RDS
-
ఆర్డీఎస్ కొన తెల్వదు.. మొన తెల్వదు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/ సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) గురించి కనీస అవగాహన లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరు నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నాడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. ‘ఆర్డీఎస్ కొన తెల్వదు.. మొన తెల్వదు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పంపులు తెల్వవు.. రిజర్వాయర్లు తెల్వవు.. కనీసం ప్రజలు నవ్వుకుంటున్నారన్న ఇంగితం లేదు.. ఆయన బండి సంజయ్ కాదు.. బంగి సంజయ్..’ అని విమర్శలు గుప్పించారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు చేపట్టే పనులు, నిధుల సమీకరణపై వివరాలు వెల్లడించడంతో పాటు ఆరు నెలల్లో ఎలా పనులు పూర్తి చేస్తారో కాగితం రాసివ్వాలని సవాలు చేశారు. గద్వాలలో జరిగిన బహిరంగసభలో ఆర్డీఎస్ ఆయకట్టుకు సంబం ధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. టీఆర్ఎస్ హయాంలో ‘తుమ్మిళ్ల’ బండి సంజయ్, బీజేపీ కర్ణాటక కో–ఇన్చార్జి డీకే అరుణ ఇద్దరూ కలిసి కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు అంటే 87,500 ఎకరాలకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. తుంగభద్రపై 1946లో మొదలై 1956లో పూర్తయిన ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా ఎన్నడూ 20 వేల ఎకరాలకు మించలేదన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మద్దతుగా 2003లో కేసీఆర్ పాదయాత్ర చేశారని, ఫలితంగా 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ అంశంపై నిపుణుల కమిటీ ఏర్పాటైందన్నారు. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు సాగు నీరు అందించడం లేదని కమిటీ నివేదిక ఇచ్చినా ఉమ్మడి పాలకులు స్పందించలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టామన్నారు. 50 వేల ఎకరాలకు సాగునీరు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీ–డిజైన్ చేస్తున్న నేపథ్యంలో ఆర్డీఎస్ మీద సంపూర్ణ సమీక్ష నిర్వహించారని మంత్రి గుర్తు చేశారు. 2017లో జీఓ 429 విడుదల చేస్తూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని రూ.780 కోట్లతో చేపట్టి ప్రభుత్వం కేవలం పదినెలల్లో పూర్తి చేసిందని వెల్లడించారు. ఆర్డీఎస్ కాల్వ కింద సాగునీరందని 50 వేల ఎకరాలకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీరందిస్తున్నామని.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తానన్న మాటను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నిలబెట్టుకున్నారని చెప్పారు. పుట్టిన నడిగడ్డను, తెలంగాణను గాలికి వదిలి.. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం చేసి దోచుకుపోయిన హంద్రీనీవా నీళ్లకు హారతి పట్టిన డీకే అరుణను పక్కనపెట్టుకుని, బండి సంజయ్ ఆర్డీఎస్ ఆయకట్టు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. -
ఆర్డీఎస్పై అధ్యయనం
సాక్షి, అమరావతి: రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) లక్ష్యాలు నెరవేరుతున్నాయా? లక్ష్యాలు సాధించలేకపోతే దానికి కారణం నిర్వహణ లోపమా? డిజైన్ లోపమా? అనే అంశాలను తేల్చనున్నారు. ఈ అధ్యయనం బాధ్యతలను పుణెలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్ )కు అప్పగించనున్నారు. ఈమేరకు కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్కే పిళ్లై చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. అధ్యయనానికి ఆర్నెళ్ల గడువు ఇచ్చారు. వచ్చే రబీ నాటికి ఆ నివేదికను అమలు చేస్తామని ఆర్కే పిళ్లై చెప్పారు. బుధవారం హైదరాబాద్లో కృష్ణా బోర్డు కార్యాలయంలో పిళ్లై అధ్యక్షతన ఆర్డీఎస్పై ప్రత్యేక సమావేశం జరిగింది. తుంగభద్ర బోర్డు సభ్య కార్యదర్శి నాగమోహన్, ఏపీ సీఈ సి.మురళీనాథ్రెడ్డి, తెలంగాణ సీఈ మోహన్కుమార్, కర్ణాటక సీఈ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఏపీకి చెందిన కేసీ కెనాల్ కోటా కింద విడుదల చేసిన నీటిని కర్ణాటక, తెలంగాణ మళ్లిస్తున్నట్లుగా జనవరి 28న బోర్డు జాయింట్ కమిటీ నిర్వహిం చిన క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడైంది. ఈ అంశాన్ని పిళ్లై ప్రస్తావించారు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించడం సరికాదన్నారు. దీనిపై తెలంగాణ సీఈ స్పందిస్తూ.. ఆర్డీఎస్కు బచావత్ ట్రిబ్యునల్ 17.1 టీఎంసీలను కేటాయించిందని, ఇందులో తుంగభద్ర డ్యామ్ నుంచి 7 టీఎంసీలను విడుదల చేయాలని పేర్కొందని అన్నారు. ఆర్డీఎస్ ఎడమ కాలువ కింద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉందని, ఏపీ జల చౌర్యం కారణంగా నీళ్లందక ఆ రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. దీనిపై ఏపీ సీఈ మురళీనాథ్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ దశలో పిళ్లై స్పందిస్తూ... కేసీ కెనాల్ కోటా కింద వి డుదల చేసిన నీటినే ఆర్డీఎస్ ఎడమ కాలువ ద్వారా కర్ణాటక, తెలంగాణ మళ్లిస్తున్నాయని తేల్చిచెప్పారు. దీంతో తెలంగాణ సీఈ మిన్నకుండిపోయారు. బచావత్ ట్రిబ్యునల్ తమకు కేటాయించిన జలాలు దక్కడం లేదని తెలంగాణ సీఈ వాదించడంతో దాన్ని తేల్చేందుకు సీడబ్ల్యూపీఆర్ఎస్తో అధ్యయనం చేయిస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. తుమ్మిళ్ల ఆపేయాల్సిందే.. తుంగభద్ర డ్యామ్ నుంచి కేసీ కెనాల్కు 10, ఆర్డీ ఎస్కు 7 టీఎంసీల కోటా ఉన్నందున నదిలో సహజప్రవాహం లేనప్పుడు.. తుంగభద్ర నుంచి 10:7 నిష్పత్తిలో నీటిని విడుదల చేసి.. దామాషా పద్ధతి లో ఆర్డీఎస్ వద్ద మూడు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలని ఏపీ సీఈ మురళీనాథ్రెడ్డి చేసిన ప్రతిపాదనను కృష్ణా బోర్డు అంగీకరించింది. ఆర్డీఎస్కు దిగువన సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో తెలంగాణ సర్కారు అక్రమంగా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిలిపివేయాలన్న డిమాండ్తోనూ కృష్ణాబోర్డు ఏకీభవించింది. తుమ్మిళ్ల ఎత్తిపోతలను ఆపేయాలని ఆర్కేపిళ్లై ఆదేశించారు. -
రాష్ట్రంలో మూడు భారీ ఔషధ నిల్వ కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రాంతీయ ఔషధ నిల్వ (రీజనల్ డ్రగ్ స్టోర్స్ - ఆర్డీఎస్) కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో వీటి నిర్మాణానికి జాతీయ ఆరోగ్యమిషన్ రూ.10 కోట్ల వంతున నిధులు ఇస్తోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ విస్తీర్ణంలో.. 40 వేల చదరపు అడుగుల్లో మందులు నిల్వ చేయడానికి అవకాశం ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన స్థలాల్లో ఏడాదిలోగా ఈ నిర్మాణాలను పూర్తిచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. భారీగా నిల్వలకు అవకాశం ⇔ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ (సీడీఎస్) ఉన్నాయి. ⇔ దీనివల్ల మందుల నిల్వకు సరిపడా విస్తీర్ణం అందుబాటులో లేదు. ⇔ ఈ నేపథ్యంలో రాష్ట్రం పంపిన ప్రతిపాదనలతో మూడు ఆర్డీఎస్ల నిర్మాణానికి రూ.10 కోట్ల వంతున నిధులిచ్చేందుకు జాతీయ ఆరోగ్యమిషన్ అంగీకరించింది. ⇔ కొత్తగా నిర్మించే ఈ కేంద్రాల్లో క్వారంటైన్ సదుపాయంతో పాటు భారీగా మందులు నిల్వ చేసుకునే వీలుంటుంది. ⇔ మందుల్ని ఈ కేంద్రాల్లో నిల్వ చేసి అవసరాన్ని బట్టి జిల్లాలకు పంపిస్తారు. ⇔ ఒక్కో కేంద్రంలో కనీసం ఆరునెలలకు సరిపడా మందుల్ని నిల్వచేయవచ్చు. ⇔ మందుల నిల్వతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కోల్డ్చైన్ (శీతలీకరణ) అవకాశం ఉంటుంది. ⇔ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, ఖరీదైన మందుల నిల్వకు ఇబ్బందులుండవు. -
ఆర్డీఎస్ ఆశలు గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్) కింది ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాదీ నిరాశే మిగిలింది. నాలుగేళ్లుగా ఊరిస్తున్న ఆధునీకరణ పనులు ఈ ఏడాది సైతం మూలన పడటంతో వారి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. ప్రస్తుతం పనులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుకొచ్చినా.. వర్షాకాలం ఆరంభమైన నేపథ్యంలో పనులు ముందుకు కదిలే ప్రసక్తే లేదు. దీంతో రబీ ఆశలు గల్లంతయినట్టే కనబడుతోంది. నిజానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉండగా, పాత పాలమూరు జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ కాల్వల మరమ్మతులు చేసి, ఎత్తును పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది. ఈ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72 కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు నాలుగేళ్లుగా అడ్డుపడుతున్నారు. దీంతో ఆర్డీఎస్ కింద సాగు ముందుకు సాగడం లేదు. కర్ణాటక మంత్రితో హరీశ్ చర్చలు జరిపినా.. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు దీనిపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్తో చర్చలు జరపగా వారు పనులకు ఓకే చెప్పారు. దీంతో ప్యాకేజీ–1లోని హెడ్వర్క్స్ అంచనాను రూ.మూడు కోట్ల నుంచి రూ.13 కోట్లకు పెంచి.. ఈ నిధులను కర్ణాటక ప్రభుత్వ ఖాతాలో జమ చేసినా, ప్యాకేజీ–1లో భాగంగా పూడికమట్టి తొలగింపు, షట్టర్ల నిర్మాణ పనులు జరుగలేదు. ఈ పనుల కొనసాగింపుపై ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో చర్చించగా, అందులో పనులకు సహకరిస్తామని ఏపీ హామీ ఇచ్చింది. అయినా అది అమలవలేదు. దీంతో పాటే గత నెలలో తుంగభద్ర బోర్డు సమావేశంలోనే ఆర్డీఎస్ అంశాన్ని బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ ఒత్తిడి చేయగా, ఏపీ అంగీకరించింది. బోర్డు దీనిపై ఎలాంటి నిర్ణయం చేయకపోవడంతో ఆ అంశం మూలన పడింది. ప్రస్తుతం పనులు మొదలుపెట్టినా వర్షాల కారణంగా ఆర్డీఎస్ కాల్వల్లోకి నీరు చేరింది. దీంతో పనులు చేసేలా పరిస్థితి లేదు. దీంతో రైతాంగం ఆశలు ఆవిరయ్యాయి. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ.. రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేలా కృషి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, పరస్పర సహకార ధోరణిని పొరుగు రాష్ట్రాలు పాటించేలా వారికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చింది. ఆర్డీఎస్ పనుల పూర్తికి సహకరించేలా ఏపీని ఒప్పించి, తెలంగాణ రైతాంగానికి సహకరించాలని కోరనుంది. -
కేంద్రం కోర్టులోకి ‘ఆర్డీఎస్’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సహకారం కరువై మూడున్నరేళ్లుగా మూలనపడ్డ రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునీకరణ పనులపై కేంద్రం వద్దే తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునీకరణ పనులు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చినా, ఏపీ సహాయ నిరాకరణ చేస్తుండటంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ.. ఈ నెల 15న కేంద్ర జల వనరుల శాఖ వద్ద జరిగే సమావేశంలో దీనిపై స్పష్టతకై పట్టుబట్టాలని కృతనిశ్చయంతో ఉంది. అలాగే ఏపీ తెరపైకి తెచ్చే అభ్యంతరాలను సైతం ఇదే సమావేశంలో తిప్పికొట్టేలా వ్యూహం రచిస్తోంది. ఆశించిన మేర అందని నీరు వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులున్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి అందటం లేదు. దీని కింద పాత పాలమూరు జిల్లాలో 87,500 ఎకరాల ఆయకట్టులో 36 వేల ఎకరాలకే నీరందుతోంది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. దీంతో ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 6 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక కూడా అంగీకరించింది. కాల్వల ఆధునీకరణ కోసం రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు మూడేళ్లుగా అడ్డు తగులుతూనే ఉన్నారు. దీంతో శాంతి భద్రతల సమస్యల కారణంగా కర్ణాటక పనులు నిలిపివేసింది. మంత్రుల భేటీకి ముందుకు రాని ఏపీ.. గతేడాది డిసెంబర్లో కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తుంగభద్ర జలాల విడుదల అంశమై మాట్లాడేందుకు వచ్చిన సమయంలో ఆర్డీఎస్ అంశం ప్రస్తావనకు వచ్చింది. తాము పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏపీతో కలసి మూడు రాష్ట్రాల మంత్రుల సమావేశం నిర్వహిస్తే పనులపై స్పష్టత వస్తుందని పాటిల్ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు రాష్ట్రం లేఖ రాసినా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ అంశాన్ని కేంద్రం వద్దే తేల్చుకోవాలని తెలంగాణ నిర్ణయించింది. -
తుమ్మిళ్ల ఎత్తిపోతలకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తుంగభద్ర నదీజలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్న వాస్తవ నీటివాటా వినియోగంలో ఏర్పడుతున్న లోటు ను పూడ్చడం దీని ఉద్దేశం. ఈ పథకం టెండర్ల ప్రక్రియ ముగిసిన దృష్ట్యా, జనవరి 4న నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళిక వేశారు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటివాటా ఉన్నా 4 టీఎంసీలకు మించి వాడటం లేదు. మహబూబ్నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నా 30 వేల ఎకరాలకు కూడా అందడం లేదు. ఈ దృష్ట్యానే 55,600 ఎకరాలకు సాగునీరు, దారిలోని గ్రామాలకు తాగునీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తుంగభద్రపై ఉన్న సుంకేశుల రిజర్వాయర్ బ్యాక్వాటర్ ఫోర్షోర్లో తుమ్మిళ్ల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించి రూ.783 కోట్లకు అనుమతులు ఇచ్చింది. సుంకేశుల బ్యాక్వాటర్ను తుమ్మిళ్ల వద్ద నుంచి పైప్లైన్ల ద్వారా ఆర్డీఎస్ కాల్వలకు మళ్లించి, అటు నుంచి మల్లమ్మకుంట రిజర్వాయర్లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి మరో 3 చిన్నపాటి రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ ఆయ కట్టు వరకు నీటిని తరలించేలా ప్రణాళిక రచించారు. ఫేజ్–1లో భాగంగా తుంగభద్ర నదీజలాలను తీసుకునేలా అప్రోచ్ చానల్, పంప్హౌస్, పైప్లైన్ల నిర్మాణానికి రూ.383 కోట్లతో అనుమతి ఇచ్చారు. ఇందిరాసాగర్ దుమ్ముగూడెంలో వృథాగా ఉన్న పంపులు, పైపులను తుమ్మిళ్ల పథకానికి ఉపయోగించాలని నిర్ణయించడంతో రూ.162 కోట్ల తో టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు పూర్తవడంతోపాటు మట్టిపనులను ఇప్పటికే మొదలు పెట్టారు. అధికారికంగా ఈ పనులను జనవరి 4న హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు. తుంగభద్ర నీళ్లివ్వండి... ఏడు వేల ఎకరాల ఆర్డీఎస్ ఆయకట్టుకు వీలుగా తుంగభద్ర నీటిని విడుదల చేయాలని శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ కర్ణాటకను కోరింది. ఈ మేరకు ఈఎన్సీ మురళీధర్ తుంగభద్ర బోర్డు ఎస్ఈకి లేఖ రాశారు. -
తుమ్మిళ్ల ఎత్తిపోతలకు ఓకే!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని తుమ్మిళ్ల దగ్గర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ఇరిగేషన్ కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఆర్డీఎస్ పరిధిలోని ఆయకట్టుకు నీరందించడానికి తుమ్మిళ్ల ఎత్తిపోతలే శరణ్యమని కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు గురువారం జరిగిన భేటీలో కమిటీ దీనికి అంగీకారం తెలిపింది. ఈ పథకానికి రూ.120 కోట్లు ఖర్చవుతుందని ఇంజనీర్లు తెలిపారు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు మొత్తం 15.9 టీఎంసీలు రావాల్సి ఉండగా, కేవలం 5 టీఎంసీలే అందుతున్నాయి. దీంతో ఆ ప్రాంత ఆయకట్టుకు నీరందించలేక పోతున్నారు. దీంతో తుమ్మిళ్లను చేపట్టి ఆర్డీఎస్ కింద ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. ఇందిరాసాగర్ ప్రాజెక్టులో ఉన్న పంపులు, పైపులు తుమ్మిళ్ల పథకానికి ఉపయోగించాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు. -
‘ఏపీ అభ్యంతరాలను పట్టించుకోవద్దు’
ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్రావు కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ను కోరారు. శుక్రవారం ఉదయం ఆయన ఎంబీ పాటిల్కు ఫోన్ చేశారు. ఆర్డీఎస్ పనులను నిలిపివేయకుండా కొనసాగించాలని కోరారు. కర్నూలు జిల్లా అధికారుల అభ్యంతరాలను పట్టించుకోవద్దని సూచించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలంగాణకు రావల్సిన సాగు నీటి వాటా అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
ఏపీ సహకరించేలా చూడండి
♦ ఆర్డీఎస్పై కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ లేఖ ♦ ఏపీ అధికారులు కర్ణాటకకు రాసిన లేఖను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తయ్యేందుకు.. ఏపీ ప్రభుత్వం సహకరించేలా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం బోర్డు సభ్య కార్యదర్శికి రాసిన లేఖను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచడం ద్వారా కర్నూలు ప్రాంత రైతులకు నష్టం వాటిల్లదని లేఖలో పేర్కొన్నారు. ఆర్డీఎస్ పూర్వాపరాలను లేఖలో వివరించారు. ఈ ఆనకట్ట పరిధిలోని ఆయకట్టును స్థిరీకరించేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును అడుగు మేర పెంచడంతో పాటు కుడివైపు ఉన్న తూము, కాలువల స్థితిగతులను మెరుగుపరచాలని నిపుణుల కమిటీ సూచించిందని వివరించారు. ఈ నివేదిక ఆధారంగానే ఆర్డీఎస్ ఆధునీకరణకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని, తన వంతు వాటాగా రూ.58.93 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసిం దన్నారు. ఆనకట్ట ఎత్తు పెంచడం, హెడ్వర్క్స్ మరమ్మతులను చేపట్టిన సంస్థ 20% పనులనే పూర్తి చేసిందన్నారు. కర్నూలు జిల్లా రైతులు తరచూ పనులను అడ్డుకోవడంతో ఆధునీకరణ ముందుకు సాగక, ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల వాటా అందడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఏపీ అభ్యంతరాలకు ఆధారాలివిగో..: ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు నిలిపివేయాలంటూ కర్ణాటక ప్రభుత్వానికి తాము ఎలాంటి లేఖ రాయలేదని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు చెబుతున్న మాటలను తెలంగాణ ప్రభుత్వం అసత్యాలుగా అభివర్ణించింది. ఆర్డీఎస్ పనులు ఆపాలంటూ ఈ నెల 16న కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీవో ఓబులేశు, ఆదోని డీఎస్పీ శ్రీనివాసరావు రాసిన లేఖలను విడుదల చేసింది. ‘‘ఆర్డీఎస్ సైట్ వద్ద కర్ణాటక అధికారులు పనులు జరిపిస్తున్నారు. కర్నూలు జిల్లా రైతులు, ప్రజలు ఈ పనులను వ్యతిరేకిస్తున్నారు. ఏపీ వైపు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన తలెత్తుతుందని భావిస్తున్నాం. ఈ ఆందోళన ఆర్డీఎస్ వద్ద శాంతిభద్రతల సమస్యగా పరిణమించే అవకాశం ఉంది’’ అని ఇరువురు అధికారులు కర్ణాటకలోని రాయచూర్ (సింథనూరు) ఆర్డీఎస్ ఎస్ఈ శ్రీప్రకాశ్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు సింథనూరు ఎస్ఈ, కర్నూలు కలెక్టర్ నడుమ ఈ నెల 16న సాగిన ఎస్ఎంఎస్ సంభాషణ కూడా బహిర్గతమైంది. ‘‘కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రుల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో.. ఈ రోజు నుంచి ఆర్డీఎస్ పనులు ప్రారంభమయ్యాయి. మా డిప్యూటీ కలెక్టర్ మీతో మాట్లాడతారు..’ అని కర్నూలు కలెక్టర్కు సింథనూరు ఎస్ఈ మెసేజ్ ఇచ్చారు. ‘‘ఏపీ ప్రభుత్వ ఆదేశాలు లేకుండా ఎలాంటి పనులు ప్రారంభించవద్దు. ప్రారంభమైన పనులను వెంటనే నిలిపేయండి’’ అని కర్నూలు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. దీనికి బదులుగా ‘‘మీ వైపు నుంచి అనుమతి లభించిన తర్వాతే పనులు ప్రారంభిస్తాం’’ అని సింథనూరు ఎస్ఈ సందేశం పంపారు. -
ఆర్డీఎస్పై కాంగ్రెస్ది కొంగ జపం
మంత్రి హరీశ్రావు ధ్వజం సాక్షి, హైదరాబాద్: గత 60 ఏళ్లలో రాజోలిబండ మళ్లింపు పథకానికి (ఆర్డీఎస్) నీళ్లివ్వనిది కాంగ్రెస్ పార్టీ కాదా అని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్రావు నిలదీశారు. ఆర్డీఎస్ వద్ద కాంగ్రెస్ నేతలు దీక్ష చేయడం, వారికి టీటీడీపీ నేతలు మద్దతు పలకడంపై ఆయన మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో హరీశ్రావు విలేకరులతో మాట్లాడుతూ ‘‘పదేళ్లపాటు అధికారంలో ఉండి ఆర్డీఎస్కు కేటాయించిన 15.09 టీఎంసీల నీటిని కాంగ్రెస్ ఏ ఒక్క రోజన్నా ఇచ్చిందా? అక్కడికేదో గతంలో వీరు ఇచ్చినట్లు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఏదో పోగొట్టిన ట్లు ఏందీ డ్రామాలు? చేపల కోసం చెరువు దగ్గర జపం చేస్తున్నట్లు నటించే కొంగకు, క్రెడిట్ గేమ్ ఆడుతున్న కాంగ్రెస్కు తేడా ఉందా? వీరిది కొంగ జపం కాక మరేంటి’’ అని ధ్వజమెత్తారు. ఆర్డీఎస్పై తెలంగాణ కాంగ్రెస్ది ఒక మాట, ఏపీ కాంగ్రెస్ది మరో మాట అని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల, కాళేశ్వరం ప్రాజెక్టులపై టీకాంగ్రెస్, మహారాష్ట్ర కాంగ్రెస్లవి వేర్వేరు మాటలని... రాష్ట్రానికో సిద్ధాంతం, రోజుకో మాట.. పూటకో చిత్తంలా కాంగ్రె స్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. ‘‘దీక్షా శిబిరం వద్ద కనిపించిన జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, డి.కె.అరుణ నిన్నటి దాకా మంత్రులేగా? వారు ఏ రోజైనా కర్ణాటకతో ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంపుపై మాట్లాడి ఉంటే అర్థం ఉండేది’’ అని హరీశ్ పేర్కొన్నారు. పనులను అడ్డుకున్నది ఎవరు? గతేడాది కర్ణాటక మంత్రి, సీఈలతో మాట్లాడి తాము పనులు చేయించేందుకు ప్రయత్నించగా కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు అడ్డుకోలేదా? అని హరీశ్రావు నిలదీశారు. రాయలసీమ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు బాంబులతో ఆర్డీఎస్ తూములను బద్దలు కొట్టి నీళ్లు తీసుకుపోతామని హెచ్చరించారని, బరిసెలతో, రాళ్లతో దాడి చేశారని... దీనిపై అప్పుడు జానా, ఉత్తమ్లు ఎందుకు మాట్లాడలేదన్నారు. ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం ద్వారా కాంగ్రెస్ నేతలు పాలమూరు ప్రజలను కరువు బాట పట్టించారని విమర్శించారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఎత్తు 6 అంగుళాల పెంపునకు సంబంధించి హెడ్వర్క్స్ పనులు మొదల య్యాయని తెలిసీ కాంగ్రెస్ నేతలు దీక్ష చేయడం హాస్యాస్పదమన్నారు. కర్ణాటక 1.2 టీఎంసీలు వాడుకున్నాక, 15.9 టీఎంసీలు మహబూబ్నగర్కు వస్తాయని, అయితే కర్ణాటక భూభాగంలోని కాల్వల ఆధునీకరణ జరిగితేనే పూర్తి స్థాయి నీళ్లు వస్తాయని, ఆ పనులు పురోగతిలో ఉన్నాయని హరీశ్ తెలిపారు. టీడీపీ నేతలు సైతం ఈ పనులను అడ్డుకోవద్దని... దీనిపై ఏపీ సీఎం చ ంద్రబాబు, మంత్రి దేవినేని ఉమలను ఒప్పించాలని హరీశ్ సూచించారు. ఆర్డీఎస్ ఆధునీకరణకు టీఆర్ఎస్ కట్టుబడి ఉందని, తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్ టెయిల్ ఎండ్ భూములకు సాగునీరు అందిస్తామన్నారు. -
సాగునీటి వివాదాలపై చర్చిద్దాం
ఏపీ మంత్రి దేవినేనికి హరీశ్రావు ఫోన్ సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి వివాదాలు లేకుండా ఆర్డీఎస్ సహా ఇతర ప్రాజెక్టులపై చర్చలకు రావాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు, ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సూచిం చారు. ఈ మేరకు హరీశ్రావు బుధవారం ఉదయం ఉమామహేశ్వరరావుకు ఫోన్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందిం చిన దేవినేని, అవసరమైతే సీఎంల స్థాయి లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో చర్చలకు సిద్ధమని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల్లో లభ్యత నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంచుకునే విషయంలో చర్చలు అవసరమని ఆయ న అభిప్రాయపడ్డా రు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రానికి ఎంత వా టా రావాలన్న దాని పై చర్చలతో స్పష్టత వస్తుందని దేవినేని అన్నారు. కాగా, ఆర్డీఎస్ పనుల ఆధునీకరణపై హరీశ్రావు గత నెలలో బెంగళూరు వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయన దేవినేనికి కూడా ఫోన్ చేసి పనుల వేగిరానికి సహకరించాల్సింది గా కోరారు. ఈ నేపథ్యంలోనే హరీశ్రావు ఏపీ మంత్రికి మరోసారి ఫోన్ చేశారు. -
దేవినేని ఉమకు హరీశ్ రావు ఫోన్
హైదరాబాద్ : నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనిశ్చితికి తెర దించేందుకు ఏపీ సర్కార్తో చర్చించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ కాల్ చేశారు. నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చించేందుకు సమావేశం అవుదామని ఈ సందర్భంగా హరీశ్ కోరారు. ఆర్డీఎస్తో పాటు తెలంగాణ నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించుకుందామని సూచించారు. అందుకు మంత్రి దేవినేని ఉమ కూడా అంగీకారం తెలిపారు. సమావేశం ఏర్పాటు చేయాలని హరీశ్కు దేవినేని ఉమ తెలిపారు. -
జూరాలకు 3 టీఎంసీలివ్వండి
నారాయణపూర్ నుంచి విడుదల చేయండి * పాలమూరుకు తాగునీరిచ్చేందుకు సహకరించండి * కర్ణాటక మంత్రిని కోరిన మంత్రి హరీశ్ * సీఎంతో చర్చించి నిర్ణయిస్తామన్న పాటిల్ * 50 రోజుల్లో ఆర్డీఎస్ పనులు పూర్తి చేస్తామని హామీ సాక్షి, హైదరాబాద్/బెంగళూరు, జూరాల: మహబూబ్నగర్ జిల్లా తాగునీటి అవసరాల కోసం మానవతా దృక్పథంతో కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నీటిపారుదల మంత్రి హరీశ్రావు కోరారు. కర్ణాటక భారీ, మధ్య తరహా నీటిపారుదల మంత్రి ఎంబీ పాటిల్ ఇందుకు సానుకూలత వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గురువారం బెంగళూరులోని విధానసౌధలో పాటిల్తో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో కలిసి హరీశ్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సం బంధాలు నెలకొనాల్సిన ఆవశ్యకత, జల పంపకాల విషయాలు, రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్) ఆధునీకరణ తదితరాలపై చర్చించారు. సీఎం కోరిక మేరకు పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చడంలో కర్ణాటక సహకారం కోరేందుకు వచ్చామని హరీశ్ అన్నారు. మహబూబ్నగర్ కరువుతో ఉన్నందున నారాయణపూర్ నుంచి 3 టీఎంసీలివ్వాలని కోరారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కృష్ణా జలనిగమ్ అధికారులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని పాటిల్ హామీ ఇచ్చారు. 50 రోజుల్లో ఆర్డీఎస్ పనులు పూర్తి ఆర్డీఎస్ గురించి కూడా భేటీలో హరీశ్ ప్రస్తావించారు. ‘‘కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 15.9 టీఎంసీల ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు నీరందాల్సి ఉన్నా ఐదారు టీఎంసీలకు మించి రావడం లేదు. దాంతో ఏనాడూ నిర్దేశిత ఆయకట్టులో కనీసం 20 వేల ఎకరాలు కూడా సాగుకు నోచుకోవడం లేదు. కర్నూ లు జిల్లా రైతులు తరచూ తూములు పగులగొట్టడం, అక్రమంగా నీటిని తరలించుకుపోవడంతో ఆర్డీఎస్ ద్వారా తెలంగాణలో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. బ్యారేజీ ఎత్తును 15 సెంటీమీటర్ల మేర పెంచేందుకు, లైనింగ్ మరమ్మతులకు ఉమ్మడి రాష్టంలో రూ.72 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.58 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసినా పనులు సాగడం లేదు’’ అని వివరించారు. పాటిల్ 50 రోజుల్లోనే ఆర్డీఎస్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఇదే సమయంలో బెంగళూరు నుంచే ఏపీ సాగునీటి మంత్రి దేవినేని ఉమతో ఫోన్లో మాట్లాడారు. ఆర్డీఎస్ పనుల సహకారంపై చర్చిద్దామని ప్రతిపాదించారు. మే 4 తర్వాత చర్పిద్దామని ఉమ హామీ ఇచ్చారు. -
28న ఆర్డీఎస్ పై కర్ణాటకతో చర్చలు
♦ బెంగళూరు వెళ్లనున్న మంత్రి హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)పై నెలకొన్న అనిశ్చితికి తెరదించేం దుకు ఎగువ రాష్ట్రమైన కర్ణాటకతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డీఎస్పై చర్చించేందుకు ఈ నెల 28న బెంగళూరుకు రావాల్సిందిగా కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎం.బి. పాటిల్...రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావును శనివారం ఆహ్వానించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నడుమ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న ఆర్డీఎస్ వివిధ కారణాలతో తెలంగాణ ప్రాంత ఆయకట్టు రైతులకు నీరు అందించలేకపోతున్న వైనాన్ని హరీశ్రావు శనివారం ఫోన్లో పాటిల్తో చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డీఎస్ పనులు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 15.9 టీఎంసీల ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా 5-6 టీఎంసీలకు మించి రావడం లేదని...ఫలితంగా నిర్దేశిత ఆయకట్టులో కనీసం 20 వేల ఎకరాలు కూడా సాగుకు నోచుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రైతులు తరచూ తూములు పగలగొట్టడం, నీటిని అక్రమంగా తరలించుకుపోవడం వంటి చర్యలతో ఆర్డీఎస్ ద్వారా తెలంగాణలో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఆర్డీఎస్ ఆధునీకరణలో భాగంగా బ్యారేజీ ఎత్తును 15 సెంటీమీటర్ల మేర పెంచేందుకు, లైనింగ్ మరమ్మతులకు ఉమ్మడి రాష్టంలో రూ. 72 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని హరీశ్రావు ప్రస్తావించారు. ఇందులో రూ. 58 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసినా పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆర్డీఎస్పై నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పాటిల్కు సూచించారు. దీనిపై స్పందించిన పాటిల్.. ఈ నెల 28న హరీశ్రావును బెంగళూరుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. -
'ఆర్డీఎస్'పై కర్ణాటకతో చర్చించనున్న టీ.సర్కార్
హైదరాబాద్ : రాజోలిబండ వివాదంపై కర్ణాటకతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులోభాగంగా తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు ఏప్రిల్ 28వ తేదీన బెంగళూరు వెళ్లనున్నారు. కర్ణాటక సాగునీటి శాఖ మంత్రి ఎం.బి.పాటిల్తో హరీశ్రావు సమావేశమై... రాజోలిబండ వివాదంపై చర్చించనున్నారు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ద్వారా మహబూబ్నగర్ జిల్లా రైతులకు నీటిని అందించడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. -
ఆర్డీఎస్ కుడి కాలువను అడ్డుకోండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ఉపనది తుంగభద్రపై రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) కుడి కాలువ పథకాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేఖ ప్రతులను కృష్ణా నది యాజమాన్య బోర్డుతో పాటు, ఏపీ ప్రభుత్వానికి పంపింది. ఆర్డీఎస్ కుడి కాలువ పథకం పేరిట నాలుగు టీఎంసీల మళ్లింపునకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆ లేఖలో ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్-1తో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టం నిబంధనలకు కూడా వ్యతిరేకమని స్పష్టీకరించింది. కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్-2 కేటాయింపులపై ఇప్పటికే జల వివాదాలు నెలకొన్నాయని... ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా కేసు విచారణలో ఉందని లేఖలో ప్రస్తావించింది. 1956 నాటి నిబంధనల ప్రకారం ఆర్డీఎస్ ద్వారా 15.90 టీఎంసీలను వినియోగించుకుని తెలంగాణలో 87,500 ఎకరాలకు సాగునీరివ్వాల్సి ఉందని... కానీ ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతం ఎన్నడూ 5 టీఎంసీలకు మించి వాడుకోలేదని తెలిపింది. కృష్ణా ట్రిబ్యునల్-2, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఆర్డీఎస్ కుడి కాలువ పథకం పనులు చేపట్టడాన్ని అడ్డుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గుర్జాపూర్తో దిగువ ప్రాజెక్టులకు గండం కృష్ణా-భీమా నదుల సంగమానికి మూడు కిలోమీటర్ల ఎగువన రాయచూర్ జిల్లా గుర్జాపూర్ వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న బ్యారేజీ పనులపైనా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపైనా నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి కేంద్ర జల వనరుల శాఖకు లేఖ రాశారు. గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణానికి కృష్ణా జలాల పంపిణీ ట్రిబ్యునల్లు ఎలాంటి నీటి కేటాయింపులు జరపలేదని అందులో పేర్కొన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి కర్ణాటక ఎలాంటి మాస్టర్ ప్లాన్ను ట్రిబ్యునల్కు సమర్పించలేదని చెప్పారు. గుర్జాపూర్తో పాటు కృష్ణా, భీమా, ఇతర నదుల పరీవాహక ప్రాంతంలోని ప్రవాహాలపైనా కర్ణాటక ప్రభుత్వం 75 టీఎంసీల సామర్థ్యం కలిగిన 52 బ్యారేజీలను నిర్మించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. 2015-16కు సంబంధించి ఎగువ నుంచి ప్రవాహం లేక జూరాల ప్రాజెక్టులోకి నీరు చేరలేదని... కర్ణాటక నిర్మిస్తున్న బ్యారేజీల మూలంగా దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీపై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. గుర్జాపూర్ బ్యారేజీ నిర్మాణంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసినా కర్ణాటక ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని, శరవేగంగా పనులు చేస్తోందని పేర్కొన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్తో పాటు కేంద్ర జల మండలి, ఇతర అనుమతులకు సంబంధించిన పత్రాలను తమకు అందజేసేలా కర్ణాటకను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. -
ఆర్డీఎస్ ఆయకట్టు స్థిరీకరణకు ‘తుళ్లూరు’
లోటు పూడ్చేందుకు కొత్త ఎత్తిపోతల పథకం సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకానికి(ఆర్డీఎస్) ఉన్న వాస్తవ నీటి వాటా వినియోగంలో ఏర్పడుతున్న లోటును పూడ్చేందుకు కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. మహబూబ్నగర్ జిల్లా అయిజా మండలం తుళ్లూరు వద్ద సుంకేశుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ను ఎత్తిపోసేలా కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. మొత్తంగా 8 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా ఆర్డీఎస్ పరిధిలోని 74 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా దీన్ని తీర్చిదిద్దారు. వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నాయి. దీంతో మహబూబ్నగర్ జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీలు లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేరు నీరు రావట్లేదు. దీంతో ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న ఏపీలోని కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డుతగులుతుండటంతో 4 టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావట్లేదు. దీంతో కేవలం 30 వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా నీరందుతోంది. సిద్ధమైన ప్రతిపాదనలు ఆర్డీఎస్ కింద ఉన్న కేటాయింపులను సమర్థంగా వాడుకునేందుకు అక్కడ రిజర్వాయర్ నిర్మిస్తే మేలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముసాయిదా ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) తయారు చేశారు. తుంగభద్రపై ఉన్న సుంకేశుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ను తుమ్మిళ్ల వద్ద నిర్మించే మల్లమ్మకుంట రిజర్వాయర్లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి మరో మూడు చిన్న పాటి రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ తుది ఆయకట్టు వరకు నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తంగా 90 రోజుల్లో 8 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. దీనికి రూ.830 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఈ ప్రణాళికపై సోమవారం మహబూబ్నగర్ జిల్లా అధికారులు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు సూచనలు వచ్చినట్లు తెలిసింది. మూడు రిజర్వాయర్లు కాకుండా కేవలం ఒక రిర్వాయర్ ద్వారానే నీటిని తరలించేలా ప్రత్యామ్నాయం అధ్యయనం చేయాలని, వీలుంటే కొత్తగా మరో 10 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించినట్లు సమాచారం. -
5 రోజులు.. 6వేల క్యూసెక్కులు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వరుణుడు కరుణ చూపుతాడన్న భరోసాతో ఇప్పటికే పంటలు సాగుచేస్తున్న రైతాం గాన్ని ఆదుకునేందుకు జూరాల ప్రాజెక్టు కింద రోజుకు 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని జిల్లా సాగునీటి సల హాబోర్డు(ఐఏబీ) సమావేశం నిర్ణయిం చింది. ఈ నీటిని ఆగస్టు 4వ తేదీ నుంచి ఐదురోజుల పాటు 6వేల క్కూసెక్కుల నీటిని విడుదల చేయాలని తీర్మానిం చింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూప ల్లి కృష్ణారావు అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఈ మేరకునిర్ణయించారు. ప్రియదర్శిని జూరా ల ప్రాజె క్టు, ఆర్డీఎస్తో పాటు జిల్లాలో ఉన్న పలు ఎత్తిపోతల పథకాలు, పనుల పురోగతిని చర్చించారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు సూచనలు, సలహాలు ఇచ్చా రు. నీటిపారుదల శాఖ సీఈ ఖగేందర్ మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టులో ఆశించినస్థాయి కన్నా తక్కువ నీటిమట్టం ఉందని, ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి నీరందించే పరిస్థితి లేదన్నారు. 0.3 టీఎంసీల నీరు మాత్రమే ప్రస్తుతం ప్రాజెక్టులో నిల్వఉందని, ఇన్ఫ్లో కూడా 800 క్యూసెక్కులు మాత్రమే ఉందని వివరించారు. దీంతో ప్రస్తుతం ఉన్న నీటిని చివరి ఆయకట్టు వరకు పరిస్థితి లేదని అయితే రోజుకు 1200 క్యూసెక్కుల చొప్పున ఐదురోజుల పాటు నీరందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతాంగాన్ని ఆదుకుందాం: ఎమ్మెల్యేలు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనవడంతో రైతులు అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకోవాలని ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని ర్యాలంపాడు రిజర్వాయర్ నీటిని విడుదల చేసి పత్తి రైతులను ఆదుకోవాలని కోరారు. చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వలేకపోయినా జూరాలలో ఉన్న నీటిని ఎన్ని ఎకరాలకు ఇవ్వగలిగితే అంతవరకు పైర్లు ఎండిపోకుండా తక్షణమే అందజేయాలని ఎమ్మెల్యేలు సంపత్కుమార్, చిట్టెం రాంమోహన్రెడ్డి, ఎస్.రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఎస్పై ఎమ్మెల్యే సంపత్కుమార్ వాటి పురోగతికి చెందిన పలు అంశాలను సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీఎస్ పనులు 85 శాతం పూర్తయినట్లు చెప్పడం సబబుకాదని, ఇది పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకుని కట్టించాల్సిందేనని అన్నారు. గతంలో కన్నా ఆర్డీఎస్పై ప్రస్తుతం 8 టీఎంసీల నీరు ప్రవహించడం కొంత పురోగతిని సూచిస్తుందన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి భీమా ప్రాజెక్టు నీటిని విడుదల చేయడం ద్వారా రైతాంగానికి అలాగే కోయిల్సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో పూర్తిస్థాయిలో సాగునీరందించాలంటే ఆల్మట్టి డ్యాం ఇంకా 60 టీఎంసీలు సామర్థ్యంతో మాత్రమే ఉందని 130 టీఎంసీల నీరు డ్యాంలోకి చేరితే తప్ప జూరాలకు నీరు వచ్చే అవకాశం లేదని సీఈ వెల్లడించారు. ఇప్పటివరకు పంటలు వేయని రైతాంగం ఆరుతడి పంటలను వేసుకోవడం మంచిందని జేడీఏ డెరైక్టర్ ఉష వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి, జిల్లా పరిషత్ ఛైర్మన్ భాస్కర్, జాయింట్ కలెక్టర్ రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు. -
కుర్చేసుకొని కూర్చుంటానన్నావ్...ఎక్కడ?
నాగర్కర్నూల్: ఆర్డీఎస్ వద్ద కుర్చేసుకుని కూర్చొని ఆనకట్ట ఎత్తు పెంచుతానన్న సీఎం కేసీఆర్ పత్తా లేకుండా పోయారని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న పెండింగ్ ప్రాజెక్టుల యాత్రను శుక్రవారం ఆమె నాగర్కర్నూలులో ప్రారంభించి పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీకె అరుణ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆర్డీఎస్ విషయంలో కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. పాలమూరు ప్రజలను మామా అల్లుళ్లు మభ్యపెట్టాలని చూస్తే డొక్క చించుతారని హెచ్చరించారు. -
ఇప్పుడైనా ఆర్డీఎస్కు నీరందేనా..?
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)తో రాష్ట్రానికి రావాల్సిన వాస్తవ నీటి వాటాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీతో ఉన్న వివాదాన్ని కేంద్ర సహకారంతో చక్కదిద్దుకునే ప్రయత్నం చేసిన రాష్ట్రం.. వాటా మేరకు నీటిని వినియోగంలోకి తెచ్చి నిర్ణీత ఆయకట్టుకు సాగునీరిచ్చే యత్నాలకు పూనుకుంది. కేంద్రం ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ఏపీ సహకారం అందిస్తే ఆర్డీఎస్ కింద బ్యారేజీ నిర్మించి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే దిశగా కసరత్తు చేస్తోంది. అవసరమైతే దీనిపై మరోమారు ఏపీతో, కర్ణాటకతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. వాస్తవానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఈ నీటిలో కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 7 టీఎంసీలు, పరీవాహకం నుంచి మరో 8 టీఎంసీలు లభ్యమవుతోంది. అయితే కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించినమేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ ఆనకట్ట పొడవును మరో 5 అంగుళాల మేర పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక అంగీకరించింది. అలాగే కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ర్టం రూ.72 కోట్ల మేర డిపాజిట్ కూడా చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డు తగులుతుండడంతో 4 టీఎంసీలు మాత్రమే రాష్ట్రానికి అందుతున్నాయి. దీంతో 37 వేల ఆయకట్టుకు సాగునీరందుతోంది. ఈ విషయాన్ని ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం దృష్టికి తీసుకురాగా, నిర్ణీత నీటిని తెలంగాణ వాడుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇందుకు తాము సహకరిస్తామని ఏపీ స్పష్టం చేసింది. బ్యారేజీ నిర్మిస్తే మేలంటున్న తెలంగాణ.. ఆర్డీఎస్ కింద ఉన్న నీటి కేటాయింపులను వాడుకునేందుకు బ్యారేజీ నిర్మిస్తే మేలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యారేజీ అయితేనే లక్ష్యం మేర ఆయకట్టుకు నీటిని అందించవచ్చని చెబుతోంది. బ్రజేష్ ట్రిబ్యునల్ సైతం కొత్తగా తుంగభద్ర నుంచి 4 టీఎంసీల నీటిని అదనం గా ఏపీలోని కేసీ కెనాల్కు కేటాయించిన దృ ష్ట్యా, ఆ నీటిని ఈ బ్యారేజీ ద్వారా అందించవచ్చు. బ్యారేజీ నిర్మాణంలో ఏపీ సైతం భాగస్వామ్యం కావాలని రాష్ట్రం అంటోంది. -
తుంగభద్ర బోర్డు పరిధిలోకి రాజోలిబండ మళ్లింపు పథకం!
బోర్డుకు విజ్ఞప్తి చేయనున్న తెలంగాణ సర్కారు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య వివాదాస్పదంగా మారిన రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)ను తుంగభద్ర బోర్డు పరిధిలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. కర్ణాటకలోని తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్కు 15.84 టీఎంసీల నీటి కేటాయింపులున్నా... ఏనాడూ 3 టీఎంసీలకు మించి అందడం లేదు. దీంతో రాష్ట్రంలో ఆర్డీఎస్ కింద ఉన్న 87 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీనిని నివారించి కర్ణాటకలో నదీ ప్రవాహ ప్రాంతంలోని కాలువల మరమ్మతులు, గట్ల పటిష్టం, పూడికతీతకు సంబంధించి ఆ రాష్ట్రంతో గతంలోనే ఒప్పందాలు జరిగినా అవి పూర్తి స్థాయిలో అమలుకావడం లేదు. దీంతో ఈ ఏడాది ఆర్డీఎస్ కింద పంటలకు నీరు అందలేదు. ఈ పరిస్థితిని మార్చాలంటే ఆర్డీఎస్ను బోర్డు పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 29న బెంగళూరులో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఇప్పటికే నిర్ణయించినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
పోటెత్తిన తుంగభద్ర
మంత్రాలయం రూరల్: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో తుంగభద్ర నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటకలోని టీబీ డ్యాం నిండటంతో అధికారులు దిగువకు భారీ ఎత్తును నీటిని వదులుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఈ నీరు మంత్రాలయానికి చేరాయి. పరవళ్లు తొక్కుతున్న నదిని చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. దీంతో నది తీర ప్రాంతంలో సందడి కనిపించింది. వరద నీటి ప్రవాహం పెరుగుతుండటంతో తీర ప్రాంత ప్రజలను తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ సీసీ నాగార్జునరెడ్డిలు అప్రమత్తం చేశారు. ఆర్డీఎస్కు జలకళ.. కోసిగిరూరల్: అగసనూరు సమీపంలోని రాజోలి బండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) జలకళను సంతరించుకుంది. ఆర్డీఎస్ ఆనకట్టపై నుంచి సుమారు 4 అడుగుల ఎత్తులో నీరు దిగువకు ప్రవహిస్తున్నాయి. వరద నీటిని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి రంగనాథ్ పరిశీలించారు. టీబీ డ్యాం నుంచి దిగువకు ఎక్కువగా నీరు వదిలే అవకాశం ఉన్నందున తీరప్రాంత గ్రామల ప్రజలు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జలమయమైన పొలాలు కౌతాళం: తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో మండలంలోని తీర ప్రాంత పొలాలు జలమయమయ్యాయి. విద్యుత్ మోటర్లు నీటమునిగాయి. మేళిగనూరు, వల్లూరు, కుంబళనూరు, మరళి, గుడికంబాల గ్రామాల్లో పత్తి, ఉల్లి పైర్లకు నష్టం వాటిల్లింది. ప్రతి ఏడాది తమకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతోందని రైతులు తెలిపారు. -
తెలంగాణలో అమెరికా,బ్రిటన్ తరహా విద్యావ్యవస్థ:కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. అమెరికా, బ్రిటన్ తరహా విద్యావ్యవస్థను తెలంగాణలో అమల్లో పెడతామన్నారు. తెలంగాణలోని 16 టీచర్ యూనియన్ల ప్రతినిధులతో కెసిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ డిమాండ్పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఆర్డీఎస్ వివాదంపై కర్ణాటక ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కర్ణాటక పరిధిలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం కోరింది. నీటి వివాద సమస్య పరిష్కరించాలని లేఖ రాసిన మంత్రి హరీశ్రావు కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ఆర్డీఎస్ పనులకు సహకరించండి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) హెడ్వర్క్స్ వద్ద ఆనకట్టను పటిష్ట పరిచేందుకు సహకరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎం.గిరిజా శంకర్ కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్డీఎస్ పనులకు రాయలసీమ ప్రాంత రైతులు అడ్డు తగులుతున్న నేపథ్యంలో కలెక్టర్ గురువారం రాయచూర్కు వెళ్లి అక్కడి జిల్లా కలెక్టర్ వి.వి.జ్యోష్ణతో సమావేశమయ్యారు. ఆర్డీఎస్ అనకట్ట వద్ద పనులు కొనసాగించేందుకు అవసరమైన పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నెలకొన్న పరిస్థితులను ఇప్పటికే తమ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు రాయచూర్ కలెక్టర్ జోష్ణ వెల్లడించారు. పనులు కొనసాగించేందుకు అవసరమైన పోలీసు రక్షణను అందిస్తామని హామీ ఇచ్చారు. 2006లో ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచన మేరకు ఆర్డీఎస్ ఆనకట్ట పటిష్ట పరిచాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి నుంచి నాలుగో ప్యాకేజీ వరకు పనులు నిర్వహించే బాధ్యతను కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించారు. ఇప్పటికే రెండు నుంచి నాలుగో ప్యాకేజీ పనులు పూర్తికాగా ఒకటో ప్యాకేజీ పనులకు రాయలసీమ ప్రాంత రైతులు అడ్డు చెబుతున్నారు. రక్షణ కల్పిస్తే తప్ప ఒకటో ప్యాకేజీ పనులు చేపట్టలేనంటూ కర్ణాటకకు చెందిన కాంట్రాక్టు సంస్థ ప్రభు కన్స్ట్రక్షన్స్ చేతులెత్తేసింది. పని ప్రదేశంలో రక్షణ కల్పించాలంటూ మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ రాయచూర్ కలెక్టర్, ఎస్పీని కోరారు. ఈ నేపథ్యంలో గురువారం మరోమారు స్వయంగా వెళ్లి రాయచూర్ కలెక్టర్తో జిల్లా కలెక్టర్ గిరిజా శంకర్ భేటీ అయ్యారు. సమావేశంలో రాయచూర్ ఎస్పీ ఎం.ఎన్.నాగరాజు, మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాశ్ పాల్గొన్నారు. -
పోలీస్ బందోబస్తుతో ఆర్డీఎస్ పనులు చేయండి
కర్ణాటక అధికారులతో కలెక్టర్ గిరిజాశంకర్ ఆర్డీఎస్ ప్రధాన నిర్మాణంలో కర్నూలు రైతుల అభ్యంతరాలతో ఆగిన పనులను నిబంధనల మేరకు చేపడుతున్నందున పోలీసు బందోబస్తుతో పనులు కొనసాగించాలని కర్ణాటక అధికారులకు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ సూచించారు. మంగళవారం రాయచూర్ అసిస్టెంట్ కమిషనర్, గుల్బర్గా డీఐజీతో కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడారు. ఇందుకు స్పందించిన కర్ణాటక అధికారుల పనులను నిర్వహించేలా బందోబస్తు చర్యలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆర్డీఎస్ ప్రధాన నిర్మాణంలో పనులు నిర్వహిస్తున్న ప్రభు కన్స్ట్రక్షన్ యజమానులతోనూ ఆయన మాట్లాడారు. పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ప్రకాష్తో మాట్లాడిన కలెక్టర్ కర్ణాటకలో పనుల పర్యవేక్షణ సంబంధిత ఇంజనీర్లను పంపాల్సిందిగా ఆదేశించారు. -
ద్రోహివి కాకుంటే ఆర్డీఎస్ ఎత్తు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణద్రోహి కాకుంటే ఆర్డీఎస్ తూముల ఎత్తును పెంచే పనులను చేపట్టాలని నీటిపారుదల మంత్రి టి.హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ తూములను ఏపీ ఎమ్మెల్యేలు ధ్వంసం చేస్తున్నారని, దీనివల్ల నష్టం జరుగుతున్నదంటూ కాంగ్రెస్కు చెందిన ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ మంగళవారం మంత్రి హరీశ్రావును కలిశారు. దీంతో వెంటనే స్పందించిన హరీశ్ ఏపీ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమతోనూ, కేంద్ర జలసంఘం ఉన్నతాధికారి పాండ్యాతోనూ ఫోనులో మాట్లాడారు. అనంతరం విలేకరులతో హరీ్శ్ మాట్లాడుతూ, ఆర్డీఎస్ గేట్ల పెంపు అక్రమంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ దీనికి 15.9 టీఎంసీల అవార్డు కూడా ఇచ్చిందన్నారు. -
'తెలంగాణ ప్రభుత్వం జలవివాదాలను ప్రోత్సహిస్తోంది'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జలవివాదాలను ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆర్డీఎస్ ఎత్తును 15 సెంమీ పెంచుతుంటే వారికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని దేవినేని ఆరోపించారు. ఆర్డీఎస్ ఎత్తు పెంపు విషయంలో తెలంగాణ మంత్రి హరీష్రావు హోదాను మరచి బాధ్యతరహితంగా మాట్లాడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచితే కడప,కర్నూలు జిల్లాల భూములు ఎడారులుగా మారుతాయని దేవినేని ఉమ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని ఆయన అన్నారు. కృష్ణా డెల్టాకు ఇప్పటివరకు 7 టీఎమ్సీల నీరు వచ్చిందని, రావాల్సిన మిగిలిన నీటి విడుదల కోసం లేఖ రాశామని దేవినేని ఉమ తెలిపారు. -
సీఐఎస్ఎఫ్ బలగాలను మొహరించైనా సరే...
హైదరాబాద్: ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) గేట్ల ఎత్తు పెంపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గేట్ల ఎత్తు పెంపుపై ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. నిర్మాణ పనులు పూర్తి చేసి తెలంగాణకు 15.9 టీఎంసీల నీటిని తెలంగాణకు ఇవ్వాలన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కూడా మాట్లాడానని చెప్పారు. సీడబ్లూసీ జోక్యం చేసుకోని సీఐఎస్ఎఫ్ బలగాలను మొహరించైనా సరే ఈ పనులు పూర్తిచేయించాలని హరీశ్రావు కోరారు. -
ఆర్డీఎస్ రగడ
గద్వాల: ఆదినుంచీ అదే రగడ.. ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) నీటి వివాదం మరోసారి రాజుకుంది. కర్ణాటకలోని తుంగభద్ర నదిపై హెడ్వర్క్స్ వద్ద స్పిల్వే గోడపై కాంక్రీట్ పనులను ఆదివారం కర్నూలు రైతుల బృందం అడ్డుకుంది. 2007లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్ ఆధునికీకరణకు రూ.92 కోట్లు కేటాయించింది. అందులో భాగంగానే హెడ్వర్క్స్లో స్పిల్వేగోడపై అరడుగు మేర కాంక్రీట్ వేయాల్సి ఉంది. రాయిచూర్ జిల్లా వైపు వంద అడుగుల మేర కాంక్రీట్ను గతేడాది వేశారు. ప్రస్తుతం కుడివైపు కర్నూలు జిల్లా నుంచి కాంక్రీట్ పనులను కాంట్రాక్టర్ ప్రారంభించాడు. కాగా, విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, టీడీపీ నేత తిక్కారెడ్డి నేతృత్వంలో రైతులు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని కాంట్రాక్టర్ను అడ్డుకున్నారు. ఇదీ ఆర్డీఎస్ క(వ్య)థ..! ఆర్డీఎస్ ద్వారా అలంపూర్ నియోజకవర్గంలో సుమారు 87,500ఎకరాలకు సాగునీరు అందాల్సిఉంది. స్లూయీజ్ రంధ్రాలు కాల్వలు అధ్వానంగా మారడంతో 30వేల ఎకరాలకు మించి అందడం లేదు. దీనికితో డు 1992లో ఆర్డీఎస్ స్లూయీజ్ రంధ్రాల కర్రషట్టర్లను రాయలసీమ ప్రాంతానికి చెం దిన కొందరు నాటు బాంబులతో బద్దలుకొట్టారు. స్పందించిన ప్రభుత్వం ఇనుపషట్టర్లను ఏర్పాటు చేయించింది. ఈ ఘటన అ ప్పట్లో మహబూబ్నగర్, కర్నూలు జిల్లాల రైతుల మధ్య సమస్యను మరింత జఠిలం చేసింది. ఈ క్రమంలో కర్నూలు రైతులు తుంగభద్ర నదికి కుడివైపున తాగునీటి పథకాలు, వ్యవసాయ అవసరాలకు నీళ్లు రాకుండా షట్టర్ల ద్వారా అడ్డుకుంటున్నారని, వాటిని తగ్గించాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. 2002లో అప్పటి ప్రభుత్వం షట్టర్ల వ ద్ద మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరుచేసింది. కర్ణాటక అధికారులు పనులు ప్రారంభించిగా కర్నూలు రైతులు అడ్డుకున్నారు. ఇదిలాఉండగా, దశాబ్దాలు గా నలుగుతున్న ఆర్డీఎస్ సమస్యకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే శాశ్వత పరి ష్కారం చూపుతామని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హామీఇచ్చారు. ఆ మాదిరిగానే 2004లో అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ నివేదిక మేరకు ఆర్డీఎస్ ఆధునికీకరణ కోసం రూ.92కోట్లు మంజూరుచేశారు. ఇందులో కర్ణాటకలో రూ.72 కోట్లు, అలంపూర్ నియోజకవర్గంలో రూ.20కోట్లతో మరమ్మతు పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించాలి ఆర్డీఎస్ పనులను అడ్డుకోవడం సరికాదు. ఎవరికి నష్టం చేసే పనుల్లేవు. కేవలం అక్కడి ప్రాంత రైతుల మెప్పు కోసమే నాయకులు అలా చేస్తున్నారు. 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు ఇచ్చిన నిధుల ఆధునికీకరణ పనులు కొనసాగుతుంటే అడ్డుకోవడం సరికాదు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి త్వరలోనే ఆర్డీఎస్ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలి. సుంకేసుల బ్యారేజీని తొలగించి నీటిమళ్లింపు పథకంలా పాత లెవల్లోనే ఉండేలా చర్యలు చేపట్టాలి. - తనగల సీతారాంరెడ్డి,ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ -
మళ్లీ మొదటికొచ్చిన నీటి గొడవ
-
మళ్లీ మొదటికొచ్చిన నీటి గొడవ
కర్నూలు: జిల్లాలోని కోస్గి మండలంలో రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఆనకట్ట ఎత్తు రెండు అడుగుల పెంచాలని కర్నాటక ప్రభుత్వం పనులు చేపట్టడంతో కర్నూలు జిల్లాకు చెందిన రైతులు ఆర్డీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. కోస్గి దగ్గర రైతులు అధికారులను అడ్డుకున్నారు. తమకు 3 వేల టీఎంసీల నిలువ నీరు రావలసి ఉండగా ఇప్పటి వరకు రాలేదని రైతులు ధర్నా చేపట్టారు. భారీ సంఖ్యలో జిల్లా రైతులు ఇక్కడకు తరలి వచ్చారు. దాంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి సంఘటనాస్థలికి చేరుకున్నారు. రైతులకు మద్దతుగా నిలిచారు. -
కర్ణాటక కదిలింది
మన అధికారుల ప్రయత్నం ఫలించింది. ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఆర్డీఎస్ ఆధునికీకరణకు అడ్డంకిగా మారిన ప్యాకేజీ-2 కాంట్రాక్టును రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆరునెలల నిరీక్షణకు తెరపడింది. మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగించి ఈ వేసవిలో వీలైనంత త్వరగా పూర్తిచేయించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదే అమలైతే వచ్చే ఖరీఫ్లో ఆయకట్టుకు నీటిని విడుదల చేసుకునే భాగ్యం కలుగుతుంది. గద్వాల, న్యూస్లైన్: జిల్లాలో 87500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన ఆర్డీఎస్ ప్రస్తుతం 30వేల ఎకరాలకు మించి అందడం లేదు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేవిధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో ఆర్డీఎస్ ఆధునికీకరణ కోసం రూ.92 కోట్లు మంజూరుచేశారు. ఈ నిధులతో కర్ణాటక పరిధిలో రూ.72కోట్లు, మిగతా రూ.20 కోట్లతో అలంపూర్ నియోజకవర్గంలో కాల్వల పనులు చేపట్టాల్సి ఉంది. అయితే కీలకంగా మారిన ప్యాకేజీ-1,2 పనులు ఇంకా పూర్తికాలేదు. ఇందులో కర్ణాటకకు చెందిన సిరామట్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ 2008లో రూ.24 కోట్లతో ప్యాకేజీ -2 పనులను దక్కించుకుంది. ప్రారంభించిన కొన్నిరోజులకే పనులను నిలిపేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ కాంట్రాక్ట్ సంస్థ గత ఫిబ్రవరిలో కర్ణాటక అధికారుల నుంచి నోటీసులు అందుకుని ఏప్రిల్ చివరి వారంలో ప్రధానకాల్వలను తవ్వేసి పనులు పూర్తి చేయకుండానే మళ్లీ వదిలేసి వెళ్లిపోయింది. ఇలా వదిలేసిన పనుల్లో హెడ్వర్క్స్ నుంచి 13వ కి.మీ వద్ద వాగుపై ఉన్న స్లాబ్ దిగువన రంధ్రం చేసి వదిలేశారు. ఈ రంధ్రాలను గత మే నెలలో కర్ణాటక అధికారులు తాత్కాలికంగా మూసివేయించి, ఖరీఫ్లో నీటి విడుదలకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ప్యాకేజీ-2 పనులు పూర్తయితేనే.. ఈ వేసవిలో ప్యాకేజీ-2 పనులను పూర్తిచేస్తేనే ఖరీఫ్లో ఎక్కువ నీటిని ప్రధానకాల్వ ద్వారా దిగువకు విడుదల చేయించే అవకాశం ఉంటుంది. అలాగే ప్యాకేజీ-1లో దాదాపు రూ.3.30 కోట్లతో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఈ వేసవిలో ప్రధాన నిర్మాణం ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. పనులు చేపట్టని ప్యాకేజీ-2 కాంట్రాక్టును రద్దుచేయాలని జూరాల అధికారుల ఒత్తిడితో ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. దీంతో రద్దయిన కాంట్రాక్టు స్థానంలో మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగించి ఈ వేసవిలో పనులు పూర్తిచేయించాలని జూరాల అధికారులు కర్ణాటక అధికారులతో చర్చిచేందుకు మరో పదిరోజుల్లో అక్కడికి వెళ్తున్నారు. ఈ ఇంజనీర్ల బృందానికి జూరాల ఎస్ఈ ఖగేందర్ నాయకత్వం వహిస్తున్నారు. ఆర్డీఎస్లో కీలకమైన ప్యాకేజీ-2 పనులను పూర్తిచేయించడంతో పాటు ప్యాకేజీ-1 పనులను కూడా సకాలంలో పూర్తిచేసే విధంగా కర్ణాటక అధికారులపై ఒత్తిడి తీసుకురానున్నారు. ఇదే జరిగితే వచ్చే ఖరీఫ్లో ఆర్డీఎస్ ఆయకట్టుకు మెరుగైన రీతిలో సాగునీటిని విడుదల చేయించుకునేందుకు అవకాశం ఉంది. కర్ణాటక అధికారులతో చర్చిస్తాం.. ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులను ఈ వేసవిలో పూర్తిచేసే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నాం. ఈ మేరకు కర్ణాటక అధికారులతో చర్చించేందుకు వచ్చేనెల మొదటివారంలో అక్కడికి వెళ్తున్నాం. ప్యాకేజీ-1లో ఉన్న ఆర్డీఎస్ హెడ్వర్క్స్ ప్రధాన పనులు గత వేసవిలోనే ప్రారంభమైనప్పటికీ, వరి రావడంతో నిలిచిపోయాయి. ఈ వేసవిలో పూర్తి చేయిస్తాం. ప్యాకేజీ-2లో కాంట్రాక్టు రద్దుతోపాటు కొత్త కాంట్రాక్ట్ సంస్థను పిలిచి వేసవిలో పూర్తిచేసేందుకు అక్కడి అధికారులపై ఒత్తిడి తెస్తాం. - ఖగేందర్, జూరాల ఎస్ఈ -
వీడని గ్రహణం
గద్వాల, న్యూస్లైన్: ఆర్డీఎస్ (రాజోలిబండ నీటి మళ్లింపు పథకం)ఆధునికీకరణ పనులకు గ్రహణం వీడటంలేదు. పంటకు నీళ్లం దక కడుపుమండి రైతులు ఆందోళన చేసిన సమయంలో ప రిశీలిస్తామని పలికే ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ తరువాత ఆర్డీఎస్ సమస్యను మరిచిపోవడం పరిపాటిగా మా రింది. పనులు పూర్తిచేయాల్సిన కర్ణాటక ఇన్నాళ్లూ కాల యాపనచేసి నాలుగునెలల క్రితం కాంట్రాక్టును రద్దుచేసిం ది. ఈ మేరకు జూరాల అధికారులకు నెలరోజుల క్రితం స మాచారం పంపించారు. కాగా, రద్దయిన టెండర్లకు కొత్త అంచనాలు రూపొందించి మన ప్రభుత్వ అనుమతికోసం నివేదికలు పంపించాల్సి ఉన్నా ఇప్పటివరకు కదలికలేదు. దీంతో ఈ వేసవిలో ఆర్డీఎస్ ప్యాకేజీ-2 పనులు ప్రారంభమయ్యే సూచనలేవీ కనిపించడం లేదు. ఇలాగే కాలయాపన జరిగితే వచ్చే ఖరీఫ్కు నీరందకపోవడంతో పాటు రబీ సీజన్ను కూడా రైతులు కోల్పోవాల్సి వస్తుంది. కేవలం రెండేళ్లలో పూర్తి కావాల్సిన ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు కర్ణాటక అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ముందుకుసాగడం లేదు. దీంతో ఆరేళ్లుగా రెండోపంట పండించకుండా ఆర్డీఎస్ ఆయకట్టు రైతాంగం నష్టపోతూనేఉంది. ఇంత జరుగుతున్నా ఆర్డీఎస్ సమస్యపై జిల్లా యంత్రాంగం సీరియస్గా స్పందించిన దాఖలాల్లేవు. కేవలం రూ.92కోట్ల వ్యయంతో ఆధునికీకరణ పనులు పూర్తి చేయించాల్సిన ప్రభుత్వం, ఆరేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆయకట్టు రైతాంగానికి ఏటా రెండోపంటకు నీటికష్టాలు తప్పడం లేదు. ఆర్డీఎస్ పనులు 2006లో నిపుణుల కమిటీ ఆర్డీఎస్ను ఆదునికీకరణ చేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ సిఫార్సుల మేరకు ప్రభుత్వం రూ.92 కోట్లను ఆధునికీకరణ కోసం 2007లో మంజూరుచేసింది. ఈ నిధుల్లో రూ.72 కోట్లతో కర్ణాటకలో, రూ.20 కోట్లతో మనరాష్ట్ర పరిధిలోని అలంపూర్ నియోజకవర్గంలో పనులకు ఖర్చుచేసే విధంగా టెండర్లు పిలిచారు. అయితే హెడ్వర్క్స్కు దిగువన ప్యాకేజీ-2లో ప్రధానకాల్వ ఆధునికీకరణ పనులను రూ.24 కోట్ల విలువతో సిరామట్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ తీసుకున్నారు. గత వేసవి మార్చిలో కేవలం పనులను ప్రారంభించి వదిలేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో మనరాష్ట్ర ఉన్నతాధికారులు, జూరాల ఇంజనీర్లు ప్యాకేజీని రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలవాలని కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చారు. పనులు చేయకుండా నిర్లక్ష్యం వహించిన ప్యాకేజీ -2 కాంట్రాక్టును రద్దుచేసేందుకు క ర్ణాటక ప్రభుత్వం ఎట్టకేలకు అనుమతిచ్చింది. ప్యాకేజీల వారీగా పనులు ఆధునికీకరణ పనుల్లో భాగంగా 1వ ప్యాకేజీని ప్రభు కస్ట్రక్షన్స్ కంపెనీ రూ.3.30 కోట్లకు చేపట్టి పనులను గత వేసవిలో ప్రారంభించారు. నదికి వరద రావడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. 2వ ప్యాకేజీ సిరామట్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ స్వామి రూ.24 కోట్లతో చేపట్టి ఇప్పటివరకు కేవలం 30శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. 3వ ప్యాకేజీ కాంట్రాక్టర్ చంద్రశేఖర్రెడ్డి రూ.24 కోట్లతో పనులు చేపట్టగా ఇప్పటివరకు 95 శాతం పూర్తయ్యాయి. 4వ ప్యాకేజీ కాంట్రాక్టర్ జయంత్రావు రూ.19 కోట్ల విలువతో మొత్తం పనులు పూర్తిచేశారు. 5వ ప్యాకేజీ (మన రాష్ట్ర పరిధి)లో కాంట్రాక్టర్ రత్న కన్స్స్ట్రక్షన్ రూ.నాలుగు కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. ఇక 6వ ప్యాకేజీలో కాంట్రాక్టర్ జీఎస్ఆర్ రూ.14 కోట్ల పనులను చేపట్టారు. ఇప్పటికీ 80 శాతం పూర్తికాలేదు. 7వ ప్యాకేజీలో రూ.ఆరుకోట్లతో రత్న కన్స్స్ట్రక్షన్స్ కంపెనీ పనులు చేపట్టి ఇవి కూడా పూర్తికాలేదు. 8వ ప్యాకేజీలో కాంట్రాక్టర్ బీఎస్ఆర్ రూ.12 కోట్లతో పనులు చేపట్టగా 60 శాతం పనులు పూర్తయ్యాయి.