-
వస్త్ర దుకాణంలో మంటలు
తుని: స్థానిక పెంటకోట రోడ్డులోని పుష్పాంజలి వస్త్ర, రెడీమేడ్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగడంతో షాపు యాజమాని రెడ్డి సూరిబాబు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో షాపులో పనిచేస్తున్న సిబ్బంది భోజనానికి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక అధికారి రాముడు మాట్లాడుతూ మూడు గంటల పాటు శ్రమిస్తే మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. భారీగా నష్టం జరిగిందని భావిస్తున్నామన్నారు. వైభవంగా తలుపులమ్మ జాతర తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు వైభవోపేతంగా జరిగాయి. 13 రోజులు జరిగిన ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా లోవదేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఆధ్వర్యంలో లోవకొత్తూరు గ్రామంలో వివిధ సాంఘిక, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు, తీర్థం, అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. వి.కొత్తూరు, కుమ్మరిలోవ, రాజుపేట, మర్లపాడు, సీత్యపేట, కొత్త వెలంపేట, వెలంపేట కాలనీ, జగన్నాథగిరి గ్రామాల్లో ఉత్సహంగా జాతరలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాల్లో విద్యుత్ దీపాలంకరణలు, బాణసంచా పేలుళ్లతో ఉత్సవాలను భారీగా నిర్వహించారు. -
పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల సభ
స్థలాలను పరిశీలించిన ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పిఠాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి రానున్న నేపథ్యంలో సభ నిర్వహించే స్థలాలను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం బుధవారం పరిశీలించారు. పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్ తదితర ప్రాంతాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. జనం భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో అనువైన ప్రాంతాలను గుర్తిస్తున్నారు. వాటినన్నింటినీ పరిశీలించి ఎక్కడ నిర్వహించేదీ నిర్ణయించనున్నారు. రఘురాం వెంట రాష్ట్ర భూదానం బోర్డు చైర్మన్ తాడి విజయ భాస్కరరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొప్పన శివనాథ్, వైఎస్సార్ సీపీ నాయకుడు గండేపల్లి బాబీ ఉన్నారు. -
ప్రతిభ ఉంటే.. ఉపకారం మీ వెంటే
రాయవరం: చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2016లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఒడిశా, కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో అమలవుతోంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 6,500 మందికి పైగా ఆర్థిక సహాయం, 27,600 మంది వరకు స్కాలర్షిప్లు అందజేశారు. ఎంపికై న విద్యార్థులు రెండేళ్ల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందవచ్చు. విద్యార్థి ప్రతిభ ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదవడానికి స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు, కాలపరిమితి ఆధారంగా ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకూ ఉపకార వేతనం అందజేస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్కు అవసరమైన దిశానిర్దేశం చేస్తారు. విద్యార్థుల అర్హతలు సరోజిని దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ ఉపకార వేతనం పొందాలంటే ఆ విద్యార్థి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఇంటర్మీడియెట్ చదువుతున్న వారు అర్హులు. పదిలో కనీసం 90 శాతం మార్కులు సాధించి ఉండాలి. దివ్యాంగులైతే 75 శాతం మార్కులు రావాలి. ఎంపిక విధానం చదువులో చూపిన ప్రతిభ, ధ్రువపత్రంలో తెలిపిన సమాచారం ఆధారంగా ఎంపిక చేస్తారు. జూన్ 23న దరఖాస్తుదారులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం తెలియజేస్తారు. ఎంపికై న విద్యార్థులు జూన్ 20 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 7వ తేదీ వరకూ గడువు విద్యాదాన్ ఉపకార వేతనం కోసం జూన్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి మార్కుల జాబితా, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, ఈ ఏడాది తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, చదువుతున్న కళాశాల వివరాలను పొందుపర్చాలి. ఆన్లైన్లో నమోదు చేసుకునే వారు వ్యక్తిగతంగా సొంత ఈ మెయిల్ కలిగి ఉండాలి. నెట్ సెంటర్, ఇతరుల ఈ మెయిల్ ఐడీలను అనుమతించరు. భవిష్యత్తులో ఎస్డీఎఫ్ నుంచి ఎటువంటి సమాచారమైనా ఈ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. అందుకే సొంత ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకుని, దాని పాస్వర్డ్ గుర్తుంచుకోవాలి. మరిన్ని వివరాల కోసం సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య విద్యాదాన్.ఆంధ్రఃఎస్డీ ఫౌండేషన్ఇండియా.కామ్ సంప్రదించాలి. లేదా 96635 17131 నంబర్లో సంప్రదించవచ్చు. దరఖాస్తు చేసుకునే విధానం విద్యార్థులు ప్లేస్టోర్లోని విద్యాదాన్ యాప్, లేదా విద్యాదాన్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.విద్యాదాన్.ఓఆర్జీలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి మార్కుల జాబితాల ప్రకారం మీ పేరులో మొదటి పేరును ఎంటర్ చేయాలి. తర్వాత రెండో పేరును నమోదు చేయాలి. అనంతరం విద్యార్థి సొంత చిరునామాను నమోదు చేయాలి. అనంతరం అప్లయ్ నౌ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ ఈ మెయిల్కు మీ అకౌంట్ యాక్టివేషన్ కోసం లింక్ వస్తుంది. యాక్టివేషన్ లింక్ క్లిక్ చేయగానే విద్యాదాన్ హోమ్ పేజీలో అకౌంట్ యాక్టికేటెడ్ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఈ మెయిల్ ఐడీ, విద్యాదాన్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయితే స్టెప్–2లోకి వెళతారు. లాగిన్ అయిన తర్వాత హెల్ప్పై క్లిక్ చేసి, సూచనలు చదివి, దాని ప్రకారం అప్లికేషన్ పూర్తి చేసి, డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత ఎడిట్పై క్లిక్ చేస్తే అప్లికేషన్ను ఎడిట్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయాలి. సబ్మిషన్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. డాక్యుమెంట్లు, పాస్పోర్టు సైజ్ ఫొటోను అప్లోడ్ చేసిన తర్వాతే దరఖాస్తును అంగీకరిస్తారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు ఈ మెయిల్ను చెక్ చేసుకోవాలి. ఎస్డీఎఫ్ ప్రతి సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తుంది. విద్యార్థులకు విద్యాదాన్ స్కాలర్ షిప్స్ జూన్ 7 వరకు దరఖాస్తుకు గడువు -
ఐటీఐలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2024–25 సంవత్సరానికి మొదట విడత అడ్మిషన్లకు పదో తరగతి, ఆపై అర్హత కలిగిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు ధవళేశ్వరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్ఆర్ఆర్ కృష్ణన్ తెలిపారు. ఆసక్తి కలవారు ఐటిఐ.ఏపీ.జీవోవి.ఇన్ అనే వెబ్సైట్లో గురువారం నుంచి జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకుని రశీదు పొందాలన్నారు. వారందరికీ ఈ నెల 10 నుంచి జూన్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 92940 50231 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ప్రశాంతంగా ఏపీ ఈసెట్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ అనంతపురం వర్సిటీ ఆధ్వర్యంలో ఈసెట్–24 ఆన్లైన్ పరీక్షను బుధవారం కాకినాడ జిల్లాలోని ఐదు కేంద్రాలలో బుధవారం ఆన్లైన్లో నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లో నిర్వహించిన పరీక్షకు 2,140 మంది దరఖాస్తు చేసుకోగా 2,094 మంది హాజరయ్యారు. కాకినాడ అచ్యుతాపురం అయాన్ అన్లైన్ కేంద్రంతో పాటు సూరంపాలెం ప్రగతి, ఆదిత్య కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని కన్వీనర్ భానుమూర్తి తెలిపారు. -
అర్ధరాత్రి పచ్చమూకల బరి తెగింపు
నల్లజర్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, వైఎస్సార్ సీపీ పార్టీ అభ్యర్థులకు లభిస్తున్న ప్రజాదరణను చూసి పచ్చమూకలు తట్టుకోలేకపోతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ బరితెగించి దాడులకు పాల్పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రచారం అనంతరం నల్లజర్లలో హోంమంత్రి తానేటి వనిత బస చేసిన వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి టీడీపీ నాయకుడు, మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, గోపాలపురం టీడీపీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజుతో సహ దాదాపు 30 నుంచి 40 మంది దాడి చేశారు. ఇనుపరాడ్లు, సర్వే కర్రలతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. హోంమంత్రి ఉన్న గది తలుపులను పగులగొట్టడానికి విఫలయత్నం చేశారు. మరో రెండు గదుల తలుపులు పగులగొట్టారు. 14 బైక్లతో పాటు కుర్చీలు, ఫర్నిచర్, డీజే వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ సమయంలో స్థానిక పోలీసు అధికారులు అక్కడే ఉన్నా టీడీపీ వర్గీయులను నిలవరించలేకపోయారు. టీడీపీ వర్గీయుల దాడిలో వల్లూరి శేషగిరిరావు, ముత్తిన నరేష్, ఏపూరి క్రాంతి, రాయుడు గంగాధరరావు, ఆలపాటి రాంభాస్కరావు, పాతూరి సత్యనారాయణ గాయపడ్డారు. దీనిపై తనపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సీసీ ఫుటేజ్ల ఆధారాలతో మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులకు ఓటమి భయం: మంత్రి వనిత హోంమంత్రి తానేటి వనిత విలేకరులతో మాట్లాడుతూ ఒక దళిత మహిళ హోంమంత్రిగా ఉండటం, రాబోయే ఓటమిని జీర్ణించుకోలేక పోవడం, నల్లజర్లలో పెద్దెత్తున ర్యాలీ, ఎన్నికల ప్రచారం జరగడం తట్టుకోలేక తనపైనా, తమ కార్యకర్తలపైనా, నాయకులపైనా టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారన్నా రు. వీళ్లచేసే అరాచకాలను చూస్తుంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నమో లేదో అర్థం కావడం లేదన్నారు. నిర్థిష్ట సమయానికి ప్రచారం ఆపి, మా నాయకుడి ఇంట్లో బస చేస్తే, దౌర్జన్యం చేయటం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.సెక్యూరిటీ రక్షణగా ఉండటంతో తాను ప్రాణాలతో బయటపడ్డానన్నారు. ఎన్నికల బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి కూడా దాడికి రావడం చూస్తుంటే వారిలోని ఓటమి భయం బహిర్గతమైందన్నారు. కాగా.. ఈ ఘటనపై నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ కార్యకర్తలందరూ సమన్వయం పాటించాలని సూచించారు. 8 మంది టీడీపీ నాయకులపై కేసు హోంమంత్రి తానేటి వనితపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి 8 మంది టీడీపీ వర్గీయులపై కేసు నమోదు చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ రామారావు బుధవారం ఉదయం విలేకరులకు తెలిపారు. వారిలో జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, టీడీపీ గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకట్రాజు ఉన్నారన్నారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయన్నారు. నల్లజర్లలో ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తుగా 144 సెక్షన్ విధించినట్టు చెప్పారు. హోంమంత్రి బస చేసిన ఇంటిపై టీడీపీ వర్గీయుల దాడి 14 బైక్లు ధ్వంసం, ఆరుగురికి గాయాలు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారాలతో పోలీసులకు మంత్రి వనిత ఫిర్యాదు -
10 వరకూ తత్కాల్లో ఇంటర్ ఫీజుకు అవకాశం
అమలాపురం టౌన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వాటికి ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులకు తత్కాల్ స్కీమ్లో అవకాశం ఉందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. తత్కాల్ స్కీమ్ కింద విద్యార్థులు రూ.మూడు వేలు జరిమానాగా చెల్లించాలని, ఈ విద్యార్థులు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో మాత్రమే పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. ఈ నెల పదో తేదీ సాయంత్రం మూడు గంటల లోపు ఫీజు చెల్లించాలని సూచించారు. ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును తత్కాల్ స్కీమ్ ద్వారా ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు ఆన్లైన్ విధానంలో చెల్లించవచ్చునని జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు పర్యవేక్షణాధికారి ఎల్.నరసింహం తెలిపారు. జగన్ పాలనలోనే ముస్లింలకు రక్షణరాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్ఆజం ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే ముస్లింలకు రక్షణ సాధ్యమని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్ఆజం అన్నారు. స్థానిక జాంపేటలోని హబీబుల్లాఖాన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఎమ్మెల్యే అభ్యర్థులు మార్గాని భరత్ రామ్ (రాజమహేంద్రవరం సిటీ), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (రూరల్), జక్కంపూడి రాజా (రాజానగరం) తరఫున ఎన్నికల ప్రచారం చేసేందుకు రెండు రోజులుగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. ముస్లిం, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ ఒక తాటిపైకి వచ్చి జగన్కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీలకు చెందిన 50 లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు అందుకున్నారన్నారు. సుమారు 850 మంది పైగా పదవులు పొందారని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేనల పొత్తు అక్రమమన్నారు. బీజేపీకి ఓటువేస్తే దేశం నుంచి ముస్లింలను తరిమి వేస్తుందని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేశారని, అప్పుడే అనేక వేల మంది ఉద్యోగాలు పొంది మంచి స్థితిలో ఉన్నారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 14 ఏళ్లు పాలించినా ముస్లింలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకుడు హబీబుల్లాఖాన్ మాట్లాడుతూ కూటమి పార్టీలు తోడు దొంగలని అన్నారు. సమావేశంలో జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఆరిఫ్, రాష్ట్ర ఫైనాన్న్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నిజాం, సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆరిఫుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
రైతులకు అవస్థలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లాలో తుని, పిఠాపురం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కాకినాడ, జగ్గంపేట, సామర్లకోట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలుకు వేడిగాలులు నుంచి ఉపశమనం లభించింది. ఉదయం నుంచి పలుమార్లు వీచిన భారీ గాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లా కేంద్రమైన కాకినాడలో రాత్రి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సామర్లకోటలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో భారీ దిగుబడి వస్తుందని కోటి ఆశలతో నూర్పిడులు చేసుకొన్న అన్నదాత ఆశలపై వరుణదేవుడు నీళ్లు చల్లాడు. కాకినాడ జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా ఇప్పటి వరకూ 1.38 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో అకాల వర్షాలతో ధాన్యం కళ్లాల్లోనే ఉండిపోయింది. మెషీన్లతో కోతలు కోసుకొని ధాన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్న రైతులు మినహా మిగిలినవారి ధాన్యపు రాశులు పొలాల్లోనే ఉండి పోయాయి. కుప్ప నూర్పిడులు చేసి తేమ శాతం తగ్గిన తర్వాత ధాన్యం అమ్ముకొందామన్న రైతులు ఆయా కళ్లాల్లోనే ధాన్యం నిల్వ చేసుకొన్నారు. ఇలా జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కళ్లాల్లోనే ఉండిపోయింది. రైతులు ధాన్యం తడవకుండా ఉండేందుకు బరకాలు కప్పుకున్నారు. ప్రస్తుతం కురిసిన చిరుజల్లులకు వరి పంటకు ఎటువంటి నష్టం ఉండదని వ్యవసాయశాఖ జేడీ ఎన్.విజయ్కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షం కారణంగా వరి కోతలు వాయిదా వేసుకోవాలని, కళ్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంత త్వరగా మిల్లులకు తరలించుకోవాలని రైతులకు సూచించారు. పొల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు మెరక ప్రాంతాలకు తరలించుకోవాలని, పనలపై ఉన్న ధాన్యం మొలకెత్తే అవకాశం ఉంటే ఉప్పు ద్రావణం పిచికారీ చేసుకోవాలని సూచించారు.సాక్షి అమలాపురం: కోనసీమ జిల్లాలో కొన్నిరోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటగా కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 29 డిగ్రీల చొప్పున నమోదవుతున్నాయి. వేసవి మొదలైన తరువాత 40 డిగ్రీలు దాటకున్నా కనిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో రాత్రి వేళల్లో సైతం జనం ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ సమయంలో జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కురిసిన వర్షం జనాన్ని సేదతీరేలా చేసింది. జిల్లాలో మండపేట, కొత్తపేట, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రామచంద్రపురం పరిసర ప్రాంతాలలో గాలి దూమారం కలవరపెట్టింది. రైతులు ఆందోళన చెందారు. అమలాపురం, అంబాజీపేట, అల్లవరం మండలాల్లో ఈదురుగాలులకు కొబ్బరి చెట్లు ఊగిపోయాయి. వర్షానికి ఉష్ణోగ్రతలు కొంత వరకు తగ్గాయి. జిల్లాలో మధ్యాహ్నం నుంచి 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలకు తగ్గింది. ఈదురుగాలులకు పలుచోట్ల వృక్షాలు నేలకులాయి. అమలాపురం రావులపాలెం రోడ్డు మీద చెట్లు విరిగిపడిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పాడ్డాయి. ఎన్నికల అభ్యర్థులకు ఉపశమనం సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎండలకు ఠారెత్తిపోతున్నారు. ఆపసోపాలు పడుతూ ప్రచారం రథంపై తిరుగుతున్నారు. అభ్యర్థులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటున్నా వేడెక్కిన వాతావరణంలో ప్రచారం చేయడం కష్టంగా ఉంటోంది. దీంతో పలువురు అభ్యర్థులు ప్రచారంలో వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్నారు. వర్షంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారితోపాటు ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు, నాయకులు ఊరట చెందారు. రబీ కోతలకు అవాంతరం వర్షంతో రబీ వరి కోతలకు కొంతవరకు అవాంతరం ఏర్పడింది. జిల్లాలో రబీ కోతలు జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. 80 శాతం మెషీన్ కోతలే కావడం విశేషం. ఈ వర్షానికి దిగుబడిపై ప్రభావం పెద్దగా ఉండదు. మెషీన్ కోతకు సైతం పెద్దగా అవాంతరం కాదు. కాని వర్షాలు కొనసాగితే మాత్రం మెషీన్ కోతకు ఇబ్బంది అవుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం తూర్పు డెల్టాలో వరి కోతలు దాదాపు పూర్తి కావస్తుండగా, మధ్య డెల్టాలో అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్లలో కోతలు జోరందుకున్నాయి. వర్షం ఉద్యాన పంటలకు, కూరగాయ పంటలకు మేలు చేసింది. కొబ్బరి, ఆయిల్పామ్, కోకో, పోక, అరటి, కంద, పసుపు వంటి పంటలతోపాటు గోదావరి లంకలు, మధ్యడెల్టాలో పలుచోట్ల కూరగాయ పంటలు పెద్ద ఎత్తున సాగుతున్న విషయం తెలిసిందే. ఆయా పంటలకు, తోటలకు మోటార్ల ద్వారా నీరందిస్తున్నా ఎండలకు వాడిపోతున్నాయి. వర్షం, వాతావరణం చల్లబడడం ఆయా పంటలకు కొంతవరకు మేలు. -
పిడుగు పడి మేకల కాపరి మృతి
తాళ్లపూడి: మండలంలోని బల్లిపాడులో పిడుగు పడి మేకల కాపరి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బల్లిపాడుకు చెందిన కవల నాగేశ్వరరావు(55) ఎప్పటి లాగే లంక భూముల్లో మేకలు మేపుతూ చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొవ్వూరు పోలీసులు తెలిపారు. కొనసాగుతున్న పోస్టల్ ఓటింగ్ ● జిల్లాలో 1,431 మంది ఓటు హక్కు వినియోగం ● 34.42 శాతం పోలింగ్ అమలాపురం రూరల్: సార్వత్రికి ఎన్నికలలో భాగంగా పోస్టల్ ఓటింగ్లో ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు, సర్వీసు ఉద్యోగులు మంగళవారం మూడోరోజు పోలింగ్ జరిగింది. ఉత్సాహంగా మూడో రోజు 34.42 శాతం పోలింగ్ జరిగింది. ఎన్నికల విధులలో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవో,ఎంఓలతోపాటు పోలీసులు, మెడికల్ సిబ్బంది, ఇతర సర్వీసు ఉద్యోగులు పోస్టల్ ఓటు వేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఎంపిక చేసిన పోలింగ్ బూత్లలో వీరంతా ఓటు వేసే సౌలభ్యం కల్పించారు. జిల్లాలో మొత్తం 14,566 మంది పీవో, ఏపీవో, ఓపీవో, ఎంఓతోపాటు ఇతర ఓటర్లు ఉన్నారు. వీరిలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 6,927 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన 7,639 మందిలో సోమవారం 3,482 మంది, మంగళవారం 1,431 ఓటు వేశారు. మంగళవారం ఏడు నియోజకవర్గాలలో అత్యధికంగా కొత్తపేటలో అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా ఓటింగ్ జరిగింది. జిలాలో ఫారం 12.ఫారం 12డి కలిపి ఇప్పటివరకు 14,921 మంది ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశారు. వీరిలో సుమారు 2,500కి పైగా మంది ఉద్యోగులు ఇతర జిల్లాలలో పని చేస్తూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు సంబంధిత జిల్లాలకు పంపించారు. వీరిలో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారనే విషయం ఈ నెల 10వ తేదీన తెలుస్తుంది. అమలాపురం జిల్లాపరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులు ఓట్లు వేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కేంద్రాలను తనిఖీ చేశారు. సీ విజిల్ యాప్ ద్వారా 620 ఫిర్యాదుల పరిష్కారం అమలాపురం రూరల్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై సీ విజిల్ యాప్ ద్వారా మార్చి 16 నుంచి మే 6వ తేదీ వరకు 745 ఫిర్యాదులు రాగా వాటిలో 124 ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించినవి కావని ధ్రువీకరించామని సీపీవో, సీవీజీల్ యాప్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మే 6వ తేదీన 44 ఫిర్యాదులు అందగా 41 ఫిర్యాదులను వంద నిమిషాల లోపు పరిష్కరించామని, రెండు ఫిర్యాదులు 100 నిమిషాల పైబడి పరిష్కరించామని ఒక ఫిర్యాదు పెండింగ్ లో ఉందని తెలిపారు. మిగిలిన ఫిర్యాదులు 620 ఉండగా వాటిలో 580 ఫిర్యాదులను వంద నిమిషాల లోపు పరిష్కరించామని, ఒక ఫిర్యాదు పెండింగ్లో ఉందన్నారు. మిగిలిన 40 ఫిర్యాదులను వంద నిమిషాలు పైబడిన తర్వాత పరిష్కరించామని, ఒకటి పెండింగ్లో ఉండని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (వెలగపూడి) ద్వారా జిల్లాకు సంబంధించి మే 6 తేదీ వరకు 44 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిలో 38 ఫిర్యాదులను పరిష్కరించామని, ఆరు పెండింగ్లోఉన్నాయని తెలిపారు. -
జగన్తోనే సంక్షేమం
కాకినాడ రూరల్: ఈ ఎన్నికలు చాలా కీలమైనవి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మీరంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. జగన్మోహన్రెడ్డితోనే సంక్షేమం సాధ్యమవుతుంది. చంద్రబాబు బోగస్ హామీలు నమ్మవద్దని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్బోస్ పిలుపునిచ్చారు. సర్పవరం జంక్షన్ వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గ శెట్టిబలిజ ఆత్మీయ సమావేశం జెడ్పీటీసీ సభ్యుడు, శెట్టిబలిజ నేత నురుకుర్తి రామకృష్ణ అధ్యక్షత మంగళవారం జరిగింది. సమావేశానికి నియోజకవర్గంలోని శెట్టిబలిజలు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్ సీపీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ హాజరయ్యారు. బోస్ మాట్లాడుతూ చైతన్యవంతులైన శెట్టిబలిజలు తమ ఓటు వినియోగించుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సునీల్, కన్నబాబు మంచి మనుషులని, పిలిస్తే పలికే వారికి ఓటు వేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారు. ఉన్నత విద్యావంతులైన ఈ ఇద్దరు అభ్యర్థుఽలు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల కంటే మెరుగైనవారన్నారు. చంద్రబాబునాయుడు ఆచరణ సాధ్యం కాని హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నందున నమ్మవద్దన్నారు. చంద్రబాబు హామీలకు ఏటా రూ.లక్షా 60వేల కోట్లు అవుతుందన్నారు. జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోపై ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. చేయగలిగిన హామీలనే ఆయన ఇచ్చారన్నారు. టీడీపీకి 40 ఏళ్లుగా వెన్నెముకగా ఉన్న బీసీలు ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు కింద రూ.రెండు లక్షల 60 వేల కోట్లు వెచ్చించారన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన నేత జగన్ : కన్నబాబు రాష్ట్రంలో నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పుకునే జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నందుకు తామంతా గర్వంగా ఫీలవుతున్నామని వైఎస్సార్ సీపీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలనలో సీఎం జగన్ శెట్టిబలిజ కులస్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. జగన్ కేబినెట్లో బీసీలకు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్చంద్రబోస్కు ఇచ్చారని గుర్తు చేశారు. బీసీలకు రెండు రాజ్యసభ సీట్లు ఇస్తే అందులో ఒకటి బోస్కు ఇచ్చారని, ఎమ్మెల్సీలు రెండు ఇస్తే అందులో ఒకటి పాత పశ్చిమ గోదావరి జిల్లాకు, మరొకటి పాత తూర్పు గోదావరి జిల్లాకు ఇచ్చారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ స్థానం శెట్టిబలిజకు ఇచ్చారని, ఈ ఎన్నికల్లో రాజమహేంద్రవరం, నరసాపురం ఎంపీ సీట్లు శెట్టిబలిజకు ఇచ్చారన్నారు. ఈ ప్రాంతంలో బలమైన సామాజికవర్గం శెట్టిబలిజ అన్నారు. వైఎస్సార్ సీపీ ఒక కులానికి సంబంధించిన పార్టీ కాదని, అందరి పార్టీ అన్నారు. జనసేనలో శెట్టిబలిజలకు ప్రాధాన్యం లేదన్నారు. కాకినాడ రాత మారుస్తా : ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కాకినాడ ఎంపీగా తనను గెలిపించండి కాకినాడ రాత మారుస్తానని వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కోరారు. మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తానన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 400గ్రామాలను దత్తత తీసుకుని ఒక్కో గ్రామాన్ని రూ.కోటితో అభివృద్ధి చేస్తానన్నారు. తీర ప్రాంతం, ఎస్ఈజెడ్, పోర్టులు, ఎయిర్ పోర్టు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడంతో రూ.30వేల కోట్లతో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానన్నారు. నిరుద్యోగులకు ఏటా 5వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. చిన్న, మధ్య తరగతి నిరుద్యోగులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇంక్యుబేషన్ సెంటర్ను రూ.100 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. తనతో పాటు కన్నబాబును గెలిపించాలని కోరారు. సీఎం జగన్తో సామాజిక న్యాయం సాధ్యవుతుందని, ఆయన కొనసాగాలన్నా, మంచి జరగాలన్నా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. జెడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసీకుమార్, కరప ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, జేసీఎస్ కన్వీనర్ గీసాల శ్రీనివాసరావు, దూనబోయిన అరుణ, వాసంశెట్టి రాజేశ్వరరావు, పార్లమెంట్ పరిశీలకులు, మాజీ మేయర్ సరోజ, యనమదల రవి, రాజమహేంద్రవరానికి చెందిన శ్రీను, కడియాల చిన్నా, గంజా సత్తిబాబు, పాలిక నరసింహమూర్తి పాల్గొన్నారు. చంద్రబాబు హామీలు బోగస్ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కన్నబాబు, సునీల్ను గెలిపించండి శెట్టిబలిజ ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సుభాష్చంద్రబోస్ -
హమ్మయ్య చల్లబడింది
నెల రోజులుగా భానుడి తీక్షణ వీక్షణాలకు విలవిల్లాడిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనం మంగళవారం కురిసిన భారీ వర్షానికి సేద తీరారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురియడంతో వీధులు జలమమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే అనుకూల వాతావరణంతో మంచి దిగుబడులు వస్తాయనకున్న రైతుల ఆశలపై ఈ వర్షం నీళ్లు చల్లింది. ధాన్యం కళ్లాల్లోనే ఉండిపోయింది. మెషీన్లతో కోతలు కోసుకొని ధాన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించుకున్న రైతులు మినహా మిగిలినవారి ధాన్యపు రాశులు పొలాల్లోనే ఉండి పోయాయి. మండిపోతున్న వేసవి ఎండల్లో ఎన్నికల ప్రచారం చేయడానికి అవస్థలు పడుతున్న అభ్యర్థులు ఒక్కసారిగా వాతావరణం చల్లపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాజమహేంద్రవరంలో భారీగా.. సాక్షి, రాజమహేంద్రవరం: నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎర్రటి ఎండ ఉండగా.. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. నగరం మొత్తం గోదావరిని తలపించింది. ప్రధాన రహదారుల్లో నీరు పొంగి పొర్లింది. రోడ్డుకు ఇరువైపులా ఉంచిన ద్విచక్ర, కార్లు వర్షపు నీటికి కొట్టుకుని పోయాయి. కంబాల చెరువు, శ్యామల సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్డు, టీ నగర్, సీతంపేట, ఆదెమ్మదెబ్బ, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సీతంపేటలో వర్షం నీటిలో కారు కొట్టుకుపోయింది. కంబాల చెరువు హైటెక్ బస్ స్టేషన్ వద్ద నీటి ఉధృతి పెరిగింది. ఒక ఆర్టీసీ బస్సుతో పాటు ఆటోలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ప్రయాణికులు హైటెక్ బస్టాండ్ వద్ద వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం తెరపిచ్చిన రెండు గంటల సమయమైనా ముంపు నీరు రోడ్డుపైన అలాగే ఉండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. హైటెక్ బస్ స్టేషన్ వద్ద నిలిచిపోయిన ప్రయాణికులు, విద్యార్థులను అగ్ని మాపక సిబ్బంది తాడు సాయంతో సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఆర్టీసీ బస్సు ముంపు నీటీలో ఇరుక్కుపోవడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
రత్నగిరిపై కుండపోత
అన్నవరం: సత్యదేవుని భక్తులు, అన్నవరం గ్రామస్తులు మంగళవారం ఉదయం సుమారు గంట సేపు కురిసిన భారీ వర్షాలకు సేద తీరారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉరుములతో కూడిన వర్షం కుండపోతగా కురియడంతో రత్నగిరి మెట్ల దారి నుంచి వర్షం నీరు కిందకు ప్రవహించింది. అది తొలిపాంచా వద్ద స్వామివారి పాదాల మంటపాన్ని ఆనుకుని రోడ్డు మీదకు ప్రవహించింది. ఈ ఏడాదిలో ఇంత భారీ వర్షం కురువడం ఇదే మొదటిసారి. అది కూడా ఎండలతో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వర్షం వరంలా అనిపించింది. ఈ వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. కాగా, తొలిపాంచా వద్ద గల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఛైత్ర మాస పూజలు నిర్వహిస్తున్న పండితులు, అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులు ఆలయం దిగువన తమ చెప్పులు విడిచారు. ఈ వర్షం వలన మెట్ల మీద నుంచి ప్రవహించిన జల ప్రవాహానికి ఆ చెప్పులు కొట్టుకుపోయాయి. కాగా, మెట్ల దారి వెంట రాకపోకలు సాగిస్తున్న భక్తులు ఈ వర్షానికి పూర్తిగా తడిసిపోయారు. -
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
మధురపూడి: ప్రమాదవశాత్తూ శ్లాబు కూలి సీతానగరం మండలం సింగవరం బాదంచెట్టు కాలనీకి చెందిన మోర్త శ్యామ్కుమార్ (20) మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం కోరుకొండ మండలం జంబూపట్నంలో చోటు చేసుకుంది. శ్యామ్ అటుగా వెళుతుండగా వర్షం కురియడంతో అంబేడ్కర్ విగ్రహానికి రక్షణగా ఏర్పాటు చేసిన షెల్టర్ శ్లాబు కిందికి వెళ్లాడు. అతనితోపాటు కొందరు జోరుగా కురుస్తున్న వర్షానికి ఈ షెల్టర్ కిందికి వెళ్లారు. విపరీతంగా కురిసిన వర్షం కారణంగా శ్లాబు కూలింది. శ్యామ్కుమార్ తలకు బలమైన గాయమై మెదడు బయటకు వచ్చి, అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ముంగమూరి పృథ్వికి గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.కోరుకొండ పోలీసులు మృతి కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ నాగమురళి తెలిపారు. తల్లి రోదన నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయావా అంటూ కొడుకు శ్యామ్ మృతితో తల్లి నాగమణి గుండెలవిసేలా రోదించారు. శ్యామ్ మృతితో సింగవరం బాదంచెట్టు కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్యామ్కుమార్, తల్లి నాగమణి సింగవరంలో ఉంటున్నారు. తండ్రి విక్టర్బాబు హైదరాబాద్లోని ఓ స్వచ్ఛంద సేవాసంస్థలో రోజుకూలీగా పనిచేస్తున్నారు. -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
సఖినేటిపల్లి: రామేశ్వరం ఏటిగట్టు ఏరియాలో మంగళవారం పనులు చేస్తున్న ఉపాధి కూలీలపై తేనెటీగలు ఆకస్మికంగా మూకుమ్మడి దాడి చేశాయి. దాడిలో 26 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరందరినీ స్థానిక పీహెచ్సీకి తరలించారు. ఆసుపత్రిలో వారికి వైద్యులు యునస్, సూరజ్ ఆధ్వర్యంలో స్టాఫ్నర్స్ తులసి, ఏఎన్ఎంలు తక్షణం వైద్యం అందించారు. ఎన్ఆర్జీఎస్ ఏపీవో నాగప్రసాద్ గాయపడిన కూలీలకు తగిన వైద్యసహకారం అందించడంలో తోడ్పాటునిచ్చారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నలుగురిలో ఒకరైన లంక మోహన్ అను ఉపాధి కూలీ ని మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. మిగిలిన 25 మంది పీహెచ్లోనే అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు చెప్పా రు. కాగా తేనెటీగల దాడిలో గాయపడిన వారిని సర్పంచ్ కట్టా ఉమామహేశ్వరరావు, నెడ్క్యాప్ డైరెక్టర్ పాటి శివకుమార్ పరామర్శించారు. పోలీసు అబ్జర్వర్కు సమస్యలు తెలపాలి అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని ఎస్పీ సుసరాపు శ్రీధర్ హెచ్చరించారు. ఈ మేరకు ఎస్పీ శ్రీధర్ మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు, జిల్లా పోలీసులకు సూచనలు ఇచ్చేందుకు, పోలీసు విధుల పరిశీలనకు ఎన్నికల సంఘం నుంచి నియమితులైన పోలీసు అబ్జర్వర్ ఐపీఎస్ అధికారి ఎంవీ చంద్రకాంత్కు జిల్లాలో ఎవరైనా ఎన్నికలపరంగా సమస్యలు ఉంటే తెలియజేయాలని సూచించారు. నేరుగా ఆయన ఫోన్ నంబర్ 78932 56556 కి కాల్ చేయాలని సూచించారు. హింసకు తావు లేకుండా ఎన్నికల సజావు నిర్వహణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఎప్పీ విజ్ఞప్తి చేశారు. కాట్రేనికోన మండలం మగసానితిప్ప, బలుసుతిప్ప, నీలరేవు, మొల్లేటిమొగ, కొత్తపాలెం, బ్రహ్మ సమేధ్యం, ఐ.పోలవరం మండలం గోగుల్లంక తదితర సముద్ర తీర గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ అబ్జర్వర్ చంద్రకాంత్ తనిఖీలు చేసి బందోబస్తు పెంపుపై ఆయా మండల పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. -
జగన్ పాలనలో ముస్లింలకు ప్రాధాన్యం
మామిడికుదురు: ముస్లింలకు అన్ని రంగాలలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని అంబేడ్కర్ కోనసీమ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ ఖాదిర్ అన్నారు. వైఎస్సార్ సీపీ రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుకు మద్దతుగా సోమవారం ఆ పార్టీ జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు కటకంశెట్టి ఆదిత్య స్వగృహంలో ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వక్ఫ్ బోర్డు జిల్లా డైరెక్టర్ ఎండీవై షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఖాదిర్ మాట్లాడుతూ ముస్లింలపై కపట ప్రేమ చూపించే చంద్రబాబు 2014 నుంచి 19 వరకు కేవలం 2,600 కోట్లు ఖర్చు చేశారన్నారు. అదే సీఎం జగన్మోహన్రెడ్డి రూ.26 వేల కోట్లు ఖర్చు చేసి ముస్లింలపై తనకున్న ప్రేమను చాటుకున్నారన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలోనే తనయుడు జగన్ నడిచి ముస్లింలకు అండగా నిలిచారన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ముస్లింలందరూ ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. ఎంపీగా రాపాక వరప్రసాదరావు, ఎమ్మెల్యేగా గొల్లపల్లి సూర్యారావుతో పాటు రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ముస్లింల సత్తా ప్రతిపక్షాలకు చాటి చెప్పాలన్నారు. సమావేశంలో రాజ్ మొహిద్దీన్, సర్కిల్ ముస్తఫా, మజహర్ అలీ పాల్గొన్నారు. నేటి నుంచి హోమ్ ఓటింగ్ అమలాపురం రూరల్: జిల్లాలో మంగళవారం నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభమవుతుందని, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 1,251 మంది ఈ విధానంలో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. హోమ్ ఓటింగ్ కోసం 73 బృందాలు నియమించి, 85 వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో 172 మంది, మండపేటలో 260 మంది, రామచంద్రపురంలో 65 మంది, పి.గన్నవరంలో 421 మంది, కొత్తపేటలో 63 మంది, రాజోలులో 161 మంది, అమలాపురంలో 109 మంది హోమ్ ఓటింగ్కు అర్హత సాధించారన్నారు. నిఘా బృందాల విస్తృత దాడులు అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిఘా బృందాలు చేస్తున్న దాడులు, తనిఖీల్లో అక్రమ మద్యం భారీగా పట్టుబడుతోంది. జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆధ్వర్యంలో జిల్లాలో ఆది, సోమవారాల్లో నిర్వహించిన దాడులు, తనిఖీల్లో పట్టుబడిన మద్యం, సారా, కేసులు, అరెస్ట్ అయిన నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ● జిల్లాలో నిర్వహించిన దాడుల్లో నిఘా బృందాలు 9 కేసులు నమోదు చేసి, పది మందిని అరెస్ట్ చేశాయి. వారి నుంచి 9 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 135 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 26.50 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నాయి. ● రాజోలు మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా పోలీస్ ఎలక్షన్ అబ్జర్వర్ ఎంవీ చంద్రకాంత్ తనిఖీలు చేసి స్థానిక పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ● అమలాపురం రూరల్ మండలం సమనస, కామనగరువు, వన్నె చింతలపూడి గ్రామాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో స్థానిక పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కలిసి సోమవారం సాయంత్రం కవాతు నిర్వహించారు. ● జిల్లాలో ఎన్నికల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జొన్నాడ, గోపాలపురం, ఎదుర్లంక, దిండి, బొబ్బర్లంక, నరసాపురపుపేట వద్ద గల జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ల్లో నిఘా బృందాలు సోమవారం వాహనాలు నిలిపి విస్తృత తనిఖీలు చేశాయి. -
మత్స్యకారులకు బతుకు భరోసా
రుణపడి ఉంటాం జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మా కుటుంబాలకు పలు రకాలుగా మంచి జరిగింది. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చేసిన కృషితో ఎంతోకాలంగా నిలిచిపోయిన ఓఎన్జీసీ నష్టపరిహారం అందింది. సుమారుగా ఐదేళ్లలో మా కుటుంబానికి రూ.2.75 లక్షలు అందింది. సీఎం జగన్, ఎమ్మెల్యే సతీష్ కుమార్కు జీవితాంతం రుణపడి ఉంటాం. – ఓలేటి భగనాన్, పోర గ్రామం, కాట్రేనికోన మండలం ఆర్థికంగా నిలబడ్డాం ఓఎన్జీసీ నష్టపరిహారం కింద ఒక్కొక్కరికీ రూ.2.75 లక్షల వరకూ వచ్చింది. ఈ సొమ్ముతో మేము అప్పులు తీర్చుకోవడమే కాకుండా పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నాం. ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. సీఎం జగన్ పాలనలో మత్స్యకారులకు మేలు జరిగింది. – చింతా నాగ మునీంద్రరావు, చింతావానిరేవు, ముమ్మిడివరం మండలం అవసరాలు తీరాయి గతంలో వేట నిషేధ సమయంలో మాకు పూట గడవడమే చాలా కష్టంగా ఉండేది. ఆ సమయంలో ఇచ్చే రూ. నాలుగు వేల పరిహారం సరిపోయేది కాదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ పరిహారాన్ని రూ.పది వేలకు పెంచారు. నాకు నాలుగేళ్లలో ఏడాదికి రూ.పది వేల చొప్పున రూ.40 వేలు అందింది. ఆ సొమ్ములు వేట లేని సమయంలో కుటుంబ అవసరాలు తీరడంతో పాటు వలల మరమ్మతులకు ఉపయోగపడ్డాయి. – మల్లాడి రాజేష్, బలుసుతిప్ప, కాట్రేనికోన మండలం ●● అండగా నిలిచిన ప్రభుత్వం ● అనేక పథకాలతో ఆర్థిక చేదోడు ముమ్మిడివరం: గోదావరి గలగలలు వింటూ, రివ్వూన వీచే గాలుల నడుమ పడవలపై చేపల వేట సాగించడం మత్స్యకారుల నిత్య కృత్యం. ఇది చూసేవారి మనసును ఆహ్లాదపరిచినా, మత్స్యకారులకు మాత్రం జీవన పోరాటం. తెల్లవారకుండానే మత్స్యకారుల మొలలో వల చేరుతుంది, బుంగ భుజమెక్కుతుంది. వేటకు వెళ్లిన వారికి ప్రతిరోజూ పరీక్షే. గంగమ్మ తల్లి కరుణిస్తే వారి వలలో చేపల పంట పండుతుంది. లేకపోతే గంటలు గడుస్తున్నా, ఎన్నిసార్లు వల విసిరినా ఒక్క చేప కూడా చిక్కదు. గంగమ్మనే నమ్ముకుని, ఆ అమ్మ కడుపులో దాగి ఉన్న మత్స్య సంపద కోసం వేట సాగిస్తూనే ఉంటారు. అయితే ఇటీవల సముద్ర గర్భంలో ఆయిల్ నిక్షేపాల అన్వేషణ బాగా పెరిగింది. దానివల్ల ఏర్పడుతున్న కాలుష్యం కారణంగా గోదావరి, సముద్ర తీరంలో మత్స్య సంపద తరిగిపోతోంది. వేటతోనే జీవనోపాధి జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర సంగమ ప్రాంతం నుంచి కాకినాడ వరకూ విస్తరించిన సముద్ర తీరాన్ని నమ్ముకుని వేలమంది అగ్నికుల క్షత్రియులు జీవనోపాధి పొందుతున్నారు. సంప్రదాయ పద్ధతిలో వీరు సాగించే వేట కారణంగా సంపాదన పెద్దగా ఉండదు. చాలామంది మత్స్యకారులు పేద వర్గానికి చెందిన వారే. అటువంటి మత్స్యకారుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారాన్ని పెంచడంతో పాటు అర్హులందరికీ ఇవ్వడం, చమురు సంస్థల ద్వారా నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందజేయడం, డీజిల్ రాయితీ పెంచడం, మత్స్యకారులు చనిపోతే వారి కుటుంబానికి బీమా సొమ్ములు చెల్లించడం.. ఇలా వారికి అనేక విధాలుగా అండదండగా నిలుస్తోంది. రూ.647 కోట్ల చమురు సంస్థల పరిహారం చమురు సంస్థల వల్ల నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం భారీగా పరిహారం అందిస్తోంది. ప్రధానంగా ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల్లోని మత్స్యకారులకు అధికంగా అందుతోంది. గడచిన ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా 23,458 మందికి రూ.647 కోట్ల పంపిణీ చేశారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో మత్స్యకారుల వెతలు విన్న జగన్.. అధికారంలోకి రాగానే చమురు సంస్థలతో చర్చలు జరిపి పరిహారం అందించారు. మొత్తం ఐదు విడతలుగా ఈ పరిహారం నేరుగా మత్స్యకారుల ఖాతాలలో డీబీటీ ద్వారా జమ చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని మండలాలతో పాటు అయినవిల్లి, కె.గంగవరం, కపిలేశ్వరపురం, కొత్తపేట మండలాలకు చెందిన 69 గ్రామాలలోని 6,078 బోట్లకుగాను ఈ పరిహారం అందుతోంది. లబ్ధిదారులలో 647 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. మత్స్యకార భరోసా వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా ఐదేళ్లలో రూ.90.40 కోట్లు పంపిణీ చేశారు. టీడీపీ హయాంలో కేవలం రూ.నాలుగు వేల చొప్పున మాత్రమే అందించేవారు. దీనిని సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.పది వేలకు పెంచి మత్స్యకారులకు పంపిణీ చేస్తున్నారు. నలభై ఐదు రోజుల పాటు వేట నిషేధం ఉత్తర్వులు ఉండడంతో వందల మంది మత్స్యకారులు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ఈ సమయంలో వీరికి రోజువారీ జీవనోపాధి కూడా కష్టమే. అలాంటి వారిని మత్స్యకార భరోసా అండగా ఉంటోంది. డీజిల్ రాయితీ, మత్స్యకార బీమా వేట బోట్లకు వినియోగించే డీజిల్కు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. రిజిస్ట్రర్ అయిన మెకనైజ్డ్ బోట్లకు దీనిని వర్తింపజేశారు. జిల్లాలోని 769 మందికి డీజిల్ రాయితీగా రూ.16.43 కోట్లు ఖర్చు చేశారు. అలాగే వివిధ కారణాలతో మత్స్యకారులు మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్ మత్స్యకార బీమాలో 666 మందికి రూ.58.94 లక్షలు పరిహారంగా అందించారు. మత్స్యకారులకు అందిన లబ్ధి పథకం లబ్ధిదారులు మొత్తం చమురు సంస్థల పరిహారం 23,458 రూ.647 కోట్లు మత్స్యకార భరోసా 7,452 రూ.90.40 కోట్లు డీజిల్ రాయితీ 769 రూ.16.43 కోట్లు మత్స్యకార బీమా 666 రూ.58.94 లక్షలు -
ఈవీఎంలలో పకడ్బందీ రక్షణ వ్యవస్థ
అమలాపురం రూరల్: ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈవీఎంలు ప్రత్యేకమైనవని, వీటి అంతర్గత భద్రత, రక్షణ వ్యవస్థలు, పకడ్బందీగా ఉంటాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. ఈవీఎంల పనితీరుపై సోమవారం కలెక్టర్రేట్లో ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందన్నారు. దానిలో భాగంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటు వేసే విధానంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోలింగ్ రోజున ఈవీఎంలను వినియోగించే విధానంపై ప్రిసైడింగ్ అధికారులకు సైతం శిక్షణ ఇచ్చామని తెలిపారు. కంట్రోల్ యూనిట్లోని బ్యాలెట్ బటన్ ద్వారా పీఓ అనుమతించిన తర్వాత ఓటరు బ్యాలెట్ యూనిట్లో ఓటు వేయడానికి వీలవుతుందన్నారు. బ్యాలెట్ యూనిట్లో అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపితో కూడిన గుర్తులు ఉంటాయని, చేతి వేళ్లతో తడిమితే స్పష్టంగా గుర్తు పట్టవచ్చునని వివరించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డమ్మీ ఈవీఎంలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలను పకడ్బందీ బందోబస్తు నడుమ భద్రపరిచామని, ఎన్నికల నిబంధనల మేరకు ర్యాండమైజేషన్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. జిల్లాకు ఆరుగురు ఎన్నికల పరిశీలకులు ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు ఇద్దరు సాధారణ, ముగ్గురు వ్యయ, ఒక పోలీస్ విభాగం పరిశీలకులు కలిపి మొత్తం ఆరుగురు ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులు నియమితులైనట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. వీరందరూ మలికిపురం మండలం దిండి ఆర్వీఆర్ సరోవర్లో అందుబాటులో ఉంటారన్నారు. సాధారణ పరిశీలకులు రాజేశ్వర్ గోయల్ (89789 62588) అమలాపురం పార్లమెంటు, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే మరో సాధారణ పరిశీలకులు పరదీప్ కుమార్ (89775 02588) ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షిస్తారన్నారు. పోలీస్ పరిశీలకులు ఎంవీ చంద్రకాంత్ (78932 56556) అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పోలీసు సంబంధిత సాధారణ ఎన్నికల నిర్వహణ తీరును తెలుసుకుంటారన్నారు. వ్యయ పరిశీలకులు ఉమేష్ కుమార్ (78935 12588) పార్లమెంట్ స్థానానికి, రాహుల్ దింగ్రా (89784 52588) ముమ్మిడివరం, రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ స్థానాలకు, సుమిత్ దాస్ గుప్తా (73308 62588) రాజోలు, పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల వ్యయాలనుపర్యవేక్షిస్తారు. -
సమర గళమై.. కదన దళమై..
● నేడు కోరుకొండకు సీఎం జగన్ రాక ● ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్న జననేత ● వేలాదిగా తరలి రానున్న జనం ● 2019 ఎన్నికలకు ముందూ ఇక్కడ జగన్ సభ ● నాడు వైఎస్సార్ సీపీ అఖండ విజయం ● అదే సెంటిమెంట్ రిపీటవుతుందంటున్న విశ్లేషకులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత ఎన్నికల వేళ చెప్పిన మాట చెప్పినట్టుగా అమలు చేయడమే కాదు.. అంతకు మించి చేసి చూపించారు ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. అందువల్లనే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సమరాంగణాన.. దేశ చరిత్రలోనే ఇప్పటి వరకూ ఏ రాజకీయ నాయకుడూ సాహసించని రీతిలో.. తన ప్రభుత్వం ద్వారా మీ కుటుంబంలో ఏదైనా మేలు జరిగినట్టు భావిస్తేనే తనకు ఓటేయండని ప్రజలను ధైర్యంగా అడుగుతూ.. దమ్మున్న ఏకైక నాయకుడిగా పేరొందారు. గడచిన ఐదేళ్లుగా ప్రజలకు ఎన్నో మేళ్లు చేసి, వాటిని కొనసాగించేందుకు మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వాలని కోరు తూ ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల మద్దతు కోరుతూ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో మంగళవారం ఉదయం జరిగే సభలో పాల్గొంటున్నారు. ఎన్నికల నోటిపికేషన్ ఇచ్చిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఆయన పాల్గొంటున్న రెండో ప్రచార సభ ఇది. సీఎం జగన్ ఎక్కడ సభ నిర్వహించినా కట్టలు తెగిన వరద గోదారిలా వేలాదిగా పోటెత్తుతున్న జనం కదన దళంలా తరలివస్తున్నారు. ‘నీవెంటే మేమంటూ’ వేలాదిగా సమరగళమై గర్జిస్తున్నారు. ఐదేళ్ల క్రితం.. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే కోరుకొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి అభిముఖంగా నాడు నిర్వహించిన ఆ ఎన్నికల ప్రచార సభ నభూతో.. అనే రీతిలో సాగింది. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. నాటి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించింది. రాజానగరం నియోజకవర్గం నుంచి 32 వేల పై చిలుకు మెజార్టీతో జక్కంపూడి రాజా తొలిసారి శాసనసభ్యుడిగా విజయకేతనం ఎగురవేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నాటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2019 ఏప్రిల్ 7న ఆయన ఇక్కడ జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. సరిగ్గా ఐదేళ్ల ఒక్క నెల తరువాత.. మే 7న అంటే మంగళవారం తిరిగి అదే కోరుకొండకు సీఎం జగన్ వస్తూండటం విశేషం. నాడు ఎన్నికల ప్రచారానికి వినియోగించిన బస్సు నుంచే.. ఉప్పొంగిన అభిమానంతో అశేషంగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ఐదేళ్ల తరువాత జరుగుతున్న ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల కోసం మంగళవారం అదే ప్రాంతంలో ఆయన బస్సు పైనుంచి ప్రసంగించనుండటం యాదృచ్ఛికమే అయినా సెంటిమెంట్గా భావిస్తున్నారు. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో జరిగే జగన్ ఎన్నికల ప్రచార సభతో నాటి సెంటిమెంట్ రిపీటవుతుందని, రాష్ట్రంలో, రాజానగరంలో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగురవేయడం ఖాయమని పార్టీ శ్రేణులు ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. నాడు జగన్ అప్పటి, ఇప్పటి అభ్యర్థి జక్కంపూడి రాజా తన తమ్ముడంటూ, తమ్ముడిని గెలిపిస్తే తనను కూడా గెలిపించినట్టేనని ప్రజల మనసు చూరగొన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలంటే రాజాను గెలిపించాలని నాడు ప్రజలను అభ్యర్థించారు. అదే తరహాలో ఈసారి కూడా ప్రజల మనసుల్ని చూరగొనేందుకు వస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మేనిఫెస్టోలో చెప్పినవే కాదు.. అందులో చెప్పనివి కూడా పూర్తి స్థాయిలో అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారు. ‘మేమంతా సిద్ధం’ అంటూ.. గత నెల 18న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన జగన్కు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. సంఘీభావంగా నిలిచారు. సంక్షేమ పథకాలతో పేదల తలరాతలు మార్చి, నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపి, కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టించిన జగన్ వైపే తామంతా ఉన్నామని ఘంటాపథంగా చెబుతున్నారు. గత నెల 28న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట సెంటర్లో సీఎం జగన్ పాల్గొన్న తొలి ఎన్నికల ప్రచార సభకు సైతం వేలాదిగా జనం పోటెత్తారు. అదే సెంటర్లో సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019లో జగన్ స భ జరగడం కూడా మరో విశేషం. ఎన్నికలు తుది దశ కు చేరుకుని, మరో ఐదు రోజుల్లో ప్రచార పర్వానికి తెర పడనున్న నేపథ్యంలో సీఎం జగన్ కోరుకొండలో సమరశంఖం పూరించనున్నారు. గడచిన ఐదేళ్లలో రూ.1,773 కోట్లతో అభివృద్ది, రూ.1,377 కోట్లతో సంక్షేమాన్ని, 20 వేల పై చిలుకు ఇళ్లు అందించి, ఇచ్చిన హామీలన్నింటినీ నూరు శాతం అమలు చేసిన రాజాను ఎమ్మెల్యేగా మరోసారి ఆశీర్వదించాలని, ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గెలిపించాలని జగన్ ప్రజలను కోరనున్నారు. మీ కుటుంబంలో మంచి చేసి ఉంటేనే ఓటేయండని అడగనున్నారు. ఈ ప్రచార సభకు తరలివెళ్లేందుకు వేలాదిగా జనం ‘మేమంతా సిద్ధం’ అంటున్నారు. గత ఎన్నికల్లో సాధించిన ఫలితాల సెంటిమెంటే ఈ సభ ద్వారా ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా రిపీటవడం ఖాయమని అంటున్నారు. వేలాదిగా తరలిరండి ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, 10.30 గంటలకు కోరుకొండ చేరుకుంటారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి రావాలని, సుశిక్షితులైన సైనికుల్లా క్రమశిక్షణ పాటిస్తూ, సభను విజయవంతం చేయాలని కోరుతున్నా. – జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
సంక్షేమం కొనసాగాలంటే జగనే రావాలి
● వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు ● కొవ్వూరు చేరుకున్న బస్సుయాత్ర కొవ్వూరు: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని వైఎస్సార్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్సార్ సీపీకి మద్దతుగా వారు చేపట్టిన బస్సుయాత్ర సోమవారం సాయంత్రానికి కొవ్వూరు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, తామంతా జగనన్నకి మద్దతుగా బస్సుయాత్ర చేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయభేరి మోగించడం ఖాయమన్నారు. అన్ని వర్గాల ప్రజలూ వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ఎల్లో మీడియా, కూటమి పార్టీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నాయని, ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎన్ని మోసపూరిత హామీలు ఇచ్చినా రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ విభాగం నాయకుడు పసుపులేటి వీరభద్రరావు సారథ్యంలో తాళ్లపూడి మండలంలోని తిరుగుడు మెట్ట, పెద్దేవం, బల్లిపాడు, వేగేశ్వరపురం గ్రామాలతో పాటు కొవ్వూరు పురపాలక సంఘంలో పర్యటించారు. యూరప్ కన్వీనర్ యల్లాప్రగడ కార్తిక్, అమెరికా కన్వీనర్ కోడూరు కృష్ణారెడ్డి, స్విట్జర్లాండ్కు చెందిన బావిగడ్డ బ్రహ్మానందరెడ్డి, ఇటలీకి చెందిన కిషోర్ యాదవ్, నెదర్లాండ్స్ నుంచి సారథి రెడ్డి వంగా, కువైట్ ప్రతినిధి కుమార స్వామి, దుబాయ్ నుంచి వెంకట రామయ్య, రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి నానిరెడ్డి, యూఎస్ఏకి చెందిన సుభాషిణి, రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి కృపాసాగర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుని కలిసి తన సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు తోట రామకృష్ణ, చెట్టే సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. కొనసాగిన పోస్టల్ బ్యాలెట్ అమలాపురం రూరల్: పోస్టల్ బ్యాలెట్లో భాగంగా రెండోరోజు సోమవారం 41.65 శాతం పోలింగ్ జరిగింది. ఎన్నికల విధులలో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవో, ఎంఓలతో పాటు పోలీసులు, మెడికల్ సిబ్బంది, ఇతర సర్వీసు ఉద్యోగులు పోస్టల్ ఓటు వేశారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎంపిక చేసిన పోలింగ్ బూత్లలో వీరంతా తమ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో 14,566 మంది పీవో, ఏపీవో, ఓపీవో, ఎంఓతో పాటు ఇతర ఓటర్ల ఉన్నారు. వీరిలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 6,927 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన 7,639 మందిలో సోమవారం 3,182 ఓటు వేశారు. రాజోలు అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 1,111 మందికి గాను 635 మంది (47.16 శాతం) ఓటు వేశారు. అత్యల్పంగా మండపేట నియోజకవర్గంలో 1,178 మందికి 232 మంది (22.34) వినియోగించుకున్నారు. -
జిల్లాకు మరో 5 కంపెనీల కేంద్ర బలగాలు
రాజస్థాన్ నుంచి రాక అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల బందోబస్తులో భాగంగా జిల్లాకు ఇప్పటికే నాలుగు సీఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలు నెల రోజుల కిందటే వచ్చాయి. పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ప్రాంతాల్లో రోజూ కవాతు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాకు మరో ఐదు కంపెనీల సీఐఎస్ఎఫ్ కేంద్ర బలగాలు అదనంగా చేరుకున్నాయి. రాజస్థాన్ నుంచి ఈ బలగాలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మొత్తం 9 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, ఓటర్లు భయబ్రాంతులకు గురికాకుండా నిర్భయంగా ఓటు వేసేందుకు ఈ బలగాలు భరోసా ఇస్తున్నాయి. ఇప్పటికే చేరుకున్న అదనపు కేంద్ర బలగాలు శనివారం నుంచి విధుల్లో ఉన్నాయని జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది. -
వైఎస్సార్ సీపీకే ఆర్యవైశ్య సంఘం మద్దతు
●● శ్రీఘాకోళ్లపు, మట్టే శ్రీనుబాబు వెల్లడి ● పెద్దాపురంలో ఆత్మీయ సమ్మేళనంసామర్లకోట: తమ మద్దతు వైఎస్సార్ సీపీకే ఉంటుందని పెద్దాపురం ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలిపారు. పెద్దాపురం మట్టే ఆదినారాయణ, శ్రీమతి నాగలక్ష్మీ కల్యాణ వేదికలో ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరుగుతోందని అన్నారు. ఆయన హామీ ఇస్తే తప్పనిసరిగా అమలు చేసి చూపిస్తారని చెప్పారు. చంద్రబాబునాయుడి పాలనను 14 ఏళ్ల పాటు చూశామని, జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్లో పోయినా మూడేళ్లలో అనేక అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఎటువంటి అవినీతికీ తావు లేకుండా అమలు చేశారని అన్నారు. అటువంటి నేతకు మరో పర్యాయం ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడానికి ఆర్యవైశ్య ఆత్మీయ కలయిక ద్వారా మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టే శ్రీనుబాబు మాట్లాడుతూ, స్థానికుడైన దవులూరి దొరబాబుకు వైఎస్సార్ సీపీ పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చిందని అన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు స్థానిక పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, వీరిద్దరికీ ఆర్యవైశ్య నాయకుల మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ, కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారిని ప్రోత్సహిస్తానని తెలిపారు. దవులూరి దొరబాబు మాట్లాడుతూ, రాజకీయంగా ఉత్సాహం ఉన్న వారిని ప్రోత్సహిస్తామని, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. సమావేశంలో కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు మట్టే ఆదేష్బాబు, కంతేటి కాశీ (మండపేట), మట్టే శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కిక్కిరిసిన అయినవిల్లి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ నిర్వహించారు. అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి పంచామృత అభిషేకాల్లో 24, లక్ష్మీగణపతి హోమంలో 15 మంది పాల్గొని పూజలు చేశారు. 25 మంది నూతన వాహన పూజ, చిన్నారులకు నామకరణలు, అక్షరాభ్యాలు జరిపారు. ఐదుగురు తలనీలాలు సమర్పించారు. స్వామివారి అన్నదాన పథకంలో 1,458 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.1,38,900 ఆదాయం సమకూరిందని ఆలయ చైర్మన్ గుత్తుల నాగబాబు, కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
కోటసత్తెమ్మ సన్నిధికి పోటెత్తిన భక్తులు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి సమిశ్రగూడేనికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్ (గోదావరి స్టీల్స్) 150 లీటర్ల పెరుగు అందజేశారు. అమ్మవారి దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,05,069 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. -
శాంతి కల్యాణం.. కడు రమణీయం
సఖినేటిపల్లి: అంతర్వేదిలోని లక్ష్మీనరసింహుని దేవస్థానంలో ఆదివారం ఆర్జిత సేవగా స్వామివారి శాంతి కల్యాణం కడు రమణీయంగా జరిగింది. బహుళ ద్వాదశి తిథి కావడంతో అర్చకులు ఈ వేడుకను నిర్వహించారు. తొలుత ఆలయంలోని కల్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఆశీనులు గావించారు. అనంతరం స్వామివారి శాంతి కల్యాణం ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాసకిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు ఈ వేడుక నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆధ్వర్యాన సిబ్బంది కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి మూలవిరాట్ దర్శనం, అన్నదాన పథకంలో భోజన సౌకర్యం కల్పించారు. -
బడిదొడుకులకు చెక్
● ‘అమ్మ ఒడి’తో ఆనందాల సవ్వడి ● రూ.15 వేల నుంచి రూ.17 వేలకు సాయం పెంపు ● వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు ● మేనిఫెస్టోలో పొందుపరిచిన సీఎం జగన్ ● జిల్లాలో 1.40 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి రాయవరం: పిల్లల చదువులు అంటే మాటలేంటి.. తల్లిదండ్రులు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి వస్తోంది.. ఇది ఒకప్పటి మాట. పేదలంటే ప్రేమ.. బడుగులంటే అభిమానంతో ప్రతి ఇంటా విద్యా కుసుమాలు వెల్లివిరియాలని వైఎస్సార్ సీపీ సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.. గత టీడీపీ హయాంలో లోపాలన్నీ సరిదిద్దింది. విద్యకు పేదరికం అడ్డురాకూడదనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అమ్మ ఒడి పథకానికి జీవం పోశారు. 2019 ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో పేదల కష్టాలను స్వయంగా చూసిన జగన్మోహన్రెడ్డి సమాజ వెనుకబాటుకు ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు కాకపోవడమే ప్రధాన కారణంగా గుర్తించారు. తల్లిదండ్రుల పేదరికం కారణంగా చిన్నారులను చదువుకు దూరం చేస్తున్నారని తెలుసుకున్న జగన్ ఆలోచనల్లోంచి ‘అమ్మ ఒడి’ పథకం రూపుదిద్దుకుంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఏటా ఈ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచారు. ఏటా ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ. 15 వేల చొప్పున సాయం అందిస్తుండగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని రూ. 17 వేలకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చారు. గత నాలుగు విడతలుగా.. ఆర్థిక ఇబ్బందులతో పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారులను పాఠశాలలకు పంపించేందుకు ఇబ్బంది పడేవారు. కొందరు మధ్యలోనే చదువులు మానిపించి పిల్లలను పనులకు పంపేవారు. పేదల విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చిన సీఎం జగన్ అమ్మఒడి పథకం ద్వారా వారి చదువులకు ఆర్థిక భరోసా కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించే తల్లుల ఖాతాలకు గత నాలుగు విడతలుగా ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. వారికి ఇచ్చే రూ.15 వేలలో రూ. రెండు వేలు పాఠశాలల అభివృద్ధికి వెచ్చిస్తుండగా, మిగిలిన రూ. 13 వేలు నేరుగా తల్లుల ఖాతాలకు జమ చేశారు. గత నాలుగు విడతల్లో సరాసరిన ఏటా జిల్లాలో 1.40 లక్షల మంది తల్లుల ఖాతాలకు రూ.840 కోట్ల వరకూ జమ చేశారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల అవసరాల కోసం వీటిని వినియోగిస్తుండగా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లులకు అదనపు సాయంగా మారుతుంది. ప్రభుత్వ సాయానికి తమ రెక్కల కష్టం జోడించి తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. ఆలోచించి.. సాయం పెంచి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ సాయాన్ని రూ.17 వేలకు పెంచనున్నట్లు సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. పాఠశాల మెయింటెనెన్స్ నిమిత్తం రూ.రెండు వేలు పోను మిగిలిన రూ. 15 వేలు తల్లుల ఖాతాలకు జమ చేస్తామని పేర్కొన్నారు. గడచిన విద్యా సంవత్సరంలో 1,38,833 మంది లబ్ధిదారులు ఉండగా తాజా పెంపుదల మేరకు ఐదేళ్లలో రూ. 1,190 కోట్ల వరకూ ప్రభుత్వ సాయం అందించనున్నారు. తాజా పెంపుదల ద్వారా రూ. 140 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. మేనిఫెస్టోలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు ● వచ్చే ఐదేళ్లలో అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన కొనసాగింపు ● అన్ని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తూ మనబడి నాడు– నేడు పనులు, అన్ని హాస్టళ్లు, అంగన్వాడీలు, డిగ్రీ కళాశాలల అభివృద్ధి ● 2025 నుంచి ఒకటో తరగతికి ఐబీ విద్యా విధానం. ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ పెంచుకుంటూ 2,035 నాటికి 10వ తరగతి విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ ● 8వ తరగతి విద్యార్థులకు ఏటా ట్యాబ్లు అందజేసే కార్యక్రమం ● 18 యూనివర్సిటీల్లో కోర్టు కేసులతో పెండింగ్లో ఉన్న 3,295 అధ్యాపక పోస్టుల భర్తీని త్వరితగతిన పూర్తి చేయడం ● డిజిటల్ ఎడ్యుకేషన్తో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడం ఇచ్చిన మాటకు కట్టుబడి సాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కచ్చితంగా ఇచ్చిన హామీని అమలు చేస్తారు. ఆచరణ సాధ్యమైన హామీనే ఆయన ఇస్తారు. ఈ విషయం ఈ ఐదేళ్లలో నిరూపితమైంది. అమ్మ ఒడి సాయం పెంచడం పేదల విద్యకు మరింత భరోసా ఇచ్చినట్లవుతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి నాలుగు విడతల్లో అమ్మ ఒడి సాయం అందించారు. వచ్చే ఐదేళ్లలో తప్పకుండా హామీని అమలు చేస్తారన్న నమ్మకం కలిగింది. – సుంకర వెంకటనాగలక్ష్మి, గృహిణి, గొల్లవిల్లి, ఉప్పలగుప్తం మండలం ఇది మాకు గొప్ప వరం పేద పిల్లలన్నా, వారి చదువ న్నా సీఎం జగన్మోహన్రెడ్డికి ఎంత ఇష్టమో అమ్మ ఒడి పథకం అమలులోనే అర్థమవుతోంది. అమ్మ ఒడి సాయం మాకు ఒక గొప్ప వరంగా మారింది. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించాలనే కోరిక బలపడుతుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈ పథకం అండగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. – జుంజూరి విజయరాజేశ్వరి, వ్యవసాయ కూలీ, వి.సావరం, రాయవరం మండలం జిల్లాలో నాలుగు విడతలుగా అమ్మఒడి సాయం సంవత్సరం లబ్ధిదారులు ప్రభుత్వ సాయం (రూ.కోట్లలో) 2019-20 1,37,994 206.991 2020-21 1,44,797 217.196 2021-22 1,45,462 218.193 2022-23 1,38,833 180.48 -
కోరుకొండకు రేపు సీఎం జగన్ రాక
మధురపూడి: ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కోరుకొండ రానున్నారు. ఇక్కడ జరిగే సిద్ధం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తారని రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా తెలిపారు. సభ ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రోడ్డులో మంగళవారం ఉదయం 9 గంటలకు జరిగే ఈ బహిరంగ సభకు భారీగా ప్రజలు, అభిమానులు తరలిరానున్నారని చెప్పారు. కాపవరం పెట్రోలు బంకు ఎదురుగా ఉన్న హెలిప్యాడ్కు సీఎం జగన్ ఉదయం చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభాస్థలికి చేరుతారని తెలిపారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా కోరుకొండలో జరిగిన భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారని, లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సభ జరగడంతో మంచి మెజారిటీ వచ్చిందని తెలిపారు. ఈసారి కూడా అదే పునరావృతమవుతుందని ఎమ్మెల్యే రాజా చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బాబు దుష్ప్రచారం అమలాపురం టౌన్: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం అమలుకు సిద్ధమవుతున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తాను సీఎంగా పనిచేసిన సమయంలో అంతా తెలుసని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిన్నూరి రామారావు (బాబి) తెలిపారు. 2016 ఏప్రిల్ ఒకటో తేదీన అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ అమలుకు రూ.65 కోట్ల నిధులు కూడా పంపించిందని గుర్తు చేశారు. అమలాపురంలో ఆదివారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. అప్పట్లో ఈ యాక్ట్ అమలుకు నిధులు సరిపోలేదని కేంద్ర ప్రభుత్వానికి బాబు ఓ లేఖ కూడా రాశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వాన్ని, జగన్ పరిపాలనను అపహాస్యం చేస్తూ చంద్రబాబు ఆ యాక్ట్ గురించి కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. భూ లిటిగేషన్లకు పూర్తిగా చరమగీతం పాడి సంబంధిత భూ యజమానికి సంపూర్ణ హక్కు కల్పించే దిశగా ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే ఈ యాక్ట్పై టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్కళ్యాణ్ బూటకపు ప్రచారాలకు దిగడం దారుణమని అన్నారు. ఈ యాక్ట్తో సీఎం జగన్ రైతులను మోసం చేస్తే ఆ యాక్ట్కు శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి మోదీ కూడా రైతులను మోసం చేస్తున్నట్టే కదా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాకు వస్తున్న ప్రధాని మోదీ సమక్షంలో ఈ యాక్ట్పై చేస్తున్న ప్రచారాన్ని వారు చెప్పగలరా.. అని బాబి సవాల్ విసిరారు. నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా అమలాపురం రూరల్: నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సూక్ష్మ పరిశీలకులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా అన్నారు. ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల బాధ్యతలపై కలెక్టర్ శుక్లా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వీరు పోలింగ్ ప్రక్రియను విభిన్న కోణాలలో పరిశీలించాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. సూక్ష్మ పరిశీలకులు స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణలో కీలక భూమిక పోషించాలన్నారు. పరిశీలన వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన చోట సూక్ష్మ పరిశీలకులను నియమించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ప్రారంభానికి కనీసం 90 నిమిషాల ముందు అంటే మాక్ పోలింగ్ ప్రారంభమయ్యే సమయంలో సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ స్టేషన్లో ఉండాలన్నారు. పోలింగ్ రోజుకి ఒకరోజు ముందుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో రిపోర్ట్ చేయాలన్నారు. వెబ్ కాస్ట్లు, వీడియోగ్రాఫర్లను గమనించాలన్నారు. మద్యం అక్రమ రవాణాపై కేసులు అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో నిఘా బృందాల తనిఖీలు విస్తృతం చేశాయి. జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులపై జిల్లా ఎస్పీ కార్యాలయం ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. జిల్లాలో మద్యం అక్రమ రవాణాపై 11 కేసులు నమోదు చేసి 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 149 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 26.82 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. రామచంద్రపురం వీఎస్ఎం కాలేజీలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ పరదీప్ కుమార్ పరిశీలించారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు
ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
‘ డిబేట్కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement