kondapochamma Sagar Project
-
కొడుకా.. అంతలోనే వెళ్లిపోతివా..!
బన్సీలాల్పేట్: కొండపోచమ్మ డ్యామ్లో మునిగిపోయి మృతిచెందిన దినేశ్వర్ అంత్యక్రియలు ఆదివారం బన్సీలాల్పేట్ శ్మశానవాటికలో నిర్వహించారు. దీంతో చాచానెహ్రునగర్లో విషాదఛాయలు నెలకొన్నాయి.స్థానికులు ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు తరలి వచ్చి దినేశ్వర్ భౌతికకాయంపై పుష్పగుచ్చాలుంచి నివాళులరి్పంచారు. కుమారుడి పారి్థవదేహంపై పడి తల్లి సుమలత విలపించిన తీరు చూపరుల కంటతడి పెట్టించింది. బాగా చదువుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటావనుకుంటే కొడుకా.. అంతలోనే అందని లోకాలకు వెళ్లావంటూ తల్లి విలపించిన తీరు అక్కడున్న వారి హృదయాలను కదిలించింది. దినేశ్వర్ అంతిమయాత్ర చాచానెహ్రునగర్ నుంచి బయలుదేరి వివిధ ప్రాంతాల గుండా బన్సీలాల్పేట్ శ్మశానవాటికకు చేరుకుంది. ప్రముఖుల పరామర్శ..బన్సీలాల్పేట్ డివిజన్ చాచానెహ్రునగర్లో ఉంచిన దినేశ్వర్ భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులరి్పంచారు. స్ధానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ కె. హేమలత, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీపతి, జి. పవన్కుమార్ గౌడ్, ఏసూరి మహేష్, వెంకటేశన్ రాజు తదితరులు కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
హైదరాబాద్ చేరుకున్న కొండ పోచమ్మ సాగర్ గల్లంతైన యువకుల మృతదేహాలు
-
కొండపొచమ్మ సాగర్ డ్యామ్లో పడి ఐదుగురు మృతి
సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ సరదా యువకుల ప్రాణాలు తీసింది. మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యామ్లో యువకులు గల్లంతయ్యారు. ఐదుగురు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు క్షేమంగా బయటపడ్డారు.మృతులను హైదరాబాద్ ముషీరాబాద్ వాసులు ధనుష్(20), లోహిత్(17), దినేశ్వర్(17), సాహిల్(19), జతిన్(17)గా గుర్తించారు. యువకులంతా 20 ఏళ్ల లోపు వారే. మృగాంక్(17), ఇబ్రహీం(20) ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతిఈ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు విద్యార్థుల గల్లంతుపై సీఎం ఆరా తీశారు. ఘటనా స్థలానికి వెళ్లాలని అధికారులను ఆదేశించారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలన్నారు.మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: హరీష్రావుకొండపోచమ్మ సాగర్ ఘటనపై మాజీ మంత్రి హరీష్రావు దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదీ చదవండి: సంక్రాంతికి వస్తానని.. తిరిగిరాని లోకాలకు -
అపూర్వం.. 30 ఏళ్ల తర్వాత తొలిసారి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను నీరందని ప్రాంతాలన్నింటికీ తరలిస్తున్న ప్రభుత్వం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. గత నెల 23న కూడవెళ్లి వాగు ద్వారా విడుదల చేసిన కాళేశ్వరం జలాలు అప్పర్ మానేరు ను చేరడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం అలుగు దుంకుతోంది. సుమారు 30 ఏళ్ల తర్వాత నిండు వేసవిలో ప్రాజెక్టు నిండుకుండలా మారడం ఇదే తొలిసారి. కూడవెళ్లి వాగు నుంచి సుమారు 70 కి.మీ. మేర ప్రయాణించిన గోదావరి జలాలు దారిలో 39 చెక్ డ్యామ్లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరగా 11 వేల ఎకరాల మేర ఆయకట్టుకు సాగునీరు అందించగలిగింది. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్యాకేజీ-9 పనులు ఆలస్య మవుతున్న నేపథ్యంలో కూడవెళ్లి వాగు ద్వారా తర లించిన జలాలు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి. ప్యాకేజీ-9 ఆలస్యమైనా చింతలేకుండా.. అప్పర్ మానేరు ప్రాజెక్టును సుమారు 50 ఏళ్ల కింద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించగా పూడిక కారణంగా ప్రస్తుతం అందులో 2.20 టీఎంసీల నీటినే నిల్వ చేసే అవకాశం ఉంటోంది. దీని కింద 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించొచ్చు. అయితే వర్షాకాలంలో మినహాయిస్తే జనవరి తర్వాత ఇందులో నీటి లభ్యత ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరుకు 11.635 టీఎంసీలను తరలిస్తూ మొత్తంగా 60 వేల ఎకరాల కొత్త ఆయ కట్టు, 26 వేల ఎకరాల స్థిరీకరణ చేయాలన్న లక్ష్యం తో ప్యాకేజీ-9 పనులను చేపట్టారు. ఈ ప్యాకేజీని మొత్తంగా రూ. 996 కోట్లతో చేపట్టగా రూ. 600 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. ముఖ్యంగా 12 కి.మీ. టన్నెల్లో 7 కి.మీ. టన్నెల్ పని పూర్తవ్వగా మిగతా లైనింగ్ పూర్తి చేయాల్సి ఉంది. మొదటి పంప్హౌస్లో 30 మెగావాట్ల సామర్థ్యంగల 2 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఒక దాని బిగింపు పనులు పూర్తయ్యాయి. రెండో దాని పనులు మొదలుపెట్టనున్నారు. ఈ పంప్హౌస్ నుంచి నీళ్లు మలక్పేట రిజర్వాయర్కు... అటు నుంచి సింగసముద్రం చెరువుకు 18 కి.మీ. గ్రావిటీ ద్వారా వెళ్తాయి. అక్కడ ఉన్న రెండో పంప్హౌస్లో 2.25 మెగావాట్ల సామర్థ్యంగల రెండు మోటార్ల ద్వారా 5.70 కి.మీ. ప్రెషర్ మెయిన్ నుంచి బట్టల చెరువు, అటు నుంచి 3.35 కి.మీ. గ్రావిటీ ద్వారా ప్రయాణించి అప్పర్ మానేరు చేరేలా డిజైన్ చేశారు. దీని ద్వారా అప్పర్ మానేరుకు నీటి లభ్యత పెంచాలని ప్రభుత్వం భావించింది. అయితే ప్యాకేజీ-9 పనుల్లో మరో 30 శాతం మేర పనులు పూర్తికాలేదు. రెండో పంప్హౌస్లో మోటార్ల బిగింపు ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైంది. జూలై చివరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం ప్యాకేజీలో 1,279 ఎకరాల భూసేకరణ అవసరం ఉండగా 605 ఎకరాలు పూర్తయింది. మిగతా భూసేకరణకు రూ. 25 కోట్ల తక్షణ అవసరాలున్నాయి. వాటి విడుదలలో ప్రభుత్వ జాప్యంతో పనులు నెమ్మదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్... కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరుకు నీటిని తరలించే ప్రణాళికను అమల్లో పెట్టారు. కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్కు వెళ్లే గ్రావిటీ కెనాల్ 7వ కి.మీ. వద్ద నిర్మించిన హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని కూడవెళ్లి వాగులోకి తరలించేలా పనులు పూర్తి చేశారు. దీంతో గత నెల 23న మంత్రి హరీశ్రావు, ఈఎన్సీ హరిరామ్ ఈ కాల్వ నుంచి 1,300 క్యూసెక్కుల నీటిని వాగులోకి విడుదల చేశారు. ఈ నీరు దారిలోని 39 చెక్డ్యామ్లను నింపుకుంటూ అప్పర్ మానేరు చేరింది. మొత్తంగా 2 టీఎంసీల మేర నీరు అప్పర్ మానేరు చేరడంతో అది ప్రస్తుతం పూర్తిగా నిండి సోమవారం సాయంత్రం నుంచి అలుగు దుంకుతోంది. జూన్లో వర్షాలు ఆలస్యమైనా.. ప్యాకేజీ–9 పనులు పూర్తి కాకపోయినా కూడవెళ్లి వాగు ద్వారా అప్పర్ మానేరు కింది ఆయకట్టుకు ఇప్పుడు కొండంత భరోసా ఉంటుందని నీటిపారుదల ఇంజనీర్లు చెబుతున్నారు. -
హల్దీలోకి గోదారమ్మ
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్కు ఎత్తిపోసిన గోదావరి నీళ్లను.. హల్దీవాగు, మంజీరా నది ద్వారా నిజాంసాగర్కు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీకారం చుట్టారు. మంగళవారం ఉదయం ప్రత్యేక బస్సులో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులోనిపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చే నీటిని సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దివాగుకు పైన ఉన్న బంధం చెరువులోకి విడుదల చేశారు. ఈ నీళ్లు పెద్దచెరువు, శాకారం ధర్మాయి చెరువు, కానీ చెరువులను నింపుతూ.. హల్దీవాగులోకి, అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్కు చేరనున్నాయి. గజ్వేల్కు నీళ్లిచ్చే ప్రాజెక్టుకూ.. అవుసులోనిపల్లి నుంచి బయలుదేరిన సీఎం.. మర్కూక్ మండలం పాములపర్తి సమీపంలో కాల్వ ద్వారా గజ్వేల్ ప్రాంతానికి గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రైతులు, మహిళలు గోదావరి జలాల్లో పసుపు, కుంకుమ, పూలు, నాణేలు వేసి గోదారమ్మకు స్వాగతం పలికారు. ఇక్కడ విడుదల చేసిన నీటితో పాములపర్తి చెరువు, పాతూరు, చేబర్తి, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా మొదలైన 20 చెరువులు నిండుతాయి. అవుసులోనిపల్లిలో ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి హరీశ్రావు గ్రామాల్లో పండుగ వాతావరణం గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో పండుగ వాతా వరణం నెలకొంది. ఉదయం నుంచే వర్గల్, గజ్వేల్, మర్కుక్ మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్దఎత్తున అవుసులోనిపల్లికి, పాములపర్తికి చేరుకున్నారు. తమ వెంట పసుపు, కుంకుమలు, పూలు, నాణేలు తీసుకొచ్చారు. సీఎం నీటిని విడుదల చేయగానే.. పెద్ద ఎత్తున జైతెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. గోదావరి నీళ్లలో పసుపుకుంకుమలు, పూలు చల్లారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు సంతోష్కుమార్, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, భూపాల్రెడ్డి, గంగాధర్ గౌడ్, ఫరీదుద్దీన్, ఫారూక్ హుస్సేన్, రాజేశ్వర్రావు, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, గణేశ్గుప్తా, హన్మంత్ షిండే, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, మదన్రెడ్డి, మహిపాల్రెడ్డి, మాణిక్రావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి జలాలను విడుదల చేస్తున్న కేసీఆర్. చిత్రంలో మంత్రి హరీశ్, ఈఎన్సీ హరిరామ్ వీలైనంతగా నీళ్లివ్వాలనే లక్ష్యంతో.. ‘నేను కాపోన్ని నాకు రైతుల కష్టాలు తెలుసు’అని తరచూ చెప్పే సీఎం కేసీఆర్.. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ సాగర్ వరకే పరిమితం చేయకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు అందేలా చూడాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దానికితోడు యాసంగి పంటలు వేసిన రైతులు హల్దివాగులోకి నీరు విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే అటు హల్దివాగుకు, ఇటు గజ్వేల్ నియోజకవర్గానికి గోదావరి జలాలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. అధికారులు కూడా వెంటనే పనుల వేగం పెంచి నీటి విడుదలకు కాల్వలు, ఇతర ఏర్పాట్లు సిద్ధం చేశారు. సీఎం మంగళవారం ఈ రెండు చోట్లా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హల్దివాగులోకి ఎన్నిరోజులకు నీరు చేరుతాయి. ఎన్ని చెక్డ్యామ్లు, ఎన్ని చెరువులు నిండుతాయి, భూగర్భ జలాల పరిస్థితి ఏమిటని మంత్రి హరీశ్రావు, నీటిపారుదలశాఖ ఈఎన్సీ హరేరామ్లను అడిగి తెలుసుకున్నారు. -
కొండపోచమ్మ టు నిజాంసాగర్
-
గోదావరి జలాలు విడుదల చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: గజ్వేల్లో సీఎం కేసీఆర్ మంగళవారం పర్యటించారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుదల సందర్భంగా గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ టు నిజాంసాగర్ కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా 6.12 కిలోమీటర్ వద్ద నుంచి హల్దివాగులోకి గోదావరి జలాలను వదిలే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత ఈ కాల్వ నుంచి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీటిని వదులుతారు. అక్కడి నుంచి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చెరువులైన వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్పేట కాని చెరువులు నిండి నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరుతాయి. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది. చదవండి: తెలంగాణ కోర్టుల్లో కరోనా కలకలం జూబ్లీహిల్స్: కారుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీభత్సం -
హల్దివాగు దశ, దిశ మారుతోందా!
సాక్షి, సిద్దిపేట: సమృద్ధిగా వర్షాలు పడితేగానీ నిండుగా నీరు కనిపించని హల్దివాగు దశ, దిశ మారుతోంది. కాలంతో పనిలేకుండా రైతులకు నీళ్లు అందేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొండపోచమ్మ సాగర్ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్ది వాగులోకి.. అక్కడి నుంచి మంజీరా మీదుగా నిజాంసాగర్లోకి గోదావరి జలాలను తరలించనున్నారు. సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు నీటి విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం పరిశీలించారు. కొండపోచమ్మ టు నిజాంసాగర్ కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా 6.12 కిలోమీటర్ వద్ద నుంచి హల్దివాగులోకి గోదావరి జలాలను వదిలే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలుత ఈ కాల్వ నుంచి వర్గల్ మండలం చౌదరిపల్లి బంధం చెరువులోకి నీటిని వదులుతారు. అక్కడి నుంచి మత్తడి దూకుతూ గొలుసుకట్టు చెరువులైన వర్గల్ పెద్దచెరువు, శాకారం ధర్మాయిచెరువు, అంబర్పేట కాని చెరువులు నిండి నాచారం మీదుగా హల్దివాగుకు గోదావరి జలాలు చేరుతాయి. మొత్తం 98 కిలోమీటర్ల పొడవుండే ఈ వాగు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం యావపూర్, నాగులపల్లి మీదుగా కామారెడ్డి జిల్లాలో మంజీరానదిలో కలుస్తుంది. దీంతో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీరుకూరు, నస్రుల్లాబాద్, నిజామాబాద్ జిల్లా బోధన్, కోటగిరి, వర్గి, ఆర్మూరు మొదలైన ప్రాంతాల రైతులకు చెందిన 14,268 ఎకరాలకు ప్రత్యక్షంగా, మరో 20వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరు అందించేందుకు దోహదపడనుంది. పదిరోజుల్లో నిజాంసాగర్కు.. మంగళవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేసే గోదావరి జలాలు హల్దివాగును దాటుకుంటూ పది రోజుల్లో నిజాంసాగర్కు చేరుకోనున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి రోజుకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగులోకి ప్రవేశించే జలాలు.. వాగుపై ఉన్న 32 చెక్ డ్యామ్లను నింపుకొంటూ పది రోజుల్లో నిజాంసాగర్లోకి చేరుతాయి. ఏర్పాట్లన్నీ సిద్ధం సీఎం కేసీఆర్ మంగళవారం గోదావరి జలాలను హల్దివాగులోకి విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్ది వాగు కాల్వలోకి నీటిని విడుదల చేస్తారు. తర్వాత 11.15 గంటలకు మర్కూక్ మండలంలోని పాములపర్తిలో గోదావరి జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు, బందోబస్తును మంత్రి హరీశ్రావు పరిశీలించారు. చదవండి: హాట్హాట్గా ఓటు వేట -
కొండపోచమ్మ టు నిజాంసాగర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో కొత్త ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అమల్లోకి తెచ్చే కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి సింగూరుకు అటు నుంచి నిజాంసాగర్కు నీటిని తరలించే ప్రణాళికలు ఇప్పటికే ఉన్నప్పటికీ, భారీ టన్నెళ్ల నిర్మాణాలతో నీటి తరలింపులో జాప్యం జరుగుతుండటంతో మరో కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చి.. దాని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తోంది. కొండపోచమ్మ సాగర్ రిజర్వా యర్ నుంచి తవ్వుతున్న సంగారెడ్డి కాల్వల నుంచి హల్దీవాగు మొదలయ్యే ఖాన్ చెరువుకు లింక్ కెనాల్ను తవ్వి నీటి మళ్లింపు లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. ఒకటి కాకుంటే.. ఇంకొక మార్గం కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించే విషయంలో చాన్నాళ్లూ సందిగ్ధత ఉన్నా, చివరికి మల్లన్నసాగర్ నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దీ వాగు ద్వారా సింగూరుకు నీటిని తరలించేందుకు మొగ్గుచూపారు. మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ పద్ధతిన నీటిని కొంతదూరం తీసుకెళ్లి, మధ్యన 32 మీటర్ల లిఫ్టు ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపేలా రూ.2,500 కోట్లతో ప్యాకేజీ–17, 18, 19లను చేపట్టారు. ప్యాకేజీ–17లో ఉన్న 18.62 కిలోమీటర్ల టన్నెల్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. ప్యాకేజీ–17లోని ఈ టన్నెల్ నిర్మాణం పూర్తి కాకుండా మల్లన్నసాగర్ నుంచి హల్దీకి, అటు నుంచి సింగూరుకు నీటిని తరలించే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయా లను ఆలోచించిన ప్రభుత్వం కొత్తగా కొండ పోచమ్మ నుంచి తవ్వుతున్న సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీకి నీటిని తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. సంగారెడ్డి కాల్వ 6.25వ కిలోమీటర్ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణం చేసి అక్కడి నుంచి ఖాన్చెరువు మీదుగా హల్దీవాగుకు నీటిని తరలించేందుకు 1.3 కిలోమీటర్ల లింక్ కెనాల్ తవ్వాలని నిర్ణయించారు. ఈ కెనాల్ పనులు ఇప్పటికే చివరి దశలో ఉన్నాయి. మరో పది పదిహేను రోజుల్లోనే ఈ లింక్ కెనాల్ ద్వారా నిజాంసాగర్కు నీటిని తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ లింక్ కెనాల్ పూర్తయితే కొండపోచమ్మ నుంచి తరలించే నీరు సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీ వాగులో కలిసి... అటునుంచి గ్రావిటీతో మంజీరాలో కలిసి నేరుగా నిజాంసాగర్కు చేరుతాయి. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్లో 8 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇందులోంచి 1,600 క్యూసెక్కుల నీటిని లింకు కాల్వ ద్వారా నిజాంసాగర్కు పంపాలన్నది ప్రస్తుతం లక్ష్యంగా ఉంది. నిజాంసాగర్లో ప్రస్తుతం 17.80 టీఎంసీలకు గానూ 13 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ప్రస్తుతం దీనికింద 2 లక్షల ఎకరాలకు అవసరమైన నీటి విడుదల జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి లభ్యత పెంచేందుకు వీలుగా హల్దీవాగుకు గోదావరి జలాలను తరలించి అటునుంచి నిజాంసాగర్కు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. -
ఎందుకు.. ఏమిటి.. ఎలా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు టీఎంసీలకు అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రభుత్వం చేపడుతున్న పనులపై కేంద్రం లేఖాస్త్రం సంధించింది. ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించి ఒక్కో అంశాన్ని ఆరా తీస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్, పర్యావరణ అనుమతులు, వ్యయా లపై వరుసగా లేఖలు సంధిస్తున్న కేంద్రం, రెండ్రోజుల కిందట ఆయకట్టు వివరాలు కోరగా, తాజాగా గురువారం అదనపు టీఎంసీ పనులను గత పనులకు భిన్నంగా చేపట్టడంపై వివరణ కోరుతూ లేఖ రాసింది. ఒక్కొక్కటిగా వివరాల సేకరణ... కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొండపోచమ్మసాగర్ వరకు బ్యారేజీలు, పంప్హౌస్ల పనులు పూర్తవగా, మల్లన్నసాగర్ రిజర్వాయర్, గంధమల్ల, బస్వాపూర్, వాటి కాల్వల పనులు పూర్తి కావాల్సి ఉంది. రెండు టీఎంసీల తరలింపు పనులకు కేంద్రం రూ.80,190 కోట్లకు అనుమతులు ఇవ్వగా, ఇందులో ఇప్పటికే రూ.55 వేల కోట్ల మేర ఖర్చు చేసింది. ఈ పనులు కొనసాగుతుండగానే, కృష్ణా బేసిన్లో నీరందని ప్రాంతాలకు సైతం కాళేశ్వరం ద్వారానే గోదావరి జలాలు అందించేలా అదనపు టీఎంసీ పనులు చేపడుతోంది. ఈ పనులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు సైతం దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. డీపీఆర్లపై బోర్డు, కేంద్రం రాసినా స్పందన లేకపోవడంతో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేరుగా లేఖలు రాశారు. ఇందులో రెండు టీఎంసీల నీటిని తరలింపునకే కేంద్రం అనుమతి ఇచ్చిందని, అదనపు టీఎంసీ పనులకు అనుమతి లేదన్న అంశాన్ని లేవనెత్తారు. దీనికి కొత్తగా అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అనంతరం పర్యావరణ అనుమతులపై కేంద్ర జలశక్తి శాఖ మరో లేఖ రాయగా, అనంతరం ప్రాజెక్టుకు తొలుత నిర్ధారించిన అంచనా వ్యయం, సవరించిన అంచనా వ్యయాలు, ఇప్పటివరకు చేసిన ఖర్చుల వివరాలను సమర్పించాలని కోరింది. ఈ లేఖ రాసిన వారం రోజుల వ్యవధిలో మూడు రోజుల కిందటే తాము 98 రోజులపాటు రోజుకు రెండు టీఎంసీల చొప్పున 195 టీఎంసీల ఎత్తిపోతలకు అనుమతిచ్చామని, దీనికి అదనంగా రోజుకు మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా ప్రతిపాదన చేశారో, లేదో తెలపాలని కోరుతూ లేఖ రాసింది. అదనపు టీఎంసీతో అదనంగా సాగులోకి వచ్చే ఆయకట్టు లేక స్థిరీకరణ ఆయకట్టు, జిల్లాల వారీగా ఆ ఆయకట్టు వివరాలు చెప్పాలని ఆదేశించింది. దీంతో పాటే ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2, వరద కాల్వ, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద స్థిరీకరణ ఆయకట్టు వివరాలను కోరింది. ఇది రాసిన రెండ్రోజులకే గురువారం మరో లేఖ రాసింది. ఇప్పటికే చేపట్టిన రెండు టీఎంసీల నీటి తరలింపునకు గ్రావిటీ కెనాల్, టన్నెళ్ల వ్యవస్థల ద్వారా నీటి తరలింపు చేపట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం అదనంగా టీఎంసీ నీటిని తీసుకునేందుకు చేపట్టిన పనులను మాత్రం పాత విధానంలో కాదని, పైప్లైన్ ద్వారా ప్రెషర్మెయిన్ వ్యవస్థ ఏర్పాటు చేసి తరలించడానికి కారణాలు ఏంటని ప్రశ్నించింది. ప్రెషర్ మెయిన్ వ్యవస్థను ఎంచుకునేందుకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర వరుస లేఖల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్ని వివరాలను సేకరించి పెట్టుకుంటోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేక జాతీయ సత్వర సాగునీటి ప్రాయోజిక కార్యక్రమం (ఏఐబీపీ)లో చేర్చి ఆర్థికసాయం చేయాలని పదేపదే కోరుతున్నా స్పందించని కేంద్రం, అదనపు టీఎంసీ పనుల వివరాలపై లేఖలు రాయడం మాత్రం విస్మయానికి గురి చేస్తోందని జల వనరుల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
‘ప్రాజెక్టులు రైతుల కోసమా.. కేసీఆర్ కోసమా ’
సాక్షి, సిద్ధిపేట : కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభించిన నెల రోజుల్లోనే కాలువలకు గండి పడిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతుందని ఆయన ఎద్దేవా చేశారు. కాలువకు గండి పడ్డ ప్రాంతాన్ని ఉత్తమ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల నిర్మాణం రైతుల కోసమా ? లేక కేసీఆర్ కోసమా ? అనేది అర్థం కావడం లేదని సందేహం వ్యక్తం చేశారు. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు గుప్పించారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై రాష్ట్ర స్థాయిలో నిలదిస్తామని దీనిపై పోరాడుతామని తెలిపారు. కాలువలకు గండి పడటం సహజం అంటున్న ఈఎన్సీ హరి రామ్ అసలు ఇంజనీర్ అవునా కాదా అన్న అనుమానం కలుగుతోందని ఉత్తమ్ మండిపడ్డారు. (కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండి) గండ్లు పడే ప్రాజెక్టులు, కాలువలు నిర్మిస్తున్నారా అని ఉత్తమ్ ప్రశ్నించారు. గండ్లు సహజం అంటున్న ఈఎన్సీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాలువకు గండి పడితేనే ఇలా ఉంటే.. ప్రాజెక్టులకు గండి పడితే పరిస్థితి మరెంత ప్రమాదకరంగా ఉంటుందో ప్రజలే గుర్తించాలని సూచించారు. కాలువ గండి పడి నష్టపోయిన శివారు వెంకటాపూర్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్ట పోయిన ప్రాంతాన్ని పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డికి సమయం లేదా అని నిలదీశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కనే కాలువకు గండి పడ్డదంటే నిర్మాణ లోపాలు తేట తెల్లం అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటి వరకు చెక్కు చెదర లేదని పేర్కొన్నారు. (తెలంగాణ సర్కార్కు హైకోర్టు ఆదేశాలు) -
కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండి
-
కొండపోచమ్మ కాల్వలకు వర్షం దెబ్బ
గజ్వేల్: కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ కాల్వలకు వర్షం దెబ్బ తగిలింది. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల కాల్వల సిమెంట్ లైనింగ్ దెబ్బతిన్నది. మట్టి కుంగిపోయి లీకేజీలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉన్నది. గోదావరి జలాలు మల్లన్నసాగర్ సర్జిపూల్ నుంచి తుక్కాపూర్ గ్రావిటీ కెనాల్ ద్వారా 24 కిలోమీటర్లు ప్రయాణం చేసి గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద నిర్మించిన హెడ్రెగ్యులేటరీ వద్దకు చేరుకుంటాయి. ఇక్కడి గేట్లు ఎత్తిన తర్వాత కాల్వల ద్వారా అక్కారం పంపుహౌజ్ వైపు మరో 6 కిలోమీటర్లు తరలివెళ్తాయి. అక్కడి నుంచి మరో 6.5 కిలోమీటర్ల మేర మర్కూక్–2 పంపుహౌజ్కు, ఆ తర్వాత కొండపోచమ్మ రిజర్వాయర్లోకి చేరుతాయి. మల్లన్నసాగర్ సర్జిపూల్ నుంచి కొడకండ్ల వరకు ఉన్న ఈ కాల్వ సామర్థ్యం 11,500 క్యూసెక్కులు. ఇది నాగార్జునసాగర్ కాల్వల సామర్థ్యం కంటే కూడా పెద్దది. ఇంతటి కీలకమైన కాల్వ వర్షాలకు దెబ్బతినడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా గజ్వేల్ మండలం కొడకండ్ల హెడ్ రెగ్యులేటరీ వద్ద సిమెంట్ లైనింగ్, మెట్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల మట్టి కుంగిపోయి సిమెంట్ లైనింగ్ దెబ్బతినడంతో లీకేజీలు ఏర్పడే ప్రమాదం నెలకొన్నది. మర్కూక్ సమీపంలోనూ కాల్వ సిమెంట్ లైనింగ్ దెబ్బతిన్నది. దీంతో కాల్వ నాణ్యత ప్రమాణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై నీటిపారుదల శాఖ ఈఈ బద్రీనారాయణ వివరణ కోరగా, భారీ వర్షాల కారణంగానే నీటి ప్రవాహం పెరిగి కాల్వ దెబ్బతిన్న మాట వాస్తవమేనని తెలిపారు. అయితే నీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే మరమ్మతు చేయిస్తున్నామని స్పష్టం చేశారు. -
కొండపోచమ్మ రిజర్వాయర్కు సీఎం
సాక్షి, సిద్దిపేట/ మర్కూక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం పరిశీలించారు. ఎర్రవల్లి ఫామ్హౌజ్ నుంచి మధ్యాహ్నం బయలుదేరిన ఆయన, తన వాహనంపై 15 కిలోమీటర్ల పొడవున ఉన్న కట్ట చుట్టూ తిరుగుతూ.. కట్ట నిర్మాణం, నీటి నిల్వ, కాల్వల ద్వారా నీటి విడుదల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్తో సీఎం మాట్లాడారు. రిజర్వాయర్ హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్నందున పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కట్టపై ఇరువైపులా పచ్చని చెట్లు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పాలని ఆదేశించారు. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా నీటిని విడుదల చేస్తేనే జలపాతాన్ని మించిన శోభ కనిపిస్తోందని, ఇక రిజర్వాయర్కు ఉన్న ఆరు పంపుల ద్వారా నీరు విడుదల చేస్తే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రిజర్వాయర్ను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తున్నారని, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తే సందర్శకుల తాకిడి అధికం అవుతుందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా భద్రతను కూడా పెంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, పర్యాటకులు కట్టపైన ఇష్టానుసారంగా తిరగకుండా చూడాలని, అవసరమైన చోట్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రిజర్వాయర్పై వెళ్తూ ఉంటే ఆనందంగా ఉందని అన్నారు. రిజర్వాయర్ ను పూర్తిస్థాయిలో నింపితే ఈ ప్రాంతంలోని ఇంచు భూమి కూడా వృథా పోకుండా సాగులోకి వస్తుందన్నారు. అప్పుడు చుట్టూరా పచ్చటి పొలాలు, మధ్య లో అందమైన రిజర్వాయర్ పర్యాటకులకు మరింత కనువిందు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రితోపాటు ఆయన చిన్ననాటి స్నేహితుడు జహంగీర్ ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
కొండపోచమ్మ: సీఎం కేసీఆర్ ఆకస్మిక తనిఖీ
సాక్షి, మర్కుక్ (సిద్దిపేట) : మర్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు, మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సీఎం ప్రాజెక్ట్ పనులను పరిశీలించడానికి వచ్చారు. దీంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద కొండపోచమ్మ ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ను కలవడానికి, చూడటానికి భారీగా తరలివచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కట్టపై తిరుగుతూ గోదావరి జలాలను పరిశీలించిన సీఎం కేసీఆర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. (ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది) కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్కు సంబంధించిన ఏమైనా లోపాలు ఉన్నాయా అని అధికారులను, స్థానికులను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సాగర్లో స్నానానికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతిని ఇవ్వొద్దని అధికారులను హెచ్చరించారు. కొండపోచమ్మ దిగువన ఉన్న రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అక్కడి రైతులను కేసీఆర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాగర్ నిర్మాణంలో జరుగుతున్న పనులపై అధికారులు సీఎంకు వివరించారు. సాగర్నుంచి మల్లన్న సాగర్ కాలువ పనుల గురించి ఆరా తీశారు. కొండపోచమ్మ కుడి, ఎడమ కాలువల పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. (త్వరలో రైతులకు శుభవార్త..) -
సీఎం కేసీఆర్ మాట తప్పారు
-
కాళేశ్వరంలో ‘మేఘా’ పవర్!
సాక్షి, హైదరాబాద్: లక్షలాది ఎకరాలకు సాగునీరిచ్చే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని కీలకమైన పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) దక్కించుకుంది. ప్రాజెక్టులోని అత్యధిక పంపింగ్ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసి ఎంఈఐఎల్ మరోమారు తన ఇంజనీరింగ్ శక్తిసామర్థ్యాలు, నైపుణ్యాన్ని చాటుకుంది. మొత్తం ప్రాజెక్టులో 4,680 మెగావాట్ల సామర్థ్యంతో పంపులు, మోటార్లు ఏర్పా టు చేస్తుండగా, ఇందులో 3,840 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు, మోటార్ల పనులను చేపట్టిన ఎంఈఐఎల్.. అతి తక్కువ సమయంలోనే 3,767 మెగా వాట్ల పంపింగ్ కేంద్రాలను పూర్తి చేసి సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించింది. ‘కొండ పోచమ్మ’తో కీర్తి శిఖరాలకు.. కాళేశ్వరంలోని మొత్తం 22 పంపింగ్ కేంద్రాల్లో 96 పంపులు, మోటార్లను 4,680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తుండగా.. అందులో 15 పంపింగ్ కేంద్రాల్లో 89 పంపులు, మోటార్లను 3,840 మెగావాట్ల సామర్థ్యంతో మేఘా సంస్థ నిర్మిస్తోంది. ఇక రోజుకు 2 టీఎంసీల నీటిని పంప్ చేసే విధంగా మేఘా సంస్థ నిర్మించిన కేంద్రాల్లో 9 వినియోగంలోకి వచ్చాయి. మరో 4 పంపింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉండగా, మరో రెండు పంపింగ్ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ పనులు ప్రారంభించిన మూడేళ్లలోనే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మొదటి దశలోని లక్ష్మి (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్ కేంద్రాలు, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు రెండో దశ ఎత్తిపోతలో గాయత్రి (ప్యాకేజీ–8), నాలుగో దశలో మిడ్మానేరు నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు అన్నపూర్ణ (ప్యాకేజీ–10), రంగనాయక సాగర్ (ప్యాకేజీ–11), మల్లన్నసాగర్ (ప్యాకేజీ –12) కేంద్రాలను సంస్థ వినియోగంలోకి తేగా.. శుక్రవారం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆరంభించిన అక్కారం, మర్కూక్ (ప్యాకేజీ–14) మోటార్లతో సంస్థ వినియోగంలోకి తెచ్చిన పంపుల సామర్థ్యం 3,767 మెగావాట్లకు చేరింది. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబీబీ, క్రాంప్టన్ గ్రేవ్స్, వెగ్ లాంటి సంస్థలు ఈ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో నిర్మించిన కొండపోచమ్మ సాగర్కు నీటిని పంపింగ్ చేయడంలో ఎంఈఐఎల్ కీలక పాత్ర పోషించి కీర్తి దక్కించుకుంది. అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉండగా, ఆ తర్వాత లిబియాలోని గ్రేట్ మ్యాన్మేడ్ రివర్ రూపుదిద్దుకుంది. వీటన్నింటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోని హంద్రీ–నీవా ఎత్తిపోతల పథ కం పెదద్ది కాగా ఆ పథకంతో పోలిక లేని స్థాయిలో భారీ బహుళ తాగు, సాగు నీటి పథకంగా ప్రస్తుతం కాళేశ్వరం ప్రపంచా న్ని ఆకర్షిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4,680 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, ఇందులో అత్యధికంగా 3,840 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. మొత్తం 7 ఈశాన్య రాష్ట్రాల విద్యుత్ సరఫరా సా మర్థ్యం 3,916 మెగావాట్లైతే కాళేశ్వరంలో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థకు దాదాపు సమానంగా ఉంది. సీఎం పట్టుదలతోనే.. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టులో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్ అదృష్టం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు, బీడు భూములను సస్యశ్యామ లం చేసేందుకు ప్రపంచంలో అత్యు త్తమ ఇంజనీరింగ్ సంస్థలతో కలసి పనిచేయడం, అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించిన జీవితకాలపు గౌరవంగా భావిస్తున్నాం. సీఎం చంద్రశేఖర్రావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే ఇంత తక్కువ కాలంలో ప్రాజెక్టు పూర్తి చేయగలిగాం..’ – బి.శ్రీనివాస్రెడ్డి, ఎంఈఐఎల్ డైరెక్టర్ -
త్వరలో రైతులకు శుభవార్త..
సాక్షి, సిద్దిపేట : ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోంది. త్వరలో రైతులకు శుభవార్త వినిపిస్తా. ఆ వార్త విని దేశమే అబ్బుర పడుతుంది’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో నిర్మించిన కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ సాగును లాభదాయకం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుం టోందన్నారు. ఇప్పటికే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, ప్రాజెక్టులు నిర్మించి సాగునీటి ఇబ్బందులను తొలగిస్తున్నామని చెప్పారు. రిజర్వాయర్ల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు రూ. వందల కోట్ల విద్యుత్ ఖర్చవుతుందని, అయినా రైతులపై ఒక్క రూపాయి కూడా నీటి తీరువా విధించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా ద్వారా రైతులకు చేయూతనిస్తున్నామని చెప్పారు. నియంత్రిత సాగు విధానంతో తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శం కానున్నారన్నారు. రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరింత చిత్తశుద్ధి్దతో ముందుకెళ్తుందన్నారు. రైతును రాజు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంటుందని... ఆ నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. అంతవరకు సస్పెన్స్గా ఉంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు. -
ఉద్యమ లక్ష్యం నెరవేరుతోంది
సాక్షి, సిద్దిపేట : రాష్ట్ర చరిత్రలో ఉజ్వల ఘట్టం ఇది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. తలాపున పారుతున్న గోదావరి.. మన చేలు, మన బతుకు ఎడారి అని పాటలు పాడుకున్నాం. ఇప్పుడు గోదావరి జలాలు తెలంగాణలోని ఎత్తైన ప్రాంతం కొండపోచమ్మ రిజర్వాయర్లో ఎత్తిపోశాం. ఇక ఈ ప్రాంతం సాగునీటి కష్టాలు తీరినట్టే. ఇలా ఉద్యమ లక్ష్యాలను ఒకొక్కటిగా నెరవేర్చుకుంటూ పరాయి పాలనలో ఆగమైన తెలంగాణలో అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నాం’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలను చినజీయర్ స్వామితో కలసి విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... నిర్వాసితులకు ఇళ్లు, ఉపాధి.. ప్రాజెక్టులు కడితే సాగునీరు వస్తుంది. ఇదే సందర్భంలో గ్రామాలు, భూములు కోల్పోవాల్సి వచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వారి త్యాగానికి వెలకట్టలేం. వారికి ప్రభుత్వం మంచి ప్యాకేజీలు ఇచ్చింది. అయినా వారు గూడులేని పక్షులుగా మారిపోయారు. ఇలా త్యాగం చేసిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కార్పొరేట్కు దీటుగా వారికి ఇళ్లు కట్టిస్తున్నాం. అదేవిధంగా వారికి ఉపాధి కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. వారి కోసం నూతనంగా ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తాం. ఆరేళ్లలోనే పురోగతి... పరాయి పాలనలో ఆగమైన తెలంగాణ... స్వరాష్ట్రం సాధించిన ఆరు సంవత్సరాల్లోనే అద్భుత ఫలితాలు సాధిస్తూ ముందుకెళ్తోంది. గతంలో కరెంట్ కోతలు, నీటి కష్టాలు ఉండేవి. ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరా అందుతోంది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తున్నాం. ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతు బీమాను అమలు చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ కూడా అమలు చేస్తున్నాం. ఇందుకోసం ఈ ఏడాది రూ. 1,300 కోట్లు విడుదల చేశాం. అదేవిధంగా ఆసరా పెన్షన్లు, వికలాంగులకు నెలకు రూ. 3 వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమే. సంక్షేమ రంగంలోనూ అనేక మార్పులు తీసుకొచ్చాం. 53 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు« ధాన్య రాసులకు నిలయంగా మారింది. దేశం మొత్తంమీద 83 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే ఒక్క తెలంగాణ నుంచే 53 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం మనం సాధించిన ప్రగతికి నిదర్శనం. ఈ విషయం నేను చెప్పేది కాదు.. ఎఫ్సీఐ సీఎండీ వీవీ ప్రసాద్ చెప్పిన మాటలివి. సాగునీటి ఇబ్బందులు తీర్చుకునేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాం. 35 టీఎంసీల సామర్థ్యంతో సీతారామ, 7.5 టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క–సారక్క, గౌరవెల్లి, గండిపల్లి మొదలైన ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ బంగారు పంటలు, భాగ్యరాసులు, పసిడి పంటలు పండే తెలంగాణగా విరజిల్లనున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బ్యారేజీల్లో 40 టీఎంసీలు, రిజర్వాయర్ల ద్వారా 125 టీఎంసీలు మొత్తం 165 టీఎంసీలను నిల్వ చేసుకుంటున్నాం. అదేవిధంగా అన్ని విధాలుగా మొత్తం 530 టీఎంసీల నీటి వినియోగ సామర్థ్యం పొందాం. రంగనాయక సాగర్ ద్వారా ఇప్పటికే చెరువుల్లోకి జలకళ సంతరించుకుంది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ద్వారా సింగూరు లిఫ్ట్ ఇరిగేషన్తో హల్దీ వాగుకు నీటిని విడుదల చేస్తాం. కామారెడ్డి, గుజ్జులు, కాయగల్ ప్రాంతాలకు కూడా సాగునీరు అందిస్తాం. ఇకపై పచ్చటి పొలాల తెలంగాణ... ప్రాజెక్టుల నిర్మాణం ఒక ఎత్తయితే పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకోవడం మరో ఎత్తు. ఇటువంటి కీలక సమస్యను అధిగమిస్తూ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవడం రాజనీతిజ్ఞతకు నిదర్శనం. వారిని మెప్పించడమే కాకుండా భూమిపూజకు అక్కడి ముఖ్యమంత్రిని ఆహ్వానించాం. తెలంగాణ అంతా సస్యశ్యామలం చేయాలని నిర్మించిన ప్రాజెక్టు ద్వారా రిజర్వాయర్లతోపాటు రూ. 4 వేల కోట్లతో 1,250 చెక్ డ్యాంలు నిర్మించాం. వ్యవసాయం లాభసాటి చేయాలనే ఆలోచనతో నియంత్రిత సాగు విధానం ప్రవేశపెట్టాం. ఇది నియంత్రిత సాగు మాత్రమే.. నియంతృత్వ సాగు కాదు. ఇంజనీర్లకు సెల్యూట్.. తెలంగాణ వారు అంటే తెలివితక్కువ వారని చులకన చేసేవారు. అటువంటి తెలంగాణ ఇంజనీర్లు ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి చూపించారు. ప్రాజెక్టు ప్రారంభంలో విమర్శలు, శాపనార్థాలు పెట్టినవారు కూడా ఇప్పుడు మౌనంగా ఉండేలా చూపించారు. సముద్ర మట్టానికి 88 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపొచమ్మ సాగర్కు జలాలు ఎత్తిపోసేలా ఆవిష్కరణ చేసి చూపించిన తెలంగాణ ఇంజనీర్లకు సెల్యూట్. ఎత్తిపోతల సలహాదారులు పెంటారెడ్డి, ఇతర ఇంజనీర్ల మేధాశక్తితో దశాబ్దాలుపట్టే ప్రాజెక్టులను కేవలం నాలుగు సంవత్సరాల్లోనే నిర్మించి సత్తా చాటారు. ఇందుకు సహకరించిన కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు ధన్యవాదాలు. అదేవిధంగా 48 డిగ్రీల ఎండలోనూ పనులు చేసిన వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వందనాలు తెలుపుతోంది. 400 మెగావాట్ల విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం పదేళ్లు పట్టేది. కానీ నాలుగు సంవత్సరాల్లోనే 480 మెగావాట్ల విద్యుత్ వినియోగం కోసం 400 కేవీ సబ్స్టేషన్లు ఆరు, 220 కేవీ సబ్స్టేషన్లు ఏడు, 135 కేవీ సబ్ స్టేషన్లు రెండు నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం వేగంగా భూసేకరణ చేసిన రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బందికి, ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసిన విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. -
ఉవ్వెత్తున గోదారి
సాక్షి, సిద్దిపేట : కరువు నేలను గోదారమ్మ ముద్దాడింది. సముద్రమట్టానికి 88 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద ప్రవహించే గోదావరి 618 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి ఎగిరి దుంకింది. మేడిగడ్డ నుంచి పది లిప్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. త్రిదండి చినజీయర్ స్వామితో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం మర్కూక్ పంప్హౌస్ వద్ద రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. మోటార్లను ఆన్ చేసిన 10 నిమిషాల్లోనే గోదావరి ఉత్తుంగ జలవాహినిలా కొండపోచమ్మ రిజ ర్వాయర్లోకి ప్రవహించింది. పంప్హౌస్ నుంచి రిజర్వాయర్ వద్దకు వచ్చిన సీఎం దంపతులు, చినజీయర్ స్వామి, మంత్రులు, ఇరిగేషన్ అధికారులు గోదావరి నీటికి స్వాగతం పలికారు. కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలు, నవధాన్యాలు, పూలు, పండ్లను నీటి ప్రవాహంలో వేసి గోదారమ్మకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మం త్రులు తన్నీరు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, ఫారూక్ హుస్సేన్, బి. వెంకటేశ్వర్లు, శేరి శుభాష్రెడ్డి, ఎమ్మెల్యేలు సొలిపేట రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, సతీష్కుమార్, మదన్రెడ్డి, రసమయి బాలకిషన్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. కొండపోచమ్మ ఆలయంలో తీర్థం స్వీకరిస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు పూజలతో కార్యక్రమానికి శ్రీకారం... కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ దంపతులు ముందుగా జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ మండలంలోని కొండపొచమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ప్రాంగణంలో శుక్రవారం వేకువజామున 4 గంటలకు చండీయాగం చేపట్టగా కేసీఆర్ దంపతులు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు మర్కూక్, ఎర్రవెల్లి గ్రామాల్లోని రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వరదరాజుపూర్లోని వరదరాజుల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీయాగంలో పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు చినజీయర్ స్వామితో కలిసి.. ఏ కార్యక్రమం చేపట్టినా యజ్ఞ, యాగాలు నిర్వహించే ఆనవాయితీ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభానికి ముందు కూడా మర్కూక్ పంప్హౌస్ వద్ద సుదర్శన యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న సీఎం దంపతులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చినజీయర్కు స్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య సుదర్శన యాగం నిర్వహించారు. యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన వారందరికీ చినజీయర్ స్వామి ఆశీర్వచనాలు అందజేశారు. అక్కడి నుంచి నేరుగా పంప్హౌస్ వద్దకు చినజీయర్ స్వామితో కలసి సీఎం కేసీఆర్ వెళ్లి పంప్హౌస్లోని రెండు మోటార్లను స్విచ్ ఆన్ చేసి కొండపొచమ్మ రిజర్వాయర్లోకి గోదావరి జాలలను వదిలారు. శుక్రవారం కొండపోచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన చండీయాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు సతాయించిన రెండో మోటార్ మర్కూక్, జగదేవ్పూర్ (గజ్వేల్): కొండపోచమ్మసాగర్ పంప్హౌస్ ప్రారంభంలో రెండో మోటార్ కొంతసేపు సతాయించింది. పంప్హౌస్లోని రెండు మోటార్లను ప్రారంభించేందుకు మర్కూక్ కట్టపైకి సీఎం కేసీఆర్ చేరుకొని మోటార్లను స్విచ్ ఆన్ చేయగా మొదటి మోటార్ వెంటనే ప్రారంభమైంది. కానీ సాంకేతిక కారణాలతో రెండో మోటార్ ఆన్ కాలేదు. దాన్ని రిపేర్ చేసేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో కేసీఆర్, మంత్రులు అక్కడి నుంచి వరదరాజుపూర్లోని వరదరాజస్వామి దేవాలయానికి వెళ్లారు. అరగంట తర్వాత మోటార్ను బాగు చేశాక సీఎం కేసీఆర్ తిరిగి పంప్హౌస్ వద్దకు చేరుకొని రెండో మోటార్ను ప్రారంభించారు. మర్కూక్ పంప్హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శన యాగంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు, చినజీయర్స్వామి తదితరులు సుదర్శనయాగంలో నవ దంపతులు మర్కూక్ (గజ్వేల్): కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు మర్కూక్ పంప్హౌస్ వద్ద నిర్వహించిన సుదర్శనయాగంలో పాల్గొనే అదృష్టం మర్కూక్ మండల ఎంపీపీ తాండ పాండుగౌడ్ నూత న దంపతులకు లభించింది. పాండుగౌడ్కు ఈ నెల 27న మెదక్ జిల్లా మనోహరాబాద్కు చెందిన మేఘనతో వివా హం జరగ్గా పెళ్ల యిన రెండో రో జే అంటే శుక్రవా రం సీఎం కేసీఆర్ సూచనల మేరకు సుదర్శనయాగంలో నూ తన దంపతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దంపతులతో కలసి ఈ అరుదైన ఘట్టంలో పాలుపంచుకున్నారు. అలాగే త్రి దండి చినజీయర్స్వామి నుంచి ఆశీర్వాదాలు తీసుకు న్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా పాండు గౌడ్ దంపతులను మా ఎంపీపీ దంపతులు అంటూ పరిచయం చేయడంతో వారు ఉప్పొంగిపోయారు. కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవంలో తమకు అవకాశం దక్కడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. -
‘కొండ’నెక్కిన గోదారి గంగమ్మ!
-
కష్టాల పాటల నుంచి పసిడి పంటలవైపు..
-
రైతులకు అతి త్వరలోనే అతిపెద్ద తీపి కబురు
-
వారం రోజుల్లోనే పెద్ద తీపి కబురు చెప్తా: కేసీఆర్
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రైతులకు వారం రోజుల్లోనే పెద్ద తీపికబురు చెబుతానని ప్రకటించారు. భారత్లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజక్టు కోసం భూములు ఇచ్చినవారి త్యాగాలు వెలకట్టలేనివని సీఎం పేర్కొన్నారు. భూములు కోల్పోయినవారందరికీ పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు వచ్చాయని అన్నారు. నిర్వాసితుల త్యాగాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. (చదవండి: కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం.. ) కష్టాల పాటల నుంచి పసిడి పంటలవైపు.. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్ ప్రారంభం ఉజ్వల ఘట్టమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఏ లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామో ఆ కల సంపూర్ణంగా, సాదృశ్యంగా సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ అపురూపమైన ప్రాజెక్టు అని సీఎం వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల్లోనే దుమ్ముగూడెం దగ్గర సీతమ్మసాగర్, దేవాదుల ప్రాజెక్టు కోసం సమ్మక్క సాగర్ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. హుస్నాబాద్ దగ్గర గౌరవెళ్లి, గండిపెల్లి ప్రాజెక్టు కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ పేరుతెచ్చుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఆరేళ్ల క్రితం కష్టాల పాటలు పాడుకున్న తెలంగాణ ఇప్పుడు పసిడి పంటల రాష్ట్రంగా మారిందని కేసీఆర్ వెల్లడించారు. (చదవండి: తెలంగాణ సాగునీటి కల సాకారం) -
కేసీఆర్ పేరుకు కొత్త నిర్వచనం..
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుకు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం చెప్పారు. తెలంగాణలో కోటి ఎకరాల మాగాణికి నీరందించడమే లక్ష్యంగా.. కేసీఆర్ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజక్ట్లో భాగమైన కొండపోచమ్మ రిజర్వాయర్(మర్కూక్) పంప్హౌస్ను కేసీఆర్ ప్రారంభించారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని దేశంలోనే యువ రాష్ట్రమైన తెలంగాణ కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని తెలిపారు. కేసీఆర్.. తన పేరును K-కాల్వలు, C-చెరువులు, R-రిజర్వాయర్లు సార్థకం చేసుకున్నారని అన్నారు. తెలంగాణలో కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.(చదవండి : కొండపోచమ్మకు గోదావరి జలాలు..) మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని చేరవేశామని కేటీఆర్ తెలిపారు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా.. త్వరలోనే కేశవపురం రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. దూరదృష్టితో భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులు నిర్మిస్తున్న కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.(చదవండి : కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు) K కాల్వలు C చెరువులు R రిజర్వాయర్లు పేరు సార్థకం కాగా...🙏 మేడిగడ్డ నుండి కొండపోచమ్మ వరకు... 82 మీటర్ల ఎత్తు నుండి 618 మీటర్ల ఎత్తు వరకు 🙏 World’s largest multi-stage lift irrigation project 💪 completed in 3 years by India’s youngest state #Telangana #KaleshwaramProject pic.twitter.com/IQcoi46xSX — KTR (@KTRTRS) May 29, 2020 -
తెలంగాణ సాగునీటి కల సాకారం
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా తెలంగాణ నేడు రికార్డులకు కెక్కించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగునీటి కోసం కొట్లాడిన ప్రాంతం నేడు జలకళతో సస్యశ్యామలమైంది. నిధులు.. నీళ్లు.. ఉద్యోగాలే ఏజెండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నీటికోసం భగీరథ ప్రయత్నం చేశారు. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నో ఇంజనీరింగ్ కంపెనీలు ముందుకొచ్చినా ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించింది మాత్రం మేఘా (MEIL). ఈ కంపెనీ రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసింది. కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా 3763 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. పుష్కలంగా గోదావరి జలాలు.. ఒకప్పుడు నీటిగోసను అనుభవించిన తెలంగాణ నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి ఆలోచనకు తోడు ఎంఈఐఎల్ అహోరాత్రుల కృషి ఫలితంగానే ఇది సాధ్యపడింది. నీటి ప్రాజెక్టులు కట్టాలంటే దశబ్దాలు పడుతాయన్న అపఖ్యాతిని దూరంచేసేలా మేఘా కంపెనీ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకంలో అత్యధిక పంపింగ్ కేంద్రాలను పూర్తిచేసి తన ఇంజనీరింగ్ శక్తిసామర్థ్యాలు, నైపుణాన్ని చాటుకుంది. కేవలం నాలుగేళ్ళ సమయంలో దాదాపు నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్హౌస్లను నిర్మించడమే కాకుండా వాటిని పంపింగ్ ద్వారా వినియోగంలోకి(ఆపరేషన్, మెయిన్టెనెన్స్) తీసుకొచ్చింది. రికార్డు స్థాయిలో పూర్తి.. మేఘా సంస్థ దీనిని ఓ నీటి ప్రాజెక్టుగా కాకుండా తమకు దక్కిన గౌరవంగా భావించి ఓ సవాల్గా తీసుకొని పూర్తి చేసింది. కేవలం నాలుగేళ్లలో ప్రపంచంలోని అతి భారీనీటి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసింది. ముఖ్యమంత్రి పట్టుదలకు తోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రోమెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబిబి, క్రాంప్టన్ గ్రేవ్స్, వెగ్ లాంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకున్నాయి. ప్రపంచంలో తొలిసారిగా ఇక్కడ భారీస్థాయిలో బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నాలుగేళ్ళ క్రితం ప్రభుత్వం ప్రారంభించింది. పనులు ప్రారంభించిన మూడేళ్ళలోనే లింక్1, లింక్2లో ఎత్తిపోతల కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి. ఇంజనీరింగ్ చరిత్రలో అద్భుతం కాళేశ్వరం.. ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే మేఘా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా నిలిచింది. తాజాగా ప్యాకేజ్14లోని పంప్హౌస్ను వినియోగంలోకి తేవడం ద్వారా 3,763మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి రానుంది. నీటి పారుదల రంగంలో దాదాపు 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసేలా భారీ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంది. సాగునీటి అవసరాల కోసం ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉంది. ఆ తర్వాత లిబియాలోని గ్రేట్ మ్యాన్మేడ్ రివర్ రూపుదిద్దుకుంది. ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వేరపోయేలా రికార్డు సమయంలో కాళేశ్వరం పనులు పూర్తయ్యాయి. భూగర్భంలో కొత్త లోకం మొత్తం పంపింగ్ కేంద్రాల్లో అత్యధిక భాగం భూగర్భంలో నిర్మించినవే. అత్యధిక సామర్థ్యం కలిగిన పంపింగ్ కేంద్రాలు భూగర్భంలోనివే. ఇందులో మేఘా ఇంజనీరింగ్ నిర్మించిన గాయత్రి (ప్యాకేజ్8), అన్నపూర్ణ (ప్యాకేజ్10), రంగనాయక సాగర్ (ప్యాకేజ్11), మల్లన్నసాగర్ (ప్యాకేజ్12) భూగర్భంలో నిర్మించినవే. ప్రధానంగా గాయత్రి పంప్హౌస్ నిర్మాణం కోసం భూగర్భంలో 2.3ఘనపు మీటర్ల మట్టిని తొలిసి బయటకు తీసింది. ఈ పంపింగ్ కేంద్రం వైశాల్యం 84753.2 చదరపు అడుగులు. దీనికి సంబంధించిన సర్జ్పూల్, అదనపు సర్జ్పూల్స్ కూడా ప్రపంచంలోనే పెద్దవి. గోదావరిని దిగువ నుంచి ఎగువకు తిరుగు ప్రయాణం చేసే విధంగా పంపింగ్ చేయడం కోసం 1120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు పంప్హౌస్లను 28మిషన్లతో ఏర్పాటు చేశారు. అవి లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్ కేంద్రాలు. వీటిన్నింటిని భూగర్భంలో నిర్మించి సరికొత్త ఆ ప్రాంతంలో సరికొత్త లోకాన్ని సృష్టించింది. భూగర్భంలో గాయత్రి నిర్మాణం.. ఆ తర్వాత ప్యాకేజ్8 పంపింగ్ కేంద్రం గాయత్రి. భూగర్భంలో మేఘా నిర్మించిన ఒక్కో పంపింగ్ కేంద్రం ఒక్కో అద్భుతాన్ని సృష్టించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో 2టిఎంసీల నీటి పంపింగ్కుగాను మొత్తం 4680 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో ఎంఈఐఎల్ ఏర్పాటు చేస్తున్న 89మిషన్లు 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి మేఘానే ఏర్పాటు చేస్తోంది. మేఘాకు దక్కిన గౌరవం ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్లో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్ అదృష్టమని మేఘా సంస్థ ప్రతినిధి బీ.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజినీరింగ్ సంస్థతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం తమకు దక్కిన జీవితకాల గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో చర్చించి ప్రోత్సహించడం వల్లనే త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని బీ.శీనివాస్ రెడ్డి తెలిపారు. -
కొండపోచమ్మకు గోదావరి జలాలు..
-
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం
సాక్షి, సిద్ధిపేట : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలమైన దశకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్ను(మర్కూక్) సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. చినజీయర్ స్వామితో కలిసి ఆయన మోటార్ ఆన్ చేశారు. దీంతో కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్రని లిఖించినట్టయింది. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారా 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్రావు, ఇంద్రకరణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎంపీలు సంతోష్కుమార్, కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. (చదవండి : కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు) అంతకుముందు శుక్రవారం తెల్లవారుజాము నుంచే కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం, మర్కూక్ వద్ద సుదర్శన యాగం ప్రారంభం అయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న కేసీఆర్ ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మర్కూక్ వద్ద నిర్వహించిన సుదర్శన యాగం పుర్ణాహుతిలో కేసీఆర్, చినజీయర్ స్వామి పాల్గొన్నారు. -
కేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు
-
కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ పూజలు
సాక్షి, సిద్ధిపేట : కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామునే కొండపోచమ్మ సాగర్ పంపుహౌస్(మర్కూక్) వద్ద సుదర్శన యాగం, ప్రాజెక్టు నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న కేసీఆర్ దంపతులు.. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొన్నారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీష్రావు, ఇంద్రకరణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. (చదవండి : కొండంత సంబురం నేడే) పూర్ణాహుతి ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎర్రవల్లి, మర్కూక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత కేసీఆర్ మర్కూక్ పంప్హౌస్ వద్దకు చేరుకొని చినజీయర్ స్వామికి స్వాగతం పలుకనున్నారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో ఆయన పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు పంప్హౌస్లలోని రెండు మోటార్లను ఆన్ చేసి గోదావరి ఎత్తిపోతలకు కేసీఆర్ శ్రీకారం చూట్టనున్నారు. -
చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్
-
29న సిద్ధిపేటకు సీఎం కేసీఆర్
సిద్దిపేటజోన్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను జిల్లాకు తరలించే మహోత్తర ఘట్టంలో మరో దృశ్యం 29వ తేదీన ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలో అత్యంత ఎత్తయిన 618 మీటర్ల ఎత్తులోని కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వైభవంగా ఈ వేడుక జరుగనుంది. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు కలెక్టరేట్లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్డేవిస్తో పాటు జిల్లా అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే మరో వైపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని సూచించారు. రాష్ట్రంలోనే అత్యంత ఎత్తులో ఉన్న కొండపొచమ్మ రిజర్వాయర్నుత్వరలో ప్రారంభించుకుంటున్న సందర్భంగా మంత్రి హరీశ్రావు జిల్లా అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం ఆలోచన అమలుకు రిజర్వాయర్ల నిర్మాణం వెనుక జిల్లా అధికారుల కృషి చాలా ఉందని, ప్రతి శాఖ నిద్రలేని రాత్రులతో అహర్నిశలు కృషి చేసి అన్ని రంగాల్లో జిల్లాను తొలి స్థానంలో నిలుపుతున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. జిల్లాలో ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు సీఎం కేసీఆర్ కార్యక్రమాలను చాలా చేశామని, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు రాకుండా ప్రశంసలు పొందామని, అలాగే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహిద్దామని మంత్రి అధికారులకు సూచించారు. ప్రధానంగా ప్రçస్తుత కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అధికార వర్గాలకు సూచించారు. కార్యక్రమం మొదటి నుంచి ముగిసే వరకు సీఎం పర్యటనలో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమాలు, శాఖల వారీగా ఏర్పాట్లు, ఇతరాత్ర నిర్వహణ బాధ్యతలపై మంత్రి హరీశ్రావు అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లాకు చెందిన అధికారులు, నాయకులు రాధాకృష్ణశర్మ, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
భాస్కర్.. ఏం నడుస్తుంది? :కేసీఆర్
గజ్వేల్/మర్కూక్ : క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్వయంగా తెలుసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ భాస్కర్, అలాగే చేబర్తి సర్పంచ్ అశోక్లతో సీఎం కేసీఆర్ ఫోన్లో సంభాషించారు. ముందుగా మర్కూక్ మండల కేంద్ర సర్పంచ్ భాస్కర్తో మాట్లాడారు. మండల అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూనే కొండపోచమ్మ సాగర్ నిర్మాణం తర్వాత ప్రజా స్పందన, ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో కొద్దిసేపు సీఎంకు, భాస్కర్కు మధ్య సంభాషణ సాగిందిలా... సీఎం కేసీఆర్: హలో భాస్కర్... నేను కేసీఆర్ను మాట్లాడుతున్న.. మర్కూక్లో ఏం నడుస్తుంది..? అభివృద్ధి పనులు ఎట్లున్నయ్.. పనులేమన్న పెండింగ్లో ఉన్నాయా..? సర్పంచ్ భాస్కర్: సార్ నమస్కారం.. చాలా వరకు పనులు పూర్తి చేశాం. మర్కూక్ గ్రామ పంచాయతీ మోడల్ భవనం నిర్మాణం కోసం నిధులు కావాలె. సీఎం: భాస్కర్ నువ్వు రందిపడకు.. మర్కూక్ను ఆదర్శంగా మార్చుకుందాం. అవసరమైతే మరో రూ.5–6 కోట్ల నిధులు మంజూరు చేస్తా. నువ్ దగ్గరుండి సమస్యలు లేకుండా చూసుకో.. అదే విధంగా రైతు వేదిక నిర్మాణం పనులు రాష్ట్రంలో మొట్టమొదటగా ప్రారంభించుకొని ఆదర్శంగా నిలుద్దాం. ఇందుకు సంబంధించి సర్వే కూడా పూర్తి చేయించిన. సర్పంచ్: సంతోషం సార్. సీఎం: ఇంకా ఏం నడుస్తుంది? సర్పంచ్: సార్... మర్కూక్పై మీరు చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాం. కొండపోచమ్మ సాగర్కు నీళ్లొస్తున్నాయని అందరూ సంబరపడిపోతున్నరు. ఎక్కడ చూసినా ఇదే ముచ్చట చెప్పుకుంటున్నరు. సీఎం: సంతోషం.. త్వరలోనే కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుందాం. ఇందుకు సంబంధించి మర్కూక్లో 15 వందల మందికి సరిపడా భోజనాలు ఏర్పాటు చేసుకుందాం.. ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోవడం అవసరం. రైతుల కళ్లలో ఆనందం చూడాలనేదే నా తపన. అంతే కాకుండా మర్కూక్ శివారులోని 14 ఎకరాల్లో పబ్లిక్ పార్కును ఏర్పాటు చేసుకుందాం.. వెంటనే ఆ భూమిని క్లీన్ చేయాలి. సర్పంచ్: సార్.. నేను దగ్గరుండి పనులు మొదలు పెడతా. ప్రతిరోజు గ్రామంలోని వార్డులన్నీ కలియ తిరిగి సమస్యలు లేకుండా చూసుకుంటా సార్.. సీఎం: సరే... కొండపోచమ్మ ప్రారంభోత్సవానికి సంబంధించి భోజనాలు ఏర్పాటు చేసే స్థలం, ఇతర ఏర్పాట్లను దగ్గరుండి చూసుకో. సర్పంచ్: మంచిది సార్... తప్పకుండా ఏర్పాట్లలో నిమగ్నమవుతా. సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి గ్రామాభివృద్ధి గురించి ఆరా తీయడంతో సర్పంచ్ భాస్కర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయ్. ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పుకుంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. చేబర్తి చెరువులో గోదావరి నీరు నింపుర్రి.. అశోక్.. నేను సీఎంను మాట్లాడుతున్న.. మంగళవారం చేబర్తి చెరువులోకి గోదావరి జలాలు వస్తున్నాయి.. ఏదో ఒక సమయంలో నీరు వదులుతారు.. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో నేను మాట్లాడినా.. మీ ఎంపీపీ పాండుగౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రంతో కలసి అందరూ బ్రహ్మాండంగా చెరువు నింపుర్రి. పూలు, పండ్లు తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టి చెరువు, కుంటల్లోకి నీరు వదులుర్రి.. సర్పంచ్ అశోక్: తప్పకుండా అందరితో మాట్లాడుతా.. మా చెరువు కుంటలను నింపుకుంటం సార్.. కృతజ్ఞతలు సార్.. సీఎం: ప్రతాప్రెడ్డితో కలసి బ్రçహ్మాం డంగా చెరువులు నింపుకొర్రి సరేనా.. సర్పంచ్: తప్పకుండా సార్.. -
మర్కూక్ గ్రామ సర్పంచ్కు కేసీఆర్ ఫోన్!
సాక్షి, సిద్దిపేట: గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ గ్రామ సర్పంచ్కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం ఫోన్ చేశారు. గ్రామం ఎలా ఉందంటూ పలకరించారు. త్వరలో ప్రారంభం కానున్న కొండపోచమ్మ సాగర్ గురించి చర్చించారు. 1500 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో రైతుల కష్టాలు తీరినట్లేనని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. గోదావరి జలాలు తెలంగాణలోని ప్రతి పల్లెకి చేరాలన్న ధృఢసంకల్పంతో సాగుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మర్కూక్ పంప్హౌజ్ చివరిది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ పర్యటన ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్కు చేర్చడం ద్వారా గోదావరి నీటిని అత్యధిక ఎత్తుకు తీసుకెళ్లినట్టవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మర్కూక్ పంప్హౌజ్లో మోటార్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు సమాచారం. -
కొండ పోచమ్మకు గోదావరి జలాలు
సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గుండెకాయ వంటి కొమురవెల్లి మలన్నసాగర్ నుంచి బుధవారం నీటి విడుదల మొదలైంది. 52 టీఎంసీల నీరు నిల్వ చేయగల సామర్ధ్యం కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ సర్జ్పూల్కు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి విడుదలైన గోదావరి జలాలు చేరాయి. ఈ పథకంలో ఇది మానవ నిర్మిత అతిపెద్ద కట్టడం. ఇక్కడి నుంచి ఈ జలాలను కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి విడుదల చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ సహ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్ పరిధిలో కొండపోచమ్మ సాగర్ భారీ రిజర్వాయర్ను ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఎటువంటి ఆర్భాటం లేకుండా నేడు అధికారులు వెట్రన్ చేపట్టారు. వెట్రన్లో భాగంగా తొలుత ఒకటో నెంబర్ పంప్ నుంచి నీటి విడుదలను చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, సూచనలకు అనుగుణంగా నీటిపారుదల రంగ నిపుణుల సలహా మేరకు ఎటువంటి అటంకాలు ఎదురవకుండా నిర్మాణపనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టింది. వాస్తవానికి మలన్నసాగర్ రిజర్వాయర్ నింపిన తర్వాతే కొండపోచమ్మ సాగర్కు నీరు విడుదల కావాలి. 52 టీఎంసీల సామర్ధ్యం కలిగిన భారీ కొమురవెల్లి మలన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి డెలివరీ సిస్టర్న్ ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఈ నీరు గజ్వేల్ మండలం అక్కారంలో నిర్మించిన పంప్హౌస్కి ఆ తర్వాత మర్కూక్ సమీపంలో నిర్మించిన మరో పంప్హౌస్కు అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సర్జ్పూల్కు చేరుతాయి. మల్లన్న సాగర్ సర్జ్పూల్ నుంచి ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 8 మెషీన్లు నీటిని ఎత్తిపోస్తాయి. ఒక్కొ పంప్ 1100 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తాయి. ఇక్కడ గోదావరి జలాలు 103.88 మీటర్ల ఎత్తుకు చేరుతాయి. ఈ మార్గమధ్యలో 16.18 కి.మీ పొడవైన సొరంగం కూడా ఉంది. దాదాపు 119 కి.మీ పొడువైన 17 డిస్ట్రిబ్యూటరీ కాలువలు కూడా దీనికి అనుసంధానంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందే ఆయకట్టులో ఎక్కువ శాతం మల్లన్నసాగర్ పరిధిలోనే ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇక్కడి నుంచి సుదూరాన ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్కు కూడా నీరు ఎత్తిపోయనున్నారు. అలాగే నల్లగొండ జిల్లాకు కూడా గోదావరి జలాలు మల్లన్నసాగర్ నుంచే అందుతాయి. ఇక్కడి నుంచి మరో స్వతంత్ర లింక్ ద్వారా నీరు సింగూరుకు చేరుతాయి. కొండపోచమ్మ సాగర్కు వెళ్లే మార్గంలో ఉండే అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపుతారు. -
వడివడిగా ‘కొండపోచమ్మ’ చెంతకు
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేట: మరో అద్భుతం దిశగా గోదావరి జలాల ప్రయాణం మొదలైంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి రాష్ట్రంలో సముద్రమట్టానికి అత్యంత ఎత్తునున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వైపు గోదారి ఉరకలెత్తుతోంది. రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి దా ని దిగువనున్న సొరంగంలోకి (టన్నెల్) శనివారం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ నీటిని విడుదల చేయగా, రంగనాయకసాగర్ కుడి, ఎడమ కాలువల్లోకి మంత్రి హరీశ్రావు నీటిని వదిలారు. కాగా, సొరంగంలోకి విడుదల చేసిన నీళ్లు మూడు పంప్హౌస్లను దాటుకుంటూ మరో 15 రోజుల్లో కొండపోచమ్మసాగర్కు చేరనున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ బెడ్లెవల్ 88 మీటర్ల నుంచి నీటిని తీసుకుంటుండగా, 200 కి.మీ. మేర ప్రయాణించి 618 మీటర్ల ఎత్తున కొండపోచమ్మకు నీళ్లుచేరి అద్భుతం సృష్టించనున్నాయి. ఎత్తిపోసేందుకు అంతా సిద్ధం.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఐదు రోజుల క్రితమే అనంతగిరి నుంచి గోదావరి నీటిని రంగనాయకసాగర్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. రంగనాయకసాగర్లో ప్రస్తుతం 3 టీఎంసీలకు గాను ఒక టీఎంసీ మేర నీటి నిల్వ ఉంది. మరో 0.50 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా పంపులు నడిపిస్తున్నారు. అదే సమయంలో రంగనాయకసాగర్ నుంచి మల్లన్నసాగర్ పంప్హౌస్ మీదుగా నీటిని కొండపోచమ్మసాగర్కు పంపేందుకు శనివారం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, ఎస్ఈ ఆనంద్, ఇతర ఇంజనీర్లు 16.18 కి.మీ. పొడవైన టన్నెల్కు నీటిని వదిలారు. అక్కడి నుంచి నీరు తుక్కాపూర్ పంప్హౌస్కు చేరనుంది. చదవండి: వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్లు ఇక్కడి సర్జ్పూల్ను నింపి 43 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 8 మోటార్ల ద్వారా నీటిని దిగువన మల్లన్నసాగర్ రిజర్వాయర్ పరిధిలో తవ్విన 18 కి.మీ. ఫీడర్ చానల్కు వదులుతారు. ఇందుకు మరో వారం పట్టనుంది. అక్కడి నుంచి నీరు 6 మోటార్లు ఉన్న అక్కారం పంప్హౌస్కు, ఆపై మరో 6 మోటార్లున్న మర్కూక్ పంప్హౌస్కు చేరతాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే 3 పంప్హౌస్ల్లో మోటార్లు నడిచేలా విద్యుత్ వ్యవస్థను ట్రాన్స్కో సిద్ధంచేసింది. ఈనెల 15 – 18 మధ్య తేదీల్లో ఏదో రోజున నీటిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న కొండపోచమ్మకు వదిలే అవకాశాలున్నాయని తెలిసింది. శనివారం రంగనాయక సాగర్ కాలువకు నీటిని విడుదల చేసి సెల్ఫీ తీసుకుంటున్న మంత్రి హరీశ్రావు. చిత్రంలో ఈఎన్సీ హరిరామ్ ఆ ఎత్తుకు చేరితే అద్భుతమే.. ‘గోదావరి కొండపోచమ్మసాగర్కు చేరితే అద్భుతమే. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో 88 మీటర్ల బెడ్లెవల్ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నాం. ఈ నీటిని 618 మీటర్ల ఎత్తు న ఉన్న కొండపోచమ్మకు తరలిస్తే 530 మీట ర్ల మేర నీటిని తరలించినట్టవుతుంది’అని ఈఎన్సీ హరిరామ్ తెలిపారు. అదీగాక మేడిగడ్డ నుంచి కొండపోచమ్మకు సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయనుందని, ఈ ప్రయాణానికి మొత్తంగా 10 స్టేజీలలో నీటి ఎత్తిపోతల పూర్తికానుందని చెప్పారు. మిడ్ మానేరు దిగువన 4వ దశలో 5 ప్యాకేజీలు ఉండగా, 76 కి.మీ. గ్రావిటీ కెనాల్, 32.42 కి.మీ. టన్నెళ్లు దాటుకొని 5 పంప్హౌస్ల ద్వారా నీరు 15 రోజుల్లో కొండపోచమ్మకు చేరుతుందని తెలిపారు. సీఎం ఆదేశాలతో నీటి తరలింపు చర్యలన్నీ పూర్తి చేశామన్నారు. నీటి చింత తీరింది: మంత్రి హరీశ్ చుక్క నీటి కోసం నానా ఇబ్బందులు పడ్డ ఈ ప్రాంతంలో గోదావరి జలాలు పరవళ్లు తొ క్కుతున్నాయని, ప్రజల నీటి చింత తీరిందని మంత్రి హరీశ్రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గత నెల 24న రంగనాయకసాగర్లోకి గోదావరి జలాలు చేరిన వి షయం తెలిసిందే. 3 టీఎంసీల సామర్థ్యం గల రంగనాయకసాగర్లోకి శనివారం ఉద యం నాటికి 1.5టీఎంసీల నీరు చేరింది. ఈ నీటిని కుడి, ఎడమ కాల్వల ద్వారా సిద్దిపేట అర్బన్, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లోని రాజగోపాల్రావుపేట, పాలమాకు ల చెరువులను నింపేందుకు మంత్రి హరీశ్రావు శనివారం విడుదల చేశారు. అనంత రం మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వస్తోందని, ఇక కష్టపడి మంచి పంటలు పండించాల్సిన బా ధ్యత రైతులపైనే ఉందన్నారు. మెద క్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, రసమయి బాలకిషన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సిద్దిపేట జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్ పాల్గొన్నారు. ఈత కొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే రంగనాయకసాగర్ ప్రధాన ఎడమ కాలువలో గోదావరి జలాలు వదిలిన సందర్భంలో రైతులతో పాటు నాయకులు పరవశించిపోయారు. కాలువ జలాలను ఎంపీ, ఎమ్మెల్యేలపై చల్లుతూ మంత్రి హరీశ్రావు ఆనందం వ్యక్తంచేశారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిన్నకోడూరు, నారాయణరావుపేట ప్రజాప్రతినిధులు సంబురంతో కాలువలో దూకి ఈత కొట్టారు. ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీశ్రావు సెల్ఫీలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు. -
‘కొండపోచమ్మ’కు పచ్చజెండా!
సాక్షి, హైదరాబాద్ : కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈనెల 4న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నీటిని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్కుమార్లు చేసిన అభ్యర్థనను హైకోర్టు ఆమోదించింది. నీటిని విడుదల చేయరాదన్న గత ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల, బాహిలాంపూర్ గ్రామాలకు చెందిన ముంపు బాధితులు దాఖలు చేసిన వ్యాజ్యాలను శుక్రవారం ధర్మాసనం మరోసారి విచారించింది. ఒకసారి అవార్డు జారీ అయ్యాక తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నీటిని విడుదల చేయడం వల్ల బహుళ ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉంటాయని, అయితే బాధితులకు పరిహారం, పునరావాసం వంటివి చట్ట ప్రకారం అమలు అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చింది. బాధితులకు చెరువు ఎల్టీఎఫ్ పరిధిలో కాకుండా గజ్వేల్లో రెండు పడక గదుల ఇళ్లలోకి వెళ్లేందుకు ఆసక్తి ఉంటే అందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వగలమని స్పష్టం చేసింది. కోతకు వచ్చిన పంటల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నిల్వ ఉన్న పంటల్ని ప్రభుత్వమే భద్రపరచాలని ఆదేశించింది. బాధితులకు చెందిన పశువులను పశు వైద్యుల సమక్షంలో తరలించాలని అధికారులను ఆదేశించింది. చదవండి: 17దాకా లాక్డౌన్.. సడలింపులివే..! రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయ్యిందని, 97 శాతానికి పరిహారం కూడా చెల్లించామని ఏజీ చెప్పారు. ఇతరులకు కూడా పునరావాస చర్యలు తీసుకుంటామన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ, అవార్డును సవాల్ చేశామని, దీనిపై హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే వరకూ నీటి విడుదలకు ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. అయితే ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని, కొద్ది మంది కోసం నీటిని విడుదల చేయకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అయినా అవార్డు జారీ అయ్యాక తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ, విచారణను 7వ తేదీకి వాయిదా వేసింది. నక్సలిజంవైపు అడుగులేస్తే ఎవరు బాధ్యులు తొలుత విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, మే 1 వరకూ హైకోర్టు గడువు ఇచ్చినప్పటికీ అధికారులు ఏప్రిల్ 30 రాత్రి 600 వందల మంది పోలీసులతో, పాతిక వాహనాల్లో వచ్చి బాధితులను బలవంతంగా ఖాళీ చేయించారని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఫోన్లు కూడా పనిచేయకుండా చేశారని తెలిపారు. బలవంతంగా ఇళ్ల నుంచి బాధితులను ఖాళీ చేయించడంపై కలెక్టర్, ఆర్డీవోలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఉన్నామని మరిచిపోరాదని, ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నది ఇందుకేనా అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పదిపన్నెండేళ్ల పిల్లల ఎదుట వారి తల్లిదండ్రులను లాక్కునిపోతుంటే, వారి ఇళ్లను కూల్చేస్తే ఆ పిల్లల్లో పాలకులపై వ్యతిరేక భావన ఏర్పడుతుందని, నక్సలిజం వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం కూడా ఉంటుందని, రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తారని, అదే జరిగితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను బ్రిటీష్ రాణి నియమించినట్టుగా భావించవద్దని ఘాటు వ్యాఖ్య చేసింది. ఈ మొత్తం ఘటనపై బాధితుల గోడును సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాన్ని నమోదు చేసి పూర్తి నివేదికను తమకు అందజేయాలని సిద్దిపేట 4వ అదనపు జిల్లా జడ్జిని ధర్మాసనం ఆదేశించింది. -
‘కొండపోచమ్మ’కు డెడ్లైన్ మే 15..
సాక్షి, మెదక్: కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మెదక్ జిల్లాలో కాల్వల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. లాక్డౌన్ పరిస్థితులు, కాళేశ్వరం పనులు, పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి కాల్వల పనులకు అవసరమైన భూ సేకరణలో నిధులకు ఇబ్బంది లేదని తెలిపారు. ఇతరత్రా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పెండింగ్ పనులు పూర్తి కావాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కొండపోచమ్మ రిజర్వాయర్ పనులు మే 15వ తేదీ వరకు పూర్తికావాలని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం అన్నపూర్ణగా మారుతుంద న్నారు. మంత్రి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేం దర్రెడ్డి, మదన్రెడ్డి, అదనపు కలెక్టర్ నగేశ్, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. చదవండి: తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఆవిర్భావ సంబురం -
గోదావరితో జలహారం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్న గోదావరి నదీ జలాలతో ఉత్తర, దక్షిణ ప్రాంతాలన్నింటికీ జలాభిషేకం చేసే ప్రణాళిక శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సముద్రంపాలయ్యే నీటిని ఒడిసిపట్టి రాష్ట్రంలోని ప్రతి మూలకు పారించే దిశగా ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాలకు నీటి లభ్యతను పెంచుతూనే నీరందని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలన్నింటినీ గోదావరితో తడిపేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఎగువ నుంచి వచ్చే జలాలపైనే పూర్తిగా ఆధారపడ్డ కృష్ణా బేసిన్ ప్రాంతాలకు తాగు, సాగునీటిని ఏడాదంతా లభ్యతగా ఉంచేలా ప్రణాళికలు వేస్తోంది. తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలకు గోదావరే ప్రధాన నీటి వనరుగా ఉంది. గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు 954 టీఎంసీల వాటా ఉంది. అయితే ఇందులో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టుల కింద ఏటా వినియోగం సరాసరిన 470 టీఎంసీల మేర ఉండగా మరో 520 టీఎంసీల వినియోగానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు చేపట్టింది. అయినప్పటికీ ఏటా వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. అదే సమయంలో కృష్ణా బేసిన్ నీటి కొరతతో అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి జలాలతో నీటి కొరత తీవ్రంగా ఉన్న కృష్ణా బేసిన్లోని ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీటిని తరలిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇప్పటికే పూర్తి చేస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గరిష్టంగా 400–500 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చి ఆ నీటిని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులైన పాలమూరు–రంగారెడ్డి, డిండి, నాగార్జునసాగర్లతో అనుసంధానించడం ద్వారా కరువు ప్రాంతాలకు తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. దీంతో కాళేశ్వరంతోపాటు సీతారామ ఎత్తిపోతల ద్వారా మొత్తంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటిని తరలించేలా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ప్రణాళికలపై ఇంజనీర్లతో ఈ నెల 24న ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. బస్వాపూర్ కేంద్రంగా పాలమూరు, డిండి, సాగర్లకు.. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్న గోదావరి నీటిని పాలమూరు–రంగారెడ్డి, డిండి, నాగార్జునసాగర్తో అనుసంధానించే ప్రాథమిక ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కాళేశ్వరంలో 11.39 టీఎంసీల సామర్థ్యం గల బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని ఈ మూడు ప్రాజెక్టుల కింది ఆయకట్టు అవసరాలకు తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. బస్వాపూర్ నుంచి పాలమూరు–రంగారెడ్డిలోని ఉద్దండాపూర్ రిజర్వాయర్కు నీటిని తరలించేలా తొలి ప్రతిపాదన ఉంది. బస్వాపూర్ నుంచి హై లెవల్ కెనాల్ ద్వారా 45 కి.మీ. దూరంలోని చండూరు మండలం తుమ్మలపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్కు.. అటు నుంచి ఇబ్రహీంపట్నం చెరువు మీదుగా ఉద్దండాపూర్ రిజర్వాయర్కు నీటిని తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. నీటిని 210 కి.మీ. మేర తరలించేందుకు సుమారు 280 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించాల్సి వస్తుందని రిటైర్డ్ ఇంజనీర్లు ఇప్పటికే అంచనా వేశారు. బస్వాపూర్ నుంచి రోజుకు 2 వేల క్యూసెక్కులను 120 రోజులపాటు తరలించగలిగినా 21 టీఎంసీలను ఉద్దండాపూర్కు తరలించే అవకాశం ఉంటుందని, దీనికి రూ. 5 వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇదే బస్వాపూర్ నుంచి డిండి ఎత్తిపోతలలో నిర్మిస్తున్న శివన్నగూడెం రిజర్వాయర్కు గోదావరి జలాలను తరలించవచ్చని తేల్చారు. బస్వాపూర్, శివన్నగూడెం మధ్య దూరం 50 కిలోమీటర్లేనని, ఈ నీటి తరలింపుతో డిండి ఎత్తిపోతల కింద ఉన్న 3.41 లక్షల ఎకరాలతోపాటు అదనంగా యాదాద్రి జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని చెబుతున్నారు. ఇక అక్కడి నుంచే నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటిని తరలించేలా ఇటీవలే కొత్త ప్రతిపాదన తెరపైకొచ్చింది. బస్వాపూర్ నుంచి కేవలం 3 కి.మీ. కాల్వ తవ్వకం ద్వారా నీటిని శామీర్పేట వాగుకు తరలించవచ్చని, కనిష్టంగా 4 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా కాల్వను వెడల్పు చేసుకుంటే సరిపోతుందని రిటైర్డ్ ఇంజనీర్లు సూచించారు. అక్కడి నుంచి మూసీ నది, ఆసిఫ్నహర్కు నీటిని తరలించాలని, ఉదయ సముద్రాన్ని బైపాస్ చేసి పానగల్ వాగులో కలపాలని ప్రాథమికంగా తేల్చారు. అక్కడి నుంచి నేరుగా నాగార్జునసాగర్లో ఆన్లైన్ రిజర్వాయర్ అయిన పెద్దదేవులపల్లి రిజర్వాయర్కు నీటిని తరలిస్తే అక్కడి నుంచి సాగర్ కింద ఉన్న 3.70 లక్షల ఎకరాల ఆయకట్టులో కనిష్టంగా 3.50 లక్షల ఎకరాలకు నీరందించి స్థిరీకరించవచ్చని తేల్చారు. నేరుగా కేపీ లక్ష్మిదేవునిపల్లికి మరో ప్రతిపాదన.. ఇక మరో ప్రతిపాదన ద్వారా కాళేశ్వరంలో భాగంగా ఉన్న సంగారెడ్డి కాల్వ నుంచి పాలమూరు–రంగారెడ్డిలో భాగమైన కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్కు రోజుకు 0.8 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల నీటిని తరలించే ప్రణాళిక వేశారు. దీనికోసం ప్రస్తుతం 2.8 టీఎంసీలుగల కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచాల్సి ఉంటుంది. దీనిద్వారా కేపీ లక్ష్మీదేవునిపల్లి కింద నిర్ణయించిన 4.13 లక్షల ఎకరాల ఆయకట్టుతోపాటు మొత్తంగా 7 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చు. కొండపోచమ్మ టు కేశవాపూర్.. కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా ఉన్న కొండపోచమ్మసాగర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చేలా కేశవాపూర్ రిజర్వాయర్కు ఇప్పటికే అనుమతుచ్చారు. కొండపోచమ్మసాగర్ మీదుగా కేశవాపూర్ రిజర్వాయర్కు మూడు వరుసల గ్రావిటీ పైపులైన్ల ద్వారా నీటిని తరలించేలా పనులు త్వరలో చేపట్టనున్నారు. రిజర్వాయర్ నుంచి వచ్చే రా వాటర్ను ఘణపూర్లోని నీటి శుధ్ది కేంద్రంలో శుద్ధి చేసి శామీర్పేట్ ,సైనిక్పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్ మెయిన్ పైప్లైన్లకు స్వచ్ఛమైన జలాలను పంపింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే కేశవాపూర్ను మొదట 10 టీఎంసీలతో ప్రతిపాదించగా ప్రస్తుతం 5.04 టీఎంసీలకు కుదిస్తున్నారు. దీనికి మొత్తంగా రూ. 3,363 కోట్లు అవుతుందని ప్రభుత్వం లెక్కగట్టింది. ఉస్మాన్సాగర్కు గోదావరి.. హైదరాబాద్ తాగునీటికి ఎలాంటి కొరత ఏర్పడకుండా చూసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ఉస్మాన్సాగర్ రిజర్వాయర్కు, అటు నుంచి హిమాయత్సాగర్ రిజర్వాయర్కు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రతిపాదించారు. కాళేశ్వరంలో భాగంగా ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించే సంగారెడ్డి కాల్వ ద్వారా ఉస్మాన్సాగర్కు నీటిని తరలించేలా ఈ ప్రణాళిక ఉంది. సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్ వద్ద స్లూయిస్ నిర్మించి ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి 50 కిలోమీటర్ల దూరాన ఉన్న ఉస్మాన్సాగర్కు నీటిని తరలించేలా ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి రూ. 300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఉస్మాన్సాగర్ నిండితే హిమాయత్సాగర్కు నీటి తరలింపు సులభమే. సీతారామతో ‘సాగర్’కు భరోసా.. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింది ఆయకట్టు పూర్తిగా ఎగువ కర్ణాటక నుంచి వచ్చే వరదపైనే ఆధారపడి ఉంటోంది. అయితే ప్రతి పదేళ్లలో ఆరేళ్లు అంచనాలకన్నా తక్కువే నీరస్తోంది. వరద వచ్చిన సమయాల్లోనూ ఖరీఫ్ ఆయకట్టుకు నీరు అందించడం గగనంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలతో సాగర్ కింది 6.50 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగానే ఇప్పటికే చేపట్టిన 114 కిలోమీటర్ల ప్రధాన కాల్వ పనులను సాగర్ కింది పాలేరు రిజర్వాయర్ వరకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నాలుగు లిఫ్టులు ఏర్పాటు చేయడం ద్వారా పాలేరు దిగువన ఉండే 2.50 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. ఇక పాలేరు రిజర్వాయర్ ఎగువన ఉన్న ఆయకట్టు అవసరాల కోసం మరో కొత్త ప్రతిపాదన చేశారు. పాలేరు చేరే సీతారామ ఎత్తిపోతల నీటిని రివర్స్ పద్ధతిన సాగర్లో భాగమైన పెద్దదేవునిపల్లి రిజర్వాయర్కు తరలించాలని, ఇందుకోసం మరో 3 లిఫ్టులు ఏర్పాటు చేయాలని గుర్తించారు. దీనిద్వారా సాగర్ కింది 2.50 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. మరో ప్రతిపాదన ద్వారా సీతారామలోని ప్రధాన కాల్వను ప్రత్యేక చానల్ తవ్వకం ద్వారా సాగర్ కాల్వలకు అనుసంధానిస్తే మరో 70 వేల ఎకరాలకు నీరందుతుందని తేల్చారు. ఈ ప్రతిపాదనలపై త్వరలోనే సమగ్ర సర్వే జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేవాదులకు కాళేశ్వరం జలాలు.. దేవాదులతో 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉండగా నీటిని తీసుకునే గంగాపురంలోని ఇన్టేక్ పాయింట్ నుంచి 187 కిలోమీటర్ల దూరంలోని తపాస్పల్లి రిజర్వాయర్ వరకు నీటిని తరలించాల్సి ఉంది. దీనికింద 92 వేల ఎకరాలకు నీరివ్వాల్సి ఉన్నా అది సాధ్యపడకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో 50 టీఎంసీల సామర్థ్యంగల మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 10 కి.మీ. మేర గ్రావిటీ కెనాల్ లేదా ప్రెషర్ మెయిన్ నిర్మించి కనీసం 10 టీఎంసీలను తపాస్పల్లికి అందించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతుతున్నాయి. అయితే గ్రావిటీ కెనాల్ ప్రతిపాదన అమలుకు రూ. 100 కోట్లు ఖర్చు చేసినా మల్లన్నసాగర్లో కనీసం 30 టీఎంసీల నీటి లభ్యత ఉండాల్సి ఉంటుంది. అదే ప్రెషర్ మెయిన్ అయితే మల్లన్నసాగర్లో 12 టీఎంసీలున్నా నీటిని తరలించొచ్చు. కానీ దీనికి రూ. 400 కోట్ల వరకు ఖర్చు ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
కొండపోచమ్మకు.. గోదావరి జలాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఈ ఏడాది నుంచే కొండపోచమ్మ సాగర్ వరకు తరలించడానికి పంపింగ్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు ప్రకటించారు. రాజరాజేశ్వర స్వామి (మిడ్ మానేరు) రిజర్వాయర్ నుంచి కొండ పోచమ్మ సాగర్ వరకు అన్ని దశల్లో పంపు హౌస్ల నిర్మాణం పూర్తి కావాలని, ఈ ఏడాది నుంచి నీటిని పంపు చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు కాళేశ్వరం పరిధిలోని పంపుహౌస్లను ప్రభాకర్ రావు శుక్రవారం సందర్శించారు. నిర్మాణ పనులను తనిఖీ చేసి, అధికారులతో సమీక్ష జరిపారు. -
గోదారి పరుగుకు పునరావాసం అడ్డు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు మిడ్మానేరు దిగువకు వచ్చేందుకు పునరావాస ప్రక్రియ అడ్డుగోడగా మారింది. మిడ్మానేరు నుంచి కొండపోచమ్మసాగర్ వరకు గోదావరి జలాలను తరలించాలంటే నాలుగు గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉండటం, అక్కడ పునరావాస ప్రక్రియ పూర్తయితే కానీ నీళ్లు దిగువకు పారే అవకాశం లేకపోవడం జాప్యానికి కారణమవుతోంది. ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా సాగకపోవడంతో మరో నెలరోజులైతేకానీ మిడ్మానేరు నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యమయ్యేలా లేదు. సంక్రాంతి తర్వాతే దిగువకు గోదావరి కాళేశ్వరం పథకం ద్వారా ఇప్పటికే మిడ్మానేరు వరకు నీటిని తరలించే ప్రక్రియ పూర్తయింది. అవసరాన్ని బట్టి మోటార్లను నడుపుతూ మేడిగడ్డ నుంచి నీటిని మిడ్మానేరుకు తరలిస్తున్నారు. మంగళవారం సైతం మిడ్మానేరులోకి 9,450 క్యూసెక్కుల మేర నీరు ఎగువ ప్యాకేజీ–6, 8ల ద్వారా పంపింగ్ చేశారు. 25.87 టీఎంసీ సామర్ధ్యం ఉన్న మిడ్మానేరులో ఇప్పటికే 23.09 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇక్కడి నుంచి నీటిని లోయర్మానేరు డ్యామ్కు తరలిస్తున్నారు. నిజానికి మిడ్మానేరు నుంచి దిగువన ఉన్న కాళేశ్వరం ప్యాకేజీలు–10, 11, 12ల ద్వారా అనంతగిరి మీదుగా కొండపోచమ్మ వరకు తరలించాల్సి ఉన్నా పునరావాస ప్రక్రియ పూర్తిగాక, నిర్వాసితులు గ్రామాలు ఖాళీ చేయకపోవడంతో దిగువకు నీటి పంపింగ్ జరగడం లేదు. మిడ్మానేరు నుంచి నీటిని తోడే పంప్హౌస్లో 4 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఆసియాలోనే పెద్దదైన 0.2 టీఎంసీ నిల్వ సామర్ధ్యం ఉన్న ఓపెన్ సర్జ్పూల్ను సైతం నీటితో నింపి పెట్టారు. అయితే మోటార్లు నడిపి అనంతగిరి రిజర్వాయర్లోకి నీళ్లు ఎత్తిపోసేందుకు మాత్రం పునరావాస ప్రక్రియ అడ్డు వస్తోంది. అనంతగిరి కింద ముంపు గ్రామంగా ఉన్న అనంతగిరి గ్రామం ఇంతవరకు ఖాళీ కాలేదు. ఇటీవలే నిర్వాసితుల పునరావాసానికి రూ.50 కోట్లు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే ఖాళీ చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో పాటే న్యాయపరమైన అంశాలు అడ్డుగా ఉన్నాయి. ఈ గ్రామాన్ని ఖాళీ చేసేవరకు పంపులు నడిపే ఆస్కారమే లేదు. ఈ గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు మరో నెల రోజులైనా పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడి నుంచి నీటిని తరలించి 15 టీఎంసీల సామర్ధ్యం ఉన్న కొండపోచమ్మసాగర్లో నిల్వ చేయాలన్నా దీనికింద మూడు గ్రామాల పునరావాస ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడు గ్రామాల్లోని 900లకు పైగా నిర్వాసిత కుటుంబాలకు తుంకిబొళ్లారం పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం చేసిచ్చినా, వివిధ కారణాలతో నిర్వాసితులు అక్కడికి వెళ్లలేదు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన పెండింగ్ పరిహారంలో ఇటీవలే రూ.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను నిర్వాసితులకు చెల్లించే ప్రక్రియ ఇప్పుడిప్పుడే పుంజుకుంది. ఈ ప్రక్రియ పూర్తయి, నిర్వాసితులు ఖాళీ చేయాలన్నా నెల రోజులు పట్టడం ఖాయంగా ఉంది. దీంతో కొండపోచమ్మ సాగర్లో నీటిని నిల్వ చేయాలంటే సంక్రాంతి తర్వాత కానీ సాధ్యపడేలా లేదు. -
కొత్త ఏడాదిలో కొండపోచమ్మకు..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాల తరలింపులో మరో కీలక ఘట్టం ఆరంభం కానుంది. ఇప్పటి వరకు మిడ్మానేరుకు పరిమితమైన గోదావరి జలాలు దాని దిగువకు సైతం రానున్నాయి. ఈ నెలాఖరులోగానే మిడ్మానేరు నుంచి దాని దిగువన ఉన్న పంపుల ద్వారా కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని ఎత్తిపోసే పనులు ప్రారంభం కానున్నాయి. అనంతగిరి, రంగనాయక్సాగర్ రిజర్వాయర్లను నింపుతూ, మల్లన్నసాగర్ ఫీడర్ చానల్ ద్వారా గోదావరి నీటిని గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ వరకు డిసెంబర్ ఆఖరు నాటికి తరలించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఆ దిశగా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో గజ్వేల్లో జల జాతర.. మిడ్మానేరులో ఇప్పటికే నీటి నిల్వ చేయాల్సి ఉన్నా, రిజర్వాయర్ కట్ట నిర్మాణంలో కొంత సీపేజీలు ఉండటంతో వాటి మరమ్మతు పనులతో ఆలస్యమైంది. ఇప్పడు అవి కొలిక్కి రావడంతో దాన్ని నింపే ప్రక్రియ మొదలైంది. ప్రాజెక్టులో 25 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 3.5 టీఎంసీల నిల్వ ఉంది. రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎగువ నుంచి పంపింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టు 20 రోజుల్లో నిండే అవకాశం ఉంది. రిజర్వాయర్లో 15 టీఎంసీలు నీరు చేరగానే ప్యాకేజీ–10 నుంచి ఎత్తిపోతల ఆరంభం చేయాలని సీఎం ఆదేశించారు. మిడ్మానేరు కింద కొండపోచమ్మ సాగర్ వరకు 50 కిలోమీటర్ల ప్రధాన కెనాల్ పరిధిలో ప్యాకేజీ–10, 11, 12, 13, 14 ప్యాకేజీలు ఉండగా, ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్యాకేజీ–10లో అప్రోచ్ చానల్, గ్రావిటీ కెనాల్ ఇతర నిర్మాణాలతో పాటు 7.65 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తయ్యాయి. ఇక్కడ 4 మోటార్లు అమర్చాల్సి ఉండగా అన్నీ పూర్తయ్యాయి. 3.5 టీఎంసీల అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. ప్యాకేజీ–11లో అన్ని పను లు పూర్తవగా, 8.41 కిలోమీటర్ల టన్నెల్ పనులు, లైనింగ్ పనులు రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఇక్కడ 4 మోటార్లలో అన్నీ సిధ్ధమయ్యాయి. 3 టీఎంసీల రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ పని పూర్తయింది. ప్యాకేజీ–12లో 16. 18 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తికాగా, 8 పంపుల్లో అన్నీ సిద్ధమైనా కొన్ని పనులను ఈ నెలాఖరుకి పూర్తి చేయనున్నారు. ఇదే ప్యాకేజీలో ఉన్న కొమరవెల్లి మల్లన్న సాగర్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. ఇక్కడ భూసేకరణ సమస్యగా ఉండటంతో రిజర్వాయర్ పనులు పూర్తి కాకున్నా 18 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ ద్వారా 15 టీఎంసీల సామర్ధ్యంతో చేపడుతున్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కనిష్టంగా 400 చెరువులు నింపేలా ప్రణాళిక పెట్టుకున్నారు. లిఫ్ట్ కోసం సిద్ధ్దమైన పంపులు కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశలో మేడిగడ్డ(లక్షి్మ), అన్నారం (సరస్వతి), సుందిళ్ల (పార్వతి) బ్యారేజీ, పంప్హౌస్ల నుంచి ఎత్తిపోసే గోదావరి నీళ్లు ఎల్లంపల్లి బ్యారేజీకి చేరతాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలోని మోటార్ల ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా అంతా సిద్ధం చేసి ఉంచారు. సుందిళ్ల పంప్హౌస్లో మాత్రం ఒక్క పంపునకు డ్రైరన్ పూర్తవ్వగా, వెట్రన్ నిర్వహించాల్సి ఉంది. దాన్ని ఈ నెల చివరి వారంలో సిద్ధం చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే గోదావరి నీళ్లు ఎల్లంపల్లికి చేరతాయి. ఇక ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 7, 8 ఉండగా, వాటిలోని పంపులన్నీ సిద్ధమయ్యాయి. ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీటి తరలింపు ఆరంభమైంది. దీంతో మిడ్మానేరు నుంచి దాని కింద ఉన్న 30వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని తరలించనున్నారు. అనంతరం ప్రాజెక్టులో నీటి నిల్వలు సుమారు 15 టీఎంసీలు చేరిన వెంటనే అక్కడి నుంచి దిగవకు పంపింగ్ ఆరంభించనున్నారు. -
పరిహారమివ్వకుండా భూములెలా తీసుకుంటారు?
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహార చెక్కులు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఉన్న రెండు రిట్ పిటిషన్లను కలిపి ఈ వ్యాజ్యాన్ని కూడా 24న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాల గ్రామంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కొండపోచమ్మ ప్రాజెక్టు భూసేకరణపై స్టే ఆదేశాలు ఉన్నా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అవార్డు ప్రకటించడం చెల్లదని ప్రకటించాలని కోరుతూ మామిడ్యాలకు చెందిన శ్రీనివాస్ మరో 24 మంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. చట్ట నిబంధనల ప్రకారం పునరావాసం, పునర్నిర్మాణ చర్యలు చేపట్టకుండా భూముల్ని స్వాధీనం చేసుకోవడం చెల్లదని, పిటిషనర్లను భూముల్లోకి వెళ్లనీయడం లేదని వారి తరఫు న్యాయవాది వాదించారు. భూసేకరణ నోటిఫికేషన్ తర్వాత చర్యలు చేపట్టరాదని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారని, దీనిని ధిక్కరిస్తున్నారని చెప్పారు. పరిహారం చెల్లించకుండా రైతుల నుంచి భూములు ఎలా తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ చట్టం సెక్షన్ 181 కింద ఇచ్చిన నోటీసును ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, ఈ పరిస్థితుల్లో సింగిల్ జడ్జి ఆదేశాలు వర్తించబోవన్నారు. ప్రాజెక్టు దాదాపు 80 శాతానికిపైగా పూర్తి అయిందని, ఇప్పటికే చాలా మంది రైతులకు ఇదే హైకోర్టులో పరిహార చెక్కులు ఇచ్చామని తెలిపారు. గతంలోని మరో రెండు కేసులతో కలిపి ఈ రిట్ను కూడా 24న విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు పునరావాస చర్యలు అమలు నిమిత్తం తమ భూముల్ని సేకరించడం అన్యాయమని పేర్కొంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి చెందిన రైతులు దాఖలు చేసిన అత్యవసర రిట్ను కూడా ధర్మాసనం విచారించింది. ఈ వ్యాజ్యాన్ని కూడా 24నే విచారిస్తామని, అప్పటివరకూ పిటిషనర్ల భూముల్ని స్వాధీనం చేసుకోరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే తరహాలో గతంలో దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఈ కేసును విచారిస్తామని ప్రకటించింది. నిర్వాసిత రైతులను ఆదుకునేందుకు ఇతర రైతుల భూముల్ని మళ్లీ సేకరించడం అన్యాయమని, ప్రభుత్వ భూమిలోనే పునరావాసం, పునర్నిర్మాణం వంటి చర్యలు చేపట్టాలని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణకు ఆలస్యమెందుకు? హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్లో ఖరీదైన భూమి విషయంలో నిరభ్యంతర పత్రాన్ని (ఎన్ఓసీ) జారీ చేసిన కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్పై విచారణ చేయాలన్న సింగిల్ జడ్జి ఆదేశాల అమల్లో జాప్యానికి కారణాలు చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శాఖాపరమైన విచారణకు ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించింది. జాప్యానికి కారణాలపై నివేదికను ఆగస్టు 5 నాటికి తమకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సర్వే నంబర్ 284/6లోని 5,262 చదరపు గజాల భూమికి తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్ఓసీ తీసుకున్నారని పేర్కొంటూ శాంతి అగర్వాల్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్ఓసీ చట్ట నిబంధనలకు అనుగుణంగా జారీ చేయలేదని, ఇందుకు కారణమైన కమిటీ చైర్మన్, ఇతర సభ్యులపై, అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్ఓసీ తీసుకున్న మహ్మద్ అబ్దుల్ వదూద్, మహ్మద్ రుక్ముద్దీన్, సయ్యద్ అబ్దుల్ రబ్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం విచారించింది. అప్పటి కమిటీకి చైర్మన్గా నవీన్ మిట్టల్, సభ్యులుగా వ్యవహరించిన జాయింట్ కలెక్టర్ వి.దుర్గాదాస్, రిటైర్డు స్పెషల్ తహసీల్దార్ వి.వి.వెంకట్రెడ్డి, సీనియర్ డ్రాఫ్ట్స్మన్ మధుసూదన్రెడ్డిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని సవాల్ చేసిన అప్పీల్ వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. ఆరు వారాల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ కోరగా అందుకు అనుమతించిన ధర్మాసనం విచారణను వచ్చే ఆగస్టు 5కి వాయిదా వేసింది. శాఖాపర విచారణ జాప్యంపై నివేదిక ఇవ్వాలని సీఎస్ను ఆదేశించింది. -
కొండపోచమ్మ సాగర్ పనుల్లో అపశృతి
గజ్వేల్రూరల్ : కొండపోచమ్మ సాగర్ కాల్వ నిర్మాణంలో అపశృతి చోటు చేసుకుంది. కాల్వ పనుల్లో నిమగ్నమైన ఇద్దరు కార్మికులపై కాంక్రీటు–సిమెంట్ మిక్చర్ మిల్లర్ లారీ జారిపడి మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసన్పల్లి గ్రామంలో కొనసాగుతున్న కొండపోచమ్మ సాగర్ ప్రధాన కాల్వ నిర్మాణ పనుల్లో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులు పనిచేస్తున్నారు. శుక్రవారం కాల్వలో సిమెంటు–కాంక్రీటు వేసేందుకు తీసుకొచ్చిన మిక్చర్ మిల్లర్ లారీ కాల్వపై భాగం నుంచి అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో కింది భాగంలో ఉన్న కార్మికులు దానికింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీసేందుకు రాత్రి 10గంటలు దాటిన తర్వాత కూడా గ్రామస్తులు, పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మృతులను మహబూబ్నగర్ జిల్లా అప్పనపల్లి గ్రామానికి చెందిన సంజీవ్ (45), మహేశ్ (23)గా గుర్తించారు. -
కొండపోచమ్మ సాగర్ పై హైకోర్టు కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా, మామిడ్యాలలో కొండపోచమ్మ సాగర్ నిర్మాణంకోసం చేపట్టిన భూ సేకరణకు సంబంధించిన తుది డిక్లరేషన్ను హైకోర్టు రద్దు చేసింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం గ్రామ సభ నిర్వహించి, బాధిత ప్రజల అభ్యంతరాలను తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆ తరువాతనే పరిహారం చెల్లింపు, భూ స్వాధీనం తదితర ప్రక్రియను ప్రారంభించాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం తీర్పునిచ్చారు. కొండపోచమ్మ సాగర్ భూ సేకరణకు సంబంధించి అధికారులు జారీచేసిన డిక్లరేషన్ను సవాలు చేస్తూ ప్రవీణ్కుమార్, మరో 30 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు. గ్రామ సభ నిర్వహించకుండానే అధికారులు ముందుకెళుతున్నారని, తమ అభ్యంతరాలను కూడా పట్టించుకోవడం లేదని పిటిషనర్లు తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, భూసేకరణ నిమిత్తం జారీచేసిన తుది డిక్లరేషన్ను రద్దు చేశారు. -
‘కొండపోచమ్మ సాగర్’ భూ సర్వేను అడ్డుకున్న రైతులు
గజ్వేల్/జగదేవ్పూర్: కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు కాల్వల భూసేకరణ సర్వే పనులను ఆదివారం రెండు ప్రాంతాల్లో రైతులు అడ్డుకున్నారు. మర్కూక్లో తహసీల్దార్ మల్లేశం, వీఆర్వోలు భూసర్వే జరిపి హద్దులు పాతుతున్నారు. అంతలో రైతులు వచ్చి.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకుండానే కాల్వల పేరిట మా భూముల్లోకి వచ్చి హద్దులు పాతుతారా.. అంటూ వాగ్వాదానికి దిగారు. భూములను ఇవ్వబోమంటూ రైతులు సర్వేను అడ్డుకొన్నారు. అధికారులు వేసిన హద్దులను తొలగించారు. కాగా, మర్కూక్ మండలం చేబర్తిలో ఉదయం 10 గంటలకు సర్వేయర్లు, నీటిపారుదల శాఖ అధికారులు సర్వే పనులు ప్రారంభించగా, రైతులు అక్కడకు వెళ్లి వెంటనే ఆపాలని, లేకుంటే ఆందోళన చెస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులు సర్వే పనులు ఆపేశారు.