ఫార్మా వద్దంటే కొట్టిస్తారా
దుద్యాల్: కట్టెలు అమ్ముకుని ఒక్కో రూపాయి కూడబెట్టి.. కొనుగోలు చేసుకుని అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న గిరిజనుల భూములను లాక్కునేందుకు యత్నిస్తే చూస్తూ ఊరుకోమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం ఆయన రోటిబండ తండాలో ఈ నెల 25న జరిగిన లాఠీచార్జీలో గాయపడిన గిరిజన మహిళలను, తండావాసులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మా ప్రకటన వెలువడి నాటి నుంచి పోలేపల్లి, లగచెర్ల, హకీంపేట్, రోటిబండ తండా, పులిచెర్ల తండా వాసులు ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరుతున్నారు. ఇది పట్టించుకోకుండా ప్రభుత్వం పోరాడుతున్న వారిపై లాఠీచార్జీ చేయించడం సమంజసం కాదన్నారు. గిరిజనుల భవిష్యత్ను అంధకారం కాకుండా ప్రభుత్వ ఫార్మాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయం లేకుండా తీర్మాణం ఇచ్చిన వారిని తరిమికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్ణయం విరమించుకోకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.
ఏ గ్యారంటీలు వద్దు.. మా భూముల జోలికి రావద్దు
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, గ్యారంటీలు అవసరం లేదు. మా భూముల జోలికి మాత్రం రావద్దని తండావాసులు కోరుతున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపనీలు ఏర్పాటు చేయడం సరికాదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిపిస్తే ముఖ్యమంత్రి అయి తమ ప్రాంతం అభివృద్ధి చేస్తాడనుకుంటే ఫార్మా కంపెనీల ఏర్పాటుతో తమ భూములను మట్టిలో కలిపేసేందుకు సిద్ధమవ్వడం ఆందోళన కలిగిస్తుందని తండావాసులు తమ బాధను వెల్లిబుచ్చుతున్నారు.
త్వరలో కేటీఆర్ రాక
ఫార్మా కంపనీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న బాధితుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చెప్పారు. శనివారం ఆయన పలువురు బాధితులను నగరంలోని తన నివాసానికి పిలిపించుకుని అధైర్యపడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చాంద్పాషా, యూత్ అధ్యక్షుడు సురేశ్రాజ్, బొంరాస్పేట్ మండల అధ్యక్షుడు యాదగిరి, దౌల్తాబాద్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కోట్ల మైపాల్, విష్ణువర్దన్ రెడ్డి, నాయకులు నరేశ్, తండావాసులు గోపాల్ నాయక్, సోమ్లానాయక్, సంతోష్ నాయక్, రవి నాయక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
భూములు లాక్కుంటే ఊరుకోం
గిరిజనులకు అండగా ఉంటాం
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
రోటిబండ తండా వాసులకు పరామర్శ
అట్రాసిటీ నమోదు చేయండి
రాంబాల్ నాయక్
గిరిజన భూములతో వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకోమని లంబడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్ నాయక్ హెచ్చచరించారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని రోటిబండ తండాలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25న రోటిబండ తండాలో ఫార్మా కంపనీ వ్యతిరేకించినందుకుగాను కాంగ్రెస్ నాయకుడు గిరిజనులను కులం పేరుతో ధూషిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను అరెస్ట్ చేయకుండా గిరిజనులపై లాఠీచార్జీ చేయడం సరికాదని మండిపడ్డారు. కులం పేరిట ధూషించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా ఏర్పాటును రద్దు చేసేవరకు ఎల్హెచ్పీఎస్ పోరాడుతుందని తండా వాసులకు ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment