debit cards
-
ప్రాభవం కోల్పోతున్న డెబిట్ కార్డ్
న్యూఢిల్లీ: యూపీఐ అత్యంత సౌకర్యవంతమైన చెల్లింపుల సాధనంగా మారిపోవడంతో, ఇంత కాలం సంపద్రాయ చెల్లింపుల్లో సింహభాగం ఆక్రమించిన డెబిట్ కార్డ్ చిన్నబోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాతి నుంచి డిజిటల్ చెల్లింపుల్లో సమూల మార్పు కనిపిస్తోంది. వర్తకుల చెల్లింపులు, వ్యక్తిగత నగదు బదిలీలకు సైతం యూపీఐని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. 2020 జూలైలో డెబిట్ కార్డులపై చేసిన చెల్లింపుల విలువ రూ.2.81 లక్షల కోట్లు. 2023 జూలైలో డెబిట్ కార్డుల చెల్లింపుల విలువ రూ.3.15 లక్షల కోట్లుగా ఉంది. అంటే మూడేళ్లలో వృద్ధి 12 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో యూపీఐ చెల్లింపుల్లో ఎన్నో రెట్ల వృద్ధి నమోదైంది. ఈ కాలంలో యూపీఐ చెల్లింపుల విలువ రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.15.33 లక్షల కోట్లకు దూసుకుపోయింది. ఇది 428 శాతం వృద్ధికి సమానం. చిన్న మొత్తాల చెల్లింపుల్లో యూపీఐకి ఉన్న సౌలభ్యంతో డెబిట్ కార్డు చెల్లింపులపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఎన్నో సానుకూలతలు.. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో యూపీఐ లావాదేవీలు మొదటి సారి 1000 కోట్లను అధిగమించాయి. విలువ రూ.15 లక్షల కోట్లుగా ఉంది. 2020 జూలై నాటికి బ్యాంకులు 85 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేశాయి. వీటి సంఖ్య తాజాగా 97 కోట్లను అధిగమించాయి. ఈ వృద్ధి కూడా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాలకు అనుబంధంగా ఉచితంగా డెబిట్ కార్డులు జారీ చేయడం వల్లేనని చెప్పుకోవాలి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి చార్జీల్లేకపోవడం, వేగంగా, సౌకర్యంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం విస్తరణ ఇందుకు దోహదం చేసినట్టు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. కేంద్రం డిజిటైజేషన్కు ప్రాధాన్యం ఇస్తుండడంతో యూపీఐ చెల్లింపులు ఇక ముందూ జోరుగా కొనసాగుతాయన్న అంచనా వ్యక్తమవుతోంది. వచ్చే 18–24 నెలల్లో 2,000 కోట్ల నెలవారీ యూపీఐ లావాదేవీలు నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్ కార్డుకూ ఆదరణ మరోవైపు క్రెడిట్ కార్డు చెల్లింపులు కూడా గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయి. 2020 జూలైలో 0.45 లక్ష కోట్ల విలువైన లావాదేవీలు నమోదు కాగా, 2023 జూలై నెలకు రూ.1.45 లక్షల కోట్ల వినియోగం నమోదైంది. ‘‘రివార్డుల రూపంలో వచ్చే ప్రయోజనాలను పొందేందుకు, క్యాష్ బ్యాక్ లేదా తగ్గింపు ప్రయోజనాల కోసం ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రోసరీ, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు తదితర పెద్ద చెల్లింపులకు క్రెడిట్ కార్డుల రూపంలో చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల వారు పలు రకాల ప్రయోజనాలు పొందే అవకాశం వారిని ఈ దిశగా ప్రోత్సహిస్తోంది’’అని పైసాబజార్ క్రెడిట్ కార్డ్ హెడ్ రోహిత్ చిబార్ తెలిపారు. కో బ్రాండెడ్ కార్డులు సైతం మొత్తం మీద క్రెడిట్ కార్డుల వినియోగం వృద్ధికి దోహదపడుతున్నాయి. కరోనా అనంతరం వినియోగదారుల వ్యయాల్లో వచి్చన మార్పులను గమనించిన బ్యాంకర్లు పలు రకాల ఆకర్షణీయమైన రివార్డులతో కస్టమర్లకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుండడం కూడా ఈ వృద్ధిని ప్రోత్సహిస్తోంది. -
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన చార్జీలు
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) చార్జీల రూపంలో కస్టమర్లపై మరింత భారాన్ని మోపింది. బ్యాంక్ డెబిట్ కార్డ్ (Debit cards)లపై వార్షిక రుసుములను పెంచేసింది. ఆగస్టు 21 నుంచి పెరిగిన చార్జీలు అమలవుతాయని ప్రకటన విడుదల చేసింది. కొత్త డెబిట్ కార్డ్లపై జాయినింగ్ ఫీజులను కూడా ఇదే విధంగా పెంచింది. ఇవి ఆగస్టు 1 అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ప్రెషన్స్ లేదా బిజినెస్ ఎక్స్ప్రెషన్స్ డెబిట్ కార్డ్పై వార్షిక రుసుము రూ. 100 పెరిగింది. ఇది ఇంతకు ముందు రూ. 499లుగా ఉండగా ఇక నుంచి రూ. 599లు గా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ప్రెషన్స్ కోరల్ లేదా బిజినెస్ ఎక్స్ప్రెషన్స్ కోరల్ డెబిట్ కార్డ్పై కూడా యాన్యువల్ ఫీజు రూ. 100 పెరిగింది. రూ. 799 ఉన్నది రూ. 899లకు పెరిగింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ప్రెషన్స్ సప్ఫిరో డెబిట్ కార్డుకు ప్రస్తుతం రూ. 4,999 ఉన్న వార్షిక రుసుములో మార్పు లేదు. బ్యాంక్ కోరల్/బిజినెస్ కోరల్ డెబిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 599 నుంచి రూ. 699కి పెరిగింది. రూబిక్స్ డెబిట్ కార్డ్ వార్షిక రుసుమైతే ఏకంగా రూ. 350 పెరిగింది. ప్రస్తుతం రూ. 749 ఉండగా ఇక నుంచి రూ. 1,099 చెల్లించాలి. సప్ఫిరో/బిజినెస్ సప్ఫిరో డెబిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 500 పెరిగింది. ప్రస్తుతం ఉన్న రూ. 1,499 నుంచి రూ. 1,999 లకు చేరింది. కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ నెలవారీ రుసుము రూ. 249లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది సంవత్సరానికి రూ. 2,988 ఉంటుంది. కాగా ఏడాది పూర్తయిన ఆయా డెబిట్ కార్డులపై కస్టమర్లు వివిధ రకాల వోచర్లను ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తుంది. వార్షిక రుసుము చెల్లించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ-మెయిల్ ద్వారా ఈ వోచర్లను పొందవచ్చు. ఇదీ చదవండి: కెనరా బ్యాంక్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్.. ఇక్కడ మామూలు రూపాయిలు కాదు.. -
మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్పై: రూ. కోటి దాకా కవరేజ్
సాక్షి,ముంబై: దేశీయంగా ప్రధాన బ్యాంకులు తమ డెబిట్కార్డులపై వినియోగదారులకు ఉచిత ప్రమాద బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తాయి. అలాగే పోయిన సామాన్లు, లావాదేవీలకు రక్షణ కల్పిస్తాయి. డెబిట్ కార్డులతో, మెజారిటీ బ్యాంకులు కాంప్లిమెంటరీ బీమా కవరేజీని అందిస్తాయి. డెబిట్ కార్డులకు ఉచిత బీమా ఉంటుంది. వాస్తవానికి ఈ విషయం చాలామంది కస్టమర్లకు తెలియదు. ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)తోపాటు, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించే కవరేజ్ని ఒకసారి చూద్దాం. (కేజీఎఫ్ లాంటి సూపర్ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!) కోటక్ మహీంద్రా బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యక్తిగత ప్రమాద మరణ ప్రయోజనాన్ని రూ. 25 లక్షల వరకు అందిస్తుంది. బీమా కవరేజీని యాక్టివేట్ చేయడానికి, ఏటీఎం లావాదేవీ, పాయింట్-ఆఫ్-సేల్ లావాదేవీ లేదా ఆన్లైన్ కొనుగోలు లాంటి విషయాల్లో ఘటనకు, లేదా ప్రమాద తేదీకి 90 రోజుల ముందు కనీసం ఒక్క సారైనా కార్డ్ని ఉపయోగించి ఉండాలి. అంతేకాకుండా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాస్ట్ కార్డ్ లయబిలిటీ కవరేజీని అందజేస్తుంది. దీని రూ. 6 లక్షల వరకు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన కార్డ్లతో మర్చంట్, ఆన్లైన్ పోర్టల్లలో చేసిన కొనుగోళ్లకు రక్షణ కల్పిస్తుంది. (మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు గుడ్న్యూస్: నామినీ నమోదు ఎలా?) ఎస్బీఐ ఎయిర్లైన్ అందించే కవరేజీకి అదనంగా, ఎస్బీఐ డెబిట్ కార్డ్ రకాన్ని బట్టి విభిన్న విమానయాన ప్రమాద మరణ బీమాను అందిస్తుంది. స్థానిక, అంతర్జాతీయ విమానాలకు బ్యాగేజ్ నష్ట బీమాను కూడా అందిస్తుంది. అయితే ఎయిర్లైన్ టిక్కెట్ను కొనుగోలుకు బ్యాంకు డెబిట్ కార్డ్ తప్పనిసరిగా ఉపయోగించాలి. అదీ ప్రమాదం జరిగిన 90 రోజులలోపు ఉపయోగించాలి. అలా చేయడంలో విఫలమైతే బీమా ప్రయోజనం ఉండదు. ఒక వేళ కార్డ్ దారుడు విమాన ప్రమాదంలో మరణిస్తే, బీమా కవరేజ్ దాదాపు రెట్టింపు అవుతుంది. (Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) ఎస్బీఐకి సంబంధించి వివిధ రకాల కార్డులపై ప్రమాద బీమా రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఎస్బీఐ గోల్డ్కు రూ. 2 లక్షలు, ప్లాటినం కార్డ్కు రూ. 5 లక్షలు, ప్రైడ్ కార్డ్కు రూ. 2 లక్షలు, ప్రీమియం కార్డ్కు రూ. 5 లక్షలు, వీసా, సిగ్నేచర్, మాస్టర్కార్డ్కు రూ. 10 లక్షలు బీమా కవరేజ్ ఉంటుంది. అలాగే ఎస్బీఐ డెబిట్ కార్డ్లతో కొనుగోలు చేసిన 90 రోజులలోపు, రూ. 1 లక్షల వరకు నష్టాన్ని కూడా కవర్ చేస్తుంది. (సోషల్ మీడియా స్టార్, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 1 కోటి వరకు లభించే ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మినహా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అందించే ప్రమాద బీమా కవరేజీ రూ. 5 లక్షలు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త డెబిట్ కార్డులు: రివార్డులు, ఆఫర్లు
హైదరాబాద్: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), వీసా భాగస్వామ్యంతో తన ఖాతాదారుల కోసం కొత్తగా రెండు ప్రీమియం డెబిట్ కార్డులను విడుదల చేసింది. ‘బీవోబీ వరల్డ్ ఒపులెన్స్’అన్నది సూపర్ ప్రీమియం వీసా ఇన్ఫినైట్ డెబిట్ కార్డు కాగా, మరొకటి, ‘బీవోబీ వరల్డ్ సాఫైర్’. క్రెడిట్ కార్డుల మాదిరే వీటిపై రివార్డులు, ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. (Elon Musk సంచలనం: పరాగ్ అగర్వాల్కు మరో షాక్!) బోవోబీ వరల్డ్ ఒపులెన్స్ వీసా ఇన్ఫినైట్ కార్డుపై కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ పికప్, డ్రాప్ సేవ, అపరిమితంగా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ సందర్శనలు, క్లబ్ మారియట్ సభ్యత్వం, హెల్త్, వెల్నెస్, డైనింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. ఆరంభంలో జాయినింగ్ ఫీజు కింద రూ.9,500, ఆ తర్వాత ఏటా రూ.9,500 కస్టమర్లు ఈ కార్డు కోసం చెల్లించుకోవాలి. ఇలాంటి ప్రయోజనాలే కలిగిన బీవోబీ వరల్డ్ సాఫైర్ జాయినింగ్ ఫీజు రూ.750. ఏటా రూ.750 ఫీజు ఉంటుంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు ముఖ్య గమనిక!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ నెల నుంచి కొత్త డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు నిబంధనల్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ మోసాలు, యూజర్ల వ్యక్తిగత వివరాల్ని దొంగిలించడం లాంటి ఘటనల్ని తగ్గించవచ్చని భావిస్తోంది. ఆర్బీఐ ఆదేశాల మేరకు..2020 మార్చి నెలలో ఎస్బీఐ తన కస్టమర్లకు, ఉద్యోగులు, స్టాక్ హోల్డర్లకు ప్రపంచ స్థాయిలో సర్వీసులు, లావాదేవీల కోసం ప్యూర్ ప్లే క్రెడిట్ కార్డ్ను వినియోగంలోకి తెచ్చింది. ఇప్పుడు ఆ కార్డులను టోకనైజేషన్ చేయనుంది. నిబంధనలకు లోబడి తయారీ, సంసిద్ధత, సాంకేతికత వారీగా,ఇంటిగ్రేషన్ కోసం ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థలైన వీసా,మాస్టర్ కార్డు,రూపేలతో జతకట్టనున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ ఎండీ,సీఈవో రామ్మోహన్ రావు అమర తెలిపారు. డెడ్ లైన్ పొడిగింపు కార్డు టోకనైజేషన్పై రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. "వినియోగదారుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని టోకనైజేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. సైబర్ నేరస్తులు వారి వ్యక్తిగత వివరాల్ని దొంగిలించకుండా ఉంచేందుకు ఈ టోకనైజేషన్ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కస్టమర్లు, వాటాదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ఆర్బీఐ కార్డ్ ఆన్ ఫైల్ (సీఓఎఫ్) టోకనైజేషన్ గడువును 3నెలల పాటు సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు చెప్పారు. అంతకుముందు ఆ గడువు జూన్ 30 వరకే ఉంది. -
డెబిట్, క్రెడిట్ కార్డు నిబంధనలు: చివరి తేదీ వచ్చేస్తోంది
సాక్షి,ముంబై: ఆన్లైన్ షాపింగ్ సౌలభ్యం కోసం ఆర్బీఐ‘టోకనైజేషన్’ అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. అలాగే చాలా సురకక్షితంగా కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసుకోవచ్చని కేంద్ర బ్యాంకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్,ఆఫ్సేల్ యాప్లో లావాదేవీలలో ఉపయోగించిన మొత్తం క్రెడిట్, డెబిట్ కార్డ్ డేటాను సెప్టెంబర్ 30, 2022 నాటికి ప్రత్యేక టోకెన్లతో భర్తీ చేయాలని ఆదేశించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు జూలై 1 నుండి 'క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్' మార్గదర్శకాలను అమలు చేయాల్సవ ఉంది. అయితే, పరిశ్రమ వాటాదారుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును అక్టోబరు 1కి పెంచింది. కస్టమర్లు సురక్షితమైన లావాదేవీలు చేయడంలో సహాయపడతాయని, కార్డ్ వివరాలు ఎన్క్రిప్టెడ్ “టోకెన్”గా స్టోర్ అవుతాయని తెలిపింది. ఒరిజినల్ కార్డ్ డేటాను ఎన్క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్తో భర్తీ చేయడం తప్పనిసరి చేసింది. ఈ టోకెన్లు కస్టమర్ వివరాలను బహిర్గతం చేయకుండా చెల్లింపు చేయడానికి అనుమతిస్తాయి. ఫలితంగా కార్డ్ హోల్డర్ల ఆన్లైన్ లావాదేవీల అనుభవాలను మెరుగుపరుస్తుంది. సైబర్ నేరగాళ్లనుంచి కార్డ్ సమాచారాన్ని భద్ర పరుస్తుంది. కార్డులు లేకుండానే ఆన్ లైన్ లో షాపింగ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ షాపింగ్ లో దిగ్గజాలైన అమెజాన్, ప్లిఫ్ కార్ట్, బిగ్ బాస్కెట్..ఇతరత్రా ఆన్ లైన్ వెబ్ సైట్ లలో షాపింగ్ మరింత సులభతరం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తోంది. అందుకనుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా 2022, జనవరి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు కొత్త చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజల సమాచారం కూడా భద్రంగా వీలు ఉండే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. టోకెన్లు ఎలా రూపొందించుకోవాలి ♦ కొనుగోలుకుముందు చెల్లింపు లావాదేవీని ప్రారంభించడానికి, ఇ-కామర్స్ వ్యాపారి వెబ్సైట్ లేదా అప్లికేషన్కు వెళ్లాలి ♦ ఉత్పత్తులను కొనుగోలు చేసే క్రమంలో..తమ కార్డు పూర్తి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. ♦ షాపింగ్ వెబ్ సైట్ కు చెందిన చెక్ అవుట్ పేజీలో కార్డు వివరాలను నమోదు చేయాలి. అనంతరం టోకనైజేషన్ సెలక్ట్ చేసుకోవాలి. ♦ క్రియేట్ టోకెన్ను సెలక్ట్ చేసి,అధికారిక మొబైల్ ఫోన్ లేదా ఇమెయిల్లో ద్వారా వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. దీంతోటోలావాదేవీ పూర్తి అవుతుంది. ♦ తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేసుకొనే ఛాన్స్ ఉంది. అదే వెబ్సైట్ లేదాయాప్లో తదుపరి కొనుగోళ్లకు నాలుగు అంకెల టోకెన్ ఇస్తే సరిపోతుంది. ♦ తద్వారా మోసాలకు తావుండదని, కొనుగోలుదారు సమాచారాన్ని సేకరించడం హ్యాకర్లకు కష్టమవుతుందని ఆర్బీఐ అభిప్రాయం. ♦ దీని ప్రకారం ఇకపై 16 అంకెల కార్డు వివరాలను, కార్డు గడువు తేదీని గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే కార్డ్ జారీ చేసేవారు క్రెడిట్ కార్డ్ను యాక్టివేట్ చేయడానికి కార్డ్ హోల్డర్ నుండి వన్ టైమ్ పాస్వర్డ్ ఆధారిత సమ్మతిని తప్పనిసరిగా పొందాలి. ఒకవేళ అది జారీ చేసిన తేదీ నుండి 30 రోజుల కంటే ఎక్కువ కస్టమర్ యాక్టివేట్ చేయపోతే, ఎలాంటి సమ్మతి రాకపోయినా, కన్ఫర్మేషన్ కోరిన తేదీ నుండి ఏడు పని దినాలలోగా, కస్టమర్కు ఎటువంటి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ ఖాతా క్లోజ్ అవుతుంది. -
డబ్బులు వద్దు.. డిజిటల్ ముద్దు
సాక్షి రాయచోటి: జేబులో పర్సు లేకపోయినా.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా.. డెబిట్, క్రెడిట్ కార్డులు, సెల్ఫోన్ అందుబాటులో ఉంటే పని సులువవుతోంది. పాల ప్యాకెట్ తీసుకోవచ్చు.. హోటల్లో తినొచ్చు.. వేడివేడి టీ తాగొచ్చు.. బార్బర్ షాపులోనూ నచ్చినట్లు కటింగ్ చేయించుకోవచ్చు.. మార్కెట్లో కూరగాయలు మొదలుకొని దుకాణంలో సరుకుల కొనుగోలు వరకు కార్డు ఉంటే చాలు ఎలాగైనా పనులు చేసుకోవచ్చు. పాతకాలం పోయింది.. కొత్త కాలం వచ్చింది.. ప్రపంచం డిజిటల్ మయంగా మారింది. ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులకు తెర తీస్తున్నారు. పైగా కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కూడా డిజిటల్ పేమెంట్లు పెరగడానికి పెద్ద కారణంగా చెప్పవచ్చు. అన్నిచోట్ల ఆన్లైన్ లావాదేవీలు కాలంలో ఎంత మార్పు అంటే ఏకంగా దుకాణంలో టీ తాగాలన్నా కూడా జనాలు ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. చిన్నపాటి వ్యాపారులు కూడా డిజిటల్ విధానానికి అలవాటు పడుతున్నారు.. మామిడిపండ్ల బండి మొదలుకుని చివరకు గంపలపై పండ్లు పెట్టుకుని అమ్ముకునే చిన్నచిన్న వ్యాపారులు కూడా ఫోన్పే అంటున్నారు. సమయానికి చిల్లర లేకపోయినా, అత్యవసరంగా మందులు కావాల్సి వచ్చినా.. చేతిలో డబ్బుల్లేకున్నా.. ఇంటి ముందుకు సరుకులొస్తున్నాయి అంటే కారణం డిజిటల్ లావాదేవీలేనని చెప్పక తప్పదు. మీ బ్యాంక్ ఖాతాలో నగదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. అన్ని పనులు సులభంగా చేసేసుకోవచ్చు. ఎప్పటి నుంచో ఈ విధానం కొనసాగుతున్నా కోవిడ్ నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం పెరిగింది. కరోనా విజృంభించిన తరుణంలో అటు వ్యాపారులు, ఇటు కొనుగోలుదారులు ఆన్లైన్ చెల్లింపుల వైపు విపరీతంగా మొగ్గు చూపారు. ఫోన్ పే, గూగుల్పే, పేటీఎం తదితర థర్డ్ పార్టీ యాప్ల సాయంతో ప్రజలు ఆన్లైన్ లావాదేవీలను సులభంగా చేస్తున్నారు. తక్కువ పరిధిలో సురక్షితమైన చెల్లింపులు జరుగుతుండటంతో వీటికి ఆదరణ లభిస్తోంది. కిరాణా, నిత్యావసరాలు, పెట్రోలు తదితర సామగ్రి మొదలు మొబైల్, డీటీహెచ్ రీచార్జిలు, విద్యుత్, గ్యాస్ బిల్లులు, రుణాల చెల్లింపులు, నగదు బదిలీలు తదితర అవసరాలన్నింటికీ వీటినే ఉపయోగిస్తున్నారు. యువత సాంకేతికతను ఎక్కువగా అందిపుచ్చుకుంటున్నారు. డిజిటల్ చెల్లింపుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సెల్ఫోన్ రీచార్జి మొదలు, షాపింగ్, వినోదం, నిత్యావసరాలు, బిల్లులు తదితర అవసరాలన్నింటికి యువత డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యమిస్తున్నారు. బ్యాంకులలో డిజిటల్కే ప్రాధాన్యం జిల్లాలో బ్యాంకుల్లో కూడా ఎక్కడచూసినా డిజిటల్ లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నగదు లావాదేవీలు చాలావరకు తగ్గిపోయాయి. ఎవరికి ఎలాంటి అవసరమొచ్చినా నేరుగా బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏటీఎంల ద్వారా కూడా వెసులుబాటు ఉంది. సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి జిల్లాలో ఖాతాదారులు బ్యాంకులు మొదలుకొని బయట కూడా డిజిటల్ లావాదేవీలే చేపట్టాలి. అయితే సేఫ్ బ్యాంకింగ్ అలవర్చుకోవాలి. కొంతమంది నకిలీ వ్యక్తులు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఓటీపీలు, పిన్ నంబర్లు అడిగితే పొరపాటున కూడా చెప్పొద్దు. అలా అడిగారంటే వెంటనే కట్ చేసి బ్యాంకులో సంప్రదించాలి. నగదు లావాదేవీలు పూర్తిగా తగ్గించి ఆన్లైన్ ద్వారా చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. – దుర్గాప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్, కడప. -
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఊరట..! ఆన్లైన్ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం..!
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు ఊరట కల్పిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల టోకనైజేషన్ విధానాల అమలును మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఆర్బీఐ ఒక ప్రకటనలో...సీఓఎఫ్(కార్డ్ ఆన్ ఫైల్ డేటా) ను నిల్వ చేసేందుకు మరో ఆరు నెలల పాటు పొడిగించినట్లు పేర్కొంది. దీంతో కొత్త టోకెనైజేషన్ పాలసీ 2022 జూలై 1 నుంచి ప్రారంభంకానుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఈ కొత్త రూల్స్ను ఆర్బీఐ ప్రవేశపెట్టనుంది. వచ్చే ఏడాది జనవరి 1 తో కొత్త రూల్స్ వచ్చే నేపథ్యంలో ఇప్పటికే ఆయా బ్యాంకులు మర్చంట్ వెబ్సైట్ లేదా పలు యాప్లో క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేసే విషయంలో ఖాతాదారులను అలర్ట్ చేశాయి. ప్రస్తుతం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఆయా బ్యాంకుల ఖాతాదారులకు ఊరట కల్గనుంది. టోకనైజేషన్ విధానాలతో ఆయా క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను బహిర్గతం చేయకుండా ఆన్లైన్ కొనుగోళ్లను అనుమతిస్తుంది. సీఐఐ అభ్యర్థన మేరకే..! ఇటీవల టోకనైజేషన్ను అమలు చేయడానికి కనీసం ఆరు నెలల సమయాన్ని ట్రేడ్ యూనియన్ వ్యాపారులు కోరారు. దీని అమలు పలు అంతరాయాలను కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ కొత్త నియమాల కారణంగా ఆన్లైన్ మర్చెంట్స్ తమ రాబడిలో 20 నుంచి 40 శాతం మేర నష్టపోయే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) గతంలో పేర్కొంది. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం...2020-21లో భారత డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ విలువ రూ. 14,14,85,173 కోట్లుగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో డిజిటల్ చెల్లింపులు ఆర్థిక వృద్ధిని ప్రేరేపించాయని సీఐఐ పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 98.5 కోట్ల కార్డ్లు ఉన్నాయని అంచనా. వీటితో ఒకే రోజు సుమారు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని సీఐఐ తెలిపింది. చదవండి: వ్యాపారులకు అలర్ట్.. జనవరి 1 నుంచి కొత్త జీఎస్టీ రూల్స్..! -
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..!
క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్..! అన్ని డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీల విషయంలో వచ్చే ఏడాది నుంచి కొత్త రూల్స్ను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకురానుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో ఆర్బీఐ కొత్త రూల్స్ను తీసుకురానుంది. ఇకపై అన్ని వివరాలను గుర్తుంచుకోవాలి...! క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి జరిపే ఆన్లైన్ లావాదేవీలకు ఆర్బీఐ కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆయా వెబ్సైట్లు, పేమెంట్ గేట్వేస్లలో అంతకుముందే నిక్షిప్తమైన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు ఇకపై నిక్షిప్తం కావు. ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం.. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు లేదంటే డిజిటల్ చెల్లింపులు నిర్వహించేటప్పుడు ఆయా వెబ్సైట్స్, యాప్స్ వంటివి కస్టమర్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేయకూడదని ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త రూల్స్ జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో కొత్త ఏడాది నుంచి ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కచ్చితంగా 16 అంకెల డెబిట్, క్రెడిట్ కార్డు నంబర్లతో పాటు, సీవీవీ, గడువు తేదీ వంటి వివరాలను గుర్తుంచుకోవాలి. ఒక వేళ ఇది వీలు కాకుంటే...టోకెనైజేషన్ పద్ధతిని వాడాల్సి ఉంటుంది. ఆర్బీఐ 2020 మార్చి నెలలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. డేటా సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. వెబ్సైట్స్, యాప్స్ కస్టమర్ల కార్డుల వివరాలను స్టోర్ చేయకూడదని ఆదేశించింది. చదవండి: ఎస్బీఐ బంపర్ ఆఫర్..! కార్డు తీసుకుంటే రూ.4,999 విలువైన స్మార్ట్వాచ్ ఉచితం..! ఇంకా మరెన్నో ఆఫర్లు అలర్ట్ ఐనా బ్యాంకులు..! వచ్చే ఏడాది నుంచి మారనున్న క్రెడిట్, డెబిట్ కార్డు రూల్స్ మారడంతో ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులను ఇప్పటికే అలర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మర్చంట్ వెబ్సైట్ లేదా యాప్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు వివరాలు స్టోర్ చేయడం కుదరదని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇప్పటికే తమ ఖాతాదారులకు తెలియజేస్తోంది. టోకెనైజేషన్ అంటే..? ఆన్లైన్ లావాదేవీలను జరిపేటప్పుడు ఖాతాదారులు 16 అంకెల క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను గుర్తుంచుకోకపోతే...టోకెనైజేషన్ విధానాన్ని వాడవచ్చును. ఈ విధానంలో ఆయా క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లు వారి కార్డు వివరాలను తెలియజేయాల్సిన పని లేదు. ఒరిజినల్ కార్డు నెంబర్కు బదులు ప్రత్యామ్నాయ ఎన్క్రిప్టెడ్ కోడ్ను బ్యాంకులు ఇస్తాయి. దీన్ని టోకెన్ అని పిలుస్తారు. లావాదేవీ సమయంలో ఈ కోడ్ను అందిస్తే సరిపోతుంది. చదవండి: మార్కెట్క్రాష్.. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న మీమ్స్ -
ఇక ఇంటర్నెట్ లేకున్నా డెబిట్ కార్డులు వాడొచ్చు!
డెబిట్ కార్డు వాడేవారికి ఒక తీపికబురు. మనం అత్యవసర సమయాల్లో డబ్బులు డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు మెషీన్ లో ఇంటర్నెట్ అవసరం అనే విషయం మన అందరికి తెలుసు. ఒకవేల మన ప్రాంతంలో ఇంటర్నెట్ లేకపోతే ఆ సమయాల్లో మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త టెక్నాలజీ రాబోతుంది. ఈ టెక్నాలజీ సహాయంతో మనం ఉన్న ప్రాంతంలోనే డెబిట్ కార్డు ద్వారా లావాదేవీలు జరపవచ్చు. ఈ దిశగా వీసా సంస్థ పనిచేస్తుంది. మనకు అందించే చిప్ ఆధారిత వీసా డెబిట్ కార్డు ద్వారా ఇంటర్నెట్ లేకున్నా ప్రతి రోజు రూ.2,000 వరకు లావాదేవీలు జరపవచ్చు. ప్రతి లావాదేవీ పరిమితి రూ.200 ఇప్పటికే పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ ఇన్నోవిటి భాగస్వామ్యంతో వీసా ఆఫ్ లైన్ చెల్లింపుల కోసం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్(పీఓసీ) పద్దతిలో ఒక డెబిట్ కార్డు తయారు చేసింది. ఈ పీఓసీ కార్డును యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మార్కెట్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రీపెయిడ్ కార్డుల ఇతర వాటి కంటే భిన్నంగా ఉంటాయి. ఇవి నెట్ వర్క్ క్లౌడ్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ కొత్త వీసా చిప్ డెబిట్ కార్డులో రోజువారీ ఖర్చు పరిమితి రూ.2,000, ప్రతి లావాదేవీ పరిమితి కూడా రూ.200 మాత్రమే అని ఆర్బీఐ పేర్కొంది. ఒకవేళ తగిన బ్యాలెన్స్ లేకపోతే లావాదేవీని తిరస్కరిస్తారు.(చదవండి: ఎస్బీఐ డెబిట్ కార్డు ఉంటే? రూ.1,00,000 వరకు బెనిఫిట్) ఈ డెబిట్ కార్డు బ్యాంకు ఖాతాదారులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఇంటర్నెట్ లేని సమయాల్లో వర్తకులతో గోడవపడకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. వీసా ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీని మొట్టమొదటి సారిగా మనదేశంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఎక్కువ శాతం డిజిటల్ లావాదేవీలు ఇంటర్నెట్ లేని ఫెయిల్ అవుతున్నట్లు గతంలో ఆర్బీఐ తెలిపింది. ఆ సమస్యకు పరిష్కారంగా ఈ కొత్త టెక్నాలజీ వీసా తీసుకోని వస్తుంది. కోవిడ్ మహమ్మారి రాకతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. అందుకే, మరింత మందికి ఈ సేవలు అందించేలా బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి. -
ఎస్బీఐ డెబిట్ కార్డు ఉంటే? రూ.1,00,000 వరకు బెనిఫిట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కస్టమర్లకు గుడ్ న్యూస్. మీ దగ్గర ఎస్బీఐ డెబిట్ కార్డు ఉంటే సులభంగా రూ.1,00,000 మీరు లోన్ తీసుకోవచ్చు. ఈఎమ్ఐ కూడా ప్రతి నెల చెల్లించవచ్చు. మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి స్టోర్ కి వెళ్లినప్పుడు మీ దగ్గర లేని సమయంలో ఎస్బీఐ డెబిట్ కార్డు ద్వారా లోన్ అక్కడే తీసుకోవచ్చు. అలాగే, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టల్స్ ద్వారా ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఎస్బీఐ కస్టమర్లు ఈఎమ్ఐ సదుపాయాన్ని వాడుకోవచ్చు. వడ్డీ రేటు మీ బ్యాంక్ ఖాతాలో ఎంత ఉందన్న టెన్షన్ లేకుండా మీకు అవసరమైన వస్తువుల్ని కొనుకోవచ్చు. ఈఎంఐ ద్వారా చెల్లించొచ్చు. ఆన్లైన్ షాపింగ్ మాత్రమే కాదు.. ఆఫ్లైన్లో కూడా అంటే ఎక్కడైనా స్టోర్లలో కూడా మీరు షాపింగ్ చేసి మీ పేమెంట్ను ఈఎమ్ఐగా మార్చేయొచ్చు. ఈ ఈఎమ్ఐ తీసుకునేటప్పుడు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ ఖాతాదారులు రూ.8,000 నుంచి రూ.లక్ష వరకు రుణాన్ని పొందవచ్చు. రెండేళ్ల ఎంసీఎల్ఆర్(7.20%) + 7.50% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తం వడ్డీరేటు అనేది 14.70%గా ఉంటుంది.(చదవండి: పలు కార్లపై బంపర్ ఆఫర్ను ప్రకటించిన హోండా..!) మీరు ఈ మొత్తాన్ని తీసుకున్నప్పుడు ఆరు, తొమ్మిది, పన్నెండు, పద్దెనిమిది నెలల రుణ కాలపరిమితిని ఎంచుకోవచ్చు. అయితే, ఈ సౌకర్యం మీకు అందుబాటులో ఉందో/లేదో తెలుసుకోవడానికి కస్టమర్లు మీ బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి DCEMI అని టైపు చేసి 567676కు పంపాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ అత్యవసర సమయాల్లో చాలా భాగ ఉపయోగపడుతుంది. డెబిట్ కార్డు ఈఎమ్ఐ సదుపాయం మర్చంట్ స్టోర్ వద్ద పివోఎస్ మెషిన్ పై ఎస్బీఐ డెబిట్ కార్డును స్వైప్ చేయండి ఇప్పుడు బ్రాండ్ ఈఎమ్ఐ - బ్యాంక్ ఈఎమ్ఐ అనే ఆప్షన్ ఎంచుకోండి. మీకు కావాల్సిన మొత్తం, రుణ కాలపరిమితి రెండు ఎంచుకోండి. మీ అర్హత చెక్ చేసిన తర్వాత పిన్ ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఆ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది, రుణ నిబంధనలు, షరతులు ఉన్న ఛార్జ్ స్లిప్ ప్రింట్ వస్తుంది. దాని మీద కస్టమర్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఈఎమ్ఐ సదుపాయం బ్యాంకులో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబరు సహాయంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో లాగిన్ అవ్వండి. మీకు నచ్చిన వస్తువు కొనుక్కొని పేమెంట్ మీద క్లిక్ చేయండి. మీకు కనిపించే పేమెంట్ ఆప్షన్ల నుంచి ఈజీ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకొని, ఆ తర్వాత ఎస్బీఐ ఎంచుకోండి. రుణ కాలవ్యవది ఎంచుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఎస్బీఐ లాగిన్ పేజీలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు క్రెడెన్షియల్స్ నమోదు చేయండి. ఒకవేళ లోన్ ఆమోదీస్తే ఆర్డర్ బుక్ చేయబడుతుంది. అప్పుడు నిబంధనలు & షరతులు(టీసీ) కనిపిస్తాయి. -
డెబిట్, క్రెడిట్ కార్డు ఉంటే రూ.10 లక్షల ఉచిత ఇన్సూరెన్స్
బ్యాంకులు జారీ చేసే డెబిట్, క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీతో వస్తాయి. దీని గురించి చాలా మంది ఖాతాదారులకు తెలియదు. రూపే కార్డు డెబిట్ కార్డు ఖాతాదారులకు బ్యాంకు బీమా కవరేజీని అందిస్తుందని చెన్నైకి చెందిన ఇండియన్ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బ్యాంకు జారీ చేసిన అన్ని డెబిట్, క్రెడిట్ కార్డ్ వేరియెంట్లు బీమా కవరేజీ అందిస్తాయని ఆయన తెలిపారు. ఖాతాదారులు ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందిన బీమా అందిస్తారు. డెబిట్, క్రెడిట్ కార్డులను బట్టి బీమా కవరేజీ ₹50,000 నుంచి ₹10 లక్షల వరకు లభిస్తుంది అని ఇండియన్ బ్యాంక్ అధికారి తెలిపారు. అనుకోకుండా జరిగే ప్రమాదాల వల్ల ఖాతాదారుడు మరణిస్తే లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యం చెందితే బీమా కవరేజీ లభిస్తుందని తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా లేదా స్వయంకృతాపరాధం వల్ల జరిగిన ప్రమాదాలకు కాదు అని ఆయన అన్నారు. బీమా కవరేజీ బ్యాంకుతో వినియోగదారులకు ఉన్న సంబంధంపై ఆధారపడి బీమా కవరేజీ ₹2 లక్షల నుంచి ప్రారంభమై డెబిట్, క్రెడిట్ కార్డులు రెండింటికీ ₹10 లక్షల వరకు లభిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. కార్డులు వాడుతూ ఉండాలి ఇటువంటి సదుపాయాల గురించి వినియోగదారులకు అవగాహన లేదని, ఖాతాదారులకు తెలియజేయడం బ్యాంకుల విధి అని వినియోగదారుల ఫోరం యాక్టివిస్ట్ శ్రీ సదాగోపన్ అన్నారు. బీమాక్లెయిం చేసుకోవడానికి ఒక షరతు ఉన్న ఏమిటంటే? కార్డు యాక్టివ్ యూజ్ లో ఉండాలి. క్లెయింలను నిర్ధిష్ట కాలవ్యవధిలో మాత్రమే చేయాలి. ఉదాహరణకు, రూపే బీమా కార్యక్రమం కింద ప్రమాదం జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోగా క్లెయిం కోసం సమాచారం అందించాలి. అలాగే క్లెయింకు సంబంధించిన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్ లను సమాచారం ఇచ్చిన తేదీ నుంచి 60 రోజుల్లోగా సబ్మిట్ చేయాలి. ప్రమాదం జరిగిన తేదీకి 90 రోజుల ముందు కార్డుదారుడు ఏదైనా లావాదేవీ(ఆర్థిక లేదా ఆర్థికేతర లావాదేవీ) చేయాల్సి ఉంటుంది. కస్టమర్లకు అందించే బీమా రకం, బీమా క్లెయిం ప్రక్రియ గురించి బ్యాంకులను ఏడాదికి ఒకసారి ఆడిట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మీ డెబిట్, క్రెడిట్ కార్డులు జాగ్రత్త.. పోగొట్టుకుంటే మళ్లీ కష్టమే!
మీకు డెబిట్, క్రెడిట్ కార్డులు బ్యాంకుల నుంచి రావాలంటే ఎంత సమయం పడుతుంది... డెబిట్ కార్డు కోసమైతే..రెండు లేదా మూడు రోజులు పట్టొచ్చు. కొన్ని బ్యాంకులయితే వెంటనే అకౌంట్ తీసిన రోజే డెబిట్ కార్డును జారీ చేస్తాయి. క్రెడిట్ కార్డు కోసమైతే.. అన్ని వెరిఫీకేషన్లు పూరైన వెంటనే బ్యాంకులు కార్డును జారీ చేస్తాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు పోతే బ్లాక్ చేసి రెండు, మూడురోజుల్లో బ్యాంకులనుంచి తిరిగి సులువుగా పొందవచ్చుననీ అనుకుంటున్నారా..! భవిష్యత్తులో అలా కుదరదు. తీవ్ర చిప్స్ కొరతతో కార్డుల ఉత్పత్తికి ఆటంకం..! రానున్న రోజుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులను బ్యాంకులు వెంటనే జారీ చేయకపోవచ్చును అసలు డెబిట్, క్రెడిట్ కార్డులను ఇవ్వకపోవచ్చును. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్ కొరతతో డెబిట్, క్రెడిట్ కార్డుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడబోతుందని వ్యాపార నిపుణులు హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 3 బిలియన్ల డెబిట్, క్రెడిట్ కార్డులను కంపెనీలు తయారుచేస్తున్నాయి. సుమారు 90 శాతం మేర నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి కార్డులను తయారుచేసే కంపెనీలు ప్రస్తుతం తీవ్ర చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి. చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థ , మొబైల్ చెల్లింపుల సంస్థలు చిప్ల కొరతను నివారించడానికి, సరఫరా పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ తెచ్చినా తంటాలు...! కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం చిప్ తయారీదారులు కార్యకలాపాలను పూర్తిగా మూసివేయవలసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చిప్స్ కొరత ఏర్పడింది. చిప్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల కోసం ఆకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది. చిప్స్ కొరత ఏర్పడడంతో సెమీకండక్టర్ పరిశ్రమ దెబ్బతింది. చిప్స్ కొరతతో పలు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం నెలకొన్న ఈఎంవీ చిప్స్ కొరతతో డెబిట్, క్రెడిట్ కార్డుల ఉత్తత్తికిభారం కానుంది. దీంతో భవిష్యత్తులో బ్యాంకుల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డుల జారీకి ఆటంకం ఏర్పడునుందని ట్రేడ్ యూనియన్ తెలిపింది. కాగా ప్రస్తుతం చిప్స్ కొరత 2022 సంవత్సరం వరకు కొనసాగనుందని చెల్లింపు కార్డుల వాణిజ్య సంస్థలు , మొబైల్ చెల్లింపుల సంస్థలు పేర్కొన్నాయి. సో ప్రస్తుతం ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కడపడితే అక్కడే పొగ్గొట్టుకున్నారో ఇక అంతే సంగతులు. చదవండి: Debit Card EMI: మీకు అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోండి..? -
Debit Card EMI: మీకు అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోండి..?
సాధారణంగా మన చేతిలో డబ్బు లేకుంటే క్రెడిట్ కార్డ్ పై ఆధారపడుతూ ఉంటాం. మనకు నచ్చిన వస్తువులను క్రెడిట్ కార్డుతో తీసుకొని సులభ వాయిదాల చొప్పున కొన్ని నెలల్లో క్రెడిట్ కార్డు బిల్లును పూర్తిగా చెల్లిస్తాం. ఇది కేవలం క్రెడిట్ కార్డుతోనే అప్పు తీసుకోవడం సాధ్యమవుతోంది అనుకుంటే మీరు పొరపడినట్లే..! డెబిట్ కార్డునుపయోగించి కూడా మీకు నచ్చిన వస్తువులను తీసుకోని సులభ వాయిదాల చోప్పున మొత్తాన్ని చెల్లించవచ్చును. ముందుగా మీరు వాడే డెబిట్ కార్డుపై ఈఎంఐ వచ్చే సౌకర్యం ఉందో లేదో సింపుల్గా తెలుసుకోండి. డెబిట్ కార్డ్ ఈఎంఐపై ముందుగా తెలుసుకోవలసిన విషయాలు ముందుగా మీ డెబిట్కార్డ్పై ఈఎంఐ తీసుకొనే అర్హత డెబిట్ కార్డ్ నంబర్, రిజిస్టర్డ్ ఫోన్ నంబర్పై ఆధారపడి ఉంటుంది . చెల్లింపులు చేసేటప్పుడు వినియోగదారులు కచ్చితంగా బ్యాంకులో రిజిస్టర్ ఐనా ఫోన్ నంబర్ను వాడాలి. ఏదైనా వస్తువును ఆర్డర్ చేయడానికి వినియోగదారులు వారి ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ కలిగి ఉండవలసిన అవసరం లేదు. కానీ ఈఎంఐను చెల్లించే సమయంలో కచ్చితంగా తగినంత నిధులను మెయిన్టెన్ చేయాలి. డెబిట్ కార్డులపై ఈఎంఐ పొందే మొత్తాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. గరిష్ట లావాదేవీ విలువ ఖాతాదారునికి ముందుగానే ఆమోదించిన పరిమితి ద్వారా నిర్ణయించబడుతుంది. మీరు బ్యాంక్ కస్టమర్ సర్వీస్ లైన్కు ఫోన్ చేయవచ్చు లేదా మీ EMI అర్హతను తనిఖీ చేయడానికి SMS పంపవచ్చు. ఆయా బ్యాంకుల ఈ-కామర్స్ వెబ్సైట్లో చెక్ చేసుకొవచ్చును. ఆయా బ్యాంకులు తమ ఖాతాదారులు డెబిట్ కార్డుపై ఈఎంఐ పొందే సౌకర్యాన్ని తెలుసుకోవడానికి వినియోగదారుల ఖాతాకు రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ను పంపాలి. ఎస్ఎంఎంస్ పంపిన కొద్ది సేపటికే బ్యాంకు నుంచి అర్హత ఉందో లేదో అనే మెసేజ్ను పంపిస్తుంది 1. యాక్సిస్ బ్యాంక్ : రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 56161600 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. 2.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 567676 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. 3. బ్యాంక్ ఆఫ్ బరోడా: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 8422009988 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. 4.హెచ్డిఎఫ్సి బ్యాంక్: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి MYHDFC అని టైప్ చేసి 5676712 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. 5. ఐసీఐసీఐ బ్యాంక్: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 5676766 నంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. 6. ఫెడరల్ బ్యాంక్: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 5676762 ఎస్ఎంఎస్ చేయాలి. లేదా 7812900900 నంబర్కు మిస్ కాల్ ఇవ్వచ్చును. 7. కోటక్ మహీంద్రా బ్యాంకు: రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి DCEMI అని టైప్ చేసి 5676788 కు ఎస్ఎంఎస్ చేయాలి. చదవండి: ఈ బ్యాంకుల్లో అపరిమిత ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్..! -
10 కోట్ల కార్డుల వివరాలు లీక్!
న్యూఢిల్లీ: డిజిటల్ వేదికలపై కస్టమర్ల కీలక సమాచారం ఎద్ద ఎత్తున చోరీకి గురైంది. ఏకంగా 10 కోట్ల క్రెడిట్, డెబిట్ కార్డుల కీలక వివరాలను ‘జస్ పే’ వేదిక నుంచి తస్కరించిన సైబర్ నేరగాళ్లు వాటిని డార్క్వెబ్లో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు!. ఈ విషయాన్ని సెక్యూరిటీ అంశాల పరిశోధకుడు రాజశేఖర్ రాజహారియా వెలుగులోకి తీసుకొచ్చారు. డార్క్వెబ్లో ఈ సమాచారం అమ్మకానికి పెట్టడాన్ని ఆయన కనిపెట్టనట్లు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న జస్పే.. ప్రముఖ సంస్థలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్, మేక్ మై ట్రిప్, ఎయిర్టెల్, ఉబెర్, స్విగ్గీ తదితర కంపెనీలకు లావాదేవీలను ప్రాసెస్ చేసే సేవలను అందిస్తోంది. దీంతో 10 కోట్ల కార్డు వివరాలు బహిర్గతం కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. 2017 మార్చి నుంచి 2020 ఆగస్ట్ మధ్య ఈ వివరాలు చోరీకి గురి కాగా, ఇటీవలే ఒకే విడత ఈ మొత్తాన్ని విక్రయించినట్టు భావిస్తున్నారు. అన్ని వివరాలూ.. కార్డు కంపెనీ (వీసా/మాస్టర్కార్డ్, ఏఎమ్ఎక్స్), కార్డు ఎక్స్పైరీ, కార్డుపై ఉండే మొదటి ఆరు, చివరి నాలుగు అంకెలు, కార్డు రకం (క్రెడిట్ లేదా డెబిట్), కార్డుపై పేరు, దాన్ని మంజూరు చేసిన బ్యాంకు, కార్డ్ ఫింగర్ప్రింట్, కార్డు ఐఎస్ఐఎన్.. ఇలా కార్డుల్లోని 16 ఫీల్డ్స్ వివరాలు, లావాదేవీల సమాచారం లీక్ అయినట్టు భావిస్తున్నారు. అలాగే, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు, పేర్లు కూడా తరలిపోయాయి. ఈ వివరాలు లావాదేవీల సమయంలో ఈ కామర్స్ సంస్థల నుంచి జస్పేకు వెళుతుంటాయి. వీటి ఆధారంగా జస్పే లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. మోసాలకు ఆస్కారం.. ఇలా చోరీ చేసిన సున్నిత సమాచారం ఆధారంగా సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు సందేహిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా యూజర్లకు కాల్ చేసి బ్యాంకు నుంచో లేక జస్పే లేక అమెజాన్ నుంచి చేస్తున్నట్టు నమ్మించి కావాల్సిన ఇతర సమాచారం కూడా తీసుకోవడం ద్వారా లావాదేవీలను చేసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. కార్డుకు సంబంధించి తమ వద్దనున్న వివరాలు చెప్పడం ద్వారా నమ్మించే ప్రయత్నం చేయవచ్చంటున్నారు. కార్డు వివరాలు లీక్ కాలేదు: జస్పే ‘‘2020 ఆగస్ట్ 18న మా సర్వర్లపై అనధికార దాడికి ప్రయత్నం జరగ్గా.. గుర్తించి అడ్డుకున్నాము. అయితే కార్డు నంబర్లు లేదా ఆర్థిక వివరాలు లేదా లావాదేవీల వివరాలు ఉల్లంఘనకు గురి కాలేదు’’ అంటూ జస్పే గతంలోనే ఓ ప్రకటన రూపంలో స్పష్టం చేసింది. భద్రత ఎలా..? కార్డుపై మూడు నంబర్ల సీవీవీ అన్నది ఎంతో సున్నితమైనది. లావాదేవీ ప్రాసెస్కు ముందు దీన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ వేదికల్లో టూఫ్యాక్టర్ ఆథెంటికేషన్ను కూడా ఉంటోంది. అంటే కార్డుదారు మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన తర్వాతే అది ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ హ్యాకర్ తనకు లభించిన సమాచారంతో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను మార్చేస్తే అప్పుడు జరగాల్సిన నష్టాన్ని అడ్డుకోలేము. కనుక ప్రతీ ఆన్లైన్ లావాదేవీ కోసం ప్రత్యేకంగా వర్చువల్ కార్డును ఉపయోగించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. -
డెబిట్, క్రెడిట్ కార్డులపై ఆంక్షలు
సాక్షి, ముంబై: బ్యాంకు కార్డు మోసాలకు చెక్ పెడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త గైడ్ లైన్స్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులకు మరింత రక్షణ కల్పించేలా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామని ఆర్బీఐ వెల్లడించింది. తక్షణమే అన్ని బ్యాంకులు, కార్డులను జారీ చేసే కంపెనీలు డెబిట్, క్రెడిట్ కార్డుల అనవసరంగా అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు సేవలను తీసివేయాలని, కార్డు వినియోగదారుడు అభీష్టం మేరకు ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆర్బీఐ కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది.. క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్, ఆన్ లైన్ లావాదేవీలకు, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వాడాలంటే, ముందస్తు అనుమతి తప్పనిసరి. వాడకంపై ముందుగానే పరిమితులను పెట్టుకోవచ్చు. ఈ పరిమితి దాటి కార్డు ద్వారా లావాదేవీకి ప్రయత్నిస్తే, వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ ఫోన్ కు సమాచారం అందుతుంది. కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, ఎన్ఎఫ్సీ, పీఓఎస్, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగానూ నిషేధించుకోవచ్చు. బ్యాంకులు జారీచేసే క్రెడిట్, డెబిట్ కార్డులుఏటీఎంలలోనూ, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) వద్ద మాత్రమే పనిచేస్తాయి. కస్టమర్లకు వారి నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు ఖాతాను జత చేస్తారు. ఈ నిబంధన ప్రీ పెయిడ్, గిఫ్ట్ కార్డులకు మాత్రం వర్తించదు. ఎలా అంటే మొబైల్ లేదా నెట్బ్యాంకింగ్ ద్వారా మీ బ్యాంక్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. కార్డులు విభాగంలోకి వెళ్లి ' మేనేజ్ కార్డ్స్ ' ఎంచుకోవాలి. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. ఇక్కడ మనకు కావాల్సిన దాన్ని ఎంచుకుని డిసేబుల్ చేయాలి. మళ్లీ కావాలనుకున్నపుడు దానికనుగుణంగా ఆన్ - ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ట్రాన్సాక్షన్ పరిమితిని కూడా సెట్ చేసుకోవచ్చు. -
బ్యాంకు పిన్ నెంబరును... కచ్చితంగా మార్చుకోవాలి
సాక్షి, సిటీబ్యూరో : మాగ్నెటిక్ స్ట్రిప్తో కూడిన డెబిట్/క్రెడిట్ కార్డుల్ని నేరగాళ్లు తేలిగ్గా క్లోనింగ్ చేస్తున్నారనే ఉద్దేశంతో బ్యాంకులు చిప్తో కూడిన కార్డుల్ని అమలులోకి తీసుకువచ్చాయి. ఇప్పుడు వీటికీ సైబర్ క్రిమినల్స్ దాడి తప్పట్లేదు. ఈ కార్డుల్నీ క్లోన్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. బుధ, గురువారాల్లోనే ఇద్దరు బాధితులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఓ గ్రాఫిక్ డిజైనర్ నుంచి రూ.50 వేలు, సోమాజిగూడకు చెందిన మరో యువకుడి ఖాతా నుంచి రూ.40,500 ఈ రకంగా కాజేశారు. మొదటి కేసులో బీహార్లోని గయ, రెండో ఉదంతంలో నెల్లూరులోని ఏటీఎం కేంద్రాల నుంచి నగదు డ్రా అయింది. ఈ కేసులు నమోదు చేసిదర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు కార్డు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చేతిలో ఇమిడే స్కిమర్మర్లతో తస్కరణ... మినీ స్కిమ్మర్లుగా పిలిచే అత్యాధునిక యంత్రాలు ప్రస్తుతం ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉండే వీటిని ఖరీదు చేస్తున్న సైబర్ నేరగాళ్ళు వివిధ వాణిజ్య సముదాయాల్లో ఉండే తమ అనుచరులకు అప్పగిస్తున్నారు. వీటిని నిత్యం తమ జేబుల్లో ఉంచుకుంటున్న ఆ అనుచరులు తమ వద్ద షాపింగ్కు వచ్చిన వచ్చిన వినియోగదారులు డబ్బు చెల్లింపు కోసం డెబిట్/క్రెడిట్ కార్డు ఇచ్చినప్పుడు అదును చూసుకుని ఆ కార్డును ఈ స్కిమ్మర్లోనూ ఒకసారి పెట్టి తీస్తున్నారు. దీంతో అందులో ఉండే డేటా మొత్తం వీటిలో నిక్షిప్తమవుతుంది. కస్టమర్ టైప్ చేసేప్పుడు పిన్ నెంబర్ను గమనిస్తున్నారు. ఆపై వినియోగదారుడి కార్డును అతడికి తిరిగి ఇచ్చేస్తున్నారు. కంప్యూటర్/ల్యాప్టాప్కు కనెక్ట్ చేసి... క్రెడిట్/డెబిట్ కార్డుకు సంబంధించిన డేటామొత్తం చిప్లో నిక్షిప్తమై ఉంటుంది. దుండగుల తమ వద్ద ఉన్న స్కిమ్మర్లో కార్డు ఆ వైపునే పెట్టి తీయడంతో డేటా తస్కరణకు గురవుతోంది. ఇలా తస్కరించిన డేటాతో కూడిన స్కిమ్మర్ల, తాము గుర్తించిన పిన్ నెంబర్లను ఈ అనుచరులు ప్ర«ధాన సూత్రధారులకు అందిస్తుంటారు. వీటిని సైబర్ నేరగాళ్ళు తన ల్యాప్టాప్/కంప్యూటర్లకు కనెక్ట్ చేసి వాటిలోకి అప్లోడ్ చేస్తుంటారు. ఆపై ఈ డేటాను డార్క్ నెట్ ద్వారా విక్రయిస్తూ ఉంటారు. దీన్ని ఖరీదు చేస్తున్న దుండగులు రైటర్లను ఖరీదు చేసి, తమ కంప్యూటర్/ల్యాప్టాప్లకు అనుసంధానిస్తుంటారు. ఇలాంటి మిషన్లన్నీ అత్యధికం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నవే ఉంటున్నాయి. ఆన్లైన్లో ఖరీదు చేస్తున్న చిప్లతో కూడిన ఖాళీ కార్డులను ఈ ల్యాప్టాప్/కంప్యూటర్లకు కనెక్ట్ చేసి ఒక్కో కార్డు డేటాను రైట్ చేసి క్లోన్డ్ కార్డులు రూపొందించేస్తుంటారు. అంటే మన క్రెడిట్కార్డుకి నకలు దుండగుడి వద్ద తయారైపోతుందన్న మాట. దేశంలోని పలు ప్రాంతాల్లో ఏజెంట్లు ఇలా తయారైన క్లోన్డ్ కార్డుల్ని వినియోగించడానికి ఈ నేరగాళ్ళు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటారు. వారికి కార్డులు, పిన్ నెంబర్లను పంపిస్తూ ఉంటారు. సీసీ కెమెరాలు లేని ఏటీఎం కేంద్రాలను గుర్తించే ఈ ఏజెంట్లు డబ్బు డ్రా చేస్తూ ఉంటారు. ఆ మొత్తంలో కొంత కమీషన్ మినహాయించుకుని మిగిలింది సూత్రధారులకు అందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎంపిక చేసుకున్న స్వైపింగ్ మిషన్ కలిగిన వారికి అందిస్తూ అక్కడ స్వైపింగ్ చేయిస్తాయి. ఇలా తమ ఖాతాల్లో పడిన మొత్తాన్ని స్వైపింగ్ మిషన్ హోల్డర్లు కొంత కమీషన్ తీసుకుంటూ సైబర్ నేరగాళ్ళకు అప్పగిస్తుంటారు. ఈ రకంగా మనకు తెలియకుండానే క్లోనింగ్ కార్డు ద్వారా మన ఖాతా ఖాళీ అయిపోతుంటుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి: ♦ క్రెడిట్, డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుకవైపు ఉండే సిగ్నేచర్ ప్యానల్లో సంతకం చేయాలి. ♦ బ్యాంకు అధికారులు పంపిన పిన్ నెంబరును అలాగే వాడేయకుండా... కచ్చితంగా మార్చుకోవాలి. ♦ క్రెడిట్/డెబిట్ కార్డు వెనుక వైపు ఉండే సీవీవీ కోడ్లో చివరకు మూడు అంకెలూ కచ్చితంగా గుర్తుపెట్టుకుని, కార్డు పై నుంచి వాటిని చెరిపేయాలి. ♦ మీ క్రెడిట్/డెబిట్ కార్డును దుకాణం, వెయిటర్ తదితరులకు ఇస్తే... అది తిరిగి మీ చేతికి వచ్చే వరకు దృష్టి మళ్లనీయకండి. ♦ ఇటీవల కోవిడ్ భయం నేపథ్యంలో అనేక మంది వ్యాపారులు, ఆయా దుకాణాల్లోని వారు కార్డులు స్వైప్ చేసిన తర్వాత పిన్ నెంబర్ అడిగి వాళ్ళే ఎంటర్ చేసుకుంటున్నారు. ♦ కొన్ని పరిíస్థితులు మినహాయిస్తే వీలున్నంత వరకు దీనికి అనుమతి ఇవ్వొద్దని అధికారులుసూచిస్తున్నారు. -
బ్యాంక్ లోన్ ఉంటే డెబిట్ కార్డు సౌకర్యం: ఆర్బీఐ
ముంబై : ఎలక్ట్రానిక్ కార్డుల జారీ అంశంలో ఆర్బీఐ పలు నిబంధనలను సడలించింది. ఇందులో భాగంగా ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా కలిగిన వ్యక్తులు కూడా డెబిట్ కార్డులను పొందడానికి అవకాశం లభించింది. ఆర్బీఐ 2015లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల్లో ఖాతా కలిగిన వారికే ఎలక్ట్రానిక్ కార్డులను జారీ చేయాల్సి ఉంది. అయితే, వీటిలో పలు మార్పులు చేసిన ఆర్బీఐ.. వ్యక్తిగత రుణాలను కలిగిన ఉన్నవారికి (కేవలం వ్యక్తులకే) డెబిట్ కార్డులను జారీ చేయవచ్చనే వెసులుబాటు ఇచ్చింది. ఈ కార్డులను కేవలం ఆన్లైన్, నగదురహిత లావాదేవీలకు మాత్రమే వినియోగించాలి. వినియోగం కోసం చెక్లు, తగిన నిల్వను ఉంచాల్సి ఉంటుందని వివరించింది. -
‘క్రెడిట్’కు ఇంటర్నేషనల్ కాటు
సాక్షి, సిటీబ్యూరో: డిజిటల్ కరెన్సీలో భాగమైన క్రెడిట్కార్డుల క్లోనింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఒకప్పుడు స్థానిక లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండగా... ఇటీవల కాలంలో అంతర్జాతీయ లావాదేవీలు పెరిగి పోయాయి. ‘చార్జ్ బ్యాక్’ సదుపాయం నేపథ్యంలో ఈ క్రైమ్ వల్ల ఆర్థిక నష్టం లేకపోయినా.. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. డెబిట్కార్డులు క్లోనింగ్ బారిన పడవని, క్రెడిట్ కార్డులకు మాత్రం తప్పట్లేదని వివరిస్తున్నారు. ‘ప్రైవేట్’ డేటా లీక్... దాదాపు ప్రతి బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల్ని జారీ చేస్తూ ఉంటుంది. ఖాతాలో ఉన్న మొత్తాన్ని వినియోగించుకోవడానికి డెబిట్, అప్పుగా వినియోగించుకుని ఆపై చెల్లించడానికి క్రెడిట్కార్డులు ఉపకరిస్తాయి. డెబిట్కార్డుల తయారీ, నిర్వహణ, జారీ మొత్తం బ్యాంకు ఆదీనంలోనే జరుగుతుంది. అయితే క్రెడిట్కార్డులకు సంబంధించింది మాత్రం ఆయా బ్యాంకులు ఔట్సోర్సింగ్ లేదా ఒప్పంద ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఇక్కడే సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తున్న డేటా అంతర్జాతీలం ద్వారా అమ్ముడైపోతోంది. ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉండటంతో పాటు అంతర్జాతీయ లావాదేవీలకు అవకాశం ఉండటంతోనే ఈ డేటాకు డిమాండ్ పెరిగింది. అయితే ఇది నేరుగా కాకుండా ఆన్లైన్ అధోజగత్తుగా పిలిచే డార్క్ నెట్ నుంచి క్రయవిక్రయాలు సాగుతున్నాయి. దానికి అంతా ప్రత్యేకం... కంప్యూటర్లలో వినియోగించే విండోస్ ఆపరేటింగ్ సిస్టం, వివిధ చిరునామాలతో ఇంటర్నెట్లో ఉండే వెబ్సైట్లు అందరికీ తెలిసినవే. ఇటీవల కాలంలో అనేక ఈ–కామర్స్ వెబ్సైట్లు అందుబాటులోకి వచి్చ, అగ్గిపెట్టె నుంచి ఆడి కారు వరకు క్రయవిక్రయాలను ఆన్లైన్లోకి తీసుకువచ్చాయి. వీటి ద్వారా క్రెడిట్కార్డుల డేటా వంటివి విక్రయానికి పెడితే పోలీసు, నిఘా వర్గాలు గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి నిఘాకు చిక్కకుండా, ‘తమ వినియోగదారుల’ మినహా మిగిలిన వారికి కనిపించకుండా అంతర్జాతీయ ముఠాలు ఇంటర్నెట్లోని అండర్ వరల్డ్ను ఏర్పాటు చేసుకున్నాయి. దీన్ని సాంకేతికంగా ‘డీప్ వెబ్’, ‘అండర్గ్రౌండ్ వెబ్’, ‘డార్క్ వెబ్’ అని పిలుస్తారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో ఈ డీప్ వెబ్లోకి చొరబడటం సాధ్యం కాదు. దీనిని టెయిల్స్గా పిలిచే ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టంను ఇన్స్టల్ చేసుకోవాలి. దీంతో పాటే టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టం సైతం ఇన్స్టల్ అవుతుంది. ఇలా డీప్ వెబ్లోని వెబ్సైట్లలో ఉన్న డేటాను బిట్కాయిన్స్ ద్వారా చెల్లించి సొంతం చేసుకునే ముఠాలు అనేకం ఉన్నాయి. కంప్యూటర్లతో అనుసంధానించి... ఇలా తమ చేతికి వస్తున్న డేటాను సైబర్ నేరగాళ్ళు తమ కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆపై ప్రత్యేకమైన కార్డ్ రైటర్స్ను ఈ కంప్యూటర్లకు అనుసంధానిస్తున్నారు. ఆన్లైన్ ద్వారానే వీళ్ళు యాగ్నెటిక్ స్ట్రిప్, చిప్లతో కూడిన ఖాళీ కార్డులు ఖరీదు చేస్తున్నారు. వీటిని రైటర్స్లో పెట్టడం ద్వారా అప్పటికే డార్క్ వెబ్ నుంచి ఖరీదు చేసిన డేటాను ఖాళీ కార్డుల్లోకి పంపిస్తున్నారు. అంటే వినియోగదారుడి క్రెడిట్కార్డు అతడి వద్దే ఉన్నా... నకలు దుండగుడి వద్ద తయారైపోతోంది. దీన్నే సాంకేతిక పరిభాషలో క్లోనింగ్ అంటారు. ఇలా భారతీయులకు చెందిన క్రెడిట్కార్డుల్ని పోలిన వాటికి క్లోన్డ్ వెర్షన్స్ విదేశీయులు తయారు చేసి తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఈ కార్డులను వినియోగించి స్వయంగా షాపింగ్ చేసేవాళ్ళు కొందరైతే... కమీషన్ పద్దతిలో ఇతరుల షాపింగ్స్కు డబ్బులు కట్టేవాళ్ళు మరికొందరు ఉంటున్నారు. ఇక్కడ మాదిరిగా విదేశాల్లో క్రెడిట్కార్డ్ వినియోగిస్తూ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకపోవడం వీరికి కలిసి వస్తోంది. ఆ షాపింగ్కు సంబంధించిన సందేశం, బిల్లులు మాత్రం ఇక్కడి అసలు వినియోగదారులకి వస్తున్నాయి. సర్వర్లను కనిపెట్టడమూ అసాధ్యమే క్రెడిట్, డెబిట్ కార్డుల ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కు సంబంధించిన ఫిర్యాదులు నెలకు 15 నుంచి 20 వరకు వస్తున్నాయి. బ్యాంకుల వారికి లేఖలు రాయడం ద్వారా చార్జ్బ్యాక్ విధానంలో ఆ డబ్బును కార్డు వినియోగదారుడి ఖాతాలోకి తిరిగి పంపించేలా చేస్తున్నాం. అయితే డేటాను దుర్వినియోగం చేస్తున్న ‘డీప్ వెబ్’కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలతో పాటు నిర్వహిస్తున్న వారి వివరాలూ బయటకు తెలిసే అవకాశాలు లేవు. ఇదే సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తున్న అంశంగా మారిపోయింది. ఈ ఇంటర్నేషనల్ క్లోనింగ్ బారినడపకుండా ఉండాలంటే మీ కార్డుల్లో ఇంటర్నేషనల్ లావాదేవీలు చేసే అంశాన్ని డిసేబుల్ చేసుకోండి. – కేవీఎం ప్రసాద్, ఏసీపీ, సిటీ సైబర్ క్రైమ్ ఠాణా -
ఆ ఎస్బీఐ డెబిట్ కార్డ్లు ఇక పనిచేయవు!
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచిస్తోంది. కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తెలిపింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతుండడంతో వాటిని అరికట్టే ప్రయత్నంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2016లో అప్పటికి వినియోగంలో ఉన్న మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ ప్రవేశ పెట్టింది . ఇప్పటికీ కూడా కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లకు వెంటనే బ్యాంక్కు వెళ్లి కార్డును మార్చుకోవాలని కస్టమర్లకు సూచించింది. చదవండి: ఎస్బీఐ గుడ్న్యూస్ మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డును మార్చుకోవడానికి కస్టమర్లు ఆయా బ్రాంచ్లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది. కొత్త ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత ఎస్బీఐ డెబిట్ కార్డు తీసుకోవాలని తెలిపింది. ఈ కార్డుల వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులు మార్చుకోవాలని ఇప్పటికే ఎన్నో సార్లు సూచించడం జరిగిందని, కార్డులను మార్చుకోని వారికి ఇక ఈనెల 31 వరకు మాత్రమేనని పేర్కొంది. -
మీ కార్డును స్విచాఫ్ చేయండి
రమణమూర్తి మంథా శ్రీధర్కు రెండు డెబిట్ కార్డులు... మూడు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇవన్నీ వీసా, మాస్టర్, మ్యాస్ట్రో కార్డులే కావటంతో ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటవుతాయి. కాకపోతే గతనెల్లో వచ్చిన ఓ క్రెడిట్ కార్డు, ఓ డెబిట్ కార్డు బిల్లులో... తాను వాడకపోయినా ఏకంగా రూ.45,000 వాడేసినట్లుంది. ఎక్కడ వాడానని చూస్తే... అంతర్జాతీయ ఈ–కామర్స్ సైట్లలో వాడినట్లు ఉంది. తనకస్సలు ఆ వెబ్సైట్ల పేర్లే తెలియవంటూ బ్యాంకుకెళ్లాడు. బ్యాంకు అధికారులు పరిశీలించారు. కార్డుల డేటా సేకరించి... ఓటీపీ అవసరం లేని సైట్ల ద్వారా ఆ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చెయ్యమన్నారు. చేసేదేమీ లేక శ్రీధర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. ఇది శ్రీధర్ ఒక్కడికే పరిమితమైన గొడవ కాదు. చాలామంది ఇప్పుడు ఇలాంటి ఫిర్యాదులతోనే పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే చాలా విదేశీ ఈ–కామర్స్ వెబ్సైట్లు తమ ద్వారా లావాదేవీలు జరిపినపుడు ఒన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) అడగటం లేదు. ఓటీపీ అక్కర్లేకుండానే కార్డు నంబరు, పేరు, ఎక్స్పైరీ తేదీ, సీవీవీ వంటి వివరాలిస్తే లావాదేవీ పూర్తయిపోతోంది. దీంతో లావాదేవీ పూర్తయ్యాకే ఫోన్లకు మెసేజీ వస్తోంది. కొన్ని బ్యాంకుల నుంచైతే ఆ మెసేజీ కూడా రావటం లేదు. దీంతో డబ్బులు పోగొట్టుకోవటం కస్టమర్ల వంతవుతోంది. మరి దీన్ని అడ్డుకోవటం ఎలా..? ఆ చర్యల వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు కూడా వినియోగదారుల డేటా రక్షణకు అత్యాధునిక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో ఒకటి... మన లావాదేవీల్ని మనమే నిలిపేసుకోవటం. మన కార్డును మనమే నియంత్రించుకోవటం. మనకు కావాల్సినపుడు మన కార్డును స్విచాన్ చేసుకోవటం... అక్కర్లేనపుడు ఆఫ్ చేసుకోవటం. ఇలా గనక చేస్తే... మన కార్డుపై మనకు తెలియకుండా లావాదేవీలు జరపటం ఎవ్వరి తరమూ కాదు. అదెలాగో చూద్దాం... ఇప్పుడు ప్రతి బ్యాంకుకూ ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ (యాప్) ఉంది. ఆ అప్లికేషన్ ద్వారా ఖాతా వివరాలు తెలుసుకోవటం, నగదు బదిలీ చేసుకోవటం, చెక్బుక్కు అభ్యర్థన పంపటం, ఈ–డిపాజిట్లు తెరవటం, బిల్లులు చెల్లించటం... ఇలా చాలా పనులు చేసుకోవచ్చు. దీంతోపాటే.. మన ఆన్లైన్ లావాదేవీల్ని, కార్డు ద్వారా జరిపే లావాదేవీలను నియంత్రించుకోవచ్చు కూడా. - దీనికోసం ‘మేనేజ్ యువర్ కార్డ్’ విభాగంలోకి వెళ్లాలి. దాదాపు అన్ని బ్యాంకుల యాప్లలోనూ ఈ సౌలభ్యం ఉంటుంది. కాకపోతే దీని శీర్షిక ఒక్కో యాప్లో ఒకోలా ఉండొచ్చు. - ఆ విభాగంలోకి వెళ్లినపుడు అక్కడ మీరు వాడుతున్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ అదే బ్యాంకు నుంచి ఒకటికన్నా ఎక్కువ కార్డులు వాడుతున్నట్లయితే ఆ కార్డులన్నీ కనిపిస్తాయి. వాటిలో మనకు కావాల్సిన కార్డును సెలక్ట్ చేసుకోవాలి. - ఆ కార్డును సెలక్ట్ చేసుకున్న తరవాత దానికి సంబంధించిన ఆప్షన్లు వస్తాయి. ఆ ఆప్షన్లలో... మొత్తం లావాదేవీలన్నిటినీ నిలిపేయటం... విదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేయటం... స్వదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేయటం వంటివి ఉంటాయి. వాటిలో మనం దేన్నయినా సెలక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు విదేశీ లావాదేవీల్ని మాత్రమే నిలిపేశామనుకోండి. విదేశాల నుంచి ఎవ్వరు మీ కార్డు నంబరుతో లావాదేవీలు చేసినా అది తిరస్కరణకు గురవుతుంది. దాంతో విదేశీ లావాదేవీల నుంచి మీ కార్డును కాపాడుకున్నట్లేనన్న మాట. - విదేశీ లేదా స్వదేశీ ఆన్లైన్ లావాదేవీలకు, విదేశీ లేదా స్వదేశీ పీఓఎస్ మెషీన్ల ద్వారా (స్వైపింగ్) జరిగే లావాదేవీలకు పరిమితులను కూడా మీరే నిర్దేశించుకోవచ్చు. ఉదాహరణకు విదేశీ, స్వదేశీ లావాదేవీలు రెండింటికీ ఆన్లైన్ ద్వారా రూ.5,000 పరిమితిని పెట్టుకున్నారనుకోండి... అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువున్నా ఆ లావాదేవీని బ్యాంకు అనుమతించదు. మీ అంతట మీరు లావాదేవీ జరిపినా అంతే. అలాగే పీఓఎస్ల ద్వారా కూడా. మీరు గనక ఒక పరిమితిని నిర్దేశిస్తే... దాన్ని మించిన మొత్తానికి లావాదేవీ జరిగితే అది తిరస్కరణకు గురవుతుంది. ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు... ఆన్లైన్ లావాదేవీలకు, పీఓఎస్ లావాదేవీలకు యాప్ ద్వారా నిర్దేశించుకునే పరిమితులను గానీ... అనుమతించటం, స్విచాఫ్ చేయటం వంటివిగానీ యాప్లో ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. అదే సెకన్లో... అంటే రియల్టైమ్లో అది అప్డేట్ అవుతుంది కూడా. అంటే... మీరు ఆన్లైన్ లావా దేవీల్ని పూర్తిగా నిలిపేసుకున్నారనుకోండి. ఆన్లైన్లో పేమెంట్ చేసే ముందు మీ యాప్లోకి వెళ్లి నియంత్రణను తొలగించుకోవచ్చు. పేమెంట్ పూర్తయిన వెంటనే మళ్లీ నిలిపేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ కార్డులు, మీ ఖాతాలు పూర్తిగా మీ అధీనంలో ఉంటాయి. నకిలీ లావాదేవీలకు ఎలాంటి ఆస్కారం ఉండదు. కార్డును ఇలా కూడా కాపాడుకోవచ్చు... చాలామంది పెట్రోలు బంకుల్లో, రెస్టారెంట్లలో పలు సందర్భాల్లో తమ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల్ని అక్కడి సిబ్బంది చేతికి ఇస్తుంటారు. ఆ సిబ్బంది వాటిని క్లోన్ చేయొచ్చు. లేకుంటే వివరాలు రాసుకున్నా... మొబైల్ ఫోన్తో రెండువైపులా ఫొటోలు తీసుకున్నా సరిపోతుంది. మన వివరాలన్నీ తన చేతికి చిక్కేసినట్లే. అందుకే పీఓఎస్ యంత్రాన్ని మన దగ్గరకే తీసుకురమ్మని చెప్పి... కార్డు మన కళ్లెదురుగానే ఇన్సర్ట్ చేయించి... మనమే పిన్ నంబరు నొక్కితే సరిపోతుంది. అంటే మన కళ్ల నుంచి ఎలాంటి చర్యా తప్పించుకోకుండా చూసుకోవాలన్న మాట. -
‘ఎనీ డెస్క్’తో.. ఎనీ టైమ్ లాగేస్తారు!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు అధికారులమంటూ ఖాతాదారుడికి ఫోన్లు చేసి డెబిడ్ కార్డు వివరాలతోపాటు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ)ని సైతం సంగ్రహించి అకౌంట్ నుంచి డబ్బులు దండుకునే జమ్తార ఓటీపీ సైబర్ నేరగాళ్లు పంథా మార్చి కొత్త దందా షురూ చేశారు. ఓసారి బోల్తాపడ్డ బాధితుడినే పదేపదే టార్గెట్ చేస్తున్నారు. ఒకసారి ఓటీపీ చెప్పి భంగపడ్డ బాధితుడు మరోసారి చెప్పేందుకు సాహసించడు. దీంతో మళ్లీమళ్లీ అడగకుండా ఓటీపీని సంగ్రహించేందుకు ఖాతాదారుడికి ఫోన్ చేసి ‘ఎనీ డెస్క్’అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకోమని చెబుతున్నారు. ఒక్కో క్రైమ్కు ఒక్కో సిమ్ వాడుతున్న ఈ నేరగాళ్లు పోలీసుల దర్యాప్తునూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఇటీవల దాదాపు 30 వరకు వచ్చాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. 7 గ్రామాల్లోనూ అదే పని.. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ జిల్లా దాటి జార్ఖండ్లో ప్రవేశించిన వెంటనే వచ్చేదే జమ్తార జిల్లా. ఆ జిల్లాలో ఉన్న 7 గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. పూర్తిస్థాయిలో విద్యుదీకరణ కూడా జరగని ఆ జిల్లా కేంద్రంలో జనరేటర్లకు మంచి డిమాండ్ ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. ల్యాప్టాప్స్, సెల్ఫోన్లతో కూర్చునే అక్కడ యువత దేశవ్యాప్తంగా అనేక మందికి కార్డు వివరాలు సహా ఓటీపీ కోసం గాలం వేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం వరకు అనేక ప్రాంతాల్లోని కాల్ సెంటర్లలో జమ్తార యువత పనిచేసి వచ్చారు. ఈ అనుభవంతో వారే సొంతంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని సైబర్ నేరాల దందాలోకి దిగారు. ఫోన్లలో ఎదుటివారితో ఎలా మాట్లా డాలి అనే అంశంపై అక్కడ శిక్షణ కూడా ఇస్తుంటారు. బిహార్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా నేరగాళ్లు ఉన్నారు. బ్యాంకుల నుంచే డేటా.. ఆయా బ్యాంకుల్లో కిందిస్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతోపాటు వాటి కాల్ సెంటర్లు తదితర మార్గాల్లో డెబిట్ కార్డుల సమాచారం ఈ సైబర్ నేరగాళ్లకు చేరుతోంది. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డులు తీసుకునే జమ్తార యువకులు వీటిని వినియోగించడానికి బేసిక్ మోడల్, తక్కువ ఖరీదున్న సెల్ఫోన్లు వాడుతుంటారు. వీటితో తమ డేటా లోని బ్యాంకు కస్టమర్ల ఫోన్ నంబర్లకు కాల్ చేస్తుంటారు. అందరూ తమ ఫోన్లలో ‘ట్రూకాలర్’తరహా యాప్స్ వాడుతున్నారు. దీంతో బోగస్ సిమ్కార్డుల్ని వినియోగిస్తున్న వీళ్లు ముందుగానే తమ నంబర్లను సదరు యాప్లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నంబర్ నుంచి కాల్ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచే వస్తున్న భావన కలిగి బుట్టలో పడతారు. ఇలా ఓ వ్యక్తి నుంచి డబ్బు కాజేసిన వెంటనే అందుకు వినియోగించిన సెల్ఫోన్, సిమ్కార్డును ధ్వంసం చేసేస్తున్నారు. పదేపదే అడగకుండా.. ఖాతాదారుడి నుంచి సేకరించిన వివరాలను అతడు బ్యాంకు ద్వారా మార్చుకునేలోపు ఎన్నిసార్లు అయినా వాడవచ్చు. ప్రతి లావాదేవీకీ ఓటీపీ కచ్చితంగా ఉండాలి. దీన్ని పదేపదే వినియోగదారుడిని అడిగితే చెప్పకుండా ఉండే ఆస్కారం ఉంది. అందుకే టార్గెట్ చేసుకున్న వారిలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉంటే ప్లే స్టోర్ నుంచి ఎనీ డెస్క్ యాప్ను డౌన్లోడ్ చేసుకోమంటున్నారు. టీమ్ వ్యూవర్ తరహాకు చెందిన దీనికి ఓ పాస్వర్డ్ చెప్పి యాక్టివ్ చేసుకోమంటున్నారు. ఈ యాప్తో భవిష్యత్లో బ్యాంకుకు సంబంధించిన ఏ సమాచారమైనా నేరుగా అందుతుందని, అప్డేట్స్, లింకేజ్లు ఆటోమేటిక్గా జరుగుతాయని చెప్పి నమ్మిస్తున్నారు. ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని యాక్టివ్ చేయగానే ఖాతాదారుడి ఫోన్ స్క్రీన్ సైబర్ నేరగాడి ల్యాప్టాప్లో ప్రత్యక్షమవుతుంది. ఫలితంగా ఫోన్కు వచ్చిన ప్రతి ఓటీపీని అడగాల్సిన పనిలేకుండా ఖాతా ఖాళీ చేయడానికి ఆస్కారం ఏర్పడుతోంది. ఇదంతా గ్రహించి తెరుకునేలోపే బాధితుల బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. దర్యాప్తులో ఎన్నో సవాళ్లు.. ఈ నేరగాళ్లు ఒక్కో నేరానికి ఒక సిమ్కార్డు మాత్రమే వాడి దాన్ని ధ్వంసం చేసేస్తుంటారు. ఇవి కూడా తప్పుడు వివరాలతో తీసుకున్నవే ఉంటున్నాయి. మరోపక్క వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలన్నీ బోగస్ పేర్లు, చిరునామాలతో ఉంటున్నాయని సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతకు కమీషన్ల ఎర వేసి వారి బ్యాంకు ఖాతాలను వాడుకుంటున్నారు. మనీమ్యూల్స్గా పిలిచే వీరి నుంచి సైబర్ నేరగాళ్లు నేరుగా డబ్బే తీసుకుంటున్నారు. దీంతో పాత్రధారుల్ని తప్ప సూత్రధారుల్ని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. ఈ తరహా సైబర్ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో.. కేసుల్ని కొలిక్కి తీసుకురావడం, సొమ్ము రికవరీ చేయడం అంత కష్టమని అధికారులు చెప్తున్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే ఈ తరహా సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పవచ్చని సూచిస్తున్నారు. ఆధార్ లింకేజ్ లేదా అప్గ్రేడేషన్ కోసం బ్యాంకు నుంచి ఎలాంటి యాప్లు రావనే విషయాన్ని ప్రతీ ఖాతాదారుడు గుర్తుంచుకోవాలని, అపరిచితులు సూచించే ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. -
రైళ్లలో క్రెడిట్, డెబిట్ కార్డులతో ఫుడ్
న్యూఢిల్లీ: రైళ్లలో ఆహార బిల్లుల్ని చెల్లించేందుకు 2,191 పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) మెషీన్లను ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టింది. రైలు ప్రయాణికులు ఈ మెషీన్ల వద్ద తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి ఆహార బిల్లులను చెల్లించవచ్చు. ప్యాంట్రీకార్లున్న రైళ్లలో పీఓఎస్ మెషీన్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైళ్లలో ఆహార పదార్థాలు కొనేటప్పుడు విక్రేతలు ప్రయాణికుల నుంచి అధికమొత్తాన్ని వసూలు చేయకుండా అరికట్టేందుకు ఈ మెషీన్లు ఉపయోగపడతాయని తెలిపింది. ఎక్స్ప్రెస్, మెయిల్ రైళ్లల్లో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 15వరకు పీఓఎస్ మెషీన్ల పనితీరు, ఆహారపదార్థాల కొనుగోలుపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తామని పేర్కొంది. -
రేపటి నుంచి రోజుకు రూ. 20 వేలు మాత్రమే..
ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గతంలో ప్రకటించిన రూ. 20 వేల విత్డ్రా లిమిట్ రేపు అనగా అక్టోబర్ 31 అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. దీనివల్ల దాదాపు 1. 42 కోట్ల మంది ఎస్బీఐ వినియోగదార్ల మీద ఈ ప్రభావం పడనుంది. ఎస్బీఐ క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులు వినియోగిస్తున్న ఎస్బీఐ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసే నగదును సగానికి కోత పెట్టి కేవలం రూ.20 వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఈ పరిమితి 40వేల రూపాయలుగా ఉండేది. అయితే ఇక మీదట రూ. 20 వేల కంటే ఎక్కువ విత్డ్రా చేయాలనుకునేవారు హై వెరియంట్ డెబిట్ కార్డ్కు అప్లై చేసుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి బ్యాంక్ అధికారులు ‘అత్యధిక మంది రోజుకు రూ.20 వేలు మించి తీయడం లేదని మా పరిశీలనలో తేలింది. అయితే వ్యాపార లావాదేవీల నిమిత్తం కొందరు వ్యాపారులు మాత్రం రూ.40,000 వరకు నగదును ఏటీఎంల నుంచి విత్డ్రా చేస్తున్నారు. దీనివల్ల ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణలో మోసాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దాంతో పాటు నగదురహిత/ డిజిటల్ లావాదేవీలు పెంచడమే ధ్యేయంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుందని’ అధికారులు తెలిపారు. -
డిసెంబర్ 31 తర్వాత ఆ కార్డులు చెల్లవు
సాక్షి, న్యూఢిల్లీ : చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులకు అప్గ్రేడ్ కావాలని బ్యాంకులు పంపుతున్న మెసేజ్లను పట్టించుకోకుంటే ఖాతాదారులకు కష్టాలు తప్పవు. డిసెంబర్ 31 తర్వాత పాత డెబిట్ కార్డులు చెల్లవని ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఈలోగా పాత డెబిట్, క్రెడిట్ కార్డుల స్ధానంలో చిప్ ఆధారిత కార్డులు పొందాలని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులను హ్యాక్ చేయడం, క్లోనింగ్ ద్వారా ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్న ఘటనలు పెరుగుతుండటంతో వినియోగదారుల సొమ్ముకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ చిప్ ఆధారిత కార్డులను ప్రవేశపెట్టాలని బ్యాంకులను ఆదేశించింది. ప్రస్తుతం వాడుతున్న మాగ్నెటిక్ స్ర్టిప్ కార్డుల స్ధానంలో ఈఎంవి చిప్ ఆధారిత కార్డులు పొందాలని ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు కస్టమర్లను కోరుతున్నాయి. ఈఎంవి చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులు జనవరి 2016 నుంచి వినియోగంలో ఉన్నాయి. 2016 జనవరి 31 తర్వాత కొత్తగా ఖాతాలు తెరిచే కస్టమర్లకు చిప్ ఆధారిత కార్డులే అందించాలని ఆర్బీఐ బ్యాంకులు విస్పష్టంగా సూచించింది. మాగ్నెటిక్ స్ర్టిప్ కార్డులతో పోలిస్తే ఈఎంవి చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులు పూర్తి భద్రతతో కూడుకున్నవి. -
ఖాతాదారులకు ఎస్బీఐ సూచన
-
ఆ ఏటీఎంలో కార్డు స్వైప్ చేస్తే, లక్షలు మాయం
ఇటీవల ఏటీఎంలలో కార్డు స్వైప్ చేయాలన్న భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. బ్యాంకు ఏటీఎంల ద్వారా కూడా కస్టమర్ల కార్డు వివరాలను చోరి చేసి, లక్షల కొద్దీ రూపాయలను మాయం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని దాదాపు 50 మంది ఉద్యోగులు ఎంతో కష్టించి సంపాదించుకున్న నగదును పోగొట్టుకున్నారు. దీనికి కారణం గురుగ్రామ్లోని యునిటెక్ సైబర్ పార్క్ వద్దనున్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో కార్డు స్వైప్ చేయడమే. ఆ ఏటీఎంలో డెబిట్ కార్డులను స్వైప్ చేసిన అనంతరం తమ నగదును కోల్పోయినట్టు మెసేజ్లు వచ్చినట్టు ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు. అమెరికాలో తమ అకౌంట్ల నుంచి నగదును విత్డ్రా అయినట్టు మెసేజ్ వచ్చినట్టు నరేష్ నోయిడా, నీరజ్ జైన్లు అనే బాధితులు పేర్కొన్నారు. ఈ మోసంపై వెంటనే వీరు పోలీసు ఫిర్యాదు దాఖలు చేశారు. ఇతర బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించారు. ఆ హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో కార్డు స్వైప్చేస్తే, ఆ ఏటీఎం తమ కార్డు వివరాలన్నింటిన్నీ చోరి చేస్తుందని బాధితులు పేర్కొన్నారు. ఏప్రిల్లోనే ఈ ఏటీఎంలో ఓ డివైజ్ ఇన్స్టాల్చేసి, ఉద్యోగులకు వేతనాలు రావడమే నగదును సైబర్ నేరగాళ్లు బదలాయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘యునిటెక్ సైబర్ పార్క్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో నా ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ కార్డుని వాడిన అనంతరం దాదాపు రూ.22,536 రూపాయలు మే 1న నా అకౌంట్ నుంచి డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది’ అని ఈ స్కాం బారిని పడిన శుభంకర్ చావ్లా పేర్కొన్నారు. తాను లక్షకు పైగా పోగొట్టుకున్నానని మనీష్ అరోరా అనే మరో ఉద్యోగి చెప్పారు. ఇలా నగదును పోగొట్టుకున్న పలువురు ఈ స్కాంపై ఫిర్యాదు చేశారు. అయితే తమ ఏటీఎం సమస్య బారిన పడిన కస్టమర్లకు నగదును తాము రీఫండ్ చేస్తామని హెచ్డీఎఫ్సీ బ్యాంకు హామీఇచ్చింది. గురుగ్రామ్ ఏటీఎంలో నెలకొన్న సమస్య తమ దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేపడుతున్నామని, ఎవరూ ఆర్థికంగా నష్టపోరని బ్యాంకు కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్నీర్ జా అన్నారు. ఈ అంతరాయానికి తాము చింతిస్తున్నట్టు పేర్కొన్నారు. -
డెబిట్ కార్డులపై షాకిచ్చిన బ్యాంకులు
ముంబై : కేంద్ర ప్రభుత్వం ఓ వైపు నుంచి డెబిట్ కార్డు వాడకాన్ని పెంచుతూ ఉంటే.. మరోవైపు నుంచి బ్యాంకులు ఆ కార్డులకి షాక్లు ఇస్తున్నాయి. ఇష్టానుసారం డెబిట్ కార్డును వాడితే ఇక ఏ మాత్రం బ్యాంకులు ఊరుకోదలుచుకోవట్లేదు. అకౌంట్లో డబ్బు లేకపోయినా డ్రా చేయటానికి ప్రయత్నిస్తే.. అందుకనుగుణంగా ఛార్జీలు విధించేందుకు సిద్ధమయ్యాయి. కనీస నిల్వ లేకుండా డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే.. మీ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.17 నుంచి రూ.25లను డెబిట్ చేస్తోంది. ఉదాహరణకు.. మీ బ్యాంక్ ఖాతాలో వెయ్యి రూపాయలే ఉన్నాయనుకుండి, ఒకవేళ మీరు 1,100 స్వైప్ చేస్తే.. సరైన నగదు నిల్వ లేదనే సమాచారం వస్తుంది. ఇక నుంచి దాంతో పాటు కనీస నిల్వ లేకుండా డబ్బులు డ్రా చేయటానికి ప్రయత్నించినందుకు గాను, ఛార్జీ కూడా బ్యాంకులు వసూలు చేయబోతున్నాయి. దీనిలోనే జీఎస్టీ రేటు కూడా అప్లయ్ అయి ఉంటుంది. ఎస్బీఐ ఏటీఎం లేదా పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్ ద్వారా డెబిట్ కార్డు స్వైప్ ఫెయిల్ అయిన ప్రతీసారి రూ.17ను వసూలు చేయనుంది. అదేవిధంగా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు రూ.25 ఛార్జీ వేయబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇలాంటి లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. కొంతమంది బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోకుండా.. డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారని బ్యాంకులు చెబుతున్నాయి. ఒకటికి రెండు సార్లు ఇలా డ్రా చేయడానికి ప్రయత్నిస్తుంటారని, ఇష్టానుసారం డెబిట్ కార్డులను వాడేస్తున్నారని పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుత సిస్టమ్లో యాంటీ-డిజిటల్ ఎక్కువగా ఉందని, ఎక్కువ సేవింగ్స్ లేనివారికి ఇది అనవసరమైన రిస్క్ అని ఐఐటీ బొంబై ప్రొఫెసర్ అన్నారు. ఈ ఛార్జీలు డిజిటల్ పేమెంట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ఒకవేళ డెబిట్ కార్డులు దుర్వినియోగమవుతున్నాయని బ్యాంకులు భావిస్తే, ఇలాంటి లావాదేవీలను నెలకు ఉచితంగా రెండు అందించాలని దాస్ అన్నారు. చెక్ బౌన్స్ ఛార్జీల కంటే ఇది చాలా చాలా తక్కువ అని మరోవైపు బ్యాంకులు చెబుతున్నాయి. ఇది న్యాయమైన నిర్ణయమేనని బ్యాంకులు సమర్థించుకుంటున్నాయి. -
రూ. 2వేల దాకా డెబిట్ కార్డు చెల్లింపులపై చార్జీలు నిల్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డులు, భీమ్ యాప్ ద్వారా రూ.2,000 దాకా చెల్లింపులపై లావాదేవీల చార్జీలను రద్దు చేసింది. ఇటు కొనుగోలుదారులకు అటు వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా సదరు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీల భారాన్ని ప్రభుత్వమే రెండేళ్ల పాటు భరించనున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్వీటర్లో పోస్ట్ చేశారు. ‘డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చే దిశగా రూ.2,000 దాకా డెబిట్ కార్డులు/భీమ్ యాప్ లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్స్ ద్వారా చేసే చెల్లింపులపై లావాదేవీల చార్జీలను ప్రభుత్వమే బ్యాంకులకు రీయింబర్స్ చేస్తుంది. దీనితో వ్యాపారస్తులపై కూడా ఎలాంటి భారమూ ఉండదు‘ అని ఆయన పేర్కొన్నారు. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. తాజా నిర్ణయంతో ఖజానాపై రూ. 2,512 కోట్ల మేర ప్రభావం పడనుంది. -
త్వరలో రేషన్ నగదు రహితం!
కార్డు, ఆధార్ ద్వారా చెల్లింపులు న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఆధార్ ద్వారా చెల్లింపులకు అన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లు, ఎరువుల దుకాణాల్లో త్వరలో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మిషన్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 1.7 లక్షల పీఓఎస్లు పీడీఎస్ల్లో అమర్చామని, కొద్ది నెలల్లో మిగిలిన అన్ని దుకాణాల్లో అందుబాటులోకి తెస్తామని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లవసా తెలిపారు. ‘ఆహార– ప్రజా పంపిణీ, ఎరువుల విభాగాల వద్ద పీఓఎస్లను ఇన్ స్టాల్ చేయడానికి అవసరమైన ప్రోగ్రామ్ ఉంది. వాటిల్లో ఆధార్ ద్వారా కూడా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకొంటాం. లక్ష గ్రామాల్లో రెండేసి మిషన్ల చొప్పున ఏర్పాటు కోసం ఆర్థిక సహకారం అందించేందుకు నాబార్డు ముందుకు వచ్చింది’ అని అశోక్ చెప్పారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా లాభమెంతన్నది అంచనాకు రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టవచ్చని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. -
కేటుగాళ్లున్నారు ’క్రెడిట్, డెబిట్ కార్డులు’ జాగ్రత్త
-
పాడి రైతులకు డెబిట్ కార్డులు
-
పాడి రైతులకు డెబిట్ కార్డులు
• ‘విజయ డెయిరీ’కి పాలు పోసే రైతులకు వెసులుబాటు • పశు సంవర్థక శాఖ నిర్ణయం... త్వరలో అందుబాటులోకి సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీకి పాలు పోసే రైతులందరికీ డెబిట్కార్డులు ఇప్పిం చాలని పశు సంవర్థక శాఖ నిర్ణరుుంచింది. సంబంధిత బ్యాంకు అధికారులతో చర్చించి త్వరలో కార్డులను రైతులకు అందజేస్తారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో విజయ డెరుురీ రైతులకు చెల్లించే సొమ్మును ఆన్లైన్ ద్వారా వారి ఖాతాల్లో జమ చేయాలని డెరుురీ ఇటీ వలే నిర్ణరుుంచి ఏర్పాట్లు కూడా చేసింది. పాడి రైతులందరికీ ‘జీరో బ్యాలెన్స’ కింద బ్యాంకు ఖాతాలున్నా వారికి డెబిట్ కార్డులు ఇవ్వలేదు. ప్రత్యేక అంశంగా పరిగణించి జీరో బ్యాలెన్సలోనే డెబిట్కార్డులు ఇవ్వాలని బ్యాంకులను పశు సంవర్థక శాఖ కోరనుంది. తెలంగాణలో విజయడెరుురీకి రోజూ 63 వేల మంది రైతులు దాదాపు 5 లక్షల లీటర్ల పాలు పోస్తుంటాన్నారు. అందుకోసం డెరుురీ ఏడాదికి రూ.350 కోట్లు రైతులకు చెల్లిస్తోంది. లీటరుకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తోంది. దాని ప్రకారం ఏడాదికి రూ.72 కోట్లు ఇస్తున్నారు. 15 రోజులకోసారి పాడి రైతు ఖాతాలకు సొమ్ము ను విడుదల చేస్తారు. సొమ్మును రైతులు డెబిట్కార్డుల ద్వారా ఏటీఎం నుంచి తెచ్చు కోవచ్చు. ఆన్లైన్లోనూ సరుకులు కొనుక్కోవచ్చు. చేపల మార్కెట్లకు స్వైపింగ్ మిషన్లు హైదరాబాద్లో చేపల మార్కెట్లపై పెద్ద నోట్ల ప్రభావం పడింది. దీంతో ఆయా మార్కెట్లు వ్యాపారం లేక కుదేలయ్యారుు. 4 సహకార చేపల కేంద్రాలు, ఆరు మొబైల్ చేపల మార్కెట్లలో విక్రయాలు పెద్దఎత్తున నిలిచిపోయారుు. చిల్లర సమస్య తలెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ స్వైపింగ్ మిషన్లు ఇవ్వాలని నిర్ణరుుంచినట్లు పశుసంవర్థకశాఖ వర్గాలు పేర్కొన్నారుు. స్వైపింగ్ మిషన్లకు ఆర్డర్ ఇచ్చామని, రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు పేర్కొంటున్నారు. -
నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచండి
– జిల్లా అధికారులకు కలెక్టర్ సూచన కర్నూలు (అగ్రికల్చర్): నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. సోమవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ఆయా శాఖల్లో జిల్లా స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఆన్లైన్ లావాదేవీలకు చేపడితే ఆదర్శంగా ఉంటుందని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డులు ఉపయోగించవద్దని, వీటిని ఉపయోగించడంతో అప్పుల భారం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డెబిట్ కార్డులను, రూపే కార్డులతో మాత్రమే లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. నగదు రహిత లావాదేవీల అంశాన్ని ప్రతి జిల్లా అధికారి సీరియస్గా తీసుకొని, సిబ్బందిని అప్రమత్తం చేసి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్లపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాకు అవసరమైనన్ని పీఓపీ మిషన్లు, మినీ మైక్రో ఏటీఎంలు వస్తున్నాయని, జిల్లా అంతటా నగదు రహిత లావాదేవీలు నిర్వహిçస్తే నగదు కొరత నుంచి బయటపడవచ్చని సూచించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్గౌడ్, సీపీఓ ఆనందనాయక్, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘స్వైపింగ్’ యంత్రాలకు డిమాండ్!
గిరాకీని కాపాడుకునేందుకు హైదరాబాద్లో వ్యాపారుల యత్నం - మంగళవారం పలు బ్యాంకులకు సుమారు మూడువేల వినతులు - పది జాతీయ బ్యాంకులు సహా ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్న వైనం - నిబంధనలను సడలించాలని కోరుతున్న వ్యాపారులు సాక్షి, హైదరాబాద్: ప్రజల చేతిలో చిల్లర లేదు.. దుకాణాల్లో గిరాకీ లేదు.. దీంతో తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి దుకాణ నిర్వాహకులు స్వైపింగ్ యంత్రాల కోసం బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు స్వైపింగ్ చేసే యంత్రాలకు ఇప్పుడు గిరాకీ పెరిగింది. హైదరాబాద్లోని వ్యాపారులు గిరాకీని కాపాడుకునేందుకు స్వైపింగ్ యంత్రాలు కావాలంటూ ఎస్బీఐ, సెంట్రల్బ్యాంక్, ఎస్బీహెచ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర పది జాతీయ బ్యాంకులతో సహా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్మహీంద్ర వంటి ప్రైవేటు బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. రోజూ వేల రూపాయల వ్యాపారం నిర్వహించే తినుబండారాల దుకాణదారులు, ఫుట్పాత్, వీధి వ్యాపారులు కూడా ఈ యంత్రాలుంటేనే తమ వ్యాపారానికి ఢోకా ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఒకే రోజు ఆయా బ్యాంకులకు సుమారు మూడువేల స్వైపింగ్ యంత్రాలు కావాలంటూ నుంచి విజ్ఞప్తులు అందినట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు తెలపడం గమనార్హం. ఈనెల 8 నుంచి బహిరంగ మార్కెట్లో రూ.500, వెరుు్య నోట్ల చలామణి కష్టతరం కావడం, చిల్లర కష్టాలు మొదలైన నేపథ్యంలో ఈ యంత్రాలకు గిరాకీ పెరిగినట్లు తెలిసింది. కాగా ఈ యంత్రాలను పొందడం అందరికీ సాధ్యపడడం లేదు. మూడేళ్ల ఐటీ రిటర్న్స్, పాన్కార్డు, చిరునామా ధ్రువీకరణ, వ్యాట్, లేబర్ సర్టిఫికెట్ వంటి ప్రభుత్వ పరమైన గుర్తింపులు, ధ్రువీకరణలు కలిగి ఉన్న కరెంట్ అకౌంట్ వినియోగదారులకు మాత్రమే ఈ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. వీధి వ్యాపారాల్లో అధికంగా కూరగాయలు, పండ్లు, టీ, బ్యాగులు, ఫ్యాన్సీ ఐటమ్స్, తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు ఉన్నారుు. వీరిలో 70 శాతం మంది మాత్రమే బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, ఇందులోనూ ఎక్కువగా సేవింగ్స్ అకౌంట్లున్నవారే కావడం గమనార్హం. ఒకవేళ బ్యాంకు అకౌంట్ ఉన్నప్పటికీ ప్రస్తుత బ్యాంకుల నిబంధనల ప్రకారం స్వైపింగ్ యంత్రాలు పొందే అర్హతలున్నవారు సగం మంది మాత్రమే ఉన్నారని ఆయా వ్యాపారాలు నిర్వహించేవారు వాపోతున్నారు. బ్యాంకు అకౌంట్ కలిగిన ప్రతి వ్యాపారికి ఈ యంత్రాలను సరఫరా చేసి నెలవారీ అద్దె వసూలు చేసుకోవాలని ఆయా వ్యాపారులు బ్యాంకర్లను కోరుతున్నారు. -
కార్డు పేమెంట్ నెట్వర్క్స్ హ్యాంగ్!
ముంబై : మొట్టమొదటిసారి డెబిట్ కార్డు యూజర్లు నెట్వర్క్ ఫెయిల్యూర్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతకుక్రితం 8 శాతంకంటే తక్కువగా ఉన్న ఈ లావాదేవీలు, రికార్డు స్థాయిలో 23 శాతం జంప్ అయ్యాయి. దీంతో కార్డు పేమెంట్ నెట్వర్క్ నెమ్మదించి లావాదేవీలు ఫెయిల్ అవుతునట్టు తెలుస్తోంది. లావాదేవీల విఫలం ఎక్కువగా తప్పుడు పిన్ నమోదు చేయడంతో జరుగుతున్నట్టు సమాచారం. తప్పుడు పిన్ నమోదు సగటున అప్పట్లో 2 శాతం ఉండేవని, ప్రస్తుతం అవి 11 శాతానికి ఎగిసినట్టు పేమెంట్ కంపెనీలు పేర్కొంటున్నాయి.. పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయంతో డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలు పెరిగాయని, ఈ నేపథ్యంలో కార్డు యూజర్లు నెట్వర్క్ విఫలపరిస్థితులను చవిచూడాల్సి వస్తోందని తెలుపుతున్నాయి.. సాధారణంగా కస్టమర్లు ఒక్కసారి పిన్ నెంబర్ తప్పుగా నమోదుచేస్తే, తర్వాతి రౌండ్లో సరైన పిన్ నమోదుతో లావాదేవీలు జరుపుకోవచ్చు. కానీ పెద్దనోట్ల రద్దుతో ఎప్పుడూ కార్డు లావాదేవీలు వాడని వారు కూడా ఈ మార్గం వైపుమొగ్గుచూపుతున్నారు. దీనిపై వారికి సరైన అవగాహన లేకపోవడంతో వారు పలుమార్లు తప్పుడు పిన్ నెంబర్లనే నమోదుచేస్తున్నట్టు పేమెంట్ కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఎక్కువసార్లు తప్పుడు పిన్ ఎంట్రీ చేయడాన్ని పేమెంట్ నెట్వర్క్ సిస్టమ్స్ కార్డు దొంగతనంగా పరిగణించి, కార్డును లేదా పీఓఎస్ మెషిన్ అయినా లాక్ చేస్తాయని పేర్కొంటున్నారు. కార్డు యూజర్లు ఈ విషయాలపై ఫిర్యాదులు ఇస్తుండగా.. తమ నెట్వర్క్లో ఎలాంటి సమస్య లేదని బ్యాంకులు చెబుతున్నాయి. సమస్యను గుర్తించిన పేమెంట్ కంపెనీలు, రికార్డు స్థాయిలో కార్డు వాడకానికి బ్యాంకులు సన్నద్ధం కాకపోవడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. అధిక విలువ కలిగిన నోట్ల విత్డ్రాలతో కొన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల డెబిల్ కార్డు వాడకం 300 శాతానికి ఎగిసిందని పేర్కొన్నారు. భారత్లో మొత్తం 70 కోట్ల డెబిట్ కార్డుదారులున్నారు. చాలామంది ప్రధానమంత్రి జన్ధన్ యోజనా కార్డులను జారీచేసిన వాళ్లే. ఈ కార్డులను ఇప్పటివరకు ఏ స్టోర్లోనూ వాడటం చేయలేదు. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటివరకు డెబిట్ కార్డులు వాడని వారు పెద్ద పెద్ద దుకాణాల్లో ఈ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారు. -
ఆ బ్యాంకు కస్టమర్లకు కొత్త డెబిట్ కార్డులు
పుణే : ఆరు లక్షలకు పైగా డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తూ కస్టమర్లకు షాకిచ్చిన దేశీయ అగ్రశ్రేణి బ్యాంకు ఎస్బీఐ, వారికి కొత్త కార్డులను జారీచేస్తోంది. ఇటీవలే హితాచీ పేమెంట్స్ సర్వీసెస్లో మాల్వేర్ ఇనెక్షన్ వల్ల దాదాపు 32 లక్షల డెబిట్ కార్డుల తస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ భారీ సైబర్ దాడిలో ఆరు లక్షల ఎస్బీఐ ఖాతాదారుల సమాచారం ప్రభావితమైందని తెలిసింది. దీంతో ఎస్బీఐ ఆ కస్టమర్ల కార్డులను బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన 6.29 లక్షల కార్డులను రీప్లేస్మెంట్లో కొత్త కార్డులను మంజూరు చేస్తున్నట్టు ఎస్బీఐ తెలిపింది. భారతీయ బ్యాంకింగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద రీప్లేస్మెంట్. 95.5 శాతం కార్డులను అక్టోబర్ 26న మంజూరు చేశామని, మిగతావారి కాంటాక్ట్ సమాచారం రాబట్టే ప్రయత్నంలో ఉన్నామని బ్యాంకు తెలిపింది. ఇప్పటి వరకూ వారు సంబంధిత బ్రాంచ్ల వద్ద సమాచారం అప్డేట్ చేయించుకోలేదని ఎస్బీఐ కార్పొరేట్ స్ట్రాటజీ, న్యూ బిజినెస్ డిప్యూటీ ఎండీ మంజు అగర్వాల్ చెప్పారు. ఆ కస్టమర్లు కూడా బ్రాంచ్లను వద్ద సంప్రదించి, కొత్త కార్డులను తీసుకెళ్లాలని పేర్కొన్నారు. మొత్తం 19 వివిధ బ్యాంకులపై ఈ సైబర్ అటాక్ జరిగింది. ఈ దాడిలో 32 లక్షల డెబిట్ కార్డుల సమాచారం తస్కరణకు గురైంది. -
కార్డులు...కష్టాలు!
బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల్ని తీసుకోవడం ఒకప్పుడు ఎంతో ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. కొండచిలువను తలపించే లైన్లు, ఎంతకీ తెమలని పనులు, కౌంటర్ దగ్గర సిబ్బంది విసుగుదలలు సర్వసాధారణం. ఇప్పుడు కోరుకున్న క్షణంలో దర్జాగా డబ్బు తీసుకునే సదుపాయం వచ్చేసింది. అవసరాలు, ఆపత్సమయాల్లో క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు పొందే సౌకర్యం కూడా లభించింది. అయితే ఈ ప్రక్రియలో పొంచి ఉన్న ప్రమాదాలు ఇప్పటికే అక్కడక్కడ బయట పడుతున్నాయి. కానీ గురువారం వెల్లడైన అంశాలు వీటన్నిటినీ తలదన్నాయి. బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు ఆంధ్రాబ్యాంకు, ఐసీఐసీఐ సహా 19 బ్యాంకులకు సంబంధించిన డెబిట్ కార్డుల సమాచారాన్ని అంతర్జాతీయ నేరగాళ్లు తస్కరించారని వచ్చిన వార్త ప్రజలను భయకంపితుల్ని చేసింది. పర్యవసానంగా 32 లక్షలమంది ఖాతాదారుల కార్డుల్ని బ్యాంకులు స్తంభింపజేయాల్సివచ్చింది. అయితే ఈలోగానే వివిధ ఖాతాల నుంచి భారీ మొత్తంలో నేరగాళ్లు డబ్బు కొల్లగొట్టారంటున్నారు. ఇప్పటికే వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కోటి ముప్ఫై లక్షల మొత్తం వరకూ కైంకర్యం అయి ఉండొచ్చునని నిర్ధా రించారు. మరికొన్ని రోజుల తర్వాతగానీ నష్టం ఎంతన్నది నికరంగా తెలియదు. సైబర్ ప్రపంచం ఆవిర్భావం వెనకే సైబర్ నేరగాళ్లు కూడా పుట్టుకొచ్చారు. ఖాతాదారులకు బ్యాంకింగ్ రంగం కల్పిస్తున్న సౌకర్యాలను ఆసరా చేసుకుని ఏటా వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఏటీఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్... ఇలా ఎన్నో రకాలైన ప్రక్రియ లను వినియోగదారులకు బ్యాంకులు అందుబాటులోకి తెచ్చాయి. కలం, కాగితం అవసరం లేకుండా దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా సొమ్ము బదిలీ చేసే ఈ ప్రక్రి యలన్నిటిపైనా నేరగాళ్ల నీడ పడటం ఆందోళన కలిగించే విషయం. 2013-14లో ఈ నేరగాళ్లు మన దేశంలో ఆన్లైన్ మోసాల ద్వారా రూ. 7,542 కోట్లు కొల్ల గొట్టగా... ఆ మరుసటి సంవత్సరానికల్లా అది రూ. 12,000 కోట్లకు చేరింది. అంటే దాదాపు 60 శాతం పెరిగిందన్న మాట! ఈ దోపిడీ 27,614 క్రెడిట్ కార్డుల ద్వారా, 3,835 డెబిట్ కార్డుల ద్వారా, 1,969 ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల ద్వారా జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. డబ్బుల లావాదేవీలు సమస్తం ఆన్లైన్ చేయడం ద్వారా దేశంలో నల్లడబ్బును అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పిం చింది. పన్నుల వసూళ్ల ద్వారా గరిష్టంగా ఆదాయాన్ని రాబట్టాలని కోరుకుం టోంది. అదే సమయంలో ఈ లావాదేవీలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా పకడ్బందీ భద్రతను కల్పించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు తరచుగా భరోసా ఇస్తోంది. తదనుగుణంగా పటిష్టమైన వ్యవస్థను అమల్లో పెట్టామని బ్యాంకులు చెబుతున్నాయి. తీరా జరిగే మోసాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. సైబర్ ప్రపంచమన్నది అడుగడుగునా మందుపాతరలుండే ప్రమాదకరమైన ప్రాంతంలాంటిది. పైకి అంతా సవ్యంగా ఉన్నట్టు, ప్రశాంతంగా గడిచిపోతున్నట్టు కనిపించినా ఎక్కడో ఏదో అపసవ్యత చోటుచేసుకోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. అలాంటి స్థితి ఏర్పడకుండా చూసే పనిలో ఉన్నవారు అత్యంత అప్ర మత్తంగా ఉండక తప్పదు. ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా, అలసత్వాన్ని చూపినా జరిగే నష్టం అపారంగా ఉంటుంది. సాఫ్ట్వేర్లో బలహీనమైన లింక్ను పట్టుకోవడానికి సైబర్ నేరగాళ్లు రాత్రింబగళ్లు గాలిస్తుంటారు. దొంగ సాఫ్ట్వేర్ను జొప్పించి సమస్త సమాచారాన్ని క్షణంలో లాగేస్తారు. దేశంలో ప్రధానంగా వివిధ బ్యాంకుల లావాదేవీల వ్యవహారాలను చూసే మూడు సంస్థలు వీసా, మాస్టర్ కార్డ్, రూపే సర్వర్లలోకి జొరబడటం ద్వారా ఖాతాదార్ల సమాచారాన్ని నేరగాళ్లు రాబట్టారు. వారు ఉపయోగించిన దొంగ సాఫ్ట్వేర్ ఎంత చాకచక్యంతో కూడుకున్న దంటే... వచ్చిన పని కానిచ్చాక ఆ సాఫ్ట్వేర్ దానంతటదే కనుమరుగైపోతుంది. సర్వర్లలో అందుకు సంబంధించిన ఎలాంటి జాడల్ని వదిలిపెట్టదు. కొమ్ములు తిరిగిన నిపుణులు కూడా దాన్ని పసిగట్టడం సాధ్యం కాదని చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు సాంకేతికంగా ఇంతటి అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటే చెల్లింపు లను నిర్వహించే ఆ మూడు సంస్థలూ, వాటితో అనుసంధానమైన బ్యాంకులు అందుకు దీటైనవిధంగా స్పందించగలిగాయా? తమ తమ సర్వర్లను భద్రంగా ఉంచుకోవడానికి తగిన సాంకేతికతనూ, నైపుణ్యాన్ని సొంతం చేసుకోగలిగాయా? వాటి సంగతలా ఉంచి సైబర్ దాడులకు సంబంధించి వస్తున్న వరస ఫిర్యాదులను కూడా అవి సకాలంలో పట్టించుకోలేకపోయాయి. అలా పట్టించుకుంటే నష్టం పరి మిత స్థాయిలో ఉండేదని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని వారాలుగా ఖాతాదార్లకు వ్యక్తిగత ఈమెయిల్ వినతులు, ఎస్ఎంఎస్ సందేశాలు పంపి, పిన్ నంబర్లు మార్చుకోమని బ్యాంకులు కోరడం నిజమే అయినా...అంతవరకూ జరి గిన దోపిడీని మీడియా ద్వారా బహిరంగపరిచి, మరే స్థాయి ముప్పు పొంచి ఉన్నదో అప్రమత్తం చేసి ఉంటే వేరుగా ఉండేది. ఆ దోపిడీ తీవ్రత అర్ధమయ్యేది. ఆ విషయంలో జాప్యం చోటుచేసుకోవడం వల్ల సైబర్ నేరగాళ్లకు అది మరింతగా ఉపయోగపడింది. ఆన్లైన్ లావాదేవీల వ్యవహారం సౌకర్యవంతమైనదే అయినా అంతకుమించిన ప్రమాదంతో కూడుకున్నదని తాజా ఉదంతం తెలియజెబుతోంది. ఈ అనుభవమైనా మరింత పటిష్టమైన నిఘాకు దారితీయాలి. ఆధార్ కార్డుల కోసం పౌరుల సమస్త సమాచారం సేకరించడాన్ని పౌర సమాజ కార్యకర్తలు తప్పు బట్టింది ఇలాంటి సమస్యలుంటాయన్న కారణంతోనే. పౌరుల డేటా నేరగాళ్ల చేతుల్లో పడుతున్నదని, దుర్వినియోగమవుతున్నదని... ఎన్నో ఇబ్బందులు తలెత్తు తున్నాయని అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు సైతం గ్రహించి ఆ కార్యక్రమాలు విర మించుకున్నాయి. మనకు పటిష్టమైన ఐటీ చట్టం ఉన్నదని, లీకేజీలు అసాధ్యమని యూపీఏ ప్రభుత్వం నమ్మబలికి ఆధార్ను అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు డెబిట్ కార్డుల బాగోతం వెలుగులో ఆధార్ను పునస్సమీక్షించడం అవసరమని గుర్తిస్తే మంచిది. -
సైబర్ ఎటాక్లో ఎస్బీఐ నష్టం ఎంత?
ముంబై: ఆరు లక్షలకు పైగా డెబిట్ కార్డులను బ్లాక్ చేసినట్టు ధృవీకరించిన ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ కార్డు వినియోగదారుల గుండెల్లో బాంబు పేల్చింది. హితాచీ పేమెంట్స్ సర్వీసెస్లో మాల్వేర్ ఇనెక్షన్ వల్లే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్న ఈ భారీ సైబర్ దాడిలో దాదాపు 30 లక్షల కార్డులు ప్రభావితమయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల సొంత ఏటీఎంలలో ఇబ్బంది ఏమీ రాలేదని మిగిలిన ప్రభుత్వ బ్యాంకులు చెబుతున్నప్పటికీ అతిపెద్ద ప్రభుత్వంరంగ బ్యాంకు ఎస్బీఐ మాత్రం అతిపెద్ద బాధితురాలిగా మిగిలింది. దాదాపు 12.5లక్షల రూపాయలను నష్టపోయినట్టు ఇది మరింత పెరిగే అవకాశ ఉందని తెలుస్తోంది.మరోవైపు 19 బ్యాంకుల నుంచి 641 ఫిర్యాదులు అందాయనీ బ్యాంకుల ప్రకటన ఆధారంగా ఇప్పటివరకు 1.3 కోట్ల నష్టం జరిగినట్టు ఎన్పీసీఐ ధృవీకరించింది. అటు ఎస్బీఐ ఏటిఎం సెంటర్లను మాత్రమే వాడాలని, మరో వారం పదిరోజుల్లో బ్లాక్ చేసిన కార్డుల స్తానంలో కొత్త కార్డులు జారీ చేయనున్నట్టు చీఫ్ జనరల్ మేనేజర్ (కోలకత్తా సర్కిల్ ) పార్థా ప్రతీం సేన్ గుప్త శుక్రవారం తెలిపారు. రెండు రోజులు ప్రకంపనలు రేపుతున్న ఈ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే జోక్యం చేసుకుంది.ప్రభుత్వ ఆధికారులు అందించిన సమాచారం ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు బ్యాంక్ చైర్మన్ అరుంధతి భట్టాచార్య తో మాట్లాడుతున్నారు అవసరమైన చోట డెబిట్ కార్డుల జారీచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కి సూచించారు. బ్యాంక్ వినియోగదారుల రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఆర్థిక మంత్రిత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దాదాపు అన్ని డెబిట్ కార్డులను పూర్తి ఉచితంగా రీప్లేస్ చేయేందుకు బ్యాంకులు నిర్ణయించాయని చెప్పారు. కాగా ప్రస్తుతం ప్రభావితమైన కొన్ని డెబిట్ కార్డులను స్తంభింప చేసి, కొత్తవి జారీ చేస్తున్నామనీ, దీంతోపాటుగా పిన్ నెంబర్లు మార్చుకోవాల్సిందిగా మరికొందరికిసూచించినట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా మే,జులై మధ్య అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టుగా సెప్టెంబరులో గుర్తించినట్లు ఎస్బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మంజు అగర్వాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
30లక్షల డెబిట్ కార్డుల సమాచారం లీక్?
ముంబై: దేశంలోని డెబిట్ కార్డుల వివరాలు పెద్దమొత్తంలో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోవడాన్ని అతిపెద్ద ఆర్థిక డేటాల ఉల్లంఘనగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దాదాపు 30 లక్షలకు పైగా (3.2 మిలియన్ ) కార్డుల డాటా తస్కరించబడిందని సమాచారం. వీటిల్లో సుమారు 20 లక్షలకు పైగా (2.6 మిలియన్ల) వీసా, మాస్టర్ కార్డులు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని గుర్తించడానికి సుమారు ఆరు వారాల పట్టిందనీ ఈ సమయంలో హిటాచీ నెట్వర్క్ లో ఉపయోగించిన సుమారు 3.2 మిలియన్ల కార్డుల సమాచారాన్ని హ్యాకర్లు సేకరించారని చెబుతున్నారు. ముఖ్యంగా చైనాలోని వివిధ ఏటీఎం సెంటర్లలో, విక్రయ కేంద్రాల్లో అనధికారిక లావేదేవీలు, కొనుగోలు జరిగినట్టుగా బాధితులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై విచారణకు ఆదేశించినట్టు నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ)ఎండీ ఏపీ హోతా తెలిపారు. బ్యాంకులనుంచి తమకు ఫిర్యాదులు అందాయనీ, ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగింది అనేది విచారిస్తున్నామని తెలిపారు. బ్యాంకులు, డెబిట్ కార్డుల సమాచారం భారీ ఎత్తున లీక్ అయిందనే అంచనాలతో దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎం పిన్ నంబర్ ను మార్చుకోవాలని సూచిస్తున్నాయి. పిన్ లేకుండా జరిగే అంతర్జాతీయ లావాదేవీలనన్నింటినీ నిలిపివేశాయి ఇప్పటికే ఆరున్నర లక్షల డెబిట్ కార్డులను బ్లాక్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీరందరికీ కొత్త కార్డులను ఇవ్వనున్నట్టు తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగానే సుమారు 6 లక్షలకు పైగా కార్డులను బ్లాక్ చేశామని తమ ఏటీఎంలో ఎలాంటి అక్రమాలు జరగడంలేదని ఖాతాదారులకు భరోసా ఇచ్చినట్టు బ్యాంకు సమాచార అధికారి మృత్యుంజయ్ మహాపా త్ర తెలిపారు. ఈ వ్యవహారంలో సుమారు రెండు వారాల క్రితమే చర్యలు తీసుకున్నామని హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ తెలిపింది. పిన్ లు మార్చుకోమని సలహా ఇవ్వడంతోపాటు, ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడొద్దని కోరినట్టు బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. వీసా, మాస్టర్ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, ఎస్ బ్యాంకులనుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. -
కార్డుదారులూ...తస్మాత్ జాగ్రత్త..!
-ఓ పక్క క్లోనింగ్... మరోపక్క స్కిమ్మింగ్ -నిత్యం సైబర్ క్రై మ్ పోలీసులకు ఫిర్యాదులు -నిత్యం మోసపోతున్నది కనీసం 15 మంది -కనీస జాగ్రత్తలే మేలంటున్న అధికారులు సాక్షి, సిటీబ్యూరో ప్లాస్టిక్ మనీగా పిలిచే క్రెడిట్/డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. జీతాలు తీసుకోవడం మొదలుకొని షాపింగ్ చేసే వరకు ఇప్పుడు ప్రతి చోటా ప్లాస్టిక్ కరెన్సీనే వాడుతుండటంతో జీవితంగా భాగంగా మారిపోయాయి. దీన్నే కొందరు ఆసరాగా చేసుకుని హైటెక్ మోసాలకు పాల్పడుతున్నారు. సీసీఎస్ ఆధీనంలోని సైబర్క్రై మ్ పోలీసులకు ప్రతి రోజూ 15 ఫిర్యాదులు వస్తున్నాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. షాపింగ్ చేసేప్పుడు, రెస్టారెంట్లుకు వెళ్లేప్పుడు నోట్ల కట్టలతో తిరిగే బదులు అంతా వీటి వినియోగానికే మొగ్గుచూపున్నారు. ఇది ఈ కార్డులకు సంబంధించిన ఒక కోణం మాత్రమే. సాంకేతిక పరిఙ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్లాస్టిక్ కరెన్సీని దుర్వినియోగం చేయడం మరో కోణం. ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించి క్లోనింగ్, స్కిమ్మింగ్ ఉదంతాలు పెరిగిపోయాయి. అనేక వ్యవస్థీకత ముఠాలు రంగంలోకి దిగి విజంభిస్తున్నాయి. మరోపక్క బ్యాంకుల పేర్లతో ఫోన్లు చేసి కార్డు వివరాలు తెలుసుకుని అందినకాడికి దండుకుంటున్న ముఠాలు అనేకం ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కార్డుల వినియోగం, జరిగే మోసాలు, జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... స్కిమ్మింగ్ ఏమిటి..? ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా స్కిమ్మింగ్ పెరిగిపోయింది. ఈ ముఠాలు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ తదితర ప్రదేశాల్లో ఉండే బాయ్స్ను ప్రలోభాలకు లోను చేసిన తమ వైపు తిప్పుకుంటారు. వినియోగదారుడు అక్కడకు వెళ్లిన సందర్భంలో బిల్లు చెల్లించడానికి కార్డులు ఇచ్చినప్పుడు వాటిని స్కిమ్ చేస్తారు. దీనికోసం వాడే స్కిమ్మర్ అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటాయి. కార్డుని ఒక్కసారి అందులో స్వైప్ చేస్తే చాలు... దాని డేటా మొత్తం అందులో నిక్షిప్తమైపోతుంది. అంటే మన కార్డు గుట్టు వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. మరోపక్క ఏటీఎం సెంటర్లలో ఫిక్స్ చేసే స్కిమ్మర్లూ ఉన్నాయి. వీటిని ఏటీఎం మిషన్లో కార్డులను ఇన్సర్ట్ చేసే ప్రదేశంలో ఫిక్స్ చేస్తారు. డబ్బు డ్రా చేసుకోవడానికి వెళ్లిన వినియోగదారుడు కార్డును ఇన్సర్ట్ చేయగానే... అక్కడ ఏర్పాటు చేసిన స్కిమ్మర్ డేటాను గ్రహిస్తుంది. క్లోనింగ్.. ఈ విధానంలో వినియోగదారుడు తాను మోసపోయానని గుర్తించడానికీ చాలా కాలం పడుతుంది. క్లోనింగ్ చే సే ముఠాలకు కార్డులు అందుబాటులో ఉండాల్సిన పని లేదు. వీరికి ఇంటర్నెట్ ప్రధాన ఆధారం. బ్యాంకులకు సంబంధించిన వెబ్సైట్లు హ్యాక్ చేయడం, కొందరు బ్యాంకు సిబ్బందిని ప్రలోభ పెట్టడం ద్వారా అక్కడుండే కార్డు హోల్డర్ల డేటా సేకరిస్తారు. మరోపక్క ఆన్లైన్ షాపింగ్ అంటూ ఎరవేయడం ద్వారా... వినియోగదారుల వివరాలు వెరిఫికేషన్ చేస్తున్నామంటూ ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్లు పంపించి, పూర్తి సెక్యూర్డ్ కాని వెబ్సైట్స్లో ఆన్లైన్ షాపింగ్ చేసే సందర్భంలోనూ కార్డు హోల్డర్ల డేటా తీసుకుంటారు. మరికొన్ని సందర్భాల్లో పరిచయస్తుల కార్డులకు సంబంధించిన వివరాలను చోరీ చేస్తారు. బోగస్ తయారీ ఇలా.. ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించిన డేటా ముష్కరుల చేతికి చేరిన తరవాత... స్కిమ్మింగ్, క్లోనింగ్ కార్డులను తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కంప్యూటర్, కార్డు రైటర్, కార్డు మేకర్, మేగ్నెటిక్ స్ట్రిప్, ఎమ్టీ కార్డులు... ఇవన్నీ ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకుని బోగస్ కార్డుల తయారీని ‘కుటీర పరిశ్రమలా’ స్థాపించేస్తున్నారు. కంప్యూటర్ను వినియోగించి తాము సేకరించిన డేటాను కార్డు రైటర్ పంపిస్తారు. అక్కడ నుంచి ఎమ్టీ కార్డుల్లో మేగ్నెటిక్ స్ట్రిప్ ఏర్పాటు చేసి వాటిని రైటర్లో పెట్టడం ద్వారా డేటా మొత్తం ఫీడ్ చేస్తారు. కార్డు మేకర్లో ఉంచి సంబంధిత బ్యాంకు డిజైన్తో బోగస్ కార్డులు తయారవుతాయి. ఇవి అసలు కార్డులకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి. ఈ కార్డులతో ముష్కరులు షాపింగ్ చేసుకుంటే... బిల్లులు మాత్రం అసలు కార్డు హోల్డర్కు వచ్చి చేరతాయి. కాస్త అప్రమత్తంగా ఉంటే... - ఏక్కడైనా బిల్లు చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డులను ఇస్తే... వాటిపైనే దష్టి పెట్టి ఉంచండి. - పూర్తిగా పరిచయస్తులు కాని వారికి క్రెడిట్ కార్డుల వివరాలు, పిన్ నెంబర్లు చెప్పకండి. - కార్డును అందుకున్న వెంటనే దాని వెనుక వైపు తప్పకుండా సంతకం చేయాలి. - కార్డు వెనుక ఉండే సీసీవీ కోడ్లోని చివరి మూడు అంకెలూ భద్రమైన చోట రాసిపెట్టుకుని, కార్డుపై లేకుండా తుడిచేయండి. - సెక్యూర్డ్ కాని వెబ్సైట్స్లో ఆన్లైన్ షాపింగ్ చేయవద్దు. - అవసరమైన క్రెడిట్ కార్డులు మాత్రమే మీతో ఉంచుకోండి. - ఏటీఎం సెంటర్లకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి. - కార్డుపైన, దాని కవర్ పైన ఎట్టిపరిస్థితిల్లోనూ పిన్ నెంబర్ రాయద్దు. - కార్డు పోయినట్లయితే వెంటనే సంబంధిత బ్యాంక్ కాల్ సెంటర్కు ఫోన్ చేసి బ్లాక్ చేయించండి. - అపరిచితులు కాల్ సెంటర్ల నుంచి అంటూ ఫోన్ చేస్తే గుడ్డిగా నమ్మి కార్డు, బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పవద్దు. - దుకాణదారులు సైతం సంతకాలు లేని కార్డులను అనుమతించకూడదు. - పెద్ద ఎత్తున ట్రాన్స్క్షన్స్ జరిగిన సందర్భంలో వినియోగదారులు గుర్తింపు పత్రాలు అడిగి, వాటిని సరిచూసుకోవాలి. - క్రెడిట్ కార్డు రిసిప్ట్లను ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా పడేయకూడదు. - ప్రతి నెలా మీరు చేస్తున్న లావాదేవీల బిల్లులు జాగ్రత్త చేసుకుని, కార్డు స్టేట్మెంట్ వచ్చిన తరవాత సరిచూసుకోండి. - మీ కార్డు లావాదేవీలపై ఎలాంటి సందేహాలు వచ్చినా... వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించండి. -
డెబిట్ కార్డుల స్థానే ఉంగరాలు!
ఇక డెబిట్ కార్డులను మర్చిపోవాల్సిందే.. ఎందుకంటే వాటి స్థానాన్ని భర్తీ చేసే డెబిట్ రింగ్స్ వచ్చేస్తున్నాయట. ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే రియో ఒలంపిక్ గేమ్స్ లో వీటిని ప్రయోగాత్మకంగా వీసా ప్రవేశపెట్టనుంది. ఇవి అచ్చం మనం వేళ్లకు పెట్టుకునే ఉంగరాల్లా ఉంటాయి. వీసా డెబిట్ కార్డుకు అనుమతి లభించే అధికారిక ఈవెంట్స్ లో ఈసారి ప్రయోగాత్మమైన రూపంలో అథ్లెట్ల ముందుకు ఈ రింగ్స్ ను తీసుకురానుంది. 45 మంది ఒలింపిక్ అథెట్లకు ప్రీ పెయిడ్ డెబిట్ రింగ్లను ఇవ్వనున్నట్లు వీసా పేర్కొంది. ఈ టెక్నాలజీని మొదట అథ్లెట్లకు పరిచయం చేసి, ఆ తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ కొత్త టెక్నాలజీని పరీక్షించడానికి వీసా గ్లోబల్ ఈవెంట్స్ ను మార్గంగా ఎంచుకుంటోంది. ఈ రింగ్లో సెక్యూర్డ్ మైక్రోచిప్, ఎంబెడెడ్ యాంటెనా ఉన్నాయి. పైన కనిపించేదిగా బ్లాక్ అండ్ వైట్ సిరామిక్ లూప్ ను వీసా పొందుపరిచింది. ఈ రింగ్ కు ఎలాంటి బ్యాటరీ కానీ, చార్జింగ్ కానీ అవసరం లేదు. ఈ రింగ్తో ప్రీపెయిడ్ మొత్తాన్నిఅథ్లెట్లు పొందుతారు. వీసా కార్డులకు బదులుగా తీసుకురాబోయే ఈ పేమెంట్ రింగ్పై అథ్లెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాలెట్లు, కార్డులు తీసుకెళ్లడం చికాకు అని, యునిఫాం మార్చుకునే ప్రతిసారి వాటిని జాగ్రత్త చేసుకోవడం కష్టంగా ఉంటోందని చెబుతున్నారు. ఈ రింగ్ అయితే.. ఎంచక్కా వేలుకు ఉంగరంలా ధరించి దాంతోనే ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. వీసా రింగ్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని నాలుగుసార్లు స్విమింగ్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న మిస్సీ ఫ్రాంక్ లిన్ చెప్పారు. -
ఆంధ్రా బ్యాంక్ ‘ముద్రా’ కార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారస్తుల కోసం ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ ‘ముద్రా’ పేరుతో రూపే డెబిట్కార్డులను ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్రాలోన్స్లో భాగంగా ఎటువంటి క్రెడిట్ గ్యారంటీ లేకుండానే రూ. 10 లక్షలోపు రుణాలను బ్యాంకులు మంజూరు చేయనున్నాయి. ఇలా మంజూరైన రుణాలను వారి అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడానికి డెబిట్ కార్డుల రూపంలో అందిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈవో ఎస్.కె.కల్రా తెలిపారు. రూ. 50 వేలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు విభాగాల్లో మొత్తం మూడు రకాల కార్డులను జారీ చేస్తున్నట్లు తెలిపారు. చిన్న, సూక్ష్మ స్థాయి వ్యాపారాలకు పెద్ద ఎత్తున రుణాలను మంజూరు చేయడానికి కేంద్రం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది. ఈ ఏడాది ప్రభుత్వరంగ బ్యాంకులు కనీసం రూ. 70,000 కోట్ల విలువైన చిన్న మధ్యస్థాయి రంగాలకు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సలహాదారు సుబ్బారావు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో బ్యాంకు వారీ లక్ష్యాలను విడుదల చేయనున్నట్లు చెపాప్రాఉ. అంతక్రితం జరిగిన కార్యక్రమంలో ముద్రా కార్డును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతేడాది ఆంధ్రాబ్యాంక్ ఈ విభాగంలో రూ. 700 కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసిందని, ఈ ఏడాది రూ. 1,600 కోట్లు మంజూరు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించవచ్చని అంచనా వేస్తున్నట్లు కల్రా తెలిపారు. -
త్వరలో క్యాష్లెస్ ఇండియా....
న్యూఢిల్లీ : త్వరలో క్యాష్లెస్ ఇండియాను తయారు చేద్దామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇక నుంచి నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే జరిపేలా చూద్దామని ఆయన తెలిపారు. నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారా జరిగేలా ప్రోత్సహకాలు ఇస్తామన్నారు. నగదు లావాదేవీలు లేని దేశం వైపు అడుగులు వేద్దామని జైట్లీ అన్నారు. నల్లధనం అరికట్టేందుకు డెబిట్, క్రెడిట్ కార్డుల ఉపయోగించేలా చూద్దామన్నారు. అలాగే జన్ధన యోజన ఖాతాదారులకు డెబిట్ కార్డులు సదుపాయం కల్పిస్తామన్నారు. -
కార్డులన్నీ స్వైప్లో!
ఒకట్రెండు బ్యాంకుల క్రెడిట్, డెబిట్కార్డులు, ప్యాన్, ఆధార్ కార్డులు.. ఇంకొన్ని ఇతర కార్డులు - చాలామంది జేబుల్లో, పర్సుల్లో సాధారణంగా కనిపించేవే. ఇన్ని కార్డులు మోతబరువు అనుకున్నారో ఏమో... ఓ కంపెనీ స్వైప్ పేరుతో ఓ వినూత్నమైన కార్డును అందుబాటులోకి తెచ్చింది. అన్నికార్డుల సమాచారం ఈ ఒక్కదాంట్లోనే నిక్షిప్తం చేసుకోవడంతోపాటు ఎప్పుడు ఏ కార్డు వాడాలో మీరే నిర్ణయించుకునే సౌకర్యం ఉండటం ఈ హైటెక్ కార్డు ప్రత్యేకత. వివిధ కార్డుల సమాచారాన్ని అప్లోడ్ చేసేందుకు ఒక్కోదాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్వైప్తోపాటు ప్రత్యేకమైన రీడర్ను కూడా ఇస్తారు. స్కాన్ చేసిన ప్రతి కార్డు వివరం స్వైప్లో నిక్షిప్తమైన తరువాత పైన ఉన్న స్క్రాల్ బటన్ ద్వారా మీరు ఏ కార్డు వాడాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కో స్వైప్ కార్డులో దాదాపు 25 కార్డుల సమాచారం నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ తరహాకార్డుల్లో ఇదే అత్యధికం. -
అప్రమత్తంగా లేకపోతే సొమ్ము గల్లంతే!
క్రెడిట్ కార్డుల వినియోగంలో బహుపరాక్ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణుల సూచన మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ విధానాలను కొందరు మంచికి వినియోగిస్తుండగా.. మరి కొందరు చెడు సావాసాలు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకంలో ఆదమరిస్తే మీ అకౌంట్లో ఉన్న సొమ్ము మొత్తం మాయమయ్యే పరిస్థితి ఉంది. షాపింగ్, మరేదైనా హోటల్కు వెళ్లినప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డులను వాడే సమయంలో అత్యంత జాగ్రత్తగా సరి చూసుకోవాలి. కొన్నిసార్లు మీరు షాపింగ్ చే యకున్నా.. కార్డు ఉపయోగించి డబ్బులు చెల్లించినట్టు బిల్లు వస్తుంది. ఇటువంటి సమయాల్లో తగు జాగ్రత్తలు పాటిం చాలని నిపుణులు సూచిస్తున్నారు. - విజయనగరం మున్సిపాలిటీ స్కిమ్మింట్ అంటే...? ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులతో ఆన్లైన్, ఇతర వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కార్యకలాపాల్లో స్కిమ్మింట్ ముఠా స్కి మ్మర్ అనే యంత్రం ద్వారా మీ కార్డులకు చెందిన పిన్ నెంబర్ ఇతర వివరాలను తస్కరించి వాటి ద్వారా మీ కార్డులను వాడుకోవడమే స్కిమ్మింగ్ అం టారు. ఈ యంత్రం చేతిలో ఇమిడిపోయేలా చిన్న సైజులో ఉంటుంది. మీరు వారికి ఇచ్చిన క్రెడిట్, డెబిట్ కార్డులను ఒకసారి స్వైప్ చేస్తే వాటి పూర్తి వివ రాలు తీసుకుంటుంది. దీంతో పాటు క్రెడిట్ కార్డు మేగ్నటిక్ స్క్రిప్, ఖాళీ కార్డును కూడా వారు సేకరిస్తుంటారు. బోగస్ క్రెడిట్ కార్డుల తయారీ... స్కిమ్మర్ను కంప్యూటర్కు అనుసంధానం చేసి అప్ప టికే అందులో ఉంచిన క్రెడిట్ కార్డు డేటాను... మెగ్నటిక్ స్ట్రిప్ ఖాళీ కార్డులోకి డౌన్ లోడ్ చే స్తారు. వీటిపై సంబంధిత బ్యాంకుల డేటాలు ఉండడంతో సామాన్యులు వాటిని కనుగొనే అవకాశం ఉండదు. ఈ విధంగా బోగస్ కార్డులు తయారు చేస్తారు. ఈ కార్డులను వివిధ రకాలుగా వాడుతుంటారు. వీటి వల్ల బిల్లు మాత్రం ఖాతాదారుడికి రాగా.. లబ్ధి వేరొక వ్యక్తి పొందుతారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ కార్డులను హోటల్, వాణిజ్య సముదాయాల్లో ఇ చ్చే సమయంలో మీ కార్డు ఇచ్చినప్పటి నుంచి తీసుకునే వరకు జాగ్ర త్తగా గమనించాలి. బ్యాంకు అధికారులు మొదటిగా మీకు ఇచ్చిన పిన్ నెం బర్ను అలాగే వాడకుండా ఏటీఎంకు వెళ్లి మీ పిన్ నెంబర్ను మార్చుకోవాలి. పిన్ నెంబర్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తున్న వినియోగదారులు మొ దటిసారిగా వినియోగించిన తరువాత లాగిన్, ట్రాన్జాక్షన్ పాస్ వార్డులను మార్చుకోవాలి. పాస్వర్డ్లను మీరు పెట్టుకునే సమయంలో అక్షరాలు, నంబర్లు కాకుండా ఏవైనా గుర్తులు వినియోగిస్తే ఇంకా మేలు. ముఖ్యంగా బ్యాంకు సిబ్బంది, ఎగ్జిక్యూటివ్ పేర్లతో ఎ న్నో ఫోన్లు వస్తుంటాయి. వాటిని నమ్మి వారికి మీ బ్యాంకు ఖాతా వివరాలను అసలు చెప్పరాదు. అన్ని తెలు సుకుని కరెక్ట్ అనిపించిన తరువాతనే బ్యాంకుకి వెళ్లి చెప్పడం మంచిది. మీరు ఇంటి చిరునామా మార్చితే తప్పని సరిగా సదరు బ్యాంక్ అధికారులకు తెలియజేసి చిరునామా మార్చుకోవాలి. మీరు బ్యాంకు నుంచి లావాదేవీలు జరపకున్నా... వాటిలో నగదు నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. -
కోపముంటే నన్ను చంపాల్సింది...నా పిల్లలేం పాపం చేశారు?
ఏ బంధాన్నైనా తెంచుకోవడం సులభం... కలుపుకోవడం కష్టం. అది తెలిసే ఏ భార్యా తన వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని అనుకోదు. పిల్లల బాగు కోసమో... సమాజం ఏమంటుందో అన్న భయానికో ఆ అడుగు వేయదు. కానీ భర్త మృగంగా మారి హింసిస్తున్నప్పుడు కూడా అలా తలొగ్గి ఉండటం ఎంతవరకూ సబబు? జీవితమంతా కాపాడతాడనుకున్న మనిషి, జీవితాన్నే కాలరాస్తున్నప్పుడు... కీడెంచి మేలెంచకుండా మౌనంగా ఉండిపోవడం ఎంతవరకూ సమంజసం? కాస్త కష్టమైనా ముందే ఓ కఠిన నిర్ణయం తీసేసుకుంటే అనర్థాలు ఆగవా? మహిళల్ని సంరక్షించడానికే 498 ఎ చట్టాన్ని చేశానంటోంది ప్రభుత్వం. మహిళలు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆ చట్టాన్ని రద్దు చేయమని అంటోంది పురుష సమాజంలోని ఓ వర్గం. అలా చేయడం ఎంతవరకూ సమర్థనీయం? ఇప్పుడివన్నీ మాట్లాడ్డానికి కారణం సుహాసిని. ఈ ప్రశ్నలన్నీ తలెత్తడానికి కారణం... ఆమె జీవితంలో సంభవించిన పెను విషాదం! సుహాసిని తన బిడ్డల కోసం నరకం లాంటి జీవితాన్ని స్తబ్దుగా నెట్టుకొచ్చింది. చివరికి ఆ స్తబ్దతే ఆమె జీవితంలో మిగిలింది. కట్టుకున్న భర్తే కాలయుముడై తన కన్నబిడ్డల ప్రాణాల్ని హరిస్తే... కన్నీరు మున్నీరవుతున్న ఆ కన్నతల్లితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ ఇది! ఎలా ఉన్నారు సుహాసినిగారూ? సుహాసిని: కళ్లు మూసినా, తెరిచినా పిల్లలే గుర్తొస్తున్నారు. వాళ్లు నా పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. పోయినవారం... సరిగ్గా ఇదే రోజు (ఇంటర్వ్యూ చేసిన రోజు)... నా పిల్లల్ని నేను చూసుకున్న చివరి రోజు... అసలా రోజు ఏం జరిగిందో చెబుతారా? ఎప్పటిలానే వచ్చాడు. పిల్లల్ని తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత మళ్లీ ఒక్కడే వచ్చాడు. పిల్లలేరని అడిగితే, గుడిలో భోంచేస్తున్నారని చెప్పాడు. నన్నూ రమ్మన్నాడు. నేను రాను, పిల్లల్ని తీసుకు రమ్మని చెప్పాను. వెళ్లిపోయాడు. కానీ ఎంతసేపటికీ తీసుకురాలేదు. ఎన్ని మెసేజులు ఇచ్చినా రిప్లై లేదు. నాలుగున్నర వరకూ చూసి ఫోన్ చేశాను. పోలీసులు లిఫ్ట్ చేశారు. తను రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. షాకయ్యాను. పిల్లలేమైపోయారో తెలియలేదు. నన్ను ఏడిపించడానికి ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడనుకున్నాను. కానీ తన ఫోన్లో ఉన్న మెసేజ్ని చూశాకగానీ అర్థం కాలేదు... జరిగిన దారుణం! పిల్లల్ని తీసుకెళ్లేపు్పుడు తనలో ఏ మార్పూ కన్పించలేదా? లేదు. ఎప్పటిలానే వచ్చాడు, తీసుకెళ్లాడు. ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదు. పిల్లలు సరదా పడ్డారని ఆ రోజు బ్యాంగ్బ్యాంగ్ సినిమాకి తీసుకెళ్తానన్నాను. దాంతో వెళ్లడానికి వాళ్లిష్టపడలేదు. వెళ్లిరండి, సినిమాకి సాయంత్రం తీసుకెళ్తాలే అని సర్దిచెప్పి పంపించాను. (కన్నీళ్లతో) కానీ వాళ్లు మళ్లీ రారని, నేనెప్పటికీ వాళ్లను చూడలేనని అనుకోలేదు. ఆయన ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నారంటారు? నేను తనకి దూరంగా వచ్చేశానని, తన దగ్గరకు వెళ్లడం లేదని నామీద కక్ష కట్టాడు. ఆ కసితోనే వాళ్లను పొట్టనబెట్టుకున్నాడు. వాళ్ల అమాయక ముఖాలు చూసయినా జాలి వేయలేదతనికి! తనలో హింసా ప్రవృత్తి ముందెప్పుడూ కనిపించలేదా? తను శాడిస్టని తెలుసు. కానీ పిల్లల్ని చంపుకునేంత కసాయివాడని మాత్రం తెలియలేదు. పెళ్లయిన నాటి నుంచీ నన్ను చిత్ర హింసలు పెట్టాడు. ఎంతసేపూ డబ్బు డబ్బు డబ్బు. సంపాదించినదంతా తన చేతిలోనే పెట్టేదాన్ని. నా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్కులు... అన్నీ తన దగ్గరే ఉండేవి. వారానికింత అని పాకెట్ మనీ ఇచ్చేవాడు. ఫోన్ రీచార్జ్ కూడా తనే చేసేవాడు. చివరికి నా సంతకాలు ఫోర్జరీ కూడా చేసేవాడు. అడిగితే చిత్రవధ చేసేవాడు. తొమ్మిదేళ్లు నరకం చూశాను. ఇంట్లోవాళ్లకు చెప్పలేదా? చెప్పినా సర్దుకుపొమ్మన్నారా? వాళ్లెప్పుడూ అలా చెప్పలేదు. నేనే సర్దుకుపోవడానికి ట్రై చేసేదాన్ని. మావాళ్లు మాట్లాడినప్పుడు బాగా చూసుకుంటాననేవాడు. వాళ్లు వెళ్లాక మళ్లీ మామూలే. అతని తరఫు వాళ్లయితే వాళ్ల ఎదురుగానే నన్ను కొడుతున్నా అడ్డుపడేవారు కాదు. మా అత్తగారుమాతోనే ఉండేది. నన్ను చిత్రహింస పెడుతున్నా ఏనాడూ కొడుకుని వారించలేదావిడ. ఇవాళ అతడు నా పిల్లల్ని పొట్టనబెట్టుకుంటే వాళ్లలో ఏ ఒక్కరూ ఫోన్ చేసి పలకరించలేదంటే ఏమనాలి! మీరొక ఇండిపెండెంట్ ఉమన్ అయివుండీ, పిల్లల్ని పెంచుకోగల స్తోమత ఉండీ ఆ హింస ఎందుకు భరించారు? ఇన్ని సంవత్సరాల తర్వాత కేసు ఎందుకు పెట్టారు? విడిపోతే ఎక్కువ సంపాదిస్తోందని అహంభావం అని అందరూ అనుకుంటారేమోనని భయం. దానికితోడు నా పిల్లలకు తండ్రిని దూరం చేయకూడదని కూడా అనుకున్నాను. కానీ తను పిల్లల్ని కూడా హింసించడం మొదలుపెట్టాడు. టీవీ చూడనిచ్చేవాడు కాదు. ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ ఏదీ తిననిచ్చేవాడు కాదు. రోజూ పప్పన్నమే. తినకపోతే కొట్టేవాడు. వాతలు పెట్టేవాడు. తట్టుకోలేక పోయాను. పైగా అతణ్ని చూసి వారిలోనూ అలాంటి ప్రవృత్తి పెరుగుతుందేమోనని భయపడ్డాను. అందుకే వచ్చేశాను. అయినా వదలకుండా వేధిస్తుంటే కేసు పెట్టక తప్పలేదు. కానీ అది తప్పుడు కేసంటూ ఉత్తరాలు రాశాడు కదా? తప్పుడు కేసు పెట్టేదాన్నే అయితే తొమ్మిదేళ్లు ఆ హింస భరించేదాన్ని కాదు. నేనెప్పుడూ కాపురాన్ని సరి చేసుకోవాలని, అతణ్ని మార్చుకోవాలనే చూశాను. ఇక భరించలేని పరిస్థితి వచ్చాక కేసు పెట్టాను. 498 ఎ చట్టాన్ని తీసేయమంటూ ఎవరెవరికో ఉత్తరాలు రాశాడు. కానీ ఆ చట్టం లేకపోతే నాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి! చూశారుగా తనెంత దారుణమైన మనిషో! కాల్ రికార్డ్స్ చూస్తే... తాను చనిపోతానని ముందే హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది కదా? ఎప్పుడూ అలా బెదిరిస్తూనే ఉండేవాడు. నన్ను తన దారిలోకి తెచ్చుకోవడానికి అదొక అస్త్రం తనకి. అందుకే పట్టించుకోలేదు. అయినా ఆ రికార్డ్స్ ఇప్పటివి కావు. ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ రికార్డ్ చేసి, అన్నిటినీ అతికి మీడియా వాళ్లకు పంపించాడు. అందుకే అందులో నా మాటలేం సరిగ్గా ఉండవు. తను నన్ను బతిమాలుతున్న మాటలే ఉంటాయి. అవి కావాలని మాట్లాడి రికార్డ్ చేసుకున్నాడు, తాను మంచివాడినని నిరూపించుకోవడం కోసం. అందులో నిజమెంతో తెలుసుకోకుండా మీడియా ప్రసారం చేసేసింది. ఆ కాల్ రికార్డ్లో... కాగితం మీద సంతకం పెట్టనని పదే పదే అన్నాడు కదా, ఏమిటా కాగితం? తనకి నా మీదసలు ప్రేమే లేదు. నేను తన దగ్గరికి ఎందుకు వెళ్లను అని పంతం! అందుకే మా పెద్దవాళ్లు... నాకేదైనా అయితే తనదే బాధ్యత అని రాసిన కాగితం మీద సంతకం పెట్టమన్నారు. కానీ అతను పెట్టడని నాకు ముందే తెలుసు. ఎందుకంటే, హింసించడం అతడి తత్వం. అలా చేయకుండా అతడు ఉండలేడు. మరి ఇన్ని తెలిసీ పిల్లల కస్టడీకి మీరు ఎందుకు ఒప్పుకున్నారు? నేను ఒప్పుకోలేదు. అతను మంచివాడు కాదని మొత్తుకున్నాను. కానీ కోర్టు నా మాట వినలేదు. ఇప్పుడేమయ్యింది! నా పిల్లల్ని కోర్టు తెచ్చివ్వగలదా?! ఒకవేళ కేసు పెట్టకుండా ఉన్నా.. అతడితోనే కలిసున్నా పిల్లలు దక్కివుండేవారని ఇప్పుడనిపిస్తోందా? ఏది ఎందుకు జరిగిందో ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. నాకు నా పిల్లలు కావాలి. వాళ్లు లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను. వాళ్ల కోసం ఎన్నో భరించాను. వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు వాళ్లే లేకుండా పోయారు. ఇక నా జీవితానికి అర్థమేముంది? అతనికి అంతగా నామీద కోపముంటే నన్ను చంపాల్సింది. నా పిల్లల్నెందుకు చంపాలి? వాళ్లేం పాపం చేశారు? సుహాసిని సంధించిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి గురుప్రసాద్ బతికి లేడు. పోనీ ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గరయినా ఉందా?! అభం శుభం తెలియనివాళ్లు. అమ్మానాన్నలు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా అర్థం చేసుకోలేని పసివాళ్లు. అన్యాయంగా అసువులు బాశారు. విరించి, విహారిలే కాదు... తల్లిదండ్రుల సమస్యలకి, వారి మధ్య కోపతాపాలకి మధ్య జీవితాలను, ప్రాణాలను కోల్పోతున్న చిన్నారులు చాలామందే ఉన్నారు. తల్లి పసుపుతాడు బిడ్డలకు ఉరితాడు అవ్వడం న్యాయమా? తండ్రి పంతం పిల్లల ప్రాణాలు తీసే యమపాశమవ్వడం ధర్మమా? ఆలోచించండి! సంభాషణ: సమీర నేలపూడి ఈ పరిస్థితిని ముందే అంచనా వేయవచ్చు! ఒక వ్యక్తి మానసిక స్థితిని బట్టి, ప్రవర్తనను బట్టి జరగబోయే అనర్థాలను ముందుగానే అంచనా వేయవచ్చు. భర్త హింసిస్తున్నా సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతోనో, తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారన్న ఉద్దేశంతోనో మౌనంగా భరించే మహిళలు చాలామంది ఉన్నారు. అయితే అతడలా ప్రవర్తించడానికి కారణం వ్యక్తిత్వ లోపం కావచ్చు. ఏదైనా మానసిక వ్యాధి కావచ్చు. ఒక్కసారి వైద్యుడిని కలిసి భర్త ప్రవర్తన గురించి చెబితే, అతడికేదైనా మానసిక సమస్య ఉందా అన్నది వాళ్లు కనిపెడతారు. దానికి చికిత్స చేయిస్తే అతడు మంచిగా మారవచ్చు. ఇలాంటి ఘోరాలకు పాల్పడకపోవచ్చు. ఒకవేళ వారు ట్రీట్మెంట్కి ఒప్పుకోకపోతే, మెంటల్హెల్త్ యాక్ట్ (సెక్షన్ 23)ని ఆశ్రయించవచ్చు. దాని ప్రకారం... ఒక వ్యక్తిలో తనను తాను కానీ, ఇతరులను కానీ హింసించే లక్షణాలు ఉంటే అతడికి బలవంతంగా కూడా చికిత్స చేయించవచ్చు. కాబట్టి హింసాత్మక ప్రవృత్తి కనిపించగానే వైద్యుల సలహా తీసుకుంటే... ఇలాంటి ఘోరాలు జరగకుండా అడ్డుకునే అవకాశం దొరుకుతుంది. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై., సైకియాట్రిస్టు చట్టాల్ని తప్పు పట్టకూడదు! ఎంత నాణ్యమైన బియ్యంలోనైనా ఒకటో రెండో రాళ్లు ఉంటాయి. మంచి ముత్యాల్లో కూడా ఒకటి రెండు నకిలీవి తగులుతుంటాయి. అందుకని మొత్తాన్నీ పారేయలేం కదా! చట్టాలూ అంతే. అప్పటి పరిస్థితులను బట్టి, అంతవరకూ చూసిన కేసుల్ని బట్టి రూపొందుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒకటో రెండో తప్పుడు కేసులు వచ్చాయని అసలు ఆ చట్టమే సరికాదంటే ఎలా? 498 ఎ అక్కడక్కడా దుర్వినియోగం అవుతోందన్నది నిజమే కావచ్చు. కానీ, కొందరలా చేశారని చట్టాన్నే లేకుండా చేస్తే నిజమైన బాధితుల పరిస్థితేం కావాలి! కాకపోతే మారుతున్న పరిస్థితులను బట్టి, మానసిక ప్రవృత్తులను బట్టి చట్టాల్లో మార్పులు జరగాలి. భర్త తనని వేధిస్తున్నాడని ఓ భార్య కేసు పెట్టినప్పుడు... అతడి ప్రవర్తన మీద నిఘా ఉంచాలి. ఆమె చెప్పింది నిజమని తేలితే ఆలస్యం చేయకుండా తీర్పు వెలువరించాలి. ఎందుకంటే ఆలస్యం జరిగేకొద్దీ మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. అది కొన్నిసార్లు హింసకు పాల్పడేలా ప్రేరేపిస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణమవుతుంది! - ఎస్.ప్రదీప్ కుమార్, న్యాయవాది -
ఐబిఎ నూతన చైర్మన్ ఎవరు?
Banks Special GENERAL AWARENESS 1. Which of the following private banks announced EMI facility on debit cards to enable its customers to convert their high value transactions into easy installments on August 19, 2014? 1) ICICI Bank 2) Axis Bank 3) HDFC Bank 4) IndusInd Bank 5) Yes Bank 2. Which senior congress leader took over as the new Chairman of Parli-ament's Public Accounts Comm-ittee (PAC) on August 20, 2014? 1) Kamal Nath 2) K.V. Thomas 3) Mallikarjun Kharge 4) A.K. Antony 5)Jairam Ramesh 3. U.R. Ananthamurty died on August 22, 2014. He won the 1994 Jnanpith Award for writings in which of the following languages? 1) Telugu 2) Tamil 3) Kannada 4) Malayalam 5) Marathi 4. Who was elected as the Chairman of the Indian Banks' Association (IBA) for 2014-15? (He succeeds K.R. Kamath) 1) Rakesh Sethi 2) C.V.R. Rajendran 3) S.S. Mundra 4) T.M. Bhasin 5) R.K. Dubey 5. Who bagged India's first medal in the second Youth Olympic Games by winning a silver in the men's 77kg weightlifting catego-ry in Nanjing, China on August 22, 2014? 1) Maymon Poulose 2) Mithra Varun 3) Lalu Taku 4) Ragala Venkata Rahul 5) None of these 6. The world's first Hindu eco te-mple Shree Swaminarayan Mandir was opened in which of the following cities on August 19, 2014? 1) Angkor Wat 2) New Delhi 3) London 4) Chicago 5) New York 7. Who won the men's singles title at the 44th All India inter-institutional table tennis championship in New Delhi on August 22, 2014? 1) Soumyajit Ghosh 2) Sanil Shetty 3) Sarthak Gandhi 4) G.Sathiyan 5) Sourav Saha 8. Who won the women's singles title at the 44th All India inter-institutional table tennis cham-pionship on August 22, 2014? 1) Poulomi Ghatak 2) Pooja Sahasrabudhe 3) Mousumi Paul 4) Madhurika Patkar 5) Nikhat Bhanu 9. Identify the mismatched pair? Public Sector Bank CMD 1) Punjab National Bank K.R. Kamath 2) UCO Bank Arun Kaul 3) Oriental Bank of Commerce S.L. Bansal 4) Indian Bank T.M. Bhasin 5) Bank of India Rajeev Rishi 10. The Depositor Education and Awareness Fund (DEAF) has be-en announced by? 1) Public sector banks 2) SEBI 3) SBI 4) RBI 5) Government of India 11. An unclaimed deposit is one wherein an account is not operated for? 1) Six months 2) One year 3) Two years 4) Ten years 5) Five years 12. The Hindustan Motors suspe-nded the production of which of the following cars in May 2014? 1) Morris Oxford 2) Ambassador 3) Contessa 4) Land Rover 5) None of these 13. With which of the following is the term 'pre-shipment finance' related? 1) Farm credit 2) Consumer credit 3) Export credit 4) Industrial credit 5) None of these 14. Recapitalization in public sector banks is done to meet the? 1) CASA ratio 2) Capital adequacy norms 3) Ratio of NPAs 4) Credit to deposit ratio 5) None of these 15. Mukul Rohatgi has recently been appointed as the new? 1) Chief Information Commissi-oner 2) Chief Vigilance Commissi-oner 3) Solicitor General 4) Principal Secretary to the Pri-me Minister 5) Attorney General 16. Which country suspended $10 million contribution to the Com-monwealth secretariat over alle-ged human rights abuses in Sri Lanka? 1) UK 2) India 3) Bangladesh 4) New Zealand 5) Canada 17. Who is the Commonwealth Cha-irperson-in-Office at present? 1) Queen Elizabeth II 2) Kamalesh Sharma 3) Mahinda Rajapakse 4) David Cameron 5) Stephen Harper 18. Nobel laureate Muhammad Yunus is well known for his contribution to Bangladesh's? 1) Agro credit sector 2) Consumer credit sector 3) Housing finance sector 4) Micro credit sector 5) Retail credit sector 19. Sachin Tendulkar has been named as the goodwill am-bassador for the 35th National Games to be held in? 1) Manipur 2) Jharkhand 3) Kerala 4) Goa 5) Maharashtra 20. The United Nations and the In-ternational Olympic Committee (IOC) have signed a historic agreement in April 2014 to use the power of sports to promote? 1) World trade and commerce 2) Peace and development 3) Literacy and awareness 4) Peaceful uses of nuclear tech-nology 5) None of these 21. The Indian Banks' Association members comprise of? 1) Public sector banks 2) Private sector banks 3) Foreign banks having offices in India 4) Urban cooperative banks 5) All the above 22. Which of the following was sta-rted in 1946? 1) RBI 2) NABARD 3) SBI 4) IBA 5) None of these 23. Which of the following is the location of the permanent office of the International Mathema-tical Union (IMU)? 1) Paris 2) Frankfurt 3) Berlin 4) Berne 5) Madrid 24. The International Congress of Mathematicians (ICM) will be held in which of the following cities in August 2018? 1) Hyderabad 2) Madrid 3) Melbourne 4) Rio de Janeiro 5) Durban 25. Kruger National Park is in the news recently. It is located in? 1) Kenya 2) Ethiopia 3) Somalia 4) Tunisia 5) South Africa 26. Which of the following is known as the Jasmine Revolution? 1) Czech uprising 2) Sudan uprising 3) Libyan uprising 4) Syria revolution 5) Tunisian revolution 27. Turkey is a member of which of the following groups/ organiza-tions? 1) G20 2) NATO 3) ASEAN 4) Both 1 and 2 5) All 1, 2 and 3 28. Mark Rutte is in the news recently. He is the Prime Minister of which of the following countries? 1) Slovenia 2) Belgium 3) Netherlands 4) Luxembourg 5) Finland 29. The third edition of the Nuclear Security Summit was held in which of the following cities on March 24-25, 2014? 1) Seoul 2) The Hague 3) New Delhi 4) Tokyo 5) Sydney 30. The Nuclear Security Summit aims to prevent nuclear terrorism by? 1) Reducing the amount of dan-gerous nuclear material in the world 2) Improving the security of all nuclear material and radio-active sources 3) Improving international coo-peration 4) Both 1 and 2 5) 1, 2 and 3 KEY 1) 1; 2) 2; 3) 3; 4) 4; 5) 4; 6) 3; 7) 4; 8) 1; 9) 5; 10) 4; 11) 4; 12) 2; 13) 3; 14) 2; 15) 5; 16) 5; 17) 3; 18) 4; 19) 3; 20) 2; 21) 5; 22) 4; 23) 3; 24) 4; 25) 5; 26) 5; 27) 4; 28) 3; 29) 2; 30) 5. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీ పరీక్షల్లో ఇంధనాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? - కె.నరేంద్రనాథ్, కాచిగూడ ఏ పోటీ పరీక్ష అయినా ఎగ్జామినర్కి తప్పకుండా మదిలో మెదిలే అంశం ఇంధనాలు. సాంప్రదాయికంగా వాడుకలో ఉన్న పిడకలు, కలప మొదలుకొని ఎల్పీజీ, గోబర్ గ్యాస్ లాంటివన్నీ ఇంధనాలే. సాధారణంగా పెట్రోల్, కిరోసిన్, డీజిల్ లాంటి ద్రవ ఇంధనాలు; ఎల్పీజీ, సీఎన్జీ లాంటి వాయు ఇంధనాలకు ఆధారం పెట్రోలియం. క్రూడ్ ఆయిల్ను ‘పాక్షిక అంశిక స్వేదన’ పద్ధతిలో రిఫైనరీల్లో శుద్ధిచేసి మార్కెట్లోకి విడుదల చేస్తారు. పోటీ పరీక్షల్లో ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలతోపాటు వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఏయే అనుఘటకాలు వస్తాయో అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు మొదట సహజవాయువు వస్తుంది. చివరగా ‘తారు’ మిగులుతుంది. వివిధ ఇంధనాల్లోని రసాయన పదార్థాల గురించి కూడా అడగవచ్చు. సాధారణంగా ఏ ఇంధనమైనా వివిధ హైడ్రోకార్బన్ల మిశ్రమం. ఉదాహరణకు ఎల్పీజీలో ప్రధాన అనుఘటకం ‘బ్యూటేన్’, సహజ వాయువులో ఉండే ప్రధాన వాయువు ‘మీథేన్’. ఇవేకాకుండా జీవ వ్యర్థాల నుంచి తయారయ్యేది బయోగ్యాస్. పేడ నుంచి తయారయ్యేది గోబర్ గ్యాస్. రెండింట్లోనూ ప్రధాన అనుఘటకం మీథేన్. ఇవన్నీ హైడ్రోకార్బన్లే. అంటే కార్బన్, హైడ్రోజన్లతో నిర్మితమై ఉన్నాయి. వీటిని మండించినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి వెలువడతాయి. రాకెట్లలో తక్కువ బరువుండి ఎక్కువ శక్తినిచ్చే ఇంధనాలు కావాలి. ద్రవ హైడ్రోజన్ మంచి ఇంధనం. ఇది మండినప్పుడు కేవలం నీరు విడుదలవుతుంది. ఇది పర్యావరణ హితమైన (నష్టం చేయని) ఇంధనం. ప్రతి గ్రాముకి ఎంత శక్తివిడుదలవుతుందనేది ఆ ఇంధన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. దేనికి ఎక్కువ కెలోరిఫిక్ విలువ ఉంటే దాని సామర్థ్యం అధికం. ఇంధనాలపై ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అలాగే హైడ్రోకార్బన్ల గురించి తప్పనిసరిగా చదవాలి. - డాక్టర్ బి.రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ. -
డెబిట్ కార్డ్తోనూ ఈఎంఐ స్కీమ్
ముంబై: డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై సమాన నెలవాయిదా (ఈఎంఐ) స్కీమ్ను ప్రైవైట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్రారంభించింది. ఈ తరహా స్కీమ్ దేశంలో ఇదే మొదటిదని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సభర్వాల్ చెప్పారు.్ర కెడిట్ కార్డ్ల ద్వారా వస్తువులను ఈఎంఐల ద్వారా కొనుగోలు చేయవచ్చని, కానీ డెబిట్ కార్డ్ ద్వారా వస్తువుల కొనుగోళ్లకు ఈఎంఐ స్కీమ్ను తొలిసారిగా అందిస్తున్నామని వివరించారు. అయితే సేవింగ్స్ అకౌంట్తో పాటు కనీసం రూ.10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారే ఈ స్కీమ్కు అర్హులని తెలిపారు. మొదటగా ఈ స్కీమ్ను శామ్సంగ్ బ్రాండ్ ఉత్పత్తులకు ఆఫర్ చేస్తున్నామని, ఆ తర్వాత ఇతర బ్రాండ్లకు విస్తరిస్తామని వివరించారు. ఈఎంఐలను మూడు/ఆరు/తొమ్మిద/ పన్నెండుగా ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈఎంఐ స్కీమ్కు సంబంధించి డెబిట్ కార్డ్ కొనుగోళ్లపై 13 శాతం వడ్డీరేటు వసూలు చేస్తామని వివరించారు. ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐ స్కీమ్ కారణంగా 2.2 కోట్ల మంది ఐసీఐసీఐ డెబిట్ కార్దుదారులు పండుగల సీజన్ సందర్భంగా తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ పొందవచ్చని, కొనుగోళ్ల లావాదేవీలపై రివార్డ్ పాయింట్లు పొందవచ్చని తెలిపారు. -
ప్లాస్టిక్ మనీ జోరు..!
ముంబై: దేశంలో ప్లాస్టిక్ మనీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వినియోగం భారీగా పెరుగుతున్న ప్రపంచ దేశాల్లో భారత్ ఒకటి. భారత్లో ఇప్పటికే దాదాపు 36.9 కోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులు సర్క్యులేషన్లో ఉన్నాయి. వీటిలో 35 కోట్ల కార్డులు డెబిట్ కార్డులు. 1.9 కోట్ల కార్డులు క్రెడిట్ కార్డులు. 10-15 శాతం కార్డులు కేవలం ఆన్లైన్ లావాదేవీల కోసమే వినియోగిస్తున్నారు. చిన్న పట్టణాల్లో సైతం ఈ తరహా లావాదేవీలు పెరుగుతున్నాయి. ఆర్బీఐ ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. ‘పేమెంట్ సిస్టమ్ అప్లికేషన్స్-ఎనేబిలింగ్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (పీకేఐ)’ పేరుతో ఈ నివేదికను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ నివేదికలో రెండు ప్రధాన పేమెంట్ నెట్వర్క్లు- మాస్టర్ కార్డ్, వీసాలను ఉటంకించింది. నివేదికలో ముఖ్యాంశాలు... భారత్ ఈ-పేమెంట్స్ విధానంలో ‘కార్డ్ పేమెంట్లు’ అంతర్గత భాగంగా మారాయి. డబ్బు బదలాయింపు, షాపింగ్, బిల్లుల చెల్లింపు వంటి పలు అవసరాలకు కస్టమర్ల ‘కార్డ్’ల వినియోగం పెరుగుతోంది. క్రెడిట్ కార్డును ఆచితూచి చేసే ఖర్చులకు వినియోగిస్తున్నారు. 1998లో దేశంలోకి ప్రవేశిం చిన డెబిట్ కార్డులను రోజూవారీ మామూలు ఖర్చులకు వాడుతున్నారు. క్రెడిట్ కార్డుల్లో దాదాపు 30 శాతం ఆన్లైన్ వినియోగంలో ఉన్నాయి. మాస్టర్ కార్డ్ నెట్వర్క్ ద్వారా లభ్యమవుతున్న సమాచారం ప్రకారం కార్డ్ పేమెంట్లలో 75 శాతం కేవలం 20 పట్టణాల్లో కేంద్రీకృతమయ్యాయి. వీటిలో 43 శాతం వాటా ఢిల్లీ, ముంబై, వాటి సబర్బన్ ప్రాంతాలదే. వీసా అధ్యయనం ప్రకారం- రూ.75,000 నుంచి రూ.1,00,000 శ్రేణిలో నెలవారీ ఆదాయం ఉన్న వారు ఎక్కువమంది ఎలక్ట్రానిక్ కార్డును వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పేమెంట్లు ఎక్కువగా జరుగుతున్న వ్యయ విభాగాల్లో రైల్-ఎయిర్ఫేర్ (71 శాతం), మన్నికైన వస్తువులు (61 శాతం), అద్దెలు (49 శాతం), టెలిఫోన్-మొబైల్ (47 శాతం), మెడికల్ ఇన్స్టిట్యూట్ (46 శాతం), దుస్తులు-పాదరక్షలు (44 శాతం), శీతల పానియాలు-రిఫ్రష్మెంట్స్ (35 శాతం) ఉన్నాయి. డెబిట్ కార్డులకన్నా దశాబ్దం ముందు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, వాటితో పోల్చితే క్రెడిట్ కార్డుల వినియోగం వృద్ధిరేటు నెమ్మదిగా ఉంది. ఆభరణాలు, విందు, షాపింగ్ వంటి వ్యయాలకు క్రెడిట్ కార్డులను అధికంగా వినియోగిస్తున్నారు. -
ఇక చిప్తో కూడిన డెబిట్,క్రెడిట్ కార్డులు