BS -6
-
భారత్లో విడుదలైన 2023 స్కోడా కొడియాక్ - ధర & వివరాలు
ఇప్పటికే భారతదేశంలో కొత్త బిఎస్6 ఫేస్-2 నిబంధనలు అమలులోకి వచ్చేసాయి. వాహన తయారీ సంస్థలన్నీ కూడా తప్పకుండా ఈ నియమాలను పాటించాలి. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలతో స్కోడా కంపెనీ దేశీయ మార్కెట్లో ఓ కొత్త కారుని లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు ధర, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్: బిఎస్6 కొత్త నిబంధనల ప్రకారం, విడుదలైన స్కోడా కారు 'కొడియాక్' 7 సీటర్ SUV. ఈ కొత్త కారు ధర రూ. 37.99 లక్షలు. అంటే ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 50,000 ఎక్కువ. అదే సమయంలో ఇందులోని స్పోర్ట్స్ లైన్ వేరియంట్ ధర రూ. 39.39 లక్షలు. ఇది కూడా దాని మునుపటి మోడల్ కంటే రూ. 90,000 ఎక్కువ కావడం గమనార్హం. బుకింగ్స్ విషయానికి వస్తే.. ఈ ఎస్యువి కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించిన కేవలం 24 గంటల్లో 1200 యూనిట్లు బుక్ అయ్యాయి. అయితే కంపెనీ ఈ కొత్త కారుని కేవలం 3000 యూనిట్లకు (ఇండియా) మాత్రమే పరిమితం చేసింది. డెలివరీల గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇది భారతదేశానికి సికెడి మార్గం ద్వారా దిగుమతై ఔరంగాబాద్ ప్లాంట్ వద్ద అసెంబుల్ అవుతాయి. డిజైన్ & ఫీచర్స్: 2023 స్కోడా కొడియాక్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా అనిపిస్తుంది, కానీ ఇందులో కొన్ని మార్పులు కూడా గమనించవచ్చు. ఈ ఎస్యువిలో రియర్ స్పాయిలర్ ఏరో డైనమిక్ పర్ఫామెన్స్ అనుమతించే రీవర్క్డ్ వెంట్స్ కలిగి ఉంది. అంతే కాకుండా ఆటోమాటిక్ డోర్ ఎడ్జ్ ప్రొటక్షన్ కూడా ఇందులో ఉంటుంది. (ఇదీ చదవండి: ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి) ఫీచర్స్ విషయానికి వస్తే, 8.0 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇన్-బిల్ట్ నావిగేషన్, పనోరమిక్ సన్రూఫ్, మంచి సౌండ్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇంజిన్ & పర్ఫామెన్స్: లేటెస్ట్ స్కోడా కొడియాక్ అదే 2 లీటర్ టర్బో పెట్రోల్ కలిగి ఉంటుంది. కావున పనితీరులో కూడా ఎటువంటి మార్పు ఉండదు. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ 190 hp పవర్, 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే ఈ కారు కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ పొందటం వల్ల మెరుగైన ఇంధన సామర్థ్యం అందిస్తుంది. (ఇదీ చదవండి: వాట్సాప్ ద్వారా రూ. 10 లక్షలు లోన్? ఒక్క హాయ్ మెసేజ్తో..) సేఫ్టీ ఫీచర్స్: స్కోడా కంపెనీ తన కొడియాక్ కారులో 9 ఎయిర్ బ్యాగులను అందించింది. ఇందులో బ్రేక్ అసిస్ట్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టి కొలిజన్ బ్రేకింగ్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్ మొదలైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. -
దెబ్బకు 17 కార్లు డిస్కంటిన్యూ: వచ్చేనెల నుంచే..
గతంలో బిఎస్6 ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన సందర్భంగా అనేక కార్ల ఉత్పత్తి నిలిపివేశారు. అయితే ఈ ఏడాది కూడా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) ఉద్గార ప్రమాణాల కారణంగా 2023 ఏప్రిల్ 01 నుంచి ఏకంగా 17 కార్లు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అనేది బిఎస్6 ఉద్గార ప్రమాణాల 2వ దశగా చెబుతున్నారు. ఇది వెహికల్ ఎగ్జాస్ట్ను నిశితంగా పరిశీలించి ఉద్గార నిబంధనలకు అనుగుణంగా క్యాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ వంటి కీలక భాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. అంతే కాకుండా వాహనాల నుండి విడుదలయ్యే NOx వంటి కాలుష్య కారకాలను కొలుస్తుంది. వాహనంలో ఉపయోగించే సెమీకండక్టర్ కూడా క్రాంక్ షాఫ్ట్ పొజిషన్, థొరెటల్, ఎయిర్ ఇన్టేక్ ప్రెజర్, ఎగ్జాస్ట్, ఇంజిన్ ఉష్ణోగ్రత మొదలైన వాటి నుండి వచ్చే ఉద్గారాలను పర్యవేక్షించడానికి అప్గ్రేడ్ చేయాలి. కావున కంపెనీలు ఇంజిన్లను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సంస్థ ఉత్పత్తుల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొత్త ఉద్గార నిబంధనలను ప్రవేశపెట్టడంతో, వాహనాల ఇంజిన్లో అనేక కొత్త మార్పులు చేయవలసి ఉంది, దీని కారణంగా వాహనాల ధరలు రూ.50,000 నుంచి రూ. 90,000 వరకు & ద్విచక్ర వాహనాల ధరలు రూ. 3,000 నుంచి రూ. 10,000 మధ్య పెరిగే సూచనలు ఉన్నాయి. (ఇదీ చదవండి: రూ. 1,299కే కొత్త ఇయర్ఫోన్స్.. ఒక్క ఛార్జ్తో 40 గంటలు) ఏప్రిల్ 01 నుంచి కనుమరుగయ్యే కార్ల జాబితాలో మహీంద్రా మొరాజో, ఆల్టురాస్ జి4, టాటా ఆల్ట్రోజ్ డీజిల్, మహీంద్రా KUV100, స్కోడా సూపర్బ్, ఆక్టేవియా, హ్యుందాయ్ ఐ20 డీజిల్, వెర్నా డీజిల్, రెనో క్విడ్800, నిస్సాన్ కిక్స్, మారుతి ఆల్టో800, ఇన్నోవా క్రిస్టా పెట్రోల్, హోండా జాజ్, అమేజ్ డీజిల్, డబ్ల్యుఆర్-వి, హోండా సిటీ 4వ తరం & 5వ తరం డీజిల్ మోడల్స్ ఉన్నాయి. -
ఇక బీఎస్–6 ఆయిల్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత్ స్టేజ్ –6 (బీఎస్–6) వాహనాలు విన్నాం.. ఇక నుంచి బీఎస్–6 ఆయిల్ కూడా అందుబాటులోకి రానుంది. ఇందుకు విశాఖ కేంద్రంగా మారనుంది. తక్కువ కాలుష్యాన్ని మాత్రమే వదులుతూ.. వాహనాల ఇంజన్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు బీఎస్–6 ఆయిల్ దోహదపడనుంది. దీన్ని ఉత్పత్తి చేసేందుకు విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) రిఫైనరీ సిద్ధమవుతోంది. దేశానికి విశాఖ నుంచే బీఎస్–6 పెట్రోల్/డీజిల్ సరఫరా కానుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న రిఫైనరీ సామర్థ్యాన్ని ఏడాదికి 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీపీఏ) సామర్థ్యం నుంచి 15 ఎంఎంటీపీఏకు పెంచేందుకు విస్తరణ, ఆధునికీకరణ పనులను సంస్థ చేపడుతోంది. ఇందుకోసం ఏకంగా రూ.26,264 కోట్లను వెచ్చిస్తోంది. అన్నీ అనుకూలిస్తే 2023 మార్చి నాటికి విశాఖ కేంద్రంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బీఎస్–6 పెట్రోల్/డీజిల్ సరఫరా కానుంది. పర్యావరణహితంగా.. బీఎస్–6 వాహనాల తయారీ నేపథ్యంలో బీఎస్–6 ఆయిల్ను సరఫరా చేయనున్నారు. బీఎస్–4 వాహనాల కంటే బీఎస్–6 వాహనాలు తక్కువ సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్ను వెదజల్లుతాయి. బీఎస్–4 ఆయిల్ను వినియోగిస్తే వాతావరణంలోకి 50 పీపీఎం సల్ఫర్ విడుదలవుతుంది. అదే బీఎస్–6 ఆయిల్ ద్వారా అయితే ఇది కేవలం 10 పీపీఎం మాత్రమే. ఇక నైట్రోజన్ ఆక్సైడ్ బీఎస్–4 ద్వారా 70 శాతం విడుదలయితే.. బీఎస్–6 ద్వారా కేవలం 25 శాతమే విడుదలవుతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా బీఎస్–6 ఆయిల్ పర్యావరణహితంగా ఉండటమే కాకుండా ఇంజన్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. భారీ రియాక్టర్ల ఏర్పాటు.. హెచ్పీసీఎల్ విస్తరణలో భాగంగా ప్రపంచంలోనే మొదటిసారిగా భారీ రియాక్టర్లను రిఫైనరీ ఏర్పాటులో ఉపయోగిస్తున్నారు. ఈ యూనిట్ కోసం మూడు భారీ రియాక్టర్లు అవసరం కాగా.. ఇప్పటికే విశాఖలోని హెచ్పీసీఎల్ ప్లాంటుకు రెండు రియాక్టర్లు చేరుకున్నాయి. ఎల్సీ మ్యాక్స్ (లుమ్మస్ సిటీ మ్యాక్స్) రియాక్టర్లుగా వీటిని పిలుస్తారు. ఒక్కో రియాక్టర్ 67.187 మీటర్ల పొడవు, 12.2 మీటర్ల వెడల్పుతో 2,105 టన్నుల బరువు ఉంటుంది. క్రూడ్ ఆయిల్ నుంచి సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న బీఎస్–6 ఆయిల్ను ఉత్పత్తి చేసేందుకు ఈ భారీ రియాక్టర్లను ఉపయోగించనున్నారు. ఎల్ అండ్ టీ సంస్థ ఈ భారీ రియాక్టర్లను సరఫరా చేస్తోంది. హెచ్పీసీఎల్ చరిత్రలోనే ఇంత భారీ స్థాయి పెట్టుబడితో రిఫైనరీని చేపట్టడం ఇదే మొదటిసారి. అలాగే ఇదే ప్లాంటులో సొంత విద్యుత్ అవసరాల కోసం క్యాప్టివ్ పవర్ ప్లాంటును కూడా నెలకొల్పుతున్నారు. రోజుకు 3 లక్షల బ్యారల్స్.. వాస్తవానికి.. హెచ్పీసీఎల్ రిఫైనరీ సామర్థ్యాన్ని 15 ఎంఎంటీపీఏకు విస్తరించే పనులు ముందస్తు ఒప్పందం ప్రకారం 2020 మధ్యనాటికే పూర్తి చేయాల్సి ఉంది. అయితే కోవిడ్ నేపథ్యంలో విస్తరణ, ఆధునికీకరణ పనులు కాస్త నెమ్మదించాయి. ఫలితంగా 2023 మార్చి నాటికి పూర్తి చేయాలని తాజాగా గడువును నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న రిఫైనరీ 8.3 ఎంఎంటీపీఏ అంటే రోజుకు 1,66,000 బ్యారళ్ల ఆయిల్ను ఉత్పత్తి చేస్తోంది. విస్తరణ, ఆధునికీకరణ పనులు పూర్తయితే ఈ సామర్థ్యం (15 ఎంఎంటీపీఏ)తో రోజుకు 3 లక్షల బ్యారళ్లకు (సుమారు 4.77 కోట్ల లీటర్లు) పెరగనుంది. -
బీఎస్– 6 కార్లకు ఇక సీఎన్జీ
సాక్షి, సిటీబ్యూరో: ఎంతో సంతోషంగా కొనుగోలు చేసిన కొత్తకారు బయటకు తీసేందుకు వెనకడుగు వేస్తున్నారా? ఇంటిల్లిపాదీ కలిసి ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఇంధన భారం బెంబేలెత్తిస్తుందా? మరేం ఫర్వాలేదు. త్వరలోనే మీ వాహనంలో ఇంధన వినియోగానికి అనుగుణమైన మార్పులు చేసుకోవచ్చు. పెట్రోల్తో నడిచే భారత్ స్టేజ్– 6 వాహనాల్లో ఇక సీఎన్జీ కిట్లను అమర్చుకోవచ్చు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై కేంద్రం దృష్టి సారించింది. త్వరలోనే అన్ని చోట్లా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో ప్రస్తుతం పెట్రోల్తో నడిచే వాహనాలు సీఎన్జీ వినియోగంలో మారడం వల్ల వాహనదారులకు ఇంధనంపై ఖర్చు 40 నుంచి 50 శాతం వరకు ఆదా అవుతుంది. గ్రేటర్లో సుమారు 1.5 లక్షల బీఎస్–6 వాహనాలకు ఊరట లభించనుందని రవాణా వర్గాలు చెబుతున్నాయి. బీఎస్– 6 శ్రేణికి చెందిన వాహనాలను కొనుగోలు చేసిన చాలా మంది సీఎన్జీకి మార్చుకోవాలని భావించినప్పటికీ ఇప్పటి వరకు ఆ అవకాశం లేకపోవడంతో ఇంధనం కోసం భారీగా ఖర్చు చేయాల్సివస్తోంది. పర్యావరణ పరిరక్షణ.. సహజ ఇంధన వాహనదారులకు ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సైతం దోహదం చేస్తుంది. ఈ మేరకు బీఎస్– 4 వాహనాల వరకు ప్రభుత్వం సీఎన్జీ కిట్లను ఏర్పాటు చేసుకొనేందుకు గతంలోనే అనుమతులను ఇచి్చంది. కానీ కొత్తగా వచ్చిన బీఎస్–6 వాహనాలకు మాత్రం ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. తాజాగా అన్ని రకాల కార్లకు సీఎన్జీ కిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం చెప్పింది. ఎస్యూవీ వాహనాలకు కూడా ఈ మార్పు వర్తించనుంది. 1.5 లక్షల వాహనాలకు ఊరట... గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 1.5 లక్షల బీఎస్–6 వాహనాలకు ఈ మార్పు వల్ల ఊరట లభించనుంది. సీఎన్జీ కిట్లను అమర్చుకోవడం వల్ల వాహనదారులు ఆ ఇంధనం అందుబాటులో లేని సమయాల్లో సాధారణ పెట్రోల్ వాహనాలుగా కూడా వినియోగించుకోవచ్చు. వాహనాల భద్రత దృష్ట్యా ప్రతి మూడేళ్లకోసారి సీఎన్జీ కిట్లను రిట్రోఫిట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. -
విశాఖలో బీఎస్–6 ఇంధన ఉత్పత్తి
సాక్షి, విశాఖపట్నం: కాలుష్య నియంత్రణకు సంబంధించి విశాఖపట్నం ప్రముఖ పాత్ర పోషించనుంది. వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు అవసరమైన భారత్ స్టేజ్–6 (బీఎస్–6) ఇంధనం ఉత్పత్తి చేసేందుకు విశాఖ కేంద్రంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. బీఎస్–6 వాహనాలు వినియోగించాలని ఏడాది కిందటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీఎస్–4 వాహనాలతో పోలిస్తే.. బీఎస్–6 వాహనాల నుంచి వచ్చే కాలుష్యం చాలా తక్కువ. బీఎస్–6 పెట్రోల్ వాహనం నుంచి నైట్రోజన్ ఆక్సైడ్ 25 శాతం వరకు తక్కువ వెలువడుతుంది. దీనికి కారణం.. ఆయా వాహనాలకు అనువైన పెట్రోల్ తయారు చేయడమే. బీఎస్–6కి అవసరమైన ఇంధన వనరుల ఉత్పత్తికి విశాఖ కేంద్రం కానుంది. కాలుష్య ఉద్గారాల్ని తగ్గించేలా బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంధనాలు ఉత్పత్తి చేసే వ్యవస్థకు హెచ్పీసీఎల్ కొద్ది రోజుల్లో శ్రీకారం చుట్టనుంది. విశాఖలో హెచ్పీసీఎల్ విస్తరణలో ఆధునిక ప్రాజెక్టులో భాగంగా.. బీఎస్–6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి చేపట్టనుంది. ఇందుకుగాను రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణలో అత్యంత కీలకమైన భారీ రియాక్టర్లు విశాఖకు చేరుకున్నాయి. అత్యంత కీలకమైన మూడు ఎల్సీ మ్యాక్స్ (లుమ్మస్ సిటీస్ మ్యాక్స్) రియాక్టర్లను విశాఖ రిఫైనరీలో ఏర్పాటు చేస్తారు. ఎల్ అండ్ టీ సంస్థ వీటిని తయారుచేసి గుజరాత్లో హెచ్పీసీఎల్ ప్రధాన కార్యాలయానికి అప్పగించింది. ఇప్పటికే రెండు రియాక్టర్లను సముద్రమార్గం ద్వారా విశాఖ తీసుకొచ్చారు. త్వరలో మూడో రియాక్టర్ వచ్చిన తరువాత వీటిని అమరుస్తారు. 67.817 మీటర్ల పొడవు, 12.2 మీటర్ల వెడల్పుతో ఉన్న ఒక్కో రియాక్టర్ బరువు 2,105 టన్నులు. ప్రపంచంలోనే అతిపెద్దవైన ఈ మూడు రియాక్టర్లు దేశంలో తొలిసారి ఆర్.యు.ఎఫ్. (రిసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీ) క్రూడ్ ఆయిల్ నుంచి బీఎస్–6 డీజిల్ను తీసేందుకు ఉపయోగపడనున్నాయి. సల్ఫర్ అత్యధికంగా ఉండే ముడి చమురును కూడా.. బీఎస్–6 ప్రమాణాలకు అనువైన అధిక నాణ్యత కలిగిన పెట్రోల్, డీజిల్గా మార్చే ప్రక్రియను ఇక్కడ చేపడతారు. త్వరలోనే పనులు ప్రారంభం విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రియాక్టర్లు హెచ్పీసీఎల్కు చేరుకున్నాయి. త్వరలో మూడో రియాక్టర్ కూడా రానుంది. వీటి ద్వారా బీఎస్–6 వాహనాలకు అవసరమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసి.. హెచ్పీసీఎల్ మరో ముందడుగు వేయనుంది. చమురు ఉత్పత్తుల్ని మెరుగుపరచడమే కాకుండా ఫీడ్ స్టాక్ పెంచేందుకు కూడా ఈ రియాక్టర్లు ఉపయోగపడతాయి. – రతన్రాజ్, హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
కొత్త బెనెల్లి లియోన్సినో 500 వచ్చేసింది : ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: బెనెల్లి ఇండియా కొత్త ప్రీమియం బైక్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. దేశీయ బీఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా 2021 బెనెల్లి లియోన్సినో 500 వెర్షన్ను విడుదల చేసింది. 2021 మోడల్ లియోన్సినో 500 స్టీల్ గ్రే, రెడ్ రెండు రంగులలో లభిస్తుంది. స్టీల్ గ్రే కలర్ వేరియంట్ ధరను 4,59,900 (ఎక్స్-షోరూమ్), రెడ్ కలర్ మోడల్ ధర రూ. 4,69,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. బీఎస్-6 బెనెల్లి లియోన్సినో 500 ను విడుదల చేయడం సంతోషంగా ఉందని బెనెల్లి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝాబక్ వ్యాఖ్యానించారు. దేశీయ మార్కెట్లో కొత్త బెనెల్లి లియోన్సినో 500 బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించాయి. 10వేల రూపాయలు చెల్లించి కంపెనీ డీలర్షిప్ లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. రాబోయే వారాల్లో డెలివరీ ప్రారంభించనుంది. మరోవైపు ఈ బైక్ 2019మోడల్ రూ.4,79,000 (ఎక్స్-షోరూమ్) ధరతో పోలిస్తే 2021మోడల్ ధరను తగ్గించడం విశేషం. 2021లో బీఎస్-6 బెనెల్లి మోటార్సైకిళ్లను ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా, మహావీర్ గ్రూప్తో పాటు భారతదేశంలో విడుదల చేయాలని బెనెల్లి యోచిస్తోంది. బీఎస్-6 బెనెల్లి లియోన్సినో 500 విశేషాలు మంచి పనితీరు, ఆకర్షణీయమైన నేకెడ్ రెట్రో స్క్రాంబ్లర్ లుక్తో పాటు ఇతర కొత్త ఫీచర్లు జోడించింది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, టెయిల్ లైట్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ వంటివి ఉన్నాయి. 500 సీసీ ఇంజిన్, 4 స్ట్రోక్ ట్విన్ సిలిండర్, డీఓహెచ్సి, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 8,500 ఆర్పీఎం వద్ద 47.5 బీహెచ్పీ పవర్ను 6,000 ఆర్పీఎం వద్ద 46 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ గేర్బాక్స్, టెలిస్కోపిక్ ఫోర్క్, లీన్ కంట్రోల్, కార్నరింగ్ ఎబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ఇతర ఫీజర్లు ఇందులో ఉన్నాయి. -
హీరో మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్, ధర ఎంతంటే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద దీని ధర రూ.72,950 గా ఉంది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసిన ఈ 125 సీసీ మోడల్ 8 బ్రేక్ హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ‘‘మా స్కూటర్ బ్రాండ్ మాస్ట్రో ఎడ్జ్కు మార్కెట్లో మంచి పేరుంది. ఈ కొత్త మోడల్ చేరికతో బ్రాండ్ ఆకర్షణ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాము’’ అని హీరో మోటోకార్ప్ సేల్స్ విభాగపు అధిపతి నవీన్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో మార్కెట్ కోలుకునేందుకు రానున్న వారాల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తామని చౌహాన్ పేర్కొన్నారు. -
రెనాల్ట్ ట్రైబర్ ఇండియా ధరల వాత
సాక్షి, ముంబై: రెనాల్ట్ ఇండియా తన పాపులర్ ఎంపీవీ ట్రైబర్ ధరలను పెంచేసింది. గత ఏడాది ఆగస్టులో భారత మార్కెట్ లో రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ చేసింది. ఆ తరువాత కొత్త నిబంధనలకు అనుగుణంగా అప్ డేట్ చేసి బీఎస్-6 వేరియంట్ ట్రైబర్ను 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ఈ ఏడాది జనవరిలో తీసుకొచ్చింది. ఈ సందర్భంగా 29 వేల రూపాయల మేర ధర పెంచింది. తాజాగా మరోసారి పెంపుతో 11,500 నుండి 13,000 మేర వినియోగదారులపై భారం మోపనుంది. దేశంలో రెనాల్ట్ ట్రైబర్ ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. ఈ కారును లాంచ్ చేసినప్పటినుంచి ఇప్పటికి నాలుగు సార్లు ధర పెంచడం గమనార్హం. ప్రధానంగా ఆర్ఎక్స్ఈ మోడల్ ధరను 13 వేల రూపాయలు పెంచింది. దీంతో దీని ధర ఇప్పుడు 5.12 లక్షలుగా ఉంది. అలాగే 12,500 పెంపుతో ఆర్ఎక్స్ జెడ్, ఆఎక్స్ జెడ్ ఏఏంటీ వేరియంట్ ధరలు 6.94 లక్షలు, 7.34 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) రూపాయలు. రెనాల్ట్ ట్రైబర్ ఎంపీవీ సింగిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్తో వస్తుంది. 1.0 లీటర్, 3 సిలిండర్ ఇంజిన్, 5 స్పీడ్ ఏఎంటీ, 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో లభ్యం. -
హోండా సిటీ : కొత్త వేరియంట్స్
సాక్షి, ముంబై: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్సిఐఎల్) తన పాపులర్ సెడాన్ హోండా సిటీ 2020ని మంగళవారం లాంచ్ చేసింది. హోండీ సిటీ కి చెందిన నాల్గవ తరం రెండు పెట్రోల్ వేరియంట్లను తాజాగా ఆవిష్కరించింది. 9.29 లక్షలు (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభధరగా నిర్ణయించింది. ఇటీవలే హోండా సిటీ సెడాన్ సరికొత్త 5 వ తరం వెర్షన్ను విడుదల చేసిన సంస్థ, 4 వ తరం కారును ఎస్ వీ, వి గ్రేడ్ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలకనుగుణంగా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్తో (మాన్యువల్ ట్రాన్స్ మిషన్) ఈ కారును అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ -6 ప్రమాణాలతో , సమకాలీన స్టైలింగ్తో తమ పాపులర్ మోడల్ 4వ తరం హోండా సిటీ అమ్మకం కొనసాగించాలని ఆశిస్తున్నామని హెచ్సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ , మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ తెలిపారు. (చదవండి : ఒకినావా ఆర్30 ఈ స్కూటర్) -
బీఎస్–6 ఇంధనం వచ్చేసింది..
న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని మరింత తగ్గించే బీఎస్–6 ప్రమాణాల పెట్రోల్, డీజిల్ విక్రయాలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో శుద్ధమైన ఇంధనాన్ని వినియోగిస్తున్న అతి తక్కువ దేశాల సరసన భారత్ కూడా చేరింది. రేటులో మార్పులు లేకుండా పాత ధరకే వీటిని విక్రయిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. సాధారణంగా లీటరుకు కనీసం రూ. 1 పెంచాల్సి ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ మేరకు సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నాయి. ‘దేశవ్యాప్తంగా మాకున్న 68,700 పెట్రోల్ బంకుల్లో నూటికి నూరు శాతం బీఎస్–6 పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుపుతున్నాం‘ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. కాలుష్య ప్రమాణాలు మారినా.. రేటులో మార్పేమీ లేదని చెప్పారు. ఐవోసీకి దాదాపు సగం మార్కెట్ వాటా ఉంది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే బీఎస్–4 ప్రమాణాల నుంచి బీఎస్–6కి మారిన ఘనత భారత్కు మాత్రమే దక్కుతుందని సింగ్ చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఏప్రిల్ 1 డెడ్లైన్ కన్నా మూడు వారాల ముందునుంచే బీఎస్–6 అమ్మకాలు ప్రారంభించామన్నారు. అటు బీపీసీఎల్ కూడా తమ 16,000 పెట్రోల్ బంకుల్లో బీఎస్–6 గ్రేడ్ ఇంధన విక్రయాలు ప్రారంభించినట్లు తెలిపింది. నవరి నుంచే తమ రిఫైనరీల్లో కొత్త గ్రేడ్ ఇంధన ఉత్పత్తి ప్రారంభమైందని, ప్రస్తుతం తమకున్న మొత్తం 16,400 పైచిలుకు బంకుల్లో దీని విక్రయం మొదలుపెట్టామని హెచ్పీసీఎల్ సీఎండీ ఎంకే సురానా తెలిపారు. 2010లో యూరో3కి సరిసమానమైన బీఎస్–3 ఇంధనాలు అందుబాటులోకి వచ్చాయి. అటుపైన బీఎస్–4కి మళ్లడానికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత బీఎస్–5 జోలికి వెళ్లకుండా దానికన్నా మెరుగైన బీఎస్–6 ఇంధనాలు వచ్చాయి. పాత ఇంధనాలతో పోలిస్తే బీఎస్–6లో కాలుష్యకారక సల్ఫర్ పరిమాణం అత్యంత తక్కువగా 10 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటుంది. బీఎస్–3లో 350 కాగా.. బీఎస్–4లో 50 పీపీఎం. -
బీఎస్–6 వాహనాలకు పెట్రోల్ కూడా ప్రత్యేకం
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏప్రిల్ నెలలో బీఎస్–6 వాహనాలు రోడ్లపైకి రానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 (భారత్ స్టాండర్డు–6) వాహనాలు మాత్రమే విక్రయించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం విదితమే. కాలుష్యానికి కారణమవుతున్న బీఎస్–4 వాహనాలు విక్రయాలు ఈ నెల 31 నుంచి నిలిపి వేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖ ఇప్పటికే డీలర్లతో సమావేశం నిర్వహించి ఆదేశాలిచ్చింది. ఈ నెల 31 లోగా బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని డీలర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గడువు తీరిన తర్వాత రిజిస్ట్రేషన్లు అంగీకరించేది లేదని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషను లేకుండా వాహనాలు తిరిగితే సీజ్ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు. భారత్ స్టాండర్డ్ వాహనాలు వచ్చాయి ఇలా.. వాహనాల నుంచి వచ్చే వాయు కాలుష్య ఉద్గారాలను బట్టి, ఇంజన్ మోడల్ను ప్రతిపాదిస్తున్నారు. దీన్నే భారత్ స్టాండర్డ్ వాహనాలుగా చెబుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు బీఎస్–2,3,4...తాజాగా బీఎస్ 6 వాహనాలు వచ్చాయి. 2001 నుంచి 2005 మధ్యలో బీఎస్–2 వాహనం రోడ్లపై హల్చల్ చేశాయి. 2005లో బీఎస్–3 వాహనాలు మార్కెట్లోకి వచ్చింది. 2017లో బీఎస్–4 ఇప్పుడు ఏప్రిల్లో బీఎస్–6 వాహనం అందుబాటులోకి రానుంది. ఇది ఇప్పటికే మార్కెట్లో వాహన ప్రియులను ఊరిస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బీఎస్–6 వాహనం వస్తోంది, ఇంజిన్ సామర్థ్యం మెరుగ్గా ఉండి వేగం తగ్గకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రధానంగా కాలుష్యం తక్కువగా వదిలే విధంగా దీన్ని తయారు చేశారు. వీటిలో మైలేజ్ పరంగా 15 శాతం అధికంగా ఉన్నా ట్యాంకులో 2 నుంచి 3 లీటర్లు నిల్వ ఉంచుకుంటేనే వాహనం నడుస్తుందని వాహన నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో పలు షోరూంలో బీఎస్–6 వాహనాలు అమ్మకాలకు సిద్ధం చేశారు. పెట్రోల్ కూడా ప్రత్యేకమే బీఎస్–6 వాహనాలకు పెట్రోల్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్ నాటికి ఈ ఇంధనం పెట్రోల్ బంకులోకి అందుబాటులోకి రానుంది. అయితే ఈ పెట్రోల్ బీఎస్–4 వాహనాలకు కూడా వాడే విధంగా తయారు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల జోరు.. బీఎస్–4 వాహనానను వదిలించుకునేందుకు డీలర్లు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాయితీలు అందిస్తున్నారు. రోజుకు 100 నుంచి 200 వరకు వాహనాలకు రిజిస్ట్రేషన్లు జరుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బీఎస్–4వాహనాలు వందల సంఖ్యలో ఉన్నాయని డీలర్లు చెబుతున్నారు. ఈ నెలాఖరు కల్లా వాహనాల అమ్మకాలు పూర్తవుతాయని చెబుతున్నారు. మార్చి 31 వరకే బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్ ఈ నెల 31 వరకే బీఎస్–4 వాహనాలను రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వాహనం అందుబాటులోకి వస్తోంది. మార్చి 31 తర్వాత బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తాం. రిజిస్ట్రేషన్ లేకుండా రోడ్డుపై వచ్చే వాహనాలను సీజ్ చేస్తాం–శాంతకుమారి, ఆర్టీఓ, కడప -
బీఎస్–4.. రిజిస్ట్రేషన్ల జోరు
సాక్షి, అమరావతి: బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్కు డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ రవాణా శాఖ వాహన డీలర్ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయిస్తోంది. మొన్నటి వరకు రోజుకు సగటున 3–4 వేల వాహనాల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఇప్పుడు 5 వేలకు పైగా జరుగుతున్నాయి. దీంతో రెండ్రోజులకే రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతోంది. ఈ నెల రెండో వారం తరువాత ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజుకు 10 వేల వరకు జరిగే అవకాశం ఉందని రవాణా శాఖ భావిస్తోంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని రవాణా శాఖ కార్యాలయాల యూనిట్లలో చేశామని అధికారులు చెబుతున్నారు. నేరుగా బీఎస్–6కు.. ► వాహన రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలోనూ కాలుష్యం, రోడ్డు భద్రత, మెకానికల్ అంశాలకు సంబంధించి భారత్ స్టాండర్డ్స్ (బీఎస్) పేరిట నాణ్యత ప్రమాణాలను నిర్ణయించారు. ► వీటిని బీఎస్–1, 2, 3, 4, 5, 6 కేటగిరీలుగా విభజించారు. ప్రస్తుతం బీఎస్–4 వాహనాల నుంచి బీఎస్–5 కాకుండా నేరుగా బీఎస్–6కు వెళ్లారు. బీఎస్లో ప్రధానంగా కాలుష్యంపైనే అత్యున్నతంగా ప్రమాణాలను నిర్దేశించారు. బీఎస్–6 వాహనాలు 68 శాతం కాలుష్య రహితంగా రూపొందించారు. ► అన్ని కంపెనీలకు బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్లు డీలర్ల వద్దే జరగనుండటంతో వీటిపై రవాణా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏయే పేర్లతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ జరిగే వాహనదారులకు రెండో వాహనం ఉందా? అన్న అంశాలపై దృష్టి పెట్టారు. ► రెండో వాహనం ఉంటే రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనాలు సహా బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ►ఈ నేపథ్యంలో బీఎస్–4 వాహనాలకు కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధరలను తగ్గించారు. ►కొందరు డీలర్లు బీఎస్–4 వాహనాలను తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించి ఏప్రిల్ తర్వాత ప్రీ ఓన్డ్ షోరూంలకు తరలించే ఆలోచన చేస్తున్నారని రవాణా అధికారులు చెబుతున్నారు. -
వాహన రంగానికి... బీఎస్–4 గుదిబండ
న్యూఢిల్లీ: వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం కోసం భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుచేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి తాజా ఉత్తర్వులను జారీ చేస్తున్నాయి. వచ్చే నెల ప్రారంభం నుంచే కొత్త నిబంధనలు అమలుకానున్న కారణంగా పాత నిబంధనలకు అనుగుణంగా ఉన్న బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ నెల చివరినాటికి ముగించేయాలని ఆదేశిస్తున్నాయి. దీంతో భారీ స్థాయిలో ఇన్వెంటరీలను కలిగి ఉన్న వాహన రంగ కంపెనీలు హడలెత్తిపోతున్నాయి. మొన్నటివరకు పరిస్థితి బాగానే ఉందని, ప్రాణాంతకమైన కరోనా వైరస్ (కోవిడ్–19) వ్యాప్తి వేగంగా ఉన్నందువల్ల షారూంలకు వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయి అమ్మకాలు నిలిచిపోయాయని చెబుతున్నాయి. విజృంభిస్తోన్న వైరస్ పరంగా చూస్తే.. గడువు తేదీలోపు బీఎస్–4 వాహన విక్రయాలను పూర్తి చేయడం కష్టమేనని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. మరోవైపు పాత వాహనాల రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తికావాలని పలు రాష్ట్ర రవాణా విభాగాలు డీలర్లకు సర్క్యులర్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. 30–రోజులకు పెరిగిన నిల్వలు పేరుకుపోయిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం కోసం పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు హర్షరాజ్ కాలే అన్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో కూడా ఈ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కొనసాగుతుందని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక మంది డీలర్ల వద్ద అన్ని విభాగాలకు చెందిన పాత వాహనాల నిల్వలు అధిక స్థాయికి చేరుకున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర నిల్వలు అధికంగా ఉన్నాయని వివరించారు. వీటి ఇన్వెంటరీ 20–30 రోజులుగా ఉందన్నారు. ఓఈఎం (ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్)తో కలిసి సంప్రదింపులు నిర్వహించనున్నామని, ఇందుకు తగిన పరిష్కార మార్గం దొరక్కపోతే డీలర్లు భారీ స్థాయిలో నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని వివరించారు. -
గడువు దాటిందా.. బండి గోవిందా!
