Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ksr Comments On Andhra Pradesh Election Results
అందుకే సీఎం జగన్‌ విక్టరీ వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య సంచలనం సృష్టించింది. శాసనసభ ఎన్నికలలో పోలింగ్ పూర్తి అయిన రెండు రోజులకు ఆయన ఐ-ప్యాక్ సంస్థలో పనిచేసేవారితో సమావేశమై ఫలితాలపై తనదైన శైలిలో జోస్యం చెప్పారు. 2019లో వైఎస్సార్‌సీపీకు వచ్చిన 151 సీట్లను మించే ఈసారి కూడా సీట్లు వస్తాయని ప్రకటించారు. ఇంత ధైర్యంగా జగన్ ఎలా చెప్పారు? ఆయన వద్ద ఉన్న సమాచారం ఏమిటి? ఇంతవరకు జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా సాహసోపేతమైన రీతిలో ఆయన తన అంచనాలు వెల్లడించడంలో ఉద్దేశం ఏమిటి అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి.జగన్ చెప్పినట్లు ఆ స్థాయిలో విజయం సాధ్యమేనా అన్న సంశయం పలువురిలో ఉంది. అయినా గత అనుభవాల రీత్యా ఏమోలే వస్తే రావచ్చు అని అనుకున్నవారూ ఉన్నారు. జగన్ ధైర్యానికి ఒకటే కారణం స్పష్టంగా కనిపిస్తుంది. తాను ఇచ్చిన పేదలు vs పెత్తందార్లు అన్న నినాదం ఫలించిందని ఆయన భావిస్తున్నారు. అంతేకాదు.. మీ ఇంట్లో తన ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే ఓటు వేయండని పిలుపు ఇచ్చారు. అది కూడా బాగా పని చేసి ఉండవచ్చు. ఎందుకంటే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల కనీసం మూడు కోట్ల మందికి పైగా లబ్ది పొందారు. వారిలో ఏభై, అరవై శాతం ఓట్లు వేసినా, తాను అనుకున్న సీట్లు రావడం కష్టం కాదు.గత ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని అత్యధికులు నమ్మారు. 120-130 సీట్లు రావచ్చని ఎక్కువ మంది భావించారు. ఆ టైమ్‌లో కూడా జగన్ 150 సీట్లు ఎందుకు రాకూడదని ప్రశ్నించేవారు. నిజంగానే ఆయన ఊహించినట్లుగానే 151 సీట్లు వచ్చాయి. అది ఒక రికార్డు. గతంలో విభజిత ఏపీలో ఆ స్థాయిలో ఏ పార్టీకి సీట్లు దక్కలేదు. ఎన్‌.టీ.రామారావు సాధించలేని రికార్డును జగన్ సాధించగలిగారు. అంతేకాక ఇరవైరెండు లోక్ సభ సీట్లు వైఎస్సార్‌సీపీ వచ్చాయి. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో లోక్ సభ సీట్లు వస్తాయని జగన్ అంటున్నారు. మామూలుగా అయితే పార్టీ క్యాడర్‌లో విశ్వాసం పెంచడానికి జగన్ ఇలా అని ఉండవచ్చులే అనుకుంటారు. కాని జగన్ ఎప్పుడు ఏమి చేసినా ఒక రివల్యూషన్‌లా ఉంటోంది.ప్రభుత్వాన్ని సైతం అలాగే నడిపారు. వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలను నెలకొల్పి పాలనలో కొత్త విప్లవాన్ని తెచ్చారు. ప్రజలకు వారి ఇళ్ల వద్దే సేవలు అందించారు. ఇది కొత్త అనుభూతే. దేశంలో ఏ రాష్ట్రంలోను ఇలాంటి సదుపాయం ప్రజలకు లేదు. జగన్ తీసుకువచ్చిన ఈ వ్యవస్థలను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవడానికి సిద్దం అవుతున్నాయి. ముఖ్యంగా వలంటీర్ల ద్వారా వృద్దులకు పెన్షన్లు ఇచ్చి వారిని గౌరవించే ప్రభుత్వం ఏపీలో మాత్రమే ఉందని ఆయన రుజువు చేశారు. అలాగే రాజకీయంగా బలహీనవర్గాలకు, మహిళలకు ఏభై శాతం పదవులు వచ్చేలా చేయడం, పథకాలు కాని, ఇళ్ల స్థలాలు కాని మహిళల పేరుతోనే ఇవ్వడం తదితర చర్యల ద్వారా సామాజిక విప్లవం తెచ్చారు. వీటన్నిటి ఫలితంగానే పోలింగ్ రోజున బలహీనవర్గాలవారు వెల్లువలా ఓట్లు వేయడానికి తరలివచ్చారన్న అభిప్రాయం ఏర్పడింది. వీటన్నిటిని బెరీజు వేసుకునే ముఖ్యమంత్రి జగన్ 151 సీట్లు మించే వైఎస్సార్‌సీపీ వస్తాయని చెప్పి ఉండవచ్చు.ఇంకో సంగతి చెప్పాలి. కూటమి నేతలు హైదరాబాద్, తదితర చోట్ల ఉన్న తమ మద్దతుదారులను రప్పించిన తీరు కూడా ఆయా గ్రామాలలోని బలహీనవర్గాలు గుర్తించాయట. పెత్తందార్లకు మద్దతు ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చినవారికి పోటీగా స్థానికంగా ఉండే గ్రామాలలోని పేదలంతా ఓటింగ​్‌లో పాల్గొన్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్ల ప్రభుత్వం నడిచిన తర్వాత తిరిగి అదే అధికార పార్టీకి గతంలో కన్నా అధికంగా సీట్లు రావడం అరుదుగా జరుగుతుంటుంది. అయితే అదేమి అసాధ్యం కాదు. ఉదాహరణకు 2014లో టీఆర్‌ఎస్‌కు 63 సీట్లు వస్తే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు 88 సీట్లు వచ్చాయి. అంటే ఏకంగా ఇరవైఐదు సీట్లు పెరిగాయన్నమాట. అలాగే గుజరాత్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 99 సీట్లు వస్తే, 2022 ఎన్నికలలో 160 వరకు వచ్చాయి.గుజరాత్ మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ తిరుగులేని ఆధిక్యతతో పాలన చేస్తోంది. ఒడిషా లో నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా పాతికేళ్లు పూర్తి చేశారు. బెంగాల్‌లో గతంలో సీపీఎం నేత జ్యోతిబసు వరసగా ఇరవైమూడేళ్లు పాలన చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో టర్మ్ కూడా ఎన్నికై ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇంకో సంగతి చెప్పాలి. ప్రత్యర్ధి పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఫలితాలు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడులో జయలలిత నేతృత్వంలోని అన్నా డిఎమ్.కె అధికారంలోకి వచ్చిన ఒక సందర్భంలో డిఎమ్.కెకి కేవలం రెండు స్థానాలే వచ్చాయి. ఉమ్మడి ఏపీలో 1994లో ఎన్‌.టీ.ఆర్‌ నాయకత్వంలోని తెలుగుదేశంకు 213 సీట్లు, మిత్రపక్షాలకు 34 సీట్లు వచ్చాయి.అప్పటి ఎన్నికలలో కాంగ్రెస్ కేవలం 26 సీట్లే గెలుచుకుని ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఒక్కోసారి కొన్ని పరిణామాలను బట్టి, ప్రభుత్వాల పనితీరును బట్టి, ఎన్నికలలో ప్రకటించే మానిఫెస్టోలలోని అంశాలను బట్టి కూడా ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. 2024 ఎన్నికలలో జగన్‌కు ఉన్న క్రెడిబిలిటిని జనం విశ్వసించారు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏది అవసరమైతే అది మాట్లాడి, అబద్దాలు చెప్పి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయారు. చంద్రబాబు నాయుడు లక్షన్నర కోట్లకుపైగా ఎన్నికల హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితి లేదు. జగన్ కొత్తగా పెద్దగా హామీలు ఇవ్వకుండా ఉన్న పరిస్థితిని చెప్పడం ఆయన నిజాయితీ తెలియచేస్తుంది. 2019లో ఇచ్చిన హామీలను జగన్ 99 శాతం నెరవేర్చడమే కాకుండా మానిఫెస్టోలను చూపించి మంచి జరిగితేనే తనకు ఓటు వేయండని ప్రజలకే పరీక్ష పెట్టారు. ఇవన్ని ఆయనకు పాజిటివ్ ఫ్యాక్టర్స్‌గా కనిపిస్తాయి.ఈ నేపధ్యంలోనే ఆయన అంత ధీమాగా 151 సీట్లను మించి వస్తాయని చెప్పి ఉండవచ్చు. ఈసారి పలు సర్వే సంస్థలు పోలింగ్ పూర్తి అయిన తర్వాత చేసిన పరిశీలనలో వైఎస్సార్‌సీపీ దే అధికారం అని చెబుతున్నాయి. టీడీపీకి అనుకూలంగా పోలింగ్‌కు ముందు మాట్లాడిన సంస్థలు సైతం పోలింగ్ అయిన తర్వాత వైఎస్సార్‌సీపీవై పే మొగ్గు చూపుతున్నాయి. అయినా టీడీపీ కూటమిలో ఆశలు పూర్తిగా పోయాయని చెప్పలేం. వారి సోషల్ మీడియా ద్వారా తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఐ-ప్యాక్ పూర్వ వ్యవస్థాపకుడు ప్రశాంత కిషోర్ ఈ మధ్య టీడీపీతో కుమ్మక్కై వైఎస్సార్‌సీపీ అధికారం దక్కదని ప్రచారం చేశారు. ఆ తరుణంలో టీడీపీతో పాటు, ఇలాంటివారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బకొట్టేలా జగన్ ఈ ప్రకటన చేసినట్లు అనిపిస్తుంది. చాలామంది ఈసారి తీవ్రమైన పోటీ ఉంటుందని, అందువల్ల వైఎస్సార్‌సీపీ వంద నుంచి 110 సీట్ల వరకు రావచ్చని అంచనా వేశారు.ఒకవేళ జగన్‌కు అనుకూలంగా వేవ్‌ వస్తే మాత్రం ఆ సీట్ల సంఖ్య 140-150 వరకు వెళ్లవచ్చని లెక్కగడుతున్నారు. కాగా ఇండియా టుడ్-ఎక్సిస్ అనే సంస్థ వైఎస్సార్‌సీపీ 142-157 వరకు సీట్లు రావచ్చని అంచనావేసింది. అలాగే టుడేస్ చాణక్య అనే సంస్థ 144-158 సీట్లు దక్కుతాయని లెక్కగట్టింది. న్యూస్ ఎక్స్-నేత అనే సంస్థ 139-152 సీట్లు రావచ్చని చెబుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సీఎన్‌ఎన్‌ న్యూస్ 18 సంస్థ 132 lనుంచి 145 సీట్లు వస్తాయని భావిస్తోంది. టైమ్‌స్ నౌ జోస్యం ప్రకారం 128-133 సీట్లు రావచ్చు. ఇలా కొన్ని సర్వే సంస్థలు సైతం వైఎస్సార్‌సీపీకు 151 మించి సీట్లు వస్తాయని చెబుతున్నాయి. వీటిని గమనిస్తే జగన్ చెప్పినట్లు వైఎస్సార్‌సీపీకు ఈ స్థాయిలో విజయం లభిస్తుందన్న భావన కలుగుతుంది. ఇదే జరిగితే నిజంగానే దేశ మంతా జగన్ వైపు చూస్తుంది. ఏపీలో జరుగుతున్న పాలన వైపు, వ్యవస్థల వైపు చూస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

CM YS Jagan Mohan Reddy Landed In London
లండన్‌ చేరుకున్న సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి లండన్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌.. శనివారం అక్కడకు చేరుకున్నారు. సీఎం జగన్‌ లండన్‌లో అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్‌ విమానం దిగుతున్న క్రమంలో జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఎన్నికల కౌంటింగ్‌కు ముందు మళ్లీ రాష్ట్రానికి తిరిగి రానున్నారు సీఎం జగన్‌. ఈ నెల 31వ తేదీ రాత్రి సీఎం జగన్‌ రాష్ట్రానికి వస్తారు.

RCB Seal Final IPL 2024 Playoff Spot Beating CSK by 27 runs
IPL 2024: సీఎస్‌కేపై ఘ‌న విజ‌యం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన‌ ఆర్సీబీ

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అడుగుపెట్టింది. ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ స‌త్తాచాటింది.ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 27 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ప్లే ఆఫ్ బెర్త్‌ను బెంగ‌ళూరు ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ఫాప్ డుప్లెసిస్‌(54) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. విరాట్ కోహ్లి(47), ర‌జిత్ పాటిదార్‌(41), కామెరాన్ గ్రీన్(38 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంత‌రం 219 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 191 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. సీఎస్‌కే బ్యాట‌ర్ల‌లో ర‌చిన్ ర‌వీంద్ర‌(61) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌చిన్ ర‌వీంద్ర‌(18 బంతుల్లో 35), ధోని(25) ఆఖ‌రిలో పోరాటం చేశారు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో య‌శ్ ద‌యాల్ రెండు వికెట్లు, మాక్స్‌వెల్‌, సిరాజ్‌, గ్రీన్‌, ఫెర్గూస‌న్ త‌లా వికెట్ సాధించారు.అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడిపోయిన‌ప్ప‌టికి.. ఛేజింగ్‌లో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగుల మార్క్ దాటి ఉంటే ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించి ఉండేది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వాలంటే ఆఖ‌రి ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి.ఆర్సీబీ పేస‌ర్ య‌శ్ ద‌యాల్ అద్బుతంగా బౌలింగ్ చేసి కేవ‌లం 7 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిత‌న జ‌ట్టుకు అద్బుత‌మైన విజ‌యాన్ని అందించాడు.

ICC T20 World Cup Trophy  To Sakshi
‘సాక్షి’కి టీ 20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ

మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్‌కప్‌ సమరం ఆరంభం కానుంది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్‌ ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న తరుణంలో క్రికెట్‌ అభిమానులు ఆ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్‌ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్‌లో మొత్తం 55 టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.కాగా జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా ఈ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ఆరంభించనుంది. భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ జూన్‌ 9న జరుగనుంది.‘సాక్షి’కి రానున్న వరల్డ్‌కప్‌ ట్రోఫీఇదిలా ఉంచితే, టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ ఆదివారం(మే 19) ‘సాక్షి’ ఆఫీస్‌కు రానుంది. ప్రొటెక్టెడ్‌ కంటైనర్‌లో సాక్షి ఆఫీస్‌కు తీసుకురానున్నారు. ఈ ట్రోఫీని సాక్షి ఆఫీస్‌కు తీసుకువచ్చి అక్కడ పని చేసే ఉద్యోగుల ముందు ప్రదర్శించనున్నారు.ఈ ట్రోఫీతో పాటు టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ పీయూష్‌ చావ్లా కూడా సాక్షి ఆఫీస్‌కు రానున్నారు. ఈ క్రమంలోనే సాక్షి ఉద్యోగస్తులతో పీయూష్‌ చావ్లా ముచ్చటించనున్నారు. ఇక ముగ్గురు నుంచి నలుగురు స్టార్‌ స్పోర్ట్స్‌ బృందం కూడా ట్రోఫీతో పాటు సాక్షి ఆఫీస్‌కు విచ్చేయనుంది. తొలిసారి ఉగాండ..టోర్నీలో భాగంగా ఉగాండ తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. నమీబియా సైతం టీ 20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది.కరీబియన్‌ దీవుల్లోని ఆంటిగ్వా అండ్‌ బర్బుడా, బార్బడోస్‌, డొమినికా, గయానా,సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ ద గ్రెనడైన్స్‌ నగరాల్లో .. యూఎస్‌ఏలోని డల్లాస్‌, ఫ్లోరిడా, న్యూయార్క్‌ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే 20 జట్లలో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్‌ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్‌లో టాప్‌-8లో నిలిచిన ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌, కెనడా, నేపాల్‌, ఓమన్‌, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్‌ ద్వారా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యాయి.

Special Article On TDP Leader Chintamaneni Prabhakar
రౌడీయిజం, గూండాగిరీ చేసేవారంతా పచ్చ పార్టీలోనే..!

కౌరవ సంతతి మొత్తం తెలుగుదేశంలోనే ఉందా? మహిళల మీద దాడులు చేసేవారు, దళితులను నీచంగా చూసేవారు, రౌడీయిజం, గూండాగిరీ చేసేవారంతా పచ్చ పార్టీలోనే సెటిల్ అయ్యారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే ఇలాంటి నికృష్ట పనులకు కేరాఫ్‌గా నిలిచారు. మహిళా తాహసీల్దార్‌ మీద దాడి నుంచి ఎన్నికల్లో దాడుల వరకు ఆ మాజీ మీద ఎన్నో నేరారోపణలున్నాయి. తాజాగా పోలీస్ స్టేషన్ మీదపడి అరెస్టయిన తన మనిషిని తీసుకెళ్లిపోయేంతగా తెగించాడు. ఇంతకీ ఈ అరాచక పచ్చ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం.ఏపీ రాజకీయాల్లో గోదావరి జిల్లాల పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే నాయకులు కొందరుంటారు. వారిలో రాజకీయాల్లో మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందినవారు కొందరైతే.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, గూండాయిజంతో అందరిపైనా చిందులు తొక్కుతూ వార్తల్లో నిలిచేవాళ్ళు మరికొందరున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులోని పచ్చ పార్టీలో ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన నేరాల్లో సెంచరీ కొట్టేందుకు తహతహలాడుతున్నాడు. గూండాగిరీతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యే దెందులూరు నుంచి రెండుసార్లు టీడీపీ తరపున గెలిచి తన అధికార అహంకారాన్ని ప్రజలకు చూపించాడు. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గట్టిగా గుణపాఠం చెప్పారు. తాజా ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని అర్థం కావడంతో తన గూండాగిరీతో అటు ప్రజల్ని..ఇటు పోలీసులను కూడా బెదిరించే స్థాయికి చేరాడు చింతమనేని ప్రభాకరచౌదరి.ఎంపీపీ దగ్గర నుంచి మొదలుపెట్టి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యేంతవరకూ చింతమనేని నేరాలు, దౌర్జన్యాల చిట్టా విప్పితే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. దశాబ్దాల రాజకీయ చరిత్రలో చింతమనేని అంటే దెందులూరులో ఒక రౌడీగా గుర్తింపు వచ్చిందే గాని రాజకీయ నాయకుడిగా, ఒక మంచి ప్రజాప్రతినిధిగా పేరు తెచ్చుకోలేకపోయారు.చింతమనేని దురాగతాలపై పలు కేసులు నమోదు అయినా ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతనుంచి మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే చింతమనేని తన నోటి దురుసు, దుడుకుతనంతో నిరంతరం వివాదాల్లో చిక్కుకుంటున్నారు.2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తన అక్రమ ఇసుక దందాను అడ్డుకున్నందుకు మహిళా తాహసీల్దార్‌ వనజాక్షిని నదిలో ఇసుకలో ఈడ్చుకుంటూ వెళ్ళి దాడి చేసిన విషయం రాష్ట్రంలో సంచలనం రేపింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభుత్వ అధికారిపై దాడి చేసినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోగా..ఆ తాహసీల్దార్‌నే తప్పుపట్టారు.ఇక అప్పటినుంచి చింతమనేని అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. ప్రజల మీద, ప్రత్యర్థుల మీద దాడులు చేయడం, పోలీసులనే బెదిరించడం నిత్యకృత్యంగా మారింది. దళితులంటే ఆయనకు ఎంత చిన్నచూపంటే..మీకు రాజకీయాలెందుకురా? రాజకీయాలు చేస్తే మేమే చేయాలంటూ.. మా బ్రీడ్ వేరు..మా బ్లడ్ వేరని తిక్కగా మాట్లాడే నందమూరి బాలకృష్ణలా అహంకారంతో కూడిన డైలాగ్స్‌ వదిలారు.ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఏలూరు టిడిపి ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏలూరు కలెక్టరేట్ కు వెళ్లిన చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన చింతమనేని పోలీసులతో ఓవరాక్షన్ చేయవద్దని..అలా చేస్తే ఏం చేయాలో తనకు తెలుసంటూ వారిని బెదిరించాడు. తమను అడ్డుకోవద్దని పోలీసులకు హెచ్చరికలు చేశారు. దీంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది. చింతమనేని మాటలకు ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులు అయ్యారు. ఎంతకాలం అయినా చింతమనేని ధోరణి మారకపోవడంతో పోలీసులు అతని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.. 13వ తేదీన పోలింగ్‌ జరుగుతున్నపుడు దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం..కొప్పులవారిగూడెంలో పంచాయతీ సర్పంచ్ సంజీవరావు కుమారుడు రవిపై టిడిపి కార్యకర్త రాజశేఖర్ కత్తెరతో దాడి చేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముద్దాయిపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ నుండి కోర్ట్ కు తీసుకువెళ్లే క్రమంలో ముద్దాయిని కస్టడీలో ఉంచారు. మూడు వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు పోలీసులతో ఘర్షణపడ్డారు. సీఐ తోపాటు పోలీస్ స్టేషన్ సిబ్బందిని దుర్భాషలాడుతూ...హత్యాయత్నం చేసి పోలీస్ కస్టడీలో ఉన్న టీడీపీ కార్యకర్తను చింతమనేని ప్రభాకర్ తన కారులో అక్కడి నుంచి తీసుకుని పరారయ్యాడు. అరెస్టయిని ముద్దాయిని పోలీస్ స్టేషన్‌ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్‌పీ స్పష్టం చేశారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర చౌదరిపై కేసుల చిట్టా భారీగా ఉంది. బహుశా రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థిపైనా లేనన్ని కేసులు చింతమనేనిపై ఉన్నాయి. రౌడీషీట్ తో పాటు 93 కేసులు తనపై నమోదయ్యాయని చింతమనేని తన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో తెలిపారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన ఉదంతం రాష్ట్రం మరచిపోదు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్‌పై దాడిచేసిన కేసులో ప్రభాకర్ కు రెండేళ్ళ జైలు శిక్ష పడింది. తాజాగా పెదవేగి పోలీస్ స్టేషన్ విధ్వంసం సృష్టించడంతో మరో కేసు నమోదు అయింది.తమ బిడ్డపై దాడి చేసిన వ్యక్తిని చింతమనేని దౌర్జన్యంగా స్టేషన్ నుండి తీసుకుపోవడంపై కొప్పులవారి గూడెం సర్పంచ్ సంజీవరావు.. వైఎస్ఆర్సిపి శ్రేణులు పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని చింతమనేనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు..లేనపుడు కూడా చింతమనేని ప్రభాకర చౌదరి రౌడీయుజం, గూండాగిరీ ఏమాత్రం ఆగడంలేదు. ఆఖరుకు ఎన్నికల్లో కూడా అహంకారపూరితంగానే వ్యవహరిస్తున్నాడు. శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు అతనికి శిరచ్ఛేదం చేశాడు. మరి ఇప్పటికి 93 కేసులు తనపై ఉన్నాయని స్వయంగా చెప్పిన చింతమనేని అహంకారం ఎప్పుడు దిగుతుందా అని దెందులూరు ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Sundar Pichai Advice for Indian Engineers
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్‌తో..

ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో భారతీయ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ (FAANG) వంటి సంస్థల్లో ఇంటర్వ్యూల్లో ఎలా విజయం సాధించాలో వివరిస్తూ.. రోట్ లెర్నింగ్ గురించి వివరించారు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. బట్టీ పడితే ఉపయోగం లేదని అన్నారు. కాబట్టి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ తప్పకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని అన్నారు.దీనికి ఉదాహరణగా 3 ఇడియట్స్ సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో మోటార్ ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు ఓ విద్యార్ధి బట్టీ పట్టిన సమాధానం చెబుతాడు. ఆ పద్దతి సరైనది కాదని వివరించారు. ఒక వ్యక్తి ఎంత స్మార్ట్ అయినప్పటికీ.. ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టడంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు.

Arvind Kejriwal Open Challenge To Pm Modi Bjp
రేపు బీజేపీ ఆఫీసుకు వస్తా... కేజ్రీవాల్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌

న్యూఢిల్లీ: ఎంపీ స్వాతిమలివాల్‌పై దాడి కేసులో తన సహాయకుడు బిభవ్‌కుమార్‌ అరెస్టయిన తర్వాత ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఫైరయ్యారు. బీజేపీకి ఓపెన్‌ ఛాలెంజ్‌ విసిరారు. ఆదివారం(మే19) తన పార్టీ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తానని, ఎవరిని కావాలంటే వారిని అరెస్ట్‌ చేసుకోవచ్చని ఛాలెంజ్‌ చేశారు.‘మోదీజీ మీరు జైల్‌ గేమ్‌ ఆడుతున్నారు. మనీష్‌ సిసోడియా, సంజయ్‌సింగ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇలా ఒకరి తర్వాత ఇంకొకరిని జైలుకు పంపుతున్నారు. నా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు వస్తా. ఎవరిని కావాలంటే వారిని జైల్లో పెట్టండి. మొత్తం అందరినీ ఒకేసారి అరెస్ట్‌ చేయండి’అని కేజ్రీవాల్‌ సవాల్‌ విసిరారు. ఆప్‌ను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని, అయితే ఆప్‌ ప్రజల గుండెల్లో ఉందని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. కాగా, కేజ్రీవాల్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌పై ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ స్పందించారు. ఎంపీ స్వాతిమలివాల్‌పై మీ ఇంట్లోనే దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.

Ysrcp Likely To Clean Sweep Uttarandhra
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?

ఉత్తరాంధ్రలో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని టాక్‌. ఓటింగ్ జరిగిన తీరు, పెరిగిన ఓటింగ్‌తో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. పైకి బింకంగా ఉన్నా..ఓటమి తప్పదనే నిర్ణయానికి వచ్చేశారు. ఉదయం నుంచే వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడాన్ని చూసి టీడీపీకి గుండె జారిపోయింది. దీంతో నాలుగు రోజుల నుంచి వారి కంటి మీద కునుకు కరువైంది. ఇంతకీ ఉత్తరాంధ్రలో ఏం జరగబోతోంది?సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బిసి వర్గాల నుంచి ఊహించినవిధంగా ఓటింగ్ జరగడం వైఎస్సార్సీపీకే అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో అనేక భారీ పరిశ్రమలు రావడంతో యువత వైఎస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపిందనే చర్చ జరుగుతోంది. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు నడిపించాయని అంటున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, మూలపేట పోర్ట్, ఐటీ రంగం అభివృద్ధితోపాటు, భారీ పరిశ్రమల ఏర్పాటు, విశాఖ నగర అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం వంటివి ఓటర్లను వైఎస్సార్‌సీపీ వైపు మరింతగా ఆకర్షితులను చేశాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనం పోతుందనే అభిప్రాయానికి అక్కడ ప్రజలు వచ్చారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమ్మఒడి, వైయస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలు మహిళలకు ఎంతో అండగా నిలిచాయి. ఈ పథకాలన్నీ మళ్ళీ కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ రావాలనే ఆలోచన మహిళల్లో స్పష్టంగా కనిపించింది.పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలు తెరవకముందు నుంచే మహిళలు వృద్ధులు బారులు తీరారు. గంటల కొద్దీ ఓపికగా క్యూల్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఆరు జిల్లాలు విశాఖ సిటీ, ఏజెన్సీ, మైదాన ప్రాంతాలు అనే తేడా లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారు. విజయనగరం జిల్లాలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ 81 శాతానికి పైగా జరగడం విశేషంగా చెబుతున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాలో పెరిగిన ఓటింగ్ టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. హేమా హేమీలైన నేతల్లో వణుకు పుడుతోంది. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స ఝాన్సీని నిలబెట్టడం వైఎస్‌ఆర్‌సీపీ కలిసి వచ్చింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతోపాటు, ఆమె పుట్టినూరు కావడంతో కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గాల ఓటర్లు సైతం బొత్స ఝాన్సీకి బ్రహ్మరథం పట్టారు.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం భరత్ ఎన్ని కోట్లు కుమ్మరించినా ప్రజలు బొత్స ఝాన్సీవైపే మొగ్గు చూపారు. గీతం భరత్ ఆయన కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడడం, గీతం యూనివర్సిటీ ముసుగులో సాగించిన భూకబ్జాలను విశాఖ ప్రజలు మర్చిపోలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఇదేవిధంగా తయారయ్యింది. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గం మారే గంటాకు ఈసారి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు.ప్రతి ఎన్నికలోను రిగ్గింగ్‌తో గెలిచే అచ్చం నాయుడుకు ఈసారి టెక్కలిలో చెక్ పడనుంది. అచ్చం నాయుడు గూండాయిజం, అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆయన్ను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుది అదే పరిస్థితి. బూతులతో విరుచుకుపడే అయ్యన్నకు మహిళలు బుద్ధి చెప్పడానికి రెడీ అయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు, కొత్త రోడ్లు నిర్మాణం, రోడ్లు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో మరోసారి వైఎస్ఆర్‌సీపీకి మొగ్గు చూపించారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకటరావులు పక్క నియోజకవర్గాలకు తరలి వెళ్లారు.అనకాపల్లి ఎంపీగా ఒకప్పటి నాటు సారా వ్యాపారి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ కూటమి తరపున పోటీ చేశారు. సీఎం రమేష్ నాన్ లోకల్ కావడం, ఓసి వెలమ కావడంతో స్థానికంగా ఉన్న బీసీ వెలమలు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకే మోగ్గు చూపించారు.ఇక్కడున్న కొద్ది రోజుల్లోనే సీఎం రమేష్ రౌడీయిజంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సీఎం రమేష్ ఎన్నికలపుడే ఇంతటి గుండాయిజం చేస్తున్నాడు. పొరపాటున గెలిస్తే తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతాడనే ఆందోళన అనకాపల్లి ప్రజల్లో కనిపించింది. దీంతో రమేష్‌కు మద్దతివ్వడానికి అనకాపల్లి ప్రజలు ఏమాత్రం అంగీకరించలేదు. ప్రస్తుత ఓటింగ్ జరిగిన తీరును బట్టి చూస్తే ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కూటమి తరపున పోటీ చేసిన హేమా హేమీలంతా మట్టి కరుస్తారనే టాక్ నడుస్తోంది. టీడీపీకి గతంలో వచ్చిన కొద్ది సీట్లు కూడా ఈసారి రావనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Renu Desai Comments On Pawan Kalyan Fans
వవన్‌ కల్యాణ్‌ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్‌

పవన్ కల్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులున్నారు. కానీ వారిలో ఎక్కువమంది శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారని సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుందని చాలామంది అంటారు. పవనిజం ముసుగులో ఇతరులపై భూతులతో దండయాత్ర చేస్తారని కూడా తెలుపుతుంటారు. బ్రో సినిమా విడుదల సమయంలో మదనపల్లిలో ఒక సంఘటన గురించి చూస్తే.. బ్రో మూవీ ఎలా ఉందని కొందరు మీడియా వారు పవన్‌ అభిమానని అడిగిన పాపానికి అతడు బ్లేడ్‌తో చేయి కోసుకున్నాడు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెబుతూ.. పవన్‌ అభిమానుల్లో కొందరు శాడిస్టులు నిజంగానే ఉన్నారని బహిరంగంగానే నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో రేణు దేశాయ్, పూనమ్ కౌర్ ఇద్దరూ ఏ పోస్టు పెట్టినా సరే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందులోకి దూరిపోతుంటారు. వాళ్లు ఎలాంటి పోస్ట్‌ పెట్టినా సరే తమ నాయకుడి గురించే అంటూ భుజాలు తడుముకుంటారు. ఆపై వెంటనే ట్రోలింగ్‌కు దిగిపోతుంటారు. ఒకవేళ పవన్‌కు పాజిటివ్‌గా పోస్ట్‌ పెడితే ఆ క్రెడిట్‌ అంతా పవన్‌కు ఇచ్చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన గురించే రేణు దేశాయ్‌ ఒక పోస్ట్‌ పెట్టింది.ఇటీవల రేణు దేశాయ్ పలు యానిమల్స్ ఎన్జీవోలకు సహకారం అందిస్తుంది. కుక్కలు,పిల్లుల వంటి జంతువుల రక్షణ కోసం ప్రతి నెల తను కొంత డబ్బు సాయం చేస్తుంది. అందుకు సంబంధించి ఆమె తన ఇన్‌స్టాలో ఒక మెసేజ్‌ చేసింది. రేణు చేస్తున్న సాయాన్ని గుర్తించలేని పవన్‌ అభిమాని ఇలా కామెంట్‌ చేశాడు. పవన్ కల్యాణ్‌ అన్నలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు. దీంతో రేణూ దేశాయ్‌కి కోపం వచ్చినట్లు ఉంది. అతనికి కరెక్ట్‌ సమాధానంతో ఇచ్చిపడేసింది.ప్రతిసారి నేను పెట్టే పోస్టుల కింద నా ఎక్స్ హస్బెండ్‌తో నన్ను ఎందుకు పోలుస్తున్నారు. ఇలాంటి వాళ్లను చాలామందిని నేను ఇప్పటికే బ్లాక్ చేశాను. పదేళ్ల వయస్సు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నా వంతు సాయం చేస్తున్నాను. జంతువులపై నేను చూపించే ప్రేమ, వాత్సల్యం ఆయనకు లేవు. నా మాజీ భర్త ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ చేయకండి. వ్యక్తిగతంగా నా మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదు. నన్ను నన్నుగా చూడండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి నా పోస్టుల్లో, నేను చేసే పనుల్లో ఆయన్ను పోల్చకండి. జంతువుల మీద నాకున్నంత కేర్ గానీ, ప్రేమ గానీ ఆయనకు ఉండదు. అతను నాలాగా యానిమల్స్ పై కేరింగ్ చూపించడు.' అని రేణు చెప్పింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)

Chennai Super Kings win toss, opt to field first against RCB
సీఎస్‌కేతో ఆర్సీబీ కీల‌క పోరు.. తుది జట్లు ఇవే

ఐపీఎల్‌-2024లో కీల‌క పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కీల‌క మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు ఒకే మార్పుతో బ‌రిలోకి దిగాయి. ఆర్సీబీ జ‌ట్టులోకి విల్ జాక్స్ స్ధానంలో మ్యాక్స్‌వెల్ రాగా.. సీఎస్‌కే జ‌ట్టులోకి మిచెల్ శాంట్న‌ర్ వ‌చ్చాడు. కాగా ప్లే ఆఫ్స్‌కు ఆర్హ‌త సాధించాలంటే ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కం.తుది జ‌ట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీప‌ర్‌), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement