అచ్చం..నంద్యాల సీన్ రిపీట్!
- సర్వే ముసుగులో కాకినాడలో ప్రలోభాలు
- డివిజన్కు ముగ్గురు చొప్పున ఇల్లిల్లూ తిరుగుతున్న వైనం
- ఎవరికి అనుకూలమో తెలుసుకుని టీడీపీ నేతలకు చేరవేత
- రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
- మీరే కిడ్నాప్ చేశారని ఫిర్యాదు అందిందన్న పోలీసులు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందడానికి టీడీపీ పెద్దలు కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేస్తున్నారు. వందలాది మందిని రంగంలోకి దింపి సర్వే పేరుతో ఎవరు అనుకూలురు.. ఎవరు వ్యతిరేకులు అనే విషయాన్ని సేకరించడం ఇందులో తొలి ఘట్టం. ఆ తర్వాత ప్రలోభాల పర్వం.. కాదు కూడదంటే బుజ్జగింపులు..ఆపై బెదిరింపులు. ఇలా సమాచారం చేర వేస్తున్న వారిని వైఎస్సార్సీపీ నేతలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే.. అచ్చంగా నంద్యాల సీనే రిపీట్ అయ్యింది.
మీరే కిడ్నాప్ చేశారేమో అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించడం విస్తుగొలుపుతోంది. కాకినాడ 35వ డివిజన్లో శుక్రవారం ఉదయం ముగ్గురు వ్యక్తులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ‘ఏ రాజకీయ పార్టీ అభివృద్ధి చేయగలదని భావిస్తున్నారు? చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం ఏమిటి? జగన్ తీరుపై ఏమనుకుంటున్నారు? కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు?’ అంటూ ప్రశ్నలు వేస్తూ వారు టీడీపీకి అనుకూలమా.. వ్యతిరేకమా అనే విషయాన్ని గమనించి నోట్ చేసుకుంటున్నారు. చివరలో ఇంటి యజమాని ఫోన్, అకౌంట్ నంబర్ను కూడా తీసుకుంటున్నారనే సమాచారం తెలియడంతో అనుమానం వచ్చిన అక్కడి వైఎస్సార్సీపీ అభ్యర్థి బెండా విష్ణు అనుచరులతో కలసి వెళ్లి అశోక్, విజయ్భాస్కర్, విజయ్ అనే వ్యక్తులను పట్టుకుని కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటి తర్వాత.. ముగ్గురు వ్యక్తులను మీరు కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు చెప్పేసరికి వైఎస్సార్సీపీ నేతలు నివ్వెరపోయారు.
150 మందితో సర్వే టీమ్
ఎన్నికల్లో సర్వే కోసం కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి వచ్చామని వైఎస్సార్సీపీ నేతలకు పట్టుబడ్డ అశోక్, విజయభాస్కర్, విజయ్ చెప్పారు. డివిజన్కు ముగ్గురు చొప్పున 150 మంది వచ్చామని, వివిధ హోటళ్లలో ఉంటున్నామన్నారు. నాలుగు రోజులుగా ఈ సర్వే చేస్తున్నామని చెప్పారు. తమకు వసతి, భోజనం కల్పించి రోజుకు రూ.400 ఇస్తున్నారని, సర్వే వివరాలను ఆన్లైన్లో తమ సంస్థకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఏ సంస్థా సర్వే నిర్వహించకూడదు. ఇందుకు విరుద్ధంగా 150 మంది సర్వేలో పాల్గొనడం అనేక సందేహాలకు తావిస్తోంది. పైగా ప్రతి సర్వే సిబ్బంది వద్ద ట్యాబ్లు కూడా ఉన్నాయి.
ఆ ట్యాబ్లలో ఓటర్ల లిస్టు నిక్షిప్తం చేసి మరీ ఇచ్చారు. సదరు ఇంటి యజమాని లేదా ఓటరు పేరు టైప్ చేయగానే ఓటరు అవునో కాదో కూడా అక్కడికక్కడే తెలిసిపోతోంది. మామూలుగా సర్వే చేసే వారి వద్ద ఇన్ని వివరాలు ఉండవు. పైగా అకౌంట్ నంబర్ అడగడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా సర్వే చేసే వారు ప్రతి ఇల్లూ తిరిగరనే విషయం తెలిసిందే. ఈ అనుమానాలతోనే వైఎస్సార్ సీపీ శ్రేణులు వారిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.