భూ సేకరణ వేగవంతం చేయాలి
వనపర్తి: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గణపసముద్రం రిజర్వాయర్ బ్రాంచ్ కెనాల్కు సంబంధించి 197 ఎకరాలు నవంబర్ 20లోపు సర్వే పూర్తి కావాలన్నారు. కర్నె తండా పార్ట్లో 171 ఎకరాల సర్వే కూడా వేగంగా చేపట్టాలని సూచించారు. రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, 27 ప్యాకేజీ కింద భూ సేకరణ, అవార్డు జారీ ప్రక్రియ నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. సమావేశలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎం.నగేష్, భూ సేకరణ ప్రత్యేక అధికారి, డిప్యూటీ కలెక్టర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్రెడ్డి, ఈఈ మధుసూదన్రావు, పంచాయతీ ఈఈ మల్లయ్య, ఆర్డయో పద్మావతి, ఏడీ సర్వే బాలకృష్ణ, డీఈలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
బాల్య వివాహాలను అరికట్టాలి..
బాల్య వివాహాలు అరికట్టేందుకు వారం పొడవునా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణకు మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తహసీల్దార్లు, ఎస్ఐలు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని, బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, వివాహంలో భాగస్వాములైన అందరిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.
మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు..
రహదారి భద్రత కమిటీ సమావేశం అనంతరం అక్కడే మాదక ద్రవ్యాల నివారణపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల తయారీ, వినియోగంపై నిఘా ఉంచాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేశామని.. సభ్యులను ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం.నగేష్, అడిషనల్ ఎస్పీ తేజావత్ రాందాస్, రోడ్లు, భవనాలశాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ దేశ్యానాయక్, ఆర్డీఓ పద్మావతి, ఆర్టీఏ మానస, జాతీయ రహదారుల అధికారులు, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ, డా. సాయినాథ్రెడ్డి, జిల్లాలోని ఎస్ఐలు, తహసీల్దార్లు, పుర కమిషనర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment