రేపటి నుంచి 4 నెలలు స్పెషల్ విండో
న్యూఢిల్లీ: నల్లధనం వివరాలను ప్రభుత్వానికి వెల్లడించి పన్ను, జరిమానా చెల్లింపు ద్వారా తప్పును సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్న పథకం బుధవారం నుంచీ ప్రారంభం కానుంది. ఆదాయం వెల్లడి పథకం 2016 కింద జూన్ 1 నుంచీ ప్రారంభమవుతున్న ఈ విండో నాలుగునెలలు అమల్లో ఉంటుంది. ప్రకటిత ఆదాయంపై పన్ను, జరిమానాతో కలిసి 45 శాతం చెల్లింపుల ద్వారా నల్లడబ్బు కలిగి ఉన్నవారు... సమస్య నుంచి బయటపడేందుకు ఈ స్కీమ్ అవకాశం కల్పిస్తోంది.
నిర్ణయ మొత్తం పన్నును నవంబర్ 30వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది. అధికార ఈ-ఫైలింగ్ వెబ్సైట్కు సంబంధించిన ఆన్లైన్ ద్వారా కానీ లేక వివిధ ప్రాంతీయ ప్రిన్సిపల్ కమిషనర్ కానీ ద్వారా డిక్లరేషన్ను సమర్పించవచ్చు. కాగా కార్యక్రమంపై అవగాహనను పెంపొందించేందుకు మంగళవారం (మే 31వ తేదీ) సాయంత్రం 7 గంటలకు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) అధికారులు ‘టాకెథాన్’ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించనున్నారు.