ఆదిలాబాద్టౌన్: పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. బీఎస్–4 వాహనాల ద్వారా వాతావరణ కాలుష్యం అధికంగా ఉండడంతో వాటి స్థానంలో బీఎస్–6 వాహనాలను వినియోగంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 2016లోనే నిర్ణయం తీసుకుంది. అయితే ఈనెల 31లోగా బీఎస్–4 వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలను స్క్రాప్గా పరిగణిస్తామని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ చేసుకోని బీఎస్–4 వాహన దారుల్లో గుబులు మొదలైంది. గడువు దగ్గర పడడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారత్ స్టేజ్–6 (బీఎస్–6) వాహనాలను మాత్రమే ఆర్టీఏ కార్యాలయంలో నమోదు చేస్తారు. బీఎస్–4 వాహనాలను అనుమతించరు. జిల్లాలో రిజిస్ట్రేషన్ కాని వాహనాలు 3,684కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఈనెల 31 వరకు గడువు ఇచ్చింది. సంబంధిత ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలు తుక్కు కిందికి వస్తాయని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ద్విచక్రవాహనాలు 3,369 ఉండగా కార్లు, ఇతర వాహనాలు 315 ఉన్నాయి. మొత్తంగా 3,684 రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలుఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ద్విచక్ర వాహనాలు 2,348, ఇతర వాహనాలు 367, నిర్మల్ జిల్లాలో ద్విచక్ర వాహనాలు 5,144, ఇతర వాహనాలు 640 ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ద్విచక్రవాహనాలు 4,395, ఇతర వాహనాలు 528 ఉన్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకోని బీఎస్–4 వాహనాలు 16,106 ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే స్క్రాపే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో కొనుగోలు చేసిన కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కొంత మంది వాహన దారులు యథేచ్ఛగా తిప్పుతున్నారు. జిల్లాలో ద్విచక్ర, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు ఉన్నాయి. అయితే బీఎస్–4 వాహనాల ద్వారా కాలుష్యం ఎక్కువగా ఉందని ప్రభుత్వం వీటి తయారీని నిలిపివేసింది. కొత్తగా బీఎస్–6 వాహనాలను తీసుకురానుంది. వీటి ద్వారా కాలుష్యం కొంత మేరకు తగ్గనుంది. రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండలాల్లో రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల గడిచిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే సీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. జరిమానాలు కూడా విధించనున్నారు. రిజిస్ట్రేషన్ విషయంలో ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే పరిష్కరించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 99493 11051 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. బీఎస్–4 వాహనాలకు ఆఫర్లు.. ఆదిలాబాద్ జిల్లాలో ఆయా షోరూంలలో ఉన్న బీఎస్–4 వాహనాల అమ్మకాల కోసం డీలర్లు వినియోగదారులకు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈనెల 31 వరకు గడువు ఉండడంతో సేల్స్ చేసేందుకు వాహన ధరల్లో రూ. 10 వేల నుంచి రూ. 20వేల వరకు తగ్గించి విక్రయాలు జరుపుతున్నారు. వినియోగదారులు ఆ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆర్టీఏ కార్యాలయంలో రోజుకు 50 నుంచి 60 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. వీటి రిజిస్ట్రేషన్ల కోసం మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఆలోగా బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్ అవుతుందో లేదోననే ఆయోమయంలో కొందరు ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే సీజ్ చేస్తాం రిజిస్ట్రేషన్ చేసుకోని బీఎస్–4 వాహనాలు ఆదిలాబాద్ జిల్లాలో 3,684 ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఈనెల 31 వరకు గడువు విధించింది. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తుక్కు కిందికి అమ్ముకోవాల్సి ఉంటుంది. అలాంటి వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం. – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్ -
ఆర్టీసీకి ‘బీఎస్–6’ గండం
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీకి భారత్ స్టేజ్(బీఎస్)–6 గండం పొంచి ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీఎస్–4 వాహనాలు తిరుగుతున్నాయి. బీఎస్–5కు వెళ్లకుండా కాలుష్య నియంత్రణ కోసం ఏకంగా బీఎస్–6 వాహనాలనే ఉపయోగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మార్చి 31వ తేదీ వరకే పాత వాహనాల రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేవలం బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని, పాత వాహనాలకు రిజిస్ట్రేషన్లను అనుమతించబోమని తేల్చి చెప్పింది. ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సులకు రిజిస్ట్రేషన్ సమస్య ఉత్పన్నమైంది. కొత్త బస్సులను కొనుగోలు చేసేటప్పుడు కేవలం ఛాసిస్లను కొనుగోలు చేస్తారు. అప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతాయి. బస్సులకు బాడీ బిల్డింగ్ చేస్తేనే శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రవాణా శాఖ చేపడుతుంది. దీంతో ఆర్టీసీ కొనుగోలు చేసిన 300 కొత్త బస్సులకు వెంటనే బాడీ బిల్డింగ్ పూర్తి చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పొరుగు రాష్ట్రాల నుంచి బస్ బాడీ బిల్డింగ్ కార్మికులను పిలిపించాలని నిర్ణయించారు. ఒకవేళ అన్ని బస్సులకు బాడీ బిల్డింగ్ పూర్తి కాకుంటే ఏం చేయాలన్న దానిపై ఆర్టీసీ అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. 2020 డిసెంబరు 31 నాటికి తొలి దశలో కాలం చెల్లిన 1,000 బస్సులను మార్చాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. వీటి స్థానంలో కొత్తగా 1,000 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. నెలన్నర కిందటే కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినా.. 1,000 బస్సులకు బాడీ బిల్డింగ్ చేయాలంటే వంద రోజుల దాకా సమయం పడుతుందని, శాశ్వత రిజిష్ట్రేషన్లు జరగవని భావించారు. అందుకే కొత్త బస్సులను 300కే పరిమితం చేశారు. మార్చి 31లోగా శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయిస్తాం.. ‘‘ఏప్రిల్ నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినందున 300 బస్సులనే కొనుగోలు చేశాం. వీటికి మార్చి 31వ తేదీలోగా శాశ్వత రిజిస్ట్రేషన్ చేయిస్తాం. పాత వాహనాలకు మార్చి 31వ తేదీ కంటే ముందే శాశ్వత రిజిస్ట్రేషన్ జరగాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్లను శాశ్వత రిజిస్ట్రేషన్లుగా గుర్తించవచ్చని మధ్యప్రదేశ్లో బస్సుల కొనుగోలు అంశంలో సుప్రీంకోర్టు మౌఖికంగా పేర్కొన్నట్లు మాకు సమాచారం ఉంది. నిర్ణీత తేదీలోగా 300 బస్సులకు బాడీ బిల్డింగ్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నాం’’ – మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ ఎండీ -
ఏప్రిల్ నుంచి పెట్రోలు ధరల మోత?
సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏప్రిల్నుంచి ఇంధన ధరలు మోతమోగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్-6 ఉద్గాన నిబంధనల నేపథ్యంలో పెట్రోలు ధరలు లీటరుకు 70-120 పైసలు పెంచవలసి వుంటుందని కంపెనీలు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తక్కువ ఉద్గారాలతో బీఎస్-6 ఇంధనాలను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తద్వారా రిటైల్ ధరలలో స్వల్ప పెరుగుదల ఉండనుందని ఐవోసీ ప్రకటించడం ఈ అంచనాలకు మరింత బలాన్నిచ్చింది. కొన్నిరిమోట్ ప్రదేశాల్లో తప్ప దేశం అంతా కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంధన సరఫరాకు తాము సిద్ధంగా ఉన్నామని జాతీయ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) శుక్రవారం వెల్లడించింది. అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉన్న ఐవోసీ తమ రిఫైనరీలను తక్కువ సల్ఫర్ డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి చేసేలా అప్గ్రేడ్ చేయడానికి రూ .17వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని కంపెనీ చైర్మన్ సంజీవ్ సింగ్ మీడియాకు వివరించారు. ధరల పెంపు సంకేతాలను ధృవీకరించిన సంజీవ్ సింగ్ ఏ మేరకు పెంపు వుంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏప్రిల్ 1 నుండి ఇంధనాల రిటైల్ ధరలలో స్వల్ప పెరుగుదల ఉంటుందని మాత్రం ప్రకటించారు. అయితే వినియోగదారులపై భారం పెద్దగా ఉండదదని హామీ ఇచ్చారు. ఇక దేశం మొత్తం కొత్త ఇంధనాలపై నడుస్తుందనీ, గతంలో 50 పీపీఎంతో పోలిస్తే సల్ఫర్ కంటెంట్ 10 పీపీఎం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. తమ చమురు శుద్ధి కర్మాగారాలను అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) రూ .35,000 కోట్లు పెట్టుబడి పెట్టగా, అందులో రూ.17 వేల కోట్లు ఐఓసి ఖర్చు చేసిందని చెప్పారు. కాగా బీపీసీఎల్ సుమారు 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, ఓఎన్జీసీకి చెందిన హెచ్పీసీఎల్ పెట్టబడులపై ఎలాంటి సమాచారం లేదు. అయితే బీఎస్-6 సంబంధిత ఇంధనాలతో ఫిబ్రవరి 26-27నుంచే సిద్ధంగా ఉన్నామని మార్చి 1 నుంచి కొత్త ఇంధనాలను మాత్రమే విక్రయిస్తామని హెచ్పీసీఎల్ ఇప్పటికే ప్రకటించింది. -
బైబై బీఎస్– 4.. మార్చి 31 వరకే రిజిస్ట్రేషన్
కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా భారత్ స్టేజ్–6 వాహనాలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇప్పటి వరకూ మార్కెట్లో ఉన్న బీఎస్–4 వాహనాల విక్రయాలు నిలిచిపోనున్నాయి. రవాణాశాఖ అధికారులు మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ వాహనాలకురిజిస్ట్రేషన్లు చేయనున్నారు. సుప్రీం ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. దీంతో ఆయా షోరూంల్లో ఉన్న బీఎస్–4 వాహనాలను విక్రయించేందుకు, డీలర్లు ప్రయత్నాలుప్రారంభించారు. నెల్లూరు(టౌన్): ప్రస్తుతం జిల్లాలో పలు షోరూంల్లో ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ బీఎస్–4 వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు తప్పేలా లేదు. ఇప్పటి నుంచి కొనుగోలు చేసిన వాహనాలను తాత్కాలిక, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే వారికి అప్పగించాలని జిల్లా రవాణాశాఖ అధికారులు ఆయా షోరూం డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా వాహనాన్ని అప్పగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కొనుగోలు చేసి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోని వాహనాలను గుర్తించి వెంటనే వాటికి రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. మార్చి 31వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బీఎస్–4 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితుల్లేవు. వాహన డీలర్లు సైతం నిర్ణీత గడువులోపు తమ షోరూంల్లోని బీఎస్–4 వాహనాలను విక్రయిస్తుండంతో పాటు వాటికి రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. షోరూం డీలర్లతో సమావేశం నిర్వహిస్తున్న డీటీసీ సుబ్బారావు ఇక నుంచి వాటికి మాత్రమే.. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–6 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇప్పటికే బీఎస్–4 వాహనాలు ఆయా షోరూంల్లో వందల సంఖ్యలో నిల్వ ఉన్నట్లు తెలిసింది. వాటిని త్వరగా విక్రయించడం లేదా తయారీ కంపెనీలకు అప్పగించడం చేయాల్సి ఉంటుంది. 2017 మార్చి 31తో బీఎస్–3 వాహనాలను నిలిపి వేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీఎస్–4 వాహనాలను విక్రయించారు. అయితే మార్చి 31వ తేదీ లోపు కొనుగోలు చేసిన బీఎస్–3 వాహనాలకు ఏప్రిల్ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి ఉండదు.రాయితీలు ప్రకటిస్తారా... గతంలో బీఎస్–3 వాహనాలకు గడువు విధించిన సమయంలో ఆయా షోరూం యజమానులు వాహనాల కోనుగోలు కోసం భారీగా రాయితీలు ప్రకటించారు. ఒక్కో వాహనం మీద ధరను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రాయితీ ఇచ్చారు. అయితే ఈసారి అదే విధంగా రాయితీలు ఇస్తారా లేక నిర్ణయించిన ధరకే అమ్ముతారన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ విభాగాల్లో వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. గతంలో రోజుకు అన్ని వాహనాలు కలిపి 350కి పైగా రిజిస్ట్రేషన్ అయ్యేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో డీలర్లు డీలా పడిన పరిస్థితి ఉంది. డీలర్లతో సమావేశం రవాణా కార్యాలయంలో గురువారం ఉప రవాణా కమిషనర్ సుబ్బారావు జిల్లాలోని ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహన డీలర్లతో సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఇప్పటి నుంచి షోరూంల్లో కొనుగోలు చేసిన బీఎస్–4 మోడల్కు సంబంధించి ప్రతి వాహనానికి తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ను చేసిన తర్వాతే యజమానులకు అప్పగించాలని తెలిపారు. ఈ ఆదేశాలను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. గతంలో విక్రయించి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కాని వాహనాలను గుర్తించి వాటికి మార్చి 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. -
హీరో స్ల్పెండర్ ప్లస్, కొత్త వెర్షన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన పాపులర్ మోడల్ స్ల్పెండర్ ప్లస్ను బీఎస్-6 వెర్షన్ ఇంజీన్తో లాంచ్ చేసింది. దేశీయంగా త్వరలో అమలుకానున్న కొత్త ఉద్గార నిబంధనల నేపథ్యంలో ఈ బైక్ను శుక్రవారం విడుదల చేసింది. ధర రూ .59,600 నుండి ప్రారంభమవుతుంది. దీంతో పాటు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా రెండు స్కూటర్లను కూడా తీసుకొచ్చింది. డెస్టినీ 125, మాస్ట్రో ఎడ్జ్ 125 పేరుతో తీసుకొచ్చిన వీటి ధరలను వరుసగా రూ .64,310 , రూ .67,950 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) ప్రారంభమవుతుందని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ పోర్ట్ఫోలియోను విస్తరించామని హీరో మోటోకార్ప్ హెడ్ (గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్) మాలో లే మాసన్ అన్నారు. జైపూర్లోని ఆర్అండ్డీ హబ్ - సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (సిఐటి) వద్ద వీటిని పూర్తిగా దేశీయంగా డిజైన్ చేసి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. -
వాహన అమ్మకాలు.. బే‘కార్’!
గ్రేటర్ నోయిడా: దేశీయంగా వాహన విక్రయాల్లో మందగమనం కొనసాగుతోంది. కొత్త ఏడాదిలోనూ అమ్మకాలు పుంజుకోలేదు. జనవరిలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 6.2 శాతం క్షీణించాయి. వాహనాల కొనుగోలు భారం పెరగడం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మందగించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త బీఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వాహనాల రేట్లు అధిక స్థాయిలో ఉండటం, ముడివస్తువుల ధరల పెరగడంతో జనవరిలో కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల రేట్లను పెంచడం కూడా అమ్మకాలపై ప్రతికూల ప్రభావాలు చూపాయి. ‘జీడీపీ వృద్ధి మందగమనం, వాహన కొనుగోలు వ్యయాలు పెరగడం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలు వాహన విక్రయాలపై కొనసాగుతున్నాయి‘ అని అని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. ‘ఇన్ఫ్రా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ఇటీవలచేసిన ప్రకటనలతో వాహనాల అమ్మకాలు మళ్లీ పుంజుకోగలవని ఆశిస్తున్నాం. ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ మెరుగుపడగలదని భావిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. త్రిచక్ర వాహనాలు కాస్త ఊరట.. జనవరి గణాంకాలను ప్రస్తావిస్తూ.. త్రిచక్ర వాహనాలు మినహా అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు పడిపోయాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు. పరిశ్రమ ఇంకా నెగటివ్లోనే ఉన్నప్పటికీ.. పండుగల సీజన్ తర్వాత విక్రయాల క్షీణత తీవ్రత కాస్త తగ్గిందని ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం కొనసాగుతున్న ఆటో ఎక్స్పోలో సందర్శకుల స్పందనను బట్టి చూస్తే.. వినియోగదారుల సెంటిమెంటు మరింత మెరుగుపడగలదని ఆశిస్తున్నాం. ఇందులో ఇప్పటిదాకా దాదాపు 70 వాహనాలను ఆవిష్కరించారు‘ అని ఆయన చెప్పారు. విక్రయాల తీరిదీ.. ► గతేడాది జనవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,80,091 యూనిట్లు. ఈ ఏడాది జనవరిలో 2,62,714 యూనిట్లకు తగ్గాయి. ► కార్ల అమ్మకాలు 8.1% క్షీణించి 1,79,324 యూ నిట్ల నుంచి 1,64,793కి పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. 15,97,528 యూనిట్ల నుంచి 13,41,005 యూనిట్లకు తగ్గాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 15 శాతం తగ్గి 10,27,766 నుంచి 8,71,886కి క్షీణించాయి. స్కూటర్లు 16 శాతం క్షీణించి 4,97,169 యూనిట్ల నుంచి 4,16,594కి పరిమితమయ్యాయి. ► వాణిజ్య వాహనాల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. 87,591 యూనిట్ల నుంచి 75,289 యూనిట్లకు తగ్గాయి. ► వివిధ కేటగిరీల్లో అన్ని వాహనాల విక్రయాలు 13.83 శాతం తగ్గి.. 20,19,253 యూనిట్ల నుంచి 17,39,975 యూనిట్లకు క్షీణించాయి. ► కంపెనీలవారీగా చూస్తే కార్ల విభాగంలో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు మాత్రం 0.29% పెరిగి 1,39,844 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 8% క్షీణించి 42,002 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ విక్రయాలు 14 శాతం పడిపోయాయి. -
ఆటోకు ఆర్థిక శాఖ తోడ్పాటు..
గ్రేటర్ నోయిడా: కొంగొత్త టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కోసం ఆటోమొబైల్ పరిశ్రమకు తగు తోడ్పాటు అందించాలని ఆర్థిక శాఖను కోరినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. విద్యుత్ వాహనాల తయారీకి, ఎగుమతులకు భారత్ గ్లోబల్ హబ్గా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆటో ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ‘కొన్నాళ్ల క్రితం రెండు ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. వాటి నాణ్యత చూశాక, రాబోయే రోజుల్లో ద్విచక్ర వాహనాలైనా.. కార్లయినా.. బస్సులైనా.. విద్యుత్ వాహనాల తయారీ, ఎగుమతుల్లో మనం కచ్చితంగా నంబర్ వన్ కాగలమని నాకు అనిపించింది‘ అని ఆయన చెప్పారు. వాహనాల తుక్కు పాలసీ తుది దశల్లో ఉందని, ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది గణనీయంగా మేలు చేయగలదని గడ్కరీ తెలిపారు. మరోవైపు వాహనాలపై జీఎస్టీ తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్పై స్పందిస్తూ.. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు చెప్పారు. భారత దిగుమతుల భారాన్ని, కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయ టెక్నాలజీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. ‘శాంత్రోవాలా’.. షారుఖ్.. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ ఇప్పటిదాకా అనేక కొత్త కార్లు ప్రవేశపెట్టినా.. ఇప్పటికీ తనకు శాంత్రో కారన్నా, శాంత్రో వాలా ప్రకటన అన్నా తనకు చాలా ఇష్టమని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ చెప్పారు. ఆటో ఎక్స్పోలో కొత్త క్రెటా ఎస్యూవీని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 22 సంవత్సరాలుగా హ్యుందాయ్కి షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నారు. గ్రేట్ వాల్ మోటర్స్ ఉత్పత్తి హవల్ ఎఫ్5 ఎస్యూవీతో మోడల్స్ ఫోక్స్వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ‘ఐడీ క్రాజ్’తో సంస్థ ప్రతినిధులు జేకే మోటర్ స్పోర్ట్స్ పెవిలియన్లో రేసింగ్ కారుతో మోడల్స్ ఆటో ఎక్స్పోలో సుజుకీ హయబుసా బైక్తో మోడల్ -
ధూమ్ షో 2020
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆటో ఎక్స్పో 2020 మోటార్ షో ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. తొలి రెండు రోజుల్లో వ్యాపార వర్గాలను అనుమతించనుండగా.. 7 నుంచి 12 దాకా సామాన్య ప్రజలు కూడా సందర్శించవచ్చు. దేశ, విదేశాలకు చెందిన పలు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు ఇందులో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. 15 పైగా స్టార్టప్ సంస్థలు, టెలికం, విద్యుత్ వాహనాల సంస్థలు, సోషల్ మీడియా సంస్థలు ఈ 15వ ఆటో ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. ‘పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన వాహనాలు, విద్యుత్ వాహనాలు, స్మార్ట్ వాహనాలకు సంబంధించిన కొంగొత్త టెక్నాలజీలను కంపెనీలు ఈ ఎక్స్పోలో ప్రదర్శిస్తున్నాయి’ అని భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య... సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ ఈ సందర్భంగా చెప్పారు. సుమారు 60 దాకా ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను కంపెనీలు ఈ ఆటో షోలో ఆవిష్కరించనున్నాయి. అయితే, వీటిలో ఎక్కువ భాగం వాహనాలు.. కొత్త బీఎస్–6 కాలుష్య ప్రమాణాలకు అప్గ్రేడ్ చేస్తున్న గత మోడల్స్ కొత్త వెర్షన్లే ఉండనున్నాయి. భారతీయ పరిశ్రమల సమాఖ్య... సీఐఐతో పాటు ఏసీఎంఏ, సియామ్ కలిసి ఈ ఆటో ఎక్స్పోను నిర్వహిస్తున్నాయి. అమ్మకాల క్షీణత తదితర సమస్యలతో వాహన పరిశ్రమ సతమతమవుతున్న తరుణంలో జరుగుతున్న ఆటోమొబైల్ ఎక్స్పో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. బయో ఇథనాల్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన బ్రెజిల్కి చెందిన చరకు పరిశ్రమ సమాఖ్య యూనికా, ఇటాలియన్ టైర్ల సంస్థ పిరెలీ, డిజైన్ కంపెనీ ఐకోనా వంటివి ఈ షోలో పాల్గొంటున్నాయి. కొత్త విదేశీ సంస్థల ఉత్పత్తులు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్, ఎఫ్ఏడబ్ల్యూ హైమా, ఒలెక్ట్రా, ఎంజీ మోటార్స్ మొదలైనవి కార్లు, ఎస్యూవీలు, బస్సులు తదితర వాహనాలను ప్రదర్శించనున్నాయి. తాజా వార్తలు, ఈవెంట్స్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోని ఆటోఎక్స్పో 2020 పేజ్లలో ఎప్పటికప్పుడు లైవ్లో అందించేందుకు సియామ్, ఫేస్బుక్ చేతులు కలిపాయి. జీడబ్ల్యూఎం 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. చైనాకు ఎస్యూవీ దిగ్గజం గ్రేట్ వాల్ మోటార్స్ (జీడబ్ల్యూఎం) భారత్లో బిలియన్ డాలర్ల (సుమారు రూ.7,100 కోట్లు) మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. పరిశోధన.. అభివృద్ధి, తయారీ, సేల్స్..మార్కెటింగ్పై ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు జీడబ్ల్యూఎం భారత అనుబంధ సంస్థ డైరెక్టర్ హర్దీప్ బ్రార్ తెలిపారు. వచ్చే 3–5 ఏళ్లలో ప్రపంచంలోనే తమకు టాప్ 3 మార్కెట్లలో భారత్ కూడా చేరగలదని విశ్వసిస్తున్నట్లు ఆయన చెప్పారు. బెంగళూరులో తమ పరిశోధనా కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు, దశలవారీగా 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు బ్రార్ వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల సందడి.. ఆటో షోలో కొంగొత్త ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా కొలువుతీరాయి. టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ, ఆల్ట్రోజ్ ఈవీలతో పాటు ‘లో ఫ్లోర్ ఎంట్రీ ఎలక్ట్రిక్ బస్’ను ప్రదర్శిస్తోంది. ఇప్పటికే 100 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, రాబోయే 2–3 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ఇన్ఫ్రా మరింత మెరుగుపడగలదని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు. జీడబ్ల్యూఎం తమ హావల్ కాన్సెప్ట్ హెచ్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీంతో పాటు విజన్ 2025 ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని ప్రదర్శిస్తోంది. మారుతీ సుజుకీ.. తమ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం ‘ఫ్యూచరో–ఈ’ని ఆవిష్కరించింది. ఎంజీ మోటార్ ఇండియా.. కొత్త మార్వెల్ ఎక్స్ వాహనాన్ని ప్రదర్శనకు ఉంచింది. చదవండి : ఆటో ఎక్స్పో సందడి షురూ: కార్ల జిగేల్.. జిగేల్ -
ఏప్రిల్ నుంచి పెట్రో ధరల పెరుగుదల!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు 50పైసల నుంచి 1 రూపాయి వరకు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం వాహనాలకు బీఎస్ 4 ప్రమాణ ఇంధనం వాడుతుండగా.. ఏప్రిల్ 1 నుంచి మరింత మెరుగైన బీఎస్ 6 ప్రమాణ ఇంధనం వినియోగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైంది. ‘బీఎస్ 6’ ఇంధనం కారణంగా వాహన కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. బీఎస్ 6 గ్రేడ్ ఇంధన ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించామని, వచ్చే నెలలో అన్ని డిపోలకు బీఎస్ 6 గ్రేడ్ ఇంధనం చేరుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా బీఎస్ 6 గ్రేడ్ ఇంధనమే వాహనాలకు అందుబాటులో ఉంటుందన్నారు. -
బీఎస్-6 : హోండా అమేజ్.. సరికొత్తగా
సాక్షి, న్యూఢిల్లీ: కార్ల తయారీ సంస్థ హోండా తన పాపులర్ మోడల్ కారు హోండా అమేజ్లో కొత్త వెర్షన్ను తీసుకొచ్చింది. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తొలి మోడల్కారు ‘అమేజ్ 2020’ని లాంచ్ చేసింది. దీని ప్రారంభధరను. 6.09 లక్షలుగా(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. 1.5 లీటర్ల ఐ-డీటెక్ డీజిల్ ఇంజీన్, 1.2 లీటర్ల ఇంజన్లీతో మాన్యువల్, సీవీటీ రెండు వెర్షన్లలోనూ ప్రారరంభించింది. హ్యుందాయ్ ఆరా, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, టాటా టిగోరేకి గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ కొత్త మోడల్
సాక్షి, న్యూఢిల్లీ : రాయల్ ఎన్ఫీల్డ్ రానున్న కొత్త ఉద్గార నిబంధనలకనుగుణంగా పాపులర్ మోడల్ హిమాలయను బైక్ను అప్డేట్ చేసింది. బీఎస్-6 ఇంజిన్తో సోమవారం లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ .1.86 లక్షల (ఎక్స్షోరూమ్, న్యూఢిల్లీ) గా ఉంచినట్లు కంపనీ తెలిపింది. ఏబీఎస్ ఫీచర్తో మూడు రంగుల్లో వీటిని తీసుకొచ్చింది. 411 సీసీ ఇంజీన్, 24.3 బీహెచ్పీ పవర్, 32 ఎన్ఎం టార్క్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. బుకింగ్స్ను ఇప్పటికే ప్రారంభించగా, మూడేళ్ల వారంటీ ప్యాకేజీని అందిస్తోంది. విలక్షణమైన అడ్వెంచర్ టూరర్ గా 2016 నుండి, హిమాలయ బైక్స్ జాతీయంగా అంతర్జాతీయంగా ఆదరణ పొందిందని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో వినోద్ దాసరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకమైన ఫీచర్స్, డిజైన్ ఫంక్షన్లతో కొత్త బిఎస్-6 హిమాలయన్ లాంచ్ చేయడం దేశంలో అడ్వెంచర్ మోటార్ సైక్లింగ్ కొత్త ప్రమాణాలను ఏర్పరచడంతోపాటు, రైడర్లను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని కంపెనీకి కలిగిస్తోందన్నారు. తమ కొత్త బైక్స్ భారతదేశంలోని రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్లలో లభిస్తాయని అన్నారు. అలాగే హెల్మెట్లు, జెర్సీలు, టీ-షర్టులు, స్వెర్ట్షర్ట్స్, హెడ్గేర్ తదితరాలను సరికొత్త గా తీసుకొస్తున్నట్టు చెప్పారు. స్నో వైట్, గ్రానైట్ కలర్ ఆప్షన్ బైక్ ధర రూ .1,86,811 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం స్లీట్ గ్రే , గ్రావెల్ గ్రే మోడల్ ధర రూ .1,89,565 (ఎక్స్-షోరూమ్) కొత్తగా వచ్చిన డ్యూయల్ టోన్ కలర్స్ - రాక్ రెడ్ , లేక్ బ్లూ - రూ .1,91,401 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తాయి. -
మార్కెట్లోకి ‘హోండా యాక్టివా 6జీ’
ముంబై: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ).. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న మరో స్కూటర్ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘యాక్టివా 6జీ’ పేరిట విడుదలైన ఈ అధునాతన స్కూటర్ స్టాండర్డ్, డీలక్స్ వేరియంట్లలో లభిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ. 63,912– 65,412 (ఎక్స్–షోరూం, ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. మును పటి మోడలైన స్టాండర్డ్ 5జీతో పోల్చితే నూతన స్కూటర్ ధర రూ.7,978 అధికం కాగా, డీలక్స్ ధర రూ. 7,613 ఎక్కువగా ఉంది. ‘బీఎస్–6 నూతన ఉద్గార ప్రమాణాలతో కూడిన మూడవ యాక్టివా ఇది. ఈ నెలాఖరుకు లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఇది అందుబాటులోకి వస్తుంది’ అని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై.ఎస్ గులేరియా తెలిపారు. -
న్యూ ఇయర్ గిఫ్ట్ : హీరోమోటో కొత్త బైక్
సాక్షి,ముంబై : హీరోమోటో కొత్త ఏడాదిలో సరికొత్త బైక్ను లాంచ్ చేసింది.100సీసీ సెగ్మెంట్లో బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తన తొలి మోటార్ సైకిల్ తీసుకొచ్చింది. హెచ్ఎఫ్ డీలక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ ప్రారంభ ధరను రూ. 55925 గా నిర్ణయించింది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త ఉద్గార నిబంధనలు అమలుకానున్న నేపథ్యంలో కంపెనీ బీఎస్-6 ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో వేగం పెంచింది. హీరో బైక్స్ లవర్స్కు కొత్త సంవత్సరం బహుమతిని అందించింది. తన పాపులర్, ఐకానిక్ మోటారుసైకిల్ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ బీఎస్-6 మోడల్ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్-వీల్ వేరియంట్ ధర రూ. 55,925 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), సెల్ఫ్-స్టార్ట్ అల్లాయ్-వీల్ ఐ3ఎస్ వేరియంట్ రూ.57,250 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద దేశంలోని హీరో మోటోకార్ప్ షోరూమ్లలో జనవరి 2020 ప్రారంభం నుండి అందుబాటులో వుంటాయని హీరోమోటో ఒకప్రకటనలో వెల్లడించింది. -
హ్యుందాయ్ ‘ఆరా’.. ఆగయా
చెన్నై: హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన కొత్త కాంపాక్ట్ సెడాన్ ‘ఆరా’ను ఆవిష్కరించింది. ఈ సెడాన్ను వచ్చే నెలలో మార్కెట్లోకి ప్రవేశపెడతామని హ్యుందాయ్ ఇండియా తెలియజేసింది. ఈ సెగ్మెంట్లో ఎక్సెంట్ తర్వాత ఈ కంపెనీ అందిస్తున్న మరో కారు ఇది. స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ), కాంపాక్ట్ హ్యాచ్బాక్ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు సాధిస్తున్నామని కంపెనీ ఎమ్డీ, సీఈఓ ఎస్.ఎస్. కిమ్ పేర్కొన్నారు. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో వెనకబడి ఉన్నామని, కొత్త ఆరా కారుతో ఆ సెగ్మెంట్లో కూడా మంచి అమ్మకాలు సాధించగలమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఎస్ 6 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఈ కారును రూపొందించామని, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది లభ్యమవుతుందని చెప్పారాయన. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, వైర్లెస్ చార్జింగ్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, స్వెప్ట్బ్యాక్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, బూమరాంగ్ షేప్లో ఉండే ఎల్ఈడీ డే రన్నింగ్ లైట్స్ తదితర ఫీచర్లున్నాయని తెలియజేశారు. కాగా ఈ కారు ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల (ఎక్స్షోరూమ్ ధరలు) శ్రేణిలో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ కారు మారుతీ డిజైర్, హోండా అమేజ్, ఫోక్స్వ్యాగన్ అమియో, ఫోర్డ్ ఆస్పైర్, టాటా టిగొర్, టొయోటా యారీలకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
వోల్వో ‘ఎక్స్సీ40 టీ4’ ఎస్యూవీ
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ తాజాగా తన కొత్త ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ ‘ఎక్స్సీ40 టీ4 ఆర్–డిజైన్’ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఈ కారు ధర రూ. 39.9 లక్షలు. కంపెనీకి చెందిన కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సీఎంఏ) ఆధారంగా రూపొందిన ఈ ఎస్యూవీలో 2–లీటర్ ఇంజిన్ అమర్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్ మాట్లాడుతూ.. ‘ఎంట్రీ లెవెల్ ఎస్యూవీలో విడుదలైన తొలి పెట్రోల్ ఇంజిన్ కారు ఇది’ అని చెప్పారు. 8–స్పీడ్ గేర్బాక్స్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ పవర్ట్రైన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో పనిచేసే 9–అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నట్లు కంపెనీ వివరించింది -
టాటా మోటార్స్ కార్ల ధరలు పెంపు..
జైసల్మేర్/రాజస్తాన్: దేశీయ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వాహన ధరలను పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని తెలియజేసింది. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాలను విడుదల చేయాల్సి వస్తుండడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుం దని, ఎంత మేర పెంచాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు. హ్యాచ్బ్యాక్ టియాగో నుంచి ఎస్యూవీ హ్యారియర్ వరకు పలు మోడళ్లను ఈ సంస్థ భారత మార్కెట్లో విక్రయిస్తోంది. వీటి ధర రూ.4.39 లక్షలు–16.85 లక్షల వరకు ఉంది. -
కొత్త జూపిటర్.. మైలేజీ సూపర్
సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ -6 బైక్స్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలతో పాటు, తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కొత్త జూపిటర్ క్లాసిక్ ఈటీ-ఎఫ్ఐ మోడల్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఆర్టీ-ఎఫ్ఐ (రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్), ఈటీ-ఎఫ్ఐ (ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్) టెక్నాలజీ అనే రెండు వెర్షన్లను డెవలప్ చేసినప్పటికీ, ప్రస్తుతం ఈటీ-ఎఫ్ఐ టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ స్కూటర్ ఎక్స్షోరూం ధరను రూ. 67,911గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి రానున్న బీఎస్-6 ప్రమాణాలను అందుకోవడంలో భాగంగా దీన్ని బుధవారం లాంచ్ చేసింది. బీఎస్-6 కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈటీ-ఎఫ్ఐ టెక్నాలజీ మెరుగైన పనితీరు, అధిక మైలేజీ ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త జూపిటర్ క్లాసిక్ 15 శాతం అధిక మైలేజీని ఇస్తుందని పేర్కొంది. జూపిటర్ క్లాసిక్లో 110 సీసీ బీఎస్-6 ఇంజిన్తోపాటు ఫ్రంట్ ప్యానెల్లో మొబైల్ కోసం ప్లేస్, యుఎస్బీ ఛార్జర్, టిన్టెడ్ విండ్స్ర్కీన్ వంటి ఫీచర్లను జోడించారు. ఇది 7500 ఆర్పీఎం వద్ద 7.9 బీహెచ్పీ శక్తిని, 5500 ఆర్పీఎం వద్ద 8ఎన్ఎం టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ‘ఈటీ-ఎఫ్ఐ టెక్నాలజీని భారత వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశాం. జూపిటర్ క్లాసిక్ ఈటీ-ఎఫ్ఐ అధిక మైలేజీతో పాటు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంద’ని టీవీఎస్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ తెలిపారు. -
అశోక్ లేలాండ్ బీఎస్–6 వాహనాలు
చెన్నై నుంచి సాక్షి బిజినెస్ ప్రతినిధి: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్లేలాండ్.. భారత్ స్టేజ్(బీఎస్)–6 ప్రమాణాలకు అనుగుణంగా తన భారీ శ్రేణి వాహనాలను ఆవిష్కరించింది. కస్టమర్ల అవసరాలకు తగిన విధంగా సీట్లు, స్టీరింగ్ వంటి వాటిని మార్చుకుని కొనుగోలు చేసే సౌకర్యాన్ని వీటిలో అందుబాటులో ఉంచింది. మాడ్యులర్ బిజినెస్ ప్రోగ్రామ్గా పిలిచే ఈ విధానం టైలర్మేడ్ తరహాలో ఉంటుందని వివరించింది. మరిన్ని భద్రతా ప్రమాణాలతో రూపొందుతున్న ఈ నూతన తరం వాహనాలు వచ్చే ఏడాది జనవరి నాటికి సిద్దమవుతాయని ప్రకటించింది. ప్రస్తుత ధరల శ్రేణి రూ.12 లక్షల నుంచి రూ.35 లక్షల వరకూ ఉండగా, నూతన మోడళ్ల విడుదల సమయంలో ధరలను వెల్లడిస్తామని సంస్థ చైర్మన్ ధీరజ్ హిందుజా అన్నారు. ఈ కామర్స్, పార్సిల్స్కు తగిన ట్రక్కుల నుంచి సిమెంట్ను తరలించే వాహనాలతోపాటు, డిఫెన్స్, టూరిస్ట్ బస్సులను ఆయన సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల వాహనాల విక్రయాలు నమోదు కాగా, త్వరలోనే అమ్మకాలను 4 లక్షల యూనిట్లకు పెంచడం ద్వారా ప్రపంచంలోనే టాప్–10 స్థానంలోకి చేరనున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 24వ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. అధునాతన టెక్నాలజీతో కూడిన వాహనాలను విడుదల చేయడం ద్వారా మార్కెట్ వాటా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ టెక్నాలజీ డ్రైవర్లకు స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఉదాహరణకు ఇంజన్లో ఎటువంటి లోపం తలెత్తినా వెంటనే డ్రైవర్కు సమాచారం వస్తుందని వెల్లడించారు. నూజివీడు ప్లాంట్కు మందగమనం సెగ ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేయడం కోసం ఆంధ్రప్రదేశ్లోని నూజివీడులో ప్లాంట్ ఏర్పాటు చేయగా, ఆ నాటి నుంచి ఆటో పరిశ్రమలో మందగమనం నెలకొనడంతో విస్తరణ పణులను చేపట్టలేకపోతున్నామని ధీరజ్ హిందుజా అన్నారు. తెలంగాణలో ఆర్టీసీ పాక్షిక ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రైవేటు ప్యాసింజర్ సంస్థలకు అవసరమైన బస్సులను ప్రస్తుతానికి తాము ఉత్పత్తి చేయడం లేదన్నారు. -
ఆగి..చూసి..కొందాం..
సాక్షి, సిటీబ్యూరో: దసరా, దీపావళి పండగలొచ్చాయంటే చాలు... ఏ ఇంట్లో చూసినా కొత్తదనం ఉట్టిపడుతుంది. చాలామంది పండగల సందర్భంగా ఏదో ఒక వస్తువు కొనుగోలు చేయాలని భావిస్తారు. నచ్చిన బైక్ కొనుక్కొని రయ్మంటూ దూసుకెళ్లాలని కుర్రకారు.. బడ్జెట్కు అనుగుణంగా పాత వాహనాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయాలని మధ్యతరగతి వర్గాలు... సొంత కారు కొనుక్కోవాలని ఉద్యోగ వర్గాల వారు ఆలోచిస్తుంటారు. వీరంతా పండగ రోజుల్లోనే తమ కలలను సాకారం చేసుకుంటారు. కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్రేటర్లో వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దసరా వెళ్లిపోయింది.. దీపావళి వస్తోంది. కానీ అమ్మకాలు మాత్రం మందగమనంలోనే ఉన్నాయి. కొత్త వాహనాల కొనుగోలుపై నగరవాసులు అనాసక్తిగా ఉన్నారు. నచ్చిన కార్లు, బైక్లు కొనుక్కోవాలని ఉన్నప్పటికీ వాయిదాలు వేస్తున్నారు. ఏ నెలకానెల ఇలా వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ప్రతి ఏటా దసరా, దీపావళి పర్వదినాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలతో సందడిగా ఉండే షోరూమ్లు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్తో పోల్చుకుంటే ఈసారి అక్టోబర్లో అమ్మకాలు 30 శాతానికి పడిపోయినట్లు రవాణా అధికారులు తెలిపారు. ప్రతిఏటా ఇబ్బడిముబ్బడిగా రోడ్డెక్కే వ్యక్తిగత వాహనాలు ఈ ఏడాది కొంతమేర తగ్గడం గమనార్హం. బీఎస్–6 కోసం వెయిటింగ్... త్వరలో అందుబాటులోకి రానున్న భారత్ స్టేజ్–6 టెక్నాలజీ వాహనాల కోసం సిటీజనులు ఎదురు చూస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బీఎస్–6 వాహనాలు వచ్చే జనవరి నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతమున్న బీఎస్–4 వాహనాల కొనుగోలుపై నగరవాసులు విముఖత చూపుతున్నారు. కార్లు, బైక్లలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. పాత వాటి స్థానంలో కొత్త వాహనాలకు నగరవాసులు అప్డేట్ అవుతున్నారు. దీంతో రెండు నెలలుగా వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో దసరా, దీపావళి రోజుల్లో కళకళలాడాల్సిన షోరూమ్లు వెలవెలబోతున్నాయి. నగరంలో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్లు ఉండగా... వీటికి అనుబంధంగా మరో 100 వరకు సబ్డీలర్స్ షోరూమ్లు ఉన్నాయి. వీటిలో ప్రతినెలా సుమారు 35వేలకు పైగా బైక్లు, మరో 10 వేలకు పైగా కార్ల విక్రయాలు జరుగుతాయి. వీటిలో 10 శాతం వరకు స్పోర్ట్స్ బైక్లు, హైఎండ్ వాహనాలు ఉంటాయి. చెన్నై, బెంగళూర్, ఢిల్లీ వంటి మెట్రో నగరాలతో పోటీ పడి హైదరాబాద్లో ఆటోమొబైల్ రంగం పరుగులు తీస్తోంది. గ్రేటర్ జనాభా కోటికి పైగా ఉంటే వాహనాల సంఖ్య అరకోటి దాటింది. కానీ ఈ ఏడాది అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాలు అన్ని నగరాల్లో ఆటోమొబైల్ రంగంపై ప్రభావం చూపుతున్నట్లుగానే నగరంలోనూ జరుగుతోంది. ఆర్థికమాంద్యంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా కొత్త టెక్నాలజీ వాహనాలు మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో దసరా, దీపావళి సీజన్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ‘ప్రతిఏటా దసరా నుంచి దీపావళి వరకు కనీసం 1,000 బైక్లు విక్రయించేవాళ్లం. కానీ ఈసారి 700 కంటే ఎక్కువగా అమ్మలేకపోయాం. బీఎస్–6 వస్తే తప్ప విక్రయాలు పెరిగే అవకాశం లేదు. అందుకోసం మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే’అని నగరానికి చెందిన ఒక ప్రముఖ ఆటోమొబైల్ షోరూమ్ డీలర్ తెలిపారు. ‘బైక్లు విక్రయాలు కొంచెం ఫర్వాలేదు. కానీ కార్ల అమ్మకాలే చాలా అధ్వానంగా ఉన్నాయి. గతేడాది కంటే ఈసారి అమ్మకాలు పెరుగుతాయని ఆశించాం. కానీ అందుకు భిన్నంగా ఉంది’ అని మరో డీలర్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం... ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రతిరోజు సుమారు 180–200 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. కానీ వీటి సంఖ్య ప్రస్తుతం 150కి పడిపోయింది. అందులో బైక్లే ఎక్కువగా ఉన్నాయి. ఒక్క ఖైరతాబాద్లోనే కాదు.. గ్రేటర్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి. ఉప్పల్, ఇబ్రహీంపట్నం, అత్తాపూర్, కొండాపూర్, మలక్పేట్, మెహదీపట్నం, మేడ్చల్, సికింద్రాబాద్, బండ్లగూడ తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు 1850–2000 వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వీటిలో 1700 వరకు బైక్లు ఉంటే మరో 300 వరకు కార్లు ఉంటాయి. కానీ ఈ సంఖ్య కొద్ది రోజులుగా గణనీయంగా పడిపోయింది. రోజుకు 1500 వరకు మాత్రమే కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వాటిలో బైక్లే ఎక్కువగా ఉన్నాయి. గతేడాది అక్టోబర్లో సుమారు 48,000 వాహనాలు నమోదు కాగా... ఈ నెలలో ఇప్పటి వరకు ఆ సంఖ్య 33,600 వరకు ఉంది. ‘మరికొద్ది రోజుల్లో అక్టోబర్ ముగియనుంది. కానీ అమ్మకాలు పెరుగుతాయనే అంచనాలు మాత్రం లేవు’ అని ఒక డీలర్ విస్మయం వ్యక్తం చేశారు. నిజానికి గ్రేటర్లో వాహనాల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 55.52 లక్షలకు చేరుకుంది. కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో అరకోటికి పైగా వాహనాలు ఉన్నాయి. రూ.లక్షల ఖరీదైన స్పోర్ట్స్ బైక్లు, హైఎండ్ కార్లు సైతం పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. కానీ ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని పొదుపు పాటిస్తున్న మధ్యతరగతి వేతనజీవులు త్వరలో రానున్న బీఎస్–6 వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. -
బీఎస్–6 ఇంధనం రెడీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్–6 (బీఎస్) ప్రమాణాలు దేశంలో 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా బీఎస్–6 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న ఆందోళన వాహన తయారీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ విషయంలో ధీమాగా ఉన్నాయి. డెడ్లైన్ లోగానే బీఎస్–6 ఫ్యూయెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందన్నది ఈ కంపెనీల మాట. అందుకు అనుగుణంగా ఈ దిగ్గజాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి కూడా. ప్రస్తుతం ఢిల్లీలో బీఎస్–6 ఫ్యూయెల్ అందుబాటులో ఉంది. ముందు వరుసలో బీపీసీఎల్.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) చకచకా తన ప్రణాళిక అమలును ముమ్మరం చేసింది. 2019 అక్టోబరు – 2020 జనవరి మధ్య రిటైల్ స్టేషన్లలో బీఎస్–4 స్థానంలో బీఎస్–6 ఇంధనం సిద్ధం చేయనుంది. జనవరికల్లా నూతన ప్రమాణాలతో ఫ్యూయెల్ రెడీ ఉంటుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బీఎస్–3 నుంచి బీఎస్–4కు మళ్లిన దానికంటే ప్రస్తుతం మరింత వేగంగా పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగంలోని ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో పోలిస్తే బీపీసీఎల్ కాస్త ముందుగా బీఎస్–6 ఫ్యూయెల్ విషయంలో పావులు కదుపుతోంది. మార్చికల్లా రెడీ.. మరో సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) సైతం పనులను వేగిరం చేసింది. ఈ ఏడాది డిసెంబరులో మొదలై మార్చికల్లా కొత్త ఇంధనంతో రిటైల్ ఔట్లెట్లు సిద్ధమవుతాయని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ వెల్లడించారు. డెడ్లైన్ కంటే నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత ఇంధనం స్థానంలో కొత్త ఇంధనం మార్పిడికి రెండు మూడు నెలలు పడుతుందని వివరించారు. ఇదే సమయంలో ఫ్యూయెల్ నాణ్యతనూ పరీక్షిస్తామన్నారు. 2020 జనవరి రెండో వారం తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లకు ఫ్యూయెల్ సరఫరా ప్రారంభిస్తామని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) చైర్మన్ ముకేష్ సురానా ఇటీవల వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా తెలిపారు. వ్యయం రూ.30,000 కోట్లు.. బీఎస్–4 ప్రమాణాల నుంచి బీఎస్–6 ప్రమాణాలకు అప్గ్రేడ్ అయ్యేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే రిఫైనరీల అభివృద్ధికి సుమారు రూ.30,000 కోట్లు ఖర్చు చేసినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. అటు వాహన తయారీ సంస్థలు ఏకంగా రూ.70,000–80,000 కోట్లు వ్యయం చేసినట్టు తెలుస్తోంది. బీఎస్–4 నుంచి బీఎస్–5 ప్రమాణాలకు బదులుగా బీఎస్–6కు మళ్లాలని 2016లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వెహికిల్స్ విక్రయం, రిజిస్ట్రేషన్ మాత్రమే చేపడతారు. ఇప్పటికే కొత్త ప్రమాణాలకు తగ్గ వాహనాలను కంపెనీలు విడుదల చేయడం ప్రారంభించాయి. -
బీఎస్–6 వాహనాల క్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బీఎస్–6 ప్రమాణాల అమలు గడువు దగ్గర పడుతుండటంతో వాహన కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలను వేగవంతం చేశాయి. ఒకదాని వెంట ఒకటి బీఎస్–6 వేరియంట్లను సిద్ధం చేస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే భారత్ స్టేజ్–6 ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోసం ఆటోమొబైల్ సంస్థలు రూ.70– 80 వేల కోట్లను వెచ్చిస్తున్నాయి. మరోవైపు బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనం మోడల్నుబట్టి 15 శాతం వరకు ఖరీదు కానుంది. ద్విచక్ర వాహన కంపెనీ హోండా బీఎస్–6 వేరియంట్ యాక్టివా–125 స్కూటర్ను ఆవిష్కరించింది. స్కూటర్స్ విభాగంలో ఇదే తొలి బీఎస్–6 వాహనం. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ బీఎస్–6 ధ్రువీకరణ దక్కించుకుంది. ఐషర్ ప్రో 2000 సిరీస్ లైట్ డ్యూటీ ట్రక్ను విడుదల చేసింది. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నాలుగు వేరియంట్లలో లాంగ్ వీల్ బేస్ ఈ–క్లాస్ సెడాన్తోపాటు ఎస్–క్లాస్ 350డీ మోడల్ను ప్రవేశపెట్టింది. టయోటా కిర్లోస్కర్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజాను విడుదల చేసింది. బీఎస్–6తో మూడు నాలుగు నెలల్లో పెట్రోల్, డీజిల్ వెహికిల్స్ను ప్రవేశపెడతామని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా చెప్పారు. మారుతి సుజుకి ఇండియా బాలెనో, ఆల్టో మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర మోడళ్లను ప్రస్తుతం పరీక్షిస్తోంది. డెడ్లైన్లోగా అన్ని మోడళ్లను బీఎస్–6 ప్రమాణాలతో ప్రవేశపెడతామని బజాజ్ ఆటో తెలిపింది. మోపెడ్స్ విభాగంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న టీవీఎస్.. బీఎస్–6 వేరియంట్ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ స్టేజ్ ప్రమాణాలు.. భారత్లో బీఎస్–1 ప్రమాణాలు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. 2005లో బీఎస్–2, బీఎస్–3 2010లో వచ్చాయి. ఇప్పుడున్న బీఎస్–4 ప్రమాణాలు 2017 ఏప్రిల్లో మొదలయ్యాయి. దేశంలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండడంతో బీఎస్–5కు బదులుగా బీఎస్–6 ప్రమాణాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్–4 వాహనం 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిల్లియన్) సల్ఫర్ను విడుదల చేస్తే, బీఎస్–6 వెహికల్ విషయంలో ఇది 10 పీపీఎం ఉంటుంది. డీజిల్ కార్లలో నైట్రోజన్ ఆక్సైడ్స్ 70 శాతం వరకు తగ్గితే, పెట్రోల్ కార్లలో 25 శాతం తగ్గుతుంది. బీఎస్–4 కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన తయారీ సంస్థలు అతి తక్కువ కాలంలోనే నూతన టెక్నాలజీ కోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. భారీ పెట్టుబడులతో... భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేసేందుకు, విడిభాగాలను స్థానికంగా తయారు చేసేందుకై ప్యాసింజర్ వెహికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు రూ.35,000– 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఇక్రా వెల్లడించింది. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మొత్తంగా వాహన పరిశ్రమ రూ.70–80 వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ చెబుతోంది. బీఎస్–6 గ్రేడ్ ఫ్యూయెల్స్ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.28,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. బీఎస్–6 నూతన సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు మహీంద్రా ప్రకటించింది. హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా రూ.800 కోట్లు వెచ్చిస్తోంది. 2019–20లో విస్తరణ నిధులు రూ.1,500 కోట్లు ఉండొచ్చని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పనున్న కొత్త ప్లాంటుతోపాటు బీఎస్–6 అప్గ్రెడేషన్కు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్వో నిరంజన్ గుప్తా తెలిపారు. ఫోర్స్ మోటార్స్ రూ.250 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే మూడేళ్లకుగాను యమహా ఇండియా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. -
2020 నుంచి బీఎస్–6 వాహనాలే
న్యూఢిల్లీ: 2020 నుంచి దేశంలో బీఎస్–6 ప్రమాణాలున్న వాహనాలే అందుబాటులో ఉంటాయని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ‘బీఎస్–6 ఇంధనాన్ని ఇప్పటికే ఢిల్లీలో వాడుతున్నాం. వచ్చేఏడాది నాటికి దేశవ్యాప్తంగా బీఎస్–6 ఇంధనంతో నడిచే వాహనాలే ఉంటాయి. కాలుష్యం అన్నది ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంది. మొత్తం కాలుష్యంలో దాదాపు 22 శాతం కేవలం వాహనాల వల్లే వస్తోంది. కాలుష్యంపై పోరాడాల్సిందే. పంజాబ్–హరియాణా రాష్ట్రాల్లో ఇటీవల పంట వ్యర్థాల దహనం తగ్గింది. ఢిల్లీ శివార్లలో ఇటుక బట్టీలను మూయించేశాం’ అని జవదేకర్ ట్వీట్ చేశారు. -
హోండా బీఎస్-6 యాక్టివా 125 ఎఫ్1 లాంచ్
హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ టూవీలర్ను లాంచ్ చేసింది. 'నిశ్శబ్ద విప్లవం'లో భాగంగా బీఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తన మొట్టమొదటి స్కూటర్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, ఇంజీన్ అప్డేట్స్తో న్యూ జనరేషన్ యాక్టివాను తీసుకొచ్చింది. ముఖ్యంగా నాయిస్ లెస్ స్టార్టర్ మోటార్, ఇన్స్ట్రుమెంటల్ను క్లస్టర్ కొత్త యాక్టివా 125 ఎఫ్ 1 స్కూటర్లో సరికొత్త ఫీచర్లుగా ఉన్నాయి. 125 సీసీ ఇంజీన్, డిస్క్బ్రేక్ తదితర ఫీచర్లతో లాంచ్ చేసింది. ఇంకా స్టాండ్ ఇండికేటర్ను కూడా జోడించింది. స్టాండ్ వేసి వుంటే ఇంజీన్స్టార్ కాదు అన్నమాట. అలాగే 6 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది.ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది. ధరల విషయానికి వస్తే, సాధారణ హోండా యాక్టా 125 రూ 60,000 - రూ .64,000 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుంచి ప్రారంభం. బీఎస్ 9(ఎఫ్-1) రెగ్యులర్ వేరియంట్ యాక్టివా స్కూటర్ ధర సుమారు 10శాతం పెరగనుంది. -
త్వరలో మహీంద్రా బీఎస్–6 వాహనాలు
ముంబై: మోటార్ వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో భారత ప్రభుత్వం భారత్ స్టేజ్ (బీఎస్) నిబంధనలను ఎప్పటికప్పుడు మార్పులుచేస్తుండగా.. వీటికి అనుగుణంగా తమ వాహనాల ఉత్పత్తిలో మార్పులు చేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ‘బీఎస్–సిక్స్’ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో తాజా నిబంధనలకు తగిన వాహనాలను ఈ ఏడాది నుంచే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై మాట్లాడిన ఎంఅండ్ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా.. ‘ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం చివరినాటికి బీఎస్–6 గ్యాసోలిన్ వాహనాన్ని సిద్ధంచేస్తున్నాం. ఈ వాహనానికి.. నూతన నిబంధనలకు తగిన విధంగా ఇంధనం ఉండాలనే ఆంక్షలు లేనందున తొలుత దీనిని విడుదలచేస్తున్నాం. అయితే, డీజిల్ వాహనానికి మాత్రం దేశం మొత్తం ఒకే బీఎస్–6 ఇంధనం అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉన్నందున ఈ వాహన విడుదల ఆలస్యం కానుంది. నూతన నిబంధనలకు సరిపడే విధంగా వాహనాలను ఉత్పత్తి చేయడం కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టాం. అమలుకు సంబంధించి ఎటువంటి టెక్నికల్ సమస్యలను ఎదుర్కొలేదు. ముందస్తు ప్రణాళికతో నూతనతరం వాహనాలను అందుబాటులోకి తీసుకునిరావడానికి రంగం సిద్ధంచేశాం’ అని అన్నారు. -
డీజిల్ కార్లకు మారుతీ మంగళం!
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు మారుతీ సుజుకీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్ నుంచి డీజిల్ వెర్షన్ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. బీఎస్6 ఉద్గార నియమావళికి అనుగుణం గా ఆటోమొబైల్ పరిశ్రమ మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దేశీయ కార్ల విక్రయాల్లో డీజిల్ కార్ల వాటా 23 శాతం ఉంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం 4.63 లక్షల డీజిల్ వాహనాలను విక్రయిం చింది. కంపెనీ ఉత్పత్తి చేసే విటారా, బ్రెజా, ఎస్క్రాస్ వంటి కొన్ని మోడళ్లు కేవలం డీజిల్ వెర్షన్లో మాత్రమే లభిస్తాయి. స్విఫ్ట్, బాలెనో, సియాజ్, ఎర్టిగా లాంటి మోడళ్లు రెండు వెర్షన్లలోనూ లభిస్తా యి. కేవలం డీజిల్ కార్ల విక్రయాలే కాకుండా వచ్చే ఏప్రిల్ నుంచి కంపెనీ ఎల్సీవీ సూపర్ క్యారీ డీజిల్ వెర్షన్ విక్రయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు మారుతీ ప్రకటించింది. ఇకపై సూపర్క్యారీ కేవలం పెట్రో ల్, సీఎన్జీ వెర్షన్లలో మాత్రమే లభిస్తుంది. డీజిల్ వాహనాలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘2020 ఏప్రిల్1 నుంచి మేము డీజిల్ కార్లను విక్రయించం’’అని మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ స్పష్టం చేశారు. అయితే బీఎస్6 డీజిల్ కార్లకు డి మాండ్ బాగా పెరిగితే అప్పుడు అందుకు తగ్గ మో డల్ను తయారు చేస్తామని వివరించారు. భవిష్యత్లో డీజిల్ ఇంజన్లతో కూడిన కార్లను తయారు చే యాల్సి వస్తే 1500 లీటర్లకు పైబడిన డీజిల్ ఇం జన్లనే తయారు చేస్తామని భార్గవ చెప్పారు. చిన్న డీజిల్ కార్లు పెద్దగా లాభదాయకం కాదన్నారు. బీఎస్6 నిబంధనలతో మరింత ప్రియం యూరప్లో బీఎస్6 నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత డీజిల్ వాహనాల విక్రయాల్లో క్షీణత నమోదవుతోందని భార్గవ చెప్పారు. ఈ నిబంధనలతో కూడిన డీజిల్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధరతో పోలిస్తే భారీగా పెరిగిందని, దీంతో వీటిపై కస్టమర్లు ఆసక్తి చూపడం లేదన్నారు. ఇండియాలో కస్టమర్లు ధరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని, అందువల్ల ఇకపై డీజిల్ ఇంజన్ వాహనాల విక్రయాలు ఇక్కడ కూడా క్షీణిస్తాయని అభిప్రాయపడ్డారు. డీజిల్ కార్లు కొనాలనుకునేవాళ్లు ఈ ఏడాది కొనడం మంచిదని, వచ్చే ఏడాది వీటి ధరలు భారీగా పెరగవచ్చని సూచించారు. ఇటీవలే కంపెనీ బీఎస్4 నిబంధనలకు అనుగుణమైన సియాజ్ సెడాన్ 1,500 లీటర్ల డీజిల్ ఇంజన్ వెర్షన్ను తయారు చేసింది. ఈ కారు ఇంజన్ను కంపెనీ సొంతంగా నిర్మించింది. ప్రస్తుతం కంపెనీ విక్రయించే డీజిల్ వాహనాల్లో ఇంజన్లను ఫియట్ సరఫరా చేస్తోంది. 2020 మార్చి చివరకు తమ ప్లాట్ఫామ్పై తయారు చేసే 16 మోడళ్ల పెట్రోల్ ఇంజన్లను బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేస్తామన్నారు. ఇప్పటికే ఆల్టో 800ను బీఎస్6 అనుగుణంగా పెట్రోల్ ఇంజన్తో ప్రవేశపెట్టామని తెలిపారు. ఇప్పటికిప్పుడు బలమైన హైబ్రిడ్ సాంకేతికతో తయారు చేసిన మోడళ్లను తీసుకువచ్చే ఆలోచన లేదని, భవిష్యత్లో వీటిపై ఫోకస్ చేస్తామని కంపెనీ సీఈఓ కెనిచి అయుకవా చెప్పారు. లాభంలో 4.6 శాతం క్షీణత మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ నికరలాభం 4.6 శాతం పతనమై 1,795.6 కోట్లకు చేరింది. 2017–18 చివరి త్రైమాసికంలో కంపెనీ రూ. 1882.1 కోట్ల లాభం నమోదు చేసింది. సమీక్షా కాలంలో కంపెనీ నికర విక్రయాలు రూ. 20,737.5 కోట్లకు చేరాయి. అంతకుముందేడాదితో పోలిస్తే ఈ మొత్తం స్వల్పంగా అధికం. క్యు4లో మొత్తం కార్ల విక్రయాలు స్వల్పంగా క్షీణించి 4,58,479 యూనిట్లకు చేరాయి. మొత్తం 2018–19 సంవత్సరానికి కంపెనీ నికరలాభం 2.9 శాతం పతనమై 7,500.6 కోట్లకు చేరింది. నికర విక్రయాలు 6.3 శాతం పెరిగి 83,026.5 కోట్లకు చేరాయి. వాల్యూం పరంగా విక్రయాలు 4.7 శాతం పెరిగి 18,62,449 యూనిట్లకు చేరాయి. ఇందులో 1,08,749 యూనిట్లను ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది. మార్చి త్రైమాసికంలో కరెన్సీ రేట్లలో ఆటుపోట్లు, కమోడిటీ ధరల్లో పెరుగుదల, ప్రమోషన్ వ్యయాలు పెరగడం, రూపీ క్షీణత వంటివి ఫలితాలపై ప్రభావం చూపాయని కంపెనీ వివరించింది. తాము చేపట్టిన వ్యయ నియంత్రణా చర్యలు లాభాలు మరింత పతనం కాకుండా ఆదుకున్నట్లు తెలిపింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి కంపెనీ షేరుపై రూ. 80 డివిడెండ్ను మారుతీ ప్రకటించింది. గతేడాది రూ.4వేల కోట్ల మూలధన వ్యయాలు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరం రూ. 4,500 కోట్ల క్యాపెక్స్ ప్రణాళికలు తయారు చేశామని కంపెనీ తెలిపింది. ఈ నిధులను ఆర్అండ్డీ, కొత్త షోరూంలకోసం భూసమీకరణ, కొత్త ఉత్పత్తుల అభివృద్ధి తదితర అంశాలపై వెచ్చిస్తామని కంపెనీ సీఎఫ్ఓ అజిత్ సేథ్ చెప్పారు. కంపెనీ ఉత్పాదిత బాలెనో ధరను రూ. 15వేల మేర పెంచుతున్నట్లు మారుతీ ప్రకటించింది. ఆర్సీ భార్గవ -
స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మారుతి కొత్త బాలెనో
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద వాహన తయారీ దారు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) సోమవారం కొత్త కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్ స్టేజ్ (బీఎస్) 6 నిబంధనలకు అనుగుణంగా దీన్ని తీసుకొచ్చింది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో బిఎస్ -6 ఇంజనతో కొత్త బాలెనో వాహనాన్ని పరిచయం చేసింది. 1.2 లీటర్ డ్యూయల్ జెట్ (పెట్రోల్) ఇంజీన్ బాలెనో కారు ధర రూ. 5.58 లక్షలు -8.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉండనున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా నెక్సా దుకాణాల ద్వారా అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2015లో లాంచ్ అయినప్పటినుంచి బాలెనో బ్లాక్ బ్లస్టర్గా నిలిచిందనీ, 5.5 లక్షల బాలెనో వినియోగదారులున్నారనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల యూనిట్లు విక్రయించించినట్టు తెలిపారు. ఇటీవలే బాలెనోను తాజా డిజైన్, టెక్నాలజీతో అప్గ్రేడ్ చేశామన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీ లాంగ్లైఫ్ సర్వీసు అందిస్తుందనీ, స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో, వాహన ఉద్గారాలను తగ్గించే మెరుగైన ఇంధన సామర్థ్యంలో వినియోగదారులను ఉత్సాహానిస్తుందని తెలిపారు. -
2020కి బీఎస్-6 నిబంధనల అమలుకు సిద్ధం: సియామ్
న్యూఢిల్లీ: దేశీ వాహన పరిశ్రమ 2020 నాటికి బీఎస్-6 ఉద్గార నిబంధనల అమలుకు సిద్ధంగా ఉందని సియామ్ తెలిపింది. ఇక బీఎస్-4 నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావొచ్చని అభిప్రాయపడి ంది. దీనికోసం బీఎస్-4 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావాల్సి ఉందని తెలిపింది. వాహన కంపెనీలు ఈ కొత్త ఇంధన లభ్యతకు సంబంధించి ఆయిల్ కంపెనీలపై పూర్తి విశ్వాసంతో ఉన్నాయని పేర్కొంది. ఒకసారి నిబంధనల అమలుకు అంగీకరించిన తర్వాత వాటిల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు, వాయిదాలు ఉండబోవని సియామ్.. వాహన కంపెనీలను హెచ్చరించింది. కేంద్రం బీఎస్-4/6 ఇంధనానికి సంబంధించి ఆయిల్ కంపెనీలకు ఇచ్చిన పలు మినహాయింపుల వల్ల వాహన కంపెనీలకు సమస్యలు ఎదురుకావొచ్చని అంచనా వేసింది. కంపెనీలు తయారు చేసే వాహనాల ఇంధన సామర్థ్యంపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. భద్రత, ఉద్గారాలకు సంబంధించిన కొత్త నిబంధనల అమలు దిశగా భారత్ చాలా వేగంగా కదులుతోందని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ దాసరి తెలిపారు. 2020కి బీఎస్-6 నిబంధలను తక్కువ కాలంలో అమల్లోకి తీసుకురావడం కష్టసాధ్యమైనా.. వాహన పరిశ్రమ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. వాహన కంపెనీలు వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని బీఎస్-6 నిబంధల అమలు సవాల్ను స్వీకరించాయని చెప్పారు.