వెంకటగిరి (సైదాపురం) : వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జనజాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తల్లి దీవెనల కోసం పట్టణం భక్తజనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు తరలివచ్చారు. జిల్లాతోపాటు ఇతర దేశాల నుంచి కూడా వెంకటగిరీయులు స్వగృహాలకు చేరుకున్నారు.
వేడుకగా మడి భిక్షాలు
పోలేరమ్మ జాతర సందర్భంగా వెంకటగిరిలోని ప్రతి వీధి కళకళలాడుతోంది. పోలేరమ్మకు మడి భిక్ష పెట్టండి.. పోతురాజుకు టెంకాయ కొట్టండి అంటూ భక్తుల చేస్తున్న నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పట్టణంలోని ప్రతి ఇంట్లో పసుపుతో అమ్మవారి ప్రతిమను తయారు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబలిని నైవేద్యంగా సమర్పించారు.
అప్రమత్తంగా విధులు
జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. ఊరేగింపు, నిమజ్జనంలో తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఎస్పీలు వెంకట్రావు, రవి మనోహరాచారి, నాగభూషణరావు, డీఎస్పీ రమణకుమార్ పాల్గొన్నారు.
నేడు నిష్క్రమణం
జాతరలో భాగంగా గురువారం వేకువజామున అమ్మవారి నిలుపు కార్యక్రమం మొదలవుతుంది. అమ్మవారి మెట్టినిల్లు నుంచి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కొలువుదీరుతారు. సాయంత్రం వరకు భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. సాయంత్రం అమ్మవారికి అత్యంత వైభవంగా నగరోత్సవం నిర్వహిస్తారు. అనంతరం విరూపమండపం వద్ద నిష్క్రమణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. దీంతో జాతర ఘట్టం పరిపూర్ణమవుతుంది.
రాష్ట్ర పండుగకు రూ.50లక్షలు
సాక్షి, అమరావతి : రాష్ట్ర పండుగ హోదాలో పోలేరమ్మ జాతర నిర్వహణకు దేవదాయశాఖ పరిధిలోని కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధుల నుంచి రూ. 50లక్షలను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఇన్చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment