గిరిజన చట్టాలను పక్కాగా అమలు చేయాలి
మీర్పేట: గిరిజన చట్టాలను ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందోజు రవీంద్రాచారి డిమాండ్ చేశారు. మీర్పేట లెనిన్నగర్లో ఆదివారం జరిగిన తెలంగాణ గిరిజన సమాఖ్య బాలాపూర్ మండల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తద్వారా గిరిజనులపై దాడులకు పాల్పడే దోషులకు శిక్షలు పడటం లేదన్నారు. ముఖ్యంగా అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులకు భూములు దక్కకపోగా, దున్నుకుంటున్న భూములను సైతం అటవీశాఖ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు చెందాల్సిన భూములకు ప్రభుత్వమే పట్టా ఇచ్చి అందజేయాలని, దీంతో పాటు ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ ప్రకారం ఎస్టీలకు జనాభా పరంగా కేటాయించిన నిధులను వారికే ఖర్చు చేయాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. అనంతరం బాలాపూర్ మండల గిరిజన సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జటావత్ రెడ్యానాయక్, కార్యదర్శిగా రమావత్ ఛత్రునాయక్, ఉపాధ్యక్షుడిగా రవినాయక్, సహాయ కార్యదర్శిగా కేతావత్ బాలునాయక్, కోశాధికారిగా నేనావత్ కిషన్నాయక్, కార్యవర్గ సభ్యుడిగా హన్మానాయక్, కౌన్సిల్ సభ్యుడిగా దత్తునాయక్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవీంద్రాచారి
Comments
Please login to add a commentAdd a comment