కవిటి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మండలంలోని రాజపురంలో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అవకాశం లభించడం వల్ల జిల్లాలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు వెల్లడించారు. ఈ మేరకు బాబాయ్ అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో భూమిని గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు పరిశ్రమలను తీసుకువచ్చి నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తామన్నారు. పోర్టు పనులు వేగంగా పూర్తి చేస్తామని, తద్వారా వేలాది మంది కి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నిరుద్యోగుల కు అవకాశాలను కల్పిస్తామని చెప్పారు.
అంతకుముందు మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గత ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకోవడం తప్ప వందరోజుల్లో ఏం చేశారో చెప్పలేకపోయారు. ఇటీవల జరిగిన కేబినేట్ భేటీలో దీపావళి నుంచి ఫ్రీ గ్యాస్ అందించాలని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే కేవలం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించేందుకే ఈ సమావేశాన్ని అధికార పార్టీ నేతలు వేదికగా చేసుకున్నారనే విమర్శలు ప్రజల నుంచి వినిపించాయి. కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పలాస ఆర్డీఓ భరత్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాజపురంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో
కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment