South America
-
పసిఫిక్ మహాసముద్రంలో చీకటి జీవి
భూగోళంపై ఎన్ని రకాల జీవులున్నాయో లెక్కేలేదు. ఎన్నో రకాల జీవులు ఇప్పటికే అంతరించిపోయినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. మరోవైపు కొత్తరకం జీవుల ఉనికి బయటపడుతూనే ఉంది. దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, చిలీ దేశాల సముద్ర తీరంలో ఒక జీవిని గుర్తించారు. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన అటకామా ట్రెంచ్ అట్టడుగున ఈ ప్రాణి నివసిస్తున్నట్లు కనిపెట్టారు. యాంఫీపాడ్ పాడ్ వర్గానికి చెందిన ఈ జీవికి డుల్సిబెల్లా కమాంచక అని పేరుపెట్టారు. కమాంచక అంటే స్థానిక భాషలో చీకటి అని అర్థం. ఈ చీకటి జీవి మాంసాహారి. ఇతర జీవులే దీని ఆహారం. ఇవి ఇక్కడ పెద్దగా కనిపించలేదు కాబట్టి అంతరించేపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. ఇంటిగ్రేటెడ్ డీప్–ఓషియన్ అబ్జర్వింగ్ సిస్టమ్(ఐడీఓఓఎస్)లో భాగంగా గత ఏడాది సముద్రం అడుగు భాగంలో శోధించారు. ఉపరితలం నుంచి 7,902 మీటర్ల లోతులో కొత్త రకం జీవి ఉన్నట్లు బయటపడింది. అంటే దాదాపు 8 కిలోమీటర్ల లోతున ఇది సంచరిస్తుండడం గమనార్హం. వాస్తవానికి అక్కడ అత్యధిక నీటి ఒత్తిడి ఉంటుంది. జలాంతర్గాములు సైతం అంత లోతుకి చేరుకోవడం కష్టం. మానవుడు ఇప్పటికీ చూడని సముద్రాల అడుగు భాగంలో జీవ వైవిధ్యానికి కొదవ లేదు. మనకు తెలియని ఎన్నో ప్రాణులు అక్కడ ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అటకామా ట్రెంచ్ అనేది భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతం. ఇక్కడ సముద్రం లోతు 6,000 మీటర్ల నుంచి 11,000 మీటర్ల దాకా ఉంటుంది. ఎన్నో విశిష్టమైన జీవులకు అటకామా ట్రెంచ్ నెలవుగా మారింది. అరుదైన యాంఫీపాడ్స్, స్నెయిల్ ఫిష్, మడ్ డ్రాగన్స్ ఇక్కడ కనిపిస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Bolivia: నాటకీయ పరిణామాల మధ్య సైనిక తిరుగుబాటు విఫలం!
సూక్రె: బొలీవియాలో బుధవారం నాటకీయ పరిణామాల నడుమ సైనిక తిరుగుబాటు విఫలమైంది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్ధతుగా అక్కడి ప్రజలు ప్రదర్శించిన ఐక్యత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా అధ్యక్ష భవనాన్ని ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోగా.. సాధారణ పౌరులు సైన్యానికి ఎదురు తిరిగారు. దీంతో.. సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు.బుధవారం బొలీవియాలో హైడ్రామా నడిచింది. లా పాజ్లో ఉన్న ప్లాజా మురిల్లో స్క్వేర్ అధ్యక్ష భవనం(ఇదే పార్లమెంట్ భవనం కూడా) వైపు ఆర్మీ వాహనాలు పరేడ్గా వెళ్లాయి. తాజా మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా నేతృత్వంలో ఈ తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. సాయుధులైన సైనికులు భవనం ముందు భారీగా మోహరించగా.. మరికొందరు లోపలికి తలుపులు బద్ధలు కొట్టి మరీ ప్రవేశించారు. ఆ సమయంలో అధ్యక్షుడు లూయిస్ ఆసే కుటుంబం లోపలే ఉంది. ఈలోపు ఈ తిరుగుబాటు ప్రయత్నం గురించి దేశమంతా తెలిసింది. అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్న అంచనాలతో జనాలు నిత్యావసరాలు ఎగబడ్డారు. మరోవైపు భారీగా జనం అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ ఛార్జితో సైన్యం వాళ్లను చెదరగొట్టే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈలోపు.. ఏం జరిగిందో తెలియదుగానీ సాయంత్రంకల్లా సైన్యం అధ్యక్ష భవనం నుంచి వెనుదిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ భవనాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే తిరుగుబాటు కారకుడైన జూనిగాను అరెస్ట్ చేశారు. సాయంత్రం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన వేల మంది పౌరులను ఉద్దేశించి అధ్యక్షుడు లూయిస్ ఆసే అభివాదం చేశారు. బొలీవియా ప్రజలకు కృతజ్ఞతలు.. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సైన్యానికి త్రివిధ దళాధిపతులుగా కొత్త వాళ్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.ఆ సమయంలో ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ.. బొలీవియా జెండా ప్రదర్శిస్తూ జాతీయ గీతం ఆలపించారు ప్రజలు.అయితే.. అరెస్ట్ కంటే ముందు మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా సంచలన ఆరోపణకు దిగారు. ప్రజల్లో తన పరపతిని పెంచుకునేందుకు అధ్యక్షుడు లూయిస్ ఆసే, తనతో కలిసి ఆడించిన డ్రామాగా పేర్కొన్నాడు. అయితే ప్రభుత్వం మాత్రం జుని ఆరోపణలను కొట్టిపారేసింది. మరోవైపు జునిపై ఎలాంటి అభియోగాలు మోపిందనేదానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.కోటి 20 లక్షల జనాభా ఉన్న బొలీవియాలో.. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 2019లో రాజకీయ సంక్షోభం తలెత్తి అప్పటి అధ్యక్షుడు ఎవో మోరేల్స్ అధ్యక్ష పీఠం నుంచి అర్ధాంతంగా దిగిపోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ లూయిస్ ఆసేతో ఎవో మోరేల్స్ పోటీ పడాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్థికంగా దిగజారిన పరిస్థితులు ఎన్నికలలోపే బొలీవియాలో ఆర్థిక సంక్షోభానికి దారి తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
గుహలు అనుకుంటే పొరబడ్డట్టే.. వాటి వెనుక చాలా పెద్ద కథే ఉంది!
ఈ భూమి కొన్ని ప్రదేశాలు అంతుచిక్కని మిస్టరీల్లా ఉంటాయి. అవి ఎవరు ఏర్పాటు చేశారన్నది కూడా కనిపెట్టలేం. కానీ వాటి నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యం ఇంతలా ఉండేదా అనిపిస్తుంది. అలాంటి అంతుచిక్కని మిస్టరీలాంటి సొరంగాలే ఇవి. చూసేందుకు గుహల్లా ఉంటాయి. అయితే ఇందులో ఎవరుండేవారన్నది ఓ మిస్టరీ. కానీ లోపల ఉండే భూగర్భ నగరం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడంటే.. దక్షిణ అమెరికాలో బ్రెజిల్ భూభాగంలో రెండు సొరంగాలును గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇవి చూడటానికి గుహల్లా కనిపించే సొరంగాలు మాదిరిగా ఉన్నాయి. అయితే ఎవరూ వీటిని చేశారనేది తెలియరాలేదు. అయితే ఇవి మానవులకు సంబంధించిన సొరంగాలా లేక జంతువులు వాటి సంరక్షణ కోసం చేసుకునేవా అనేది మిస్టరీగా ఉంది. అయితే దక్షిణ అమెరికాలో పాంపతేరియంకి చెందిన హోల్మెసినా అనే ఒక అంతరించిపోయిన జంతువు తాబేలు మాదిరి షెల్తో పెద్దగా ఉండేదని, అదే ఈ సొరంగాలు చేసి ఉంటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అలా ఈ సొరంగాలు ఏ జాతుల జంతువులకు సంబంధించిన అని పరిశోధను చేయగా..పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ అధ్యయనంలో దక్షిణ బ్రెజిల్,అర్జెంటీనా అంతటా దాదాపు 15 వందలకు పైగా ఇలాంటి సొరంగాలను గుర్తించారు పరిశోధకులు. అలాగే 2009లో ఒక రైతు బ్రెజిల్లోని దక్షిణ ప్రాంతంలో తన మొక్కజొన్న పొలం గుండా వెళ్తున్నప్పుడూ ఇలాంటి సొరంగాన్ని చూసినట్లు తెలిపాడు. తాను ఆ టైంలో ట్రాక్టర్పై అటువైపుగా వెళ్తుండగా ట్రాక్టర్ ఒకవైపుకి ఒరిగిపోయి ఆగిపోయిందని, అప్పుడే వీటిని గుర్తించానని చెప్పుకొచ్చాడు. దీంతో పరిశోధకుల బృందం ఆ దిశగా అధ్యయనం చేయగా, ఆ సొరంగా మొక్కజొన్న పొలం నుంచి రైతు ఇంటి కింద ఉన్న భూగర్భం వరకు ఉండటం చూసి కంగుతిన్నారు. దాదాపు రెండు మీటర్లు ఎత్తు, రెండు మీటర్ల వెడల్పూ, 15 మీటర్ల పొడవాటి పొలం మీదుగా రైతు ఇంటి వరకు సొరంగం ఉన్నట్లు తెలిపారు. అయితే గోడలపై ఉన్న లోతైన పంజాగుర్తులను చూసి నాటి మానవుల గుర్తులే సూచిస్తున్నాయన్నారు. ఇక ఆ పరిశోధకులు బృందలోని ఓ శాస్త్రవేత్త ఇది దాదాపు 10 వేల ఏళ్ల నాటిదని నిర్థారించారు. ఇందులో సుమారు 20 వేల మంది ఉండేవారని అన్నారు. అయితే ఇలా సొరంగం తవ్వే ఇజనీరింగ్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ సొరంగా 280 అడుగు దిగువన ఉంది. బహుశా క్రీస్తూ పూర్వం 1200 ఏళ్ల క్రితం ఫిజియన్లు అనే పూర్వీకులు ఉండే వారని భావిస్తున్నారు. వారు గృహ జీవితం ఇలా ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కొందరూ మాత్రం రోమన సామ్రాజ్యంలో క్రైస్తవ నివాసులు గుహ వ్యవస్థ ఇలా ఉండేదని, ఇవి వారి ప్రార్థన మందిరాలుగా ఉండేవని అన్నారు. కాలక్రమేణ వైన్, ఆలివ్ వంటి వాటిని తయారు చేసే ప్రదేశాలుగా మారినట్లు భావిస్తున్నారు. బహుశా అప్పటి ప్రజలకు ఈ భూగర్భ నగరం భూతల స్వర్గంగా ఉండి ఉండొచ్చు అందువల్లే ఇలా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చన్నారు. అలాగే నాటి ప్రపంచంపై దండయాత్రలు జరిగేవి కాబట్టి నాటి విజేతలు, ఆక్రమణదారులు వీటిని ఉపయోగించి ఉండొచ్చు అని పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. అయితే చివరికి సొరంగాలు ఏంటన్నవీ శాస్తవేత్తలు నిర్థారించలేకపోయారు. దీంతో అవి ఓ అంతు చిక్కని మిస్టరీ సొరంగాలుగా మిగిలిపోయాయి. These tunnels were once believed to hide religious fortunes deep in their chambers, but the real treasure is found in who - or what - created them. In 2009, a farmer was driving through his corn field in the south of Brazil when he suddenly felt his tractor sink and lurch to… pic.twitter.com/leRQyDpkA5 — Fascinating (@fasc1nate) March 18, 2024 (చదవండి: రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్ కారునే ఏకంగా..!) -
దక్షిణ అమెరికాలోనూ యుద్ధ మేఘాలు!
అటు రష్యా–ఉక్రెయిన్. ఇటు ఇజ్రాయెల్–పాలస్తీనా. ఇలా ఇప్పటికే రెండు యుద్ధాలతో దాదాపు రెండేళ్లుగా ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఇవి చాలవన్నట్టు దక్షిణ అమెరికా ఖండంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. బుల్లి దేశమైన గయానా అదీనంలో ఉన్న ఎసెక్విబో ప్రాంతంలోని అపార చమురు నిల్వలపై పొరుగు దేశం వెనెజులా కన్నేసింది. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పూర్తిగా కబళించే దిశగా పావులు కదుపుతోంది. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గయానాకు అమెరికా దన్నుగా నిలుస్తుండటంతో పరిస్థితులు క్రమంగా ముదురు పాకాన పడుతున్నాయి... దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతం రెండు శతాబ్దాలుగా వెనెజులా, గయానా మధ్య వివాదాలకు కారణంగా ఉంటూ వస్తోంది. ఇది తమదంటే తమదని రెండు దేశాలూ వాదిస్తున్నాయి. కాకపోతే దాదాపు గత వందేళ్లుగా ఈ ప్రాంతం గయానా అ«దీనంలోనే ఉంది. దీని విషయమై కొద్ది దశాబ్దాలుగా ఇరు దేశాల నడుమ అడపాదడపా కీచులాటలు సాగుతూనే వస్తున్నాయి. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ప్రకటనతో పదేళ్లపాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్టు 2015లో బయట పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. ఆ నిల్వలపై కన్నేసిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఎసెక్విబో నిజానికి తమదేనన్న వాదనను తిరగదోడారు. దీన్ని ఇంటా బయటా పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ప్రకటించి తాజాగా ఉద్రిక్తతలకు తారస్థాయికి తీసుకెళ్లారు. విలీనంపై వెనెజులాలో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడంతో గయానా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఎలాంటి దుందుడుకు చర్యలూ చేపట్టొద్దన్న కోర్టు ఆదేశించిన రెండు రోజులకే వాటిని బేఖాతరు చేస్తూ మదురో డిసెంబర్ 3న వెనెజులావ్యాప్తంగా రిఫరెండం జరిపారు. ఏకంగా 95 శాతం మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపు తున్న కొత్త మ్యాపులను మదురో విడుదల చేసేశారు! రంగంలోకి అమెరికా గయానాపై వెనెజులా సైనిక చర్యకు దిగవచ్చన్న వార్తలు కొద్ది రోజులుగా జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హుటాహుటిన రంగంలోకి దిగింది. గయానాకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి ఆ దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తూ వెనెజులాకు హెచ్చరికలు పంపుతోంది. దీని వెనక అమెరికా స్వీయ చమురు ప్రయోజనాలు దాగున్నాయి. ఎసెక్వెబోలో చమురు నిల్వలను గుర్తించిన ఎక్సాన్మొబిల్ అమెరికా చమురు దిగ్గజమే. ఒక్క 2022లోనే చమురు వెలికితీత ద్వారా ఆ కంపెనీకి ఏకంగా 600 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది! వాటిని వదులుకోవడం అగ్ర రాజ్యానికి సుతరామూ ఇష్టం లేదు. దట్టమైన అడవులతో కూడిన ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు శరణ్యం. లేదంటే ఇరు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న బ్రెజిల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కూడా వెనెజులాతో తమ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతియుతంగా తేల్చుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మదురోకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న ఆయన సమక్షంలో సమావేశమై వివాదంపై చర్చించుకునేందుకు మదురో, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంగీకరించినట్టు చెబుతున్నారు. శతాబ్దాల వివాదం... వెనెజులా, గయానా మధ్య ఎసెక్విబో వివాదం ఈనాటిది కాదు. వెనెజులా అప్పట్లో స్పెయిన్ వలస రాజ్యంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతం వెనెజులా అ«దీనంలోనే ఉండేది. 1899 దాకా అలాగే కొనసాగింది. 1899లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గయానాకు దఖలు పడింది. కానీ అది మోసపూరిత ఒప్పందని వెనెజులా ఆరోపిస్తూ వస్తోంది. తమ ప్రాతినిధ్యం లేకుండా తమ తరఫున అమెరికా, బ్రిటన్ దీనికి తలూపాయని చెబుతోంది. రాజకీయ ఎత్తుగడే! నిజంగా గయానాపై దండెత్తడం మదురో ఉద్దేశం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. 2013 నుంచీ అధికారంలో ఉన్న మదురోపై వెనెజులాలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఆయన పదేళ్ల పై చిలుకు పాలనలో దేశం పేదరికం కోరల్లో చిక్కిందన్న అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో యుద్ధం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించి, అధ్యక్ష ఎన్నికలను వీలైనంత కాలం వాయిదా వేసేందుకే ఆయన ఈ ఎత్తు వేశారని చెబుతున్నారు. సహజ వనరుల గని ► ఎసెక్విబో ప్రాంతం అపార సహజ వనరులకు ఆలవాలం ► దీని విస్తీర్ణం దాదాపు 1.59 లక్షల చదరపు కిలోమీటర్లు ► గయానా మొత్తం భూభాగంలో మూడింట రెండొంతులు ఈ ప్రాంతమే విస్తరించి ఉంది ► కానీ గయానా మొత్తం జనాభా దాదాపు 8 లక్షలైతే అందులో ఎసెక్విబోలో ఉన్నది 1.2 లక్షల మందే ► ఈ ప్రాంతం నిండా దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలే విస్తరించి ఉన్నాయి ► భారీ పరిమాణంలో బంగారం, రాగి తదితర ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
42 ఏళ్లకు అమ్మను చూశాడు!
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం చిలీలో నెలలు నిండకుండానే జన్మించిన ఓ శిశువు అపహరణకు గురయ్యాడు. కిడ్నాపర్లు ఆ శిశువును అమెరికాకు చెందిన దంపతులకు దత్తతకిచ్చేశారు. ఇది జరిగి 42 ఏళ్లయింది. ప్రస్తుతం అతడి పేరు జిమ్మీ లిపర్ట్ థైడెన్. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఆష్బర్న్లో ఉంటూ లాయర్గా పనిచేస్తున్నాడు. కాగా, 1970, 80ల్లో నియంత ఫినోచెట్ హయాంలో చిలీలో వందలాదిగా శిశువులు అపహరణకు గురయ్యారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో వారిలో కొందరు తిరిగి కన్నవారి చెంతకు చేరుతున్నారనే వార్తను మొన్న ఏప్రిల్లో థైడెన్ చూశాడు. ఆ సంస్థను సంప్రదించి తన డీఎన్ఏ వివరాల సాయంతో కన్న తల్లి జాడ కనుక్కున్నాడు. తోబుట్టువులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంకేముంది? భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని చిలీలోని వల్దీవియాలో ఉండే తల్లి మరియా అంజెలికా గొంజాలెజ్ వద్దకు వెళ్లాడు. ‘హాస్పిటల్ సిబ్బంది నెలలు నిండని నా కొడుకు చనిపోయాడని చెప్పగా విని, గుండెలవిసేలా రోదించాను. నా చిన్నారి ఎక్కడున్నా సుఖంగా ఉండాలని దేవుణ్ని కోరుకున్నా. నా ప్రార్థన ఫలించింది’అంటూ ఆమె కొడుకును హత్తుకుంది. తల్లి, కొడుకు కలుసుకున్న వేళ ఆ ఊరంతా పండగ చేసుకుంది. -
అమెజాన్ అడవుల్లో అద్భుతం
బొగొటా: దక్షిణ అమెరికాలోని కొలంబియాలో దట్టమైన అమెజాన్ అడవుల్లో ఒక అద్భుతం జరిగింది. విమాన ప్రమాదంలో చిక్కుకొని అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ఏకంగా 40 రోజుల తర్వాత మృత్యుంజయులుగా బయటపడ్డారు. విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడమే ఒక అద్భుతమైతే, క్రూరమృగాలు తిరిగే అడవుల్లో 40 రోజులు ప్రాణాలతో ఉండడం మరో అద్భుతం. దట్టమైన అటవీ ప్రాంతంలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సైనికులు వారిని క్షేమంగా వెనక్కి తీసుకువచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పౌష్టికాహార లోపంతో బాగా బలహీనపడిపోవడంతో పాటుగా ఆ చిన్నారుల శరీరంపై పురుగు పుట్రా చేసిన కాట్లు ఉన్నాయి. ఒకే తల్లి బిడ్డలైన నలుగురు చిన్నారుల్లో 13, 9. 4 ఏళ్లతో పాటుగా ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు. చరిత్రలో నిలిచిపోతారు : అధ్యక్షుడు పెట్రో అడవుల్లో కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు క్షేమంగా వెనక్కి తిరిగి రావడంతో దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో మృత్యుంజయులు అన్న మాటకి వీరంతా ఉదాహరణగా నిలుస్తున్నారని అన్నారు. వీరు ప్రాణాలతో ఉండడం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇదొక మేజికల్ డే అని సైనికులు చేసిన కృషిని అభినందించారు. అసలేం జరిగింది? అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలో అరారాక్యూరా నుంచి శాన్జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి గత నెల మే 1న ఒక సింగిల్ ఇంజిన్ విమానం బయల్దేరింది. నలుగురు చిన్నారులు, వారి తల్లి, ఒక గైడ్, ఒక పైలెట్తో విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తి ఇంజిన్ విఫలం కావడంతో దట్టమైన కీకారణ్యంలో కుప్పకూలిపోయింది. విమానం రాడార్ నుంచి అదృశ్యం కావడంతో అధికారులు వారిని కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఆపరేషన్ హోప్ పేరుతో సహాయ చర్యలు మొదలు పెట్టారు. విమాన ప్రమాదం జరిగిన రెండు వారాల అనంతరం మే 16న అధికారులు విమాన శకలాలను గుర్తించగలిగారు. అక్కడ పైలెట్, గైడ్, చిన్నారుల తల్లి మృతదేహాలు మాత్రమే లభించడంతో పిల్లలు నలుగురు సజీవంగా ఉన్నారని నిర్ణారణకి వచ్చారు. పిల్లలు క్షేమంగానే ఉన్నారనడానికి సైనికుల గాలింపుల్లో పాలసీసా, సగం తిని పారేసిన పండు, జడకు కట్టుకునే రిబ్బన్ వంటివి దొరకడంతో సహాయ చర్యలు మరింత ముమ్మరం చేశారు. పిల్లల అడుగు జాడలు కూడా చాలా చోట్ల కనిపించాయి. వాటి ఆధారంగా దాదాపుగా 150 మంది సైనికులతో పాటుగా జాగిలాల సాయంతో దట్టమైన అడవుల్లో గాలించారు. అడవుల్లో ఉండే గిరిజన తెగలు వారికి సహకారం అందించారు. మొత్తానికి ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత అధికారులు ఆ పిల్లల జాడ కనిపెట్టగలిగారు. హెలికాప్టర్లో రాజధాని బొగొటాలో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎలా మనుగడ సాగించారు? అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇన్నాళ్లూ పులులు, పాములు ఇతర క్రూరమృగాల మధ్య ఎలా మనుగడ సాగించారో వివరాలు తెలియాల్సి ఉంది.ఆ పిల్లలు హ్యూటోటో అనే స్థానిక తెగకు చెందినవారు. పుట్టినప్పట్నుంచి అటవీ ప్రాంతాల్లోనే వారు నివాసం ఉంటున్నారు. అడవుల్లో చెట్లకు కాసే ఏ పళ్లు తినాలో , క్రూర మృగాల బారిన పడకుండా ఎలా తమని తాము కాపాడుకోవాలో కొంతవరకు వారికి అవగాహన ఉంది. అందుకే కీకారణ్యంలో తప్పిపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సహాయ కార్యక్రమాల్లో భాగంగా హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహార పొట్లాలు బహుశా పిల్లలను కాపాడి ఉంటాయని సైనికాధికారులు భావిస్తున్నారు. పిల్లలు క్షేమంగా తిరిగిరావడంతో వారి బామ్మ ఫాతిమా వాలెన్సియా ఆనందానికి హద్దులే లేవు. పిల్లల తల్లి పనిలో ఉన్నప్పుడు పెద్దమ్మాయి మిగిలిన చిన్నారుల ఆలనాపాలనా చూసేదని, అదే ఇప్పుడు అడవుల్లో వాళ్లు ఇన్నాళ్లూ గడపడానికి ఉపయోగపడిందని చెప్పారు. -
ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!
ఏ దేశంలోని రోడ్లయినా వివిధ ప్రాంతాలను కలుపుతాయనే విషయం మనకు తెలిసిందే. వివిధ రోడ్లపై ప్రయాణించడం ద్వారా మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే కొన్ని రోడ్లు చిన్నవిగా, మరికొన్ని రోడ్లు పెద్దవిగా ఉండటాన్ని మనం గమనించేవుంటాం. మనదేశంలోని అతిపెద్ద రోడ్డు విషయానికివస్తే అది నేషనల్ హైవే-44. ఇది 3,745 కిలోమీటర్ల దూరం కలిగివుంది. ఇది కన్యాకుమారితో మొదలై శ్రీనర్ వరకూ ఉంటుంది. అయితే ప్రపంచంలో దీనికి మించిన అతిపెద్ద హైవే ఉందని, దానిపై ప్రయాణిస్తే ఏకంగా 14 దేశాలు చుట్టేయచ్చనే సంగతి మీకు తెలుసా? ఉత్తర అమెరికా- దక్షిణ అమెరికాలను కలిపే పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి. అలస్కాలో మొదలై అర్జెంటీనా వరకూ ఈ రహదారి కొనసాగుతుంది. రెండు మహా ద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది. ఈ హైవేను మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ రహదారిలోని 110 కిలోమీటర్ల ఒక భాగం నిర్మాణం ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు. ఇది పనామా కొలంబియాల మధ్య ఉంది. కాగా ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం కిడ్నాప్లు, డ్రగ్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ తదితర అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారింది. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా ప్లెయిన్ మాధ్యమంలో బైపాస్ చేస్తారు. చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్కు సైకిల్పై ఆ 14 దేశాలు ఇవే.. 1. యునైటెడ్ స్టేట్స్ 2.కెనడా 3. మెక్సికో 4. గ్వాటెమాల 5. ఎల్ సల్వడార్ 6.హోండురాస్ 7. నికరాగ్వా 8. కోస్టా రికా 9.పనామా 10.కొలంబియా 11. ఈక్వెడార్ 12. పెరూ 13.చిలీ 14. అర్జెంటీనా ప్రయాణానికి ఎంత సమయం పడుతుందంటే... ఎవరైనా ప్రతీరోజూ సుమారు 500 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలిగితే వారు 60 రోజుల్లో ఈ రహదారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. కార్లెస్ సాంటామారియా అనే సైకిలిస్టు ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టివచ్చాడు. ఈ నేపధ్యంలో అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. ఈ రహదారి మొత్తం పొడవు 48 వేల కిలోమీటర్లు. The Pan-American highway is the longest highway in the world. This road is about 19.000 miles/30.000km long #nowyouknow #FridayThoughts pic.twitter.com/oRdBTMhFRD — 🇺🇦Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) November 6, 2020 -
బంగారు గనిలో ప్రమాదం.. 27 మంది మృతి
లిమా: దక్షిణ అమెరికా దేశం పెరూలోని ఓ బంగారు గనిలో సంభవించిన అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. ఇద్దరిని మాత్రమే రక్షించగలిగామని అధికారులు తెలిపారు. అరెక్విపా ప్రాంతంలోని ఎస్పెరాంజా గనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఈ ఘటన చోటుచేసుకుంది. గనిలో సుమారు 100 మీటర్ల లోతులో సిబ్బంది పనిచేస్తున్న చోట మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు పెరూలో ఉన్నాయి. ఏటా వీటి నుంచి 100 టన్నుల బంగారాన్ని వెలికితీస్తుంటుంది. ప్రపంచంలోని బంగారం ఉత్పత్తిలో ఇది 4%. -
Lionel Messi: 'వొడువని ముచ్చట'.. అరుదైన గౌరవం
మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్కప్ సాధించి ఇప్పటికి మూడు నెలలు కావొస్తుంది. కానీ ఇంకా అది ఒడవని ముచ్చటలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే మూడు నెలలైనా ఇంకా మెస్సీ నామస్మరణ మారుమోగుతూనే ఉంది. వరల్డ్కప్ సాధించినప్పటి నుంచి మెస్సీకి ఏదో ఒక చోట గౌరవ సత్కారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సౌత్ అమెరికన్ ఫుట్బాల్ గవర్నింగ్ కౌన్సిల్ మెస్సీకి అరుదైన గౌరవంతో సత్కరించింది. సౌత్ అమెరికన్ ఫుట్బాల్ హెడ్క్వార్టర్స్ అయిన కాన్మిబోల్లోని మ్యూజియంలో అతని మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్కప్ను అందించినందుకు గానూ ఈ గౌరవం ఇచ్చినట్లు గవర్నింగ్ కౌన్సిల్ పేర్కొంది. కాగా ఫుట్బాల్లో దిగ్గజాలుగా పేరు పొందిన డీగో మారడోనా, పీలే తర్వాత కాన్మిబోల్ మ్యూజియంలో ఈ గౌరవం అందుకున్న మూడో ఆటగాడిగా మెస్సీ రికార్డుకెక్కాడు. ఇక గతేడాది డిసెంబర్లో ఫ్రాన్స్పై పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించిన అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నీ ఆద్యంతం అంతా తానై నడిపించిన మెస్సీ ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇటీవలే బ్యూనస్ ఎయిర్స్లో పనామాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో అర్జెంటీనా జట్టు 2-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మెస్సీ ఒక గోల్ చేశాడు. ఇది మెస్సీకి 800వ గోల్ కావడం విశేషం. ఇక అర్జెంటీనా తరపున 99వ గోల్స్ సాధించిన మెస్సీ వందో గోల్కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. Statue for the best player in history. #Messi 🐐🇦🇷pic.twitter.com/BrW2XqShh8 — Leo #Messi 🐐 (@LeoCuccittini_) March 27, 2023 చదవండి: దుమ్మురేపిన రొనాల్డో.. పోర్చుగల్ ఖాతాలో రెండో విజయం -
ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి
దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పనామాలో అమెరికాకు వలస వెళ్లే వారిని తీసుకెళ్తున్న బస్సు.. మరో మినీ బస్సును ఢీకొట్టింది. చిరికీలోని గ్వాలకాలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృత్యువాతపడినట్లు పనామా జాతీయ వలసదారుల డైరెక్టర్ సమీరా గోజైన్ బుధవారం తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, అతని సహాయకుడితోసహా మొత్తం 66 మంది ఉన్నారు. రాజధాని పనామా నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చిరీకి ప్రావిన్స్ రాజధాని నగరం డేవిడ్లోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోంది. క్షతగాత్రుల సంఖ్యను, మృతుల వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. తొలుత 15 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మృతుల సంఖ్య 39కు పెరిగింది. కొలంబియా సరిహద్దులోని అడవి ప్రాంతం అయిన డేరియన్ నుంచి వలసదారులతో బస్సు బయల్దేరింది. వీరంతా పనామా, కోస్టా రికా, సెంట్రల్ అమెరికా, మెక్సికో గుండా చివరికి యునైటెడ్ స్టేట్స్కు ప్రయాణిస్తున్నారు. -
కూతుళ్ల కోసం ‘తల్లి’గా మారాడు!
క్విటో(ఈక్వెడార్): కన్న కూతుళ్లంటే ఆ తండ్రి ఎంతో ఇష్టం. విడిపోయిన భార్య వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్ల కస్టడీ తనకే ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే, తల్లి వద్దే కూతుళ్లు ఉండాలంటుంది చట్టం. అందుకే, కూతుళ్లకు తల్లి ప్రేమను పంచేందుకు దుస్సాహసమే చేశాడు ఆ తండ్రి. ఏకంగా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇప్పుడైనా చట్టం కూతుళ్లను తన వద్దకే పంపిస్తుందని ఆశపడుతున్నాడు..! ఈ ఘటన దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్లో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రెనె సలినాస్ రమోస్(47), అతని భార్య విడిపోయారు. చట్టం ప్రకారం వీరి సంతానం తల్లి సంరక్షణలోనే ఉండాలి. మహిళ మాత్రమే బిడ్డలకు ప్రేమను అందిస్తుందని చట్టం అంటోంది. భార్య ఐదు నెలలుగా కూతుళ్లను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తోందని అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన కూతుళ్లు దూరం కావడం తట్టుకోలేని రమోస్ మరో మార్గం ఆలోచించాడు. ఏకంగా లింగమార్పిడి చేయించుకుని, మహిళగా మారాడు. అధికార రికార్డుల్లో మహిళగానే ఉన్నా, నిత్య జీవితంలో పురుషుడిగానే చెలామణి అవుతున్నాడు. మహిళగా మారినందున, కోర్టు కేసు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తల్లి వద్ద ఇబ్బందులు పడుతున్న తన బిడ్డలకు తల్లిగా మారుతానంటున్నాడు. ఈక్వెడార్ ఎల్జీబీటీఐ హక్కుల సంస్థలు మాత్రం రమోస్ చర్యపై మండిపడుతున్నాయి. -
Monkeypox: బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం
బ్రెసిలియ: మంకీపాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి వారం గడవక ముందే మరిన్ని దేశాలకు వైరస్ విస్తరించింది. తాజాగా ప్రపంచంలో బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం రికార్డు అయ్యింది. మంకీపాక్స్ మొదటగా వెలుగు చూసింది ఆఫ్రికాలోనే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆఫ్రికా దేశాల్లోనే అత్యధిక మంకీపాక్స్ కేసులు, మరణాలు సంభవించాయి. అయితే తొలిసారిగా ఓ బయటిదేశంలో మంకీపాక్స్ మరణం నమోదు కావడం విశేషం. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్లో 41 ఏళ్ల వ్యక్తి Monkeypoxతో మరణించాడని అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. 👉🏽 బ్రెజిల్ రాష్ట్రం మినాస్ గెరాయిస్ రాజధాని బెలో హోరిజోంటేలో సదరు వ్యక్తి మంకీపాక్స్తో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అయితే అతనిలో రోగనిరోధక వ్యవస్థ(ఇమ్యూనిటీ) అత్యంత బలహీనంగా ఉందని, రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. 👉🏽 ఇదిలా ఉంటే.. జూన్ 10వ తేదీన యూరప్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ నిర్ధారణ కావడంతో బ్రెజిల్లో తొలి కేసు నమోదు అయ్యింది. ఇప్పటిదాకా వెయ్యి దాకా మంకీపాక్స్ కేసులు బ్రెజిల్లో నమోదు అయ్యాయి. సావో పాలో, రియో డీ జనెరియోలోనే ఎక్కువ కేసులు వెలుగు చూశాయి. 👉🏽జ్వరం, హై ఫీవర్, వాపు లక్షణాలు, చికెన్పాక్స్ తరహా ఒంటిపై దద్దర్లు తదితర లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 👉🏽డబ్ల్యూహెచ్వో ప్రకారం.. మంకీపాక్స్ ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమైన వైరస్. కానీ, ఈ మధ్య బయటి దేశాల్లోనూ విజృంభిస్తోంది. ఇప్పటిదాకా 78 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. 70 శాతం యూరప్ దేశాల్లో, 25 శాతం అమెరికాలో బయటపడ్డాయి. 👉🏽 మంకీపాక్స్ ఎవరికైనా సోకవచ్చు. గట్టిగా తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా మంకీపాక్స్ ఒకరి నుంచి ఒకరిని వ్యాపిస్తోంది. చికిత్సతో వైరస్ నుంచి బయటపడొచ్చు. 👉🏽 అయితే ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లో ఎక్కువ శాతం కేసులు లైంగిక ధోరణి వల్లే నమోదు అయ్యాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన WHO.. సెక్స్ పార్ట్నర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు సైతం జారీ చేసింది. చదవండి: మంకీపాక్స్తో సీరియస్ అయితే ఈ టీకా వాడొచ్చు! -
కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్
బొగొటా: దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. దేశ కొత్త అధ్యక్షుడిగా వామపక్ష మాజీ తిరుగుబాటు నేత గుస్తావో పెట్రో ఆగస్ట్ 7న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆఫ్రో–కొలంబియన్ అయిన ఫ్రాన్సియా మార్కెజ్(40) చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలను ముందుండి నడిపారు. నల్లజాతి కొలంబియన్ల తరఫున పోరాడారు. సుదీర్ఘకాలం కొనసాగిన సాయుధ పోరాటం కారణంగా సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తామని మార్కెజ్ మీడియాతో అన్నారు. లా టొమా అనే మారుమూల గ్రామంలోని పేద కుటుంబంలో జన్మించిన మార్కెజ్ 16 ఏళ్ల వయస్సులోనే తల్లి అయ్యారు . తన కూతురు కోసం ఎంతో కష్టపడ్డారు. ఒకవైపు రెస్టారెంట్లో పనిచేసుకుంటూనే లా డిగ్రీ పూర్తి చేశారు. చుట్టు పక్కల గ్రామాల్లోని అఫ్రో–కొలంబియన్లకు చెందిన భూముల్లో అక్రమ బంగారు గనుల తవ్వకాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. ఆమె కృషికి గాను 2018లో గోల్డ్మ్యాన్ ఎన్విరాన్మెంటల్ బహుమతి అందుకున్నారు. డెమోక్రటిక్ పోల్ పార్టీలో గత ఏడాది జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి గుస్తావో పెట్రో చేతిలో ఓడిపోయారు. కానీ, పార్టీలోని మిగతా సీనియర్ నేతల కంటే ఎక్కువ ఓట్లు ఆమెకే పడ్డాయి. సాయుధ వామపక్ష తిరుగుబాటు నేత అయిన పెట్రోకు ప్రజల్లో అంతగా పలుకుబడి లేదు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పేదలు, యువత, పట్టణ ప్రాంత మహిళలు మార్కెజ్ వైపు మొగ్గు చూపారు. ఆఫ్రో–కొలంబియన్ల ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు పెట్రోకు పడ్డాయి. మార్కెజ్ జనాదరణ కూడా విజయానికి బాటలు వేసిందని స్పష్టం చేస్తున్నారు. -
ముప్పు ముంగిట అమెజాన్.. కథ మారకపోతే కష్టాలకు తలుపులు బార్లా తెరిచినట్టే!
ఒకపక్క వాతావరణ మార్పులు, మరోపక్క అడవుల నరికివేతతో ప్రఖ్యాత అమెజాన్ వర్షారణ్యం (రెయిన్ ఫారెస్ట్) ఎండిపోతోంది. మానవ తప్పిదాల కారణంగా అమెజాన్ అడవులు రికవరీ అయ్యే ఛాన్సులు క్షీణిస్తున్నాయని, దీంతో ఇవి క్రమంగా అడవుల స్థాయి నుంచి సవన్నా (గడ్డి మైదానాలు)లుగా మారిపోతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇదే నిజమైతే కేవలం అమెజాన్ విస్తరించిన ప్రాంతమే కాకుండా ప్రపంచమంతటిపై పెను ప్రభావం పడుతుందని తెలిపింది. అమెజాన్ బేసిన్లోని వర్షారణ్యం ప్రపంచ వర్షారణ్యాల్లో సగానికిపైగా ఉంటుంది. ప్రపంచ కార్బన్డైఆక్సైడ్ (co2) స్థాయి నియంత్రణలో అమెజాన్ వర్షారణ్యానిది కీలకపాత్ర. అయితే ఈ అడవులు క్షీణించి సవన్నాలుగా మారితే co2 నియంత్రణ బదులు co2 వేగంగా పెరిగేందుకు కారణమవుతాయని పర్యావరణ నిపుణులు వివరించారు. గతంలో ఊహించినదాని కన్నా వేగంగా ఈ అడవులు అంతర్ధానం అంచుకు చేరుతున్నాయన్నారు. 25 సంవత్సరాల శాటిలైట్ డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ అడవి వేగంగా క్షీణిస్తోందని నేచర్ క్లైమెట్ ఛేంజ్లో పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా చెట్ల నరికివేత, కరువు సంభవించిన ప్రాంతాల్లో తిరిగి అడవి కోలుకోవడం దాదాపు సగానికిపైగా తగ్గిందని అధ్యయన సహ రచయత టిమ్ లెంటాన్ చెప్పారు. మానవ తప్పిదాలకు తోడు పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు అమెజాన్ అడవుల రికవరీ సామర్థ్యం పూర్తిగా నశించిపోయేందుకు కారణమవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా కార్బన్ కాలుష్యాన్ని తగ్గించకపోతే శతాబ్ది మధ్యకు వచ్చేసరికి ఈ అడవులు పూర్తిగా కనుమరుగవుతాయని అంచనా వేశారు. ప్రపంచానికే డేంజర్ ఇప్పటికే ధ్రువాల వద్ద మంచు కరగడం, వాతావరణంలో co2 స్థాయిలు పెరగడం, దక్షిణాసియాలో అనూహ్య రుతుపవనాలు, క్షీణిస్తున్న కోరల్ రీఫ్ పర్యావరణ వ్యవస్థలు, అట్లాంటిక్ సముద్ర ప్రవాహాల్లో మార్పులతో ప్రపంచమంతా ప్రమాదం అంచుల్లోకి పయనిస్తోంది. వీటికి అమెజాన్ అడవుల క్షీణత తోడైతే కార్చిచ్చుకు వాయువు తోడైనట్లు ప్రమాదకర పర్యావరణ మార్పులు సంభవిస్తాయని నిపుణుల అంచనా. అమెజాన్ అడవులు అధిక శాతం విస్తరించిన బ్రెజిల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడవుల నరికివేత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఒకప్పుడు co2 సింక్ (కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకునే)గా ఉన్న అమెజాన్ ఫారెస్టు ప్రస్తుతం co2 సోర్స్ (ఉత్పత్తి కారకం)గా మారిందని సైంటిస్టులు హెచ్చరించారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అమెజాన్ అడవులు వదిలే కార్బన్డైఆక్సైడ్ పరిమాణం 20 శాతం మేర పెరిగిందన్నారు. వాతావరణంలో co2 పెరగడం ఉష్ణోగ్రతలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ వాయువును పీల్చుకోవడంలో చెట్లు, మృత్తిక కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైతే చెట్ల నరికివేత ఊపందుకొని, మృత్తికలు సారహీనం కావడం జరుగుతుందో co2 నియంత్రణ అదుపుతప్పుతుంది. అమెజాన్ అడవులు దాదాపు 9000 కోట్ల టన్నుల co2ను నియంత్రిస్తుంటాయి. ఈ అడవుల క్షీణతతో ఇంత స్థాయిలో co2 వాతావరణంలోకి విడులయ్యే అవకాశాలు పెరుగుతాయి. అప్పుడు దక్షిణఅమెరికాతో పాటు ప్రపంచమంతా ఫలితం అనుభవించాల్సిఉంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఇంకా ఉందని అధ్యయన రచయతలు తెలిపారు. ప్రపంచ ఉష్ణోగ్రతలను నియంత్రించగలిగితే ఆటోమేటిగ్గా అరణ్య రికవరీ సామర్ధ్యం పెరుగుతుందన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం, చెట్ల నరికివేతను నియంత్రించడం, పంటమార్పిడి ద్వారా మృత్తిక సారహీనం కాకుండా కాపాడడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకతలు.. ► 9 దేశాల్లో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల పైచిలుకు విస్తీర్ణంలో అమెజాన్ వర్షారణ్యం వ్యాపించి ఉంది. ► అమెజాన్ పరీవాహక ప్రాంతంలో 75 శాతాన్ని ఈ అడవులు ఆక్రమించాయి. ► కలప, బయో ఇంధనం, పోడు వ్యవసాయం కోసం 1970 నుంచి ఈ అరణ్యంలో 20 శాతాన్ని మనిషి కబళించాడు. ► ఈ అడవుల్లో దాదాపు 3,344 ఆదిమ జాతుల ప్రజలు నివాసముంటున్నారు. ► వీటిపై ఆధారపడి సుమారు 3 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. ► ప్రపంచంలోని జీవ ప్రజాతుల్లో పదింట ఒకటి ఈ వర్షారణ్యాల్లో కనిపిస్తుంది. ► ప్రపంచంలోనే అత్యధిక వృక్ష, జీవ ప్రజాతులకు ఈ అడవులు ఆవాసం. ► ఇందులో సుమారు 16 వేల ప్రజాతులకు చెందిన దాదాపు 39,000 కోట్ల చెట్లున్నట్లు అంచనా. ► ఈ అడవుల్లో 25 లక్షల రకాల కీటకాలు, 2, 200 రకాల చేపలు, 1,294 రకాల పక్షులు, 427 రకాల క్షీరదాలు, 378 రకాల సరీసృపాలు నివసిస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
బంగారంలో బప్పీ లహరిని మించిపోయాడు.. శరీరంపై 2 కిలోలు, కారు, బైక్ అన్నీ..
బప్పీలహిరి.. సంగీతమే కాదు.. ఆయన ఆహార్యమూ స్పెషలే.. ముఖ్యంగా బంగారం. అది తనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నది ఆయన నమ్మకం.. ఈ చిత్రంలోని వియత్నాంవాసి ట్రాన్డక్లాయ్ అయితే.. దాన్ని మరింత ఎక్కువ నమ్ముతాడు.. అందుకే ఎప్పుడూ తన శరీరం మీద రెండు కిలోలకు తక్కువ కాకుండా ఇలా గోల్డ్ ఉంచుకుంటాడు. అదొక్కటేనా.. తన కారు, బైక్ అన్నీ గోల్డ్ ప్లేటింగ్ చేయించేశాడు.. దాని వల్ల లోకల్గా పాపులర్ కూడా అయ్యాడు. ఇంత బంగారం ఉంది.. ఏం చేస్తాడు అనేదేగా మీ డౌట్.. వియత్నాంలో దక్షిణ అమెరికా బల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.. వాటిని తెచ్చి.. అమ్మడమే మనోడి పని. చదవండి: "భార్యలను కొట్టండి" భర్తలకు సలహలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి! -
లోయలో పడిన బస్సు.. 24 మంది మృతి
లాపాజ్(బొలివియా): దక్షిణ అమెరికాలోని బొలివియాలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో 24 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు దాదాపు 100 మీటర్ల లోతు ఉన్న లోయలో పడడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
డెలివరీ బాయ్గా మారిన అంతర్జాతీయ క్రికెటర్
ఒలింపిక్ చాంపియన్... ఈ ఒక్క మాట చాలు ఆటగాళ్ల రాతను మార్చేందుకు... మనలాంటి దేశంలో అయితే ఒలింపిక్ స్వర్ణం సాధించిన ఆటగాడు మిగతా జీవితం గురించి ఆలోచించాల్సిన, బెంగ పడాల్సిన పనే ఉండదు. కోట్ల రూపాయలు, కానుకలతో కనకాభిషేకం కురుస్తుంది. కానీ అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒలింపిక్ విజయం సాధించినా సరే... అవసరమైనప్పుడు బతుకుతెరువు కోసం ఎలాంటి చిన్న పనికైనా సిద్ధం కావాల్సిందే. అదీ వెనిజులా లాంటి దేశం నుంచి వచ్చిన ఆటగాడి పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరం. లాడ్జ్ (పోలాండ్): దక్షిణ అమెరికా దేశం వెనిజులా... ఆ దేశం తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించారు. 1968లో బాక్సర్ ఫ్రాన్సిస్కో రోడ్రిగ్స్ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్లో ఫెన్సింగ్ క్రీడాంశంలో రూబెన్ లిమార్డో గాస్కన్ బంగారు పతకం సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా లిమార్డోకు పెద్దగా ఏమీ కలిసి రాలేదు. కానీ లోటు లేకుండా మాత్రం జరిగిపోయింది. 2016 రియో ఒలింపిక్స్లో విఫలమైనా... ఇప్పుడు మళ్లీ టోక్యో ఒలింపిక్స్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్గా రూబెన్ లిమార్డో; ‘లండన్’ స్వర్ణంతో... రెండు ప్రపంచ చాంపియన్షిప్ రజతాలు కూడా గెలుచుకున్న 35 ఏళ్ల లిమార్డో... ఇందుకోసం యూరోపియన్ దేశం పోలాండ్లో శిక్షణ పొందుతున్నాడు. ఇంత కాలం ఒక ఆటగాడిగా స్పాన్సర్షిప్ నుంచే వచ్చే డబ్బులతో అంతా సవ్యంగానే సాగింది. అయితే కరోనా ఒక్కసారిగా అన్నీ మార్చేసింది. టోక్యో క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో పాటు స్పాన్సర్లు కూడా వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము అండగా నిలవలేమంటూ చేతులెత్తేశారు. ఒకవైపు శిక్షణ, మరోవైపు భార్య, ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఉంది. ఒక క్రీడాకారుడిగా ఇన్నేళ్లు గడిపిన తనకు మరో పని తెలీదు. దాంతో కుటుంబ పోషణ కోసం లిమార్డో ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. ఉదయమే ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం తన సైకిల్పై ఫుడ్ ఆర్డర్లు అందించేందుకు బయల్దేరడం, సాయంత్రం వచ్చి మళ్లీ సాధన కొనసాగించడం అతని దినచర్య. అయితే డెలివరీ బాయ్గా పని చేయడం పట్ల తాను బాధ పడడం లేదని, కోవిడ్–19 కాలంలో కనీసం బతికేందుకు ఒక ఆధారం దొరికినందుకు సంతోషిస్తున్నానని చెప్పినప్పుడు లిమార్డోలో ఒక ఒలింపిక్ చాంపియన్ కాకుండా ఎలాగైనా పోరాటం సాగించాలనుకునే ఒక సామాన్యుడు కనిపించాడు. మరో ఒలింపిక్ పతకం తన కల అని, దానిని నెరవేర్చుకునేందుకు ఎంతౖకైనా కష్టపడతానని అతను చెబుతున్నాడు. అతని స్వదేశం వెనిజులా నుంచి అయితే అసలు ఆశించడానికి ఏమీ లేదు. తీవ్ర రాజకీయ సంక్షోభం కారణంగా ఆ దేశం ప్రస్తుతం కనీస ఆహారం, మందులు కూడా లేకుండా భయంకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అక్కడ 1 యూఎస్ డాలర్ విలువ సుమారు 10 వేల వెనిజులన్ బొలీవర్స్కు పడిపోవడం దాని తీవ్రతను చూపిస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్ కూడా... నెదర్లాండ్స్కు చెందిన 28 ఏళ్ల పాల్ ఆడ్రియాన్ వాన్ మీకెరన్ది కూడా ఇదే తరహా బాధ. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడైన ఈ ఫాస్ట్ బౌలర్ జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు, 41 టి20 మ్యాచ్లు ఆడాడు. 2020 టి20 వరల్డ్ కప్కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టులో అతను కూడా సభ్యుడు. అయితే ఇప్పుడు టి20 ప్రపంచకప్ వాయిదా పడటం అతడికి సమస్య తెచ్చిపెట్టింది. సాధారణంగా నెదర్లాండ్స్ క్రికెటర్లు వేసవిలో మాత్రమే క్రికెట్ బరిలోకి దిగి ఆటకు అనువుగా ఉండని శీతాకాలంలో ఇతర ఉద్యోగాలు చేసుకుంటారు. అక్టోబర్–నవంబర్లో ఆస్ట్రేలియా గడ్డపై ప్రపంచ కప్ జరిగి ఉంటే వారికి డబ్బు వచ్చి ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో వాన్ మీకెరన్ కూడా ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్గా పని మొదలు పెట్టాడు. ‘ఈ రోజు ప్రపంచకప్ క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ ఈ శీతాకాలంలో డబ్బుల కోసం ఉబెర్ ఈట్స్ డెలివరీలు చేయాల్సి వస్తోంది. పరిస్థితులు ఎలా మారిపోతాయో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే బాధేమీ లేదు. అంతా నవ్వుతూ ఉండండి’ అని మీకెరన్ ట్వీట్ చేశాడు. -
ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగలవు!
ప్రకృతిలోని అద్భుతమైన ‘నిర్మాణాల్లో’ సాలెగూడు కూడా ఒకటి. ఆహారాన్ని సంపాదించుకునేందుకు సాలీడు పురుగులు దీనిని అల్లుకుంటాయి. ఇందులో చిక్కిన జీవి(సూక్ష్మజీవులు) ఏదైనా సరే విలవిల్లాడుతూ ప్రాణాలు విడవాలే తప్ప.. తప్పించుకోవడం అసాధ్యం. ఆహారం సంపాదించుకునేందుకు అంత పక్కాగా ప్లాన్ చేస్తాయి సాలీడులు. ఇక సాధారణంగా ఇప్పటి వరకు సాలీడులు చిన్న చిన్న జీవులను తినడం మాత్రమే మనం చూశాం. అయితే తరంతుల అనే జాతికి చెందిన ‘పింక్ టో తరంతుల’ అనే పెద్ద సాలీడు ఓ పక్షిని ముందరి కాళ్లతో బంధించి దానిని నోట కరచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘‘సాలీడు, పక్షిని తింటుందా. మా షెడ్లో కూడా సాలీడు గూళ్లు ఉన్నాయి. ఇకపై అక్కడికి వెళ్లను. ఇది చాలా భయంకరంగా ఉంది’’అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది) ఇక ఈ విషయం గురించి జాసన్ డన్లోప్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘‘చెట్లపై నివసించే ఇలాంటి పెద్ద సాలీడులు సాధారణంగా చిన్న చిన్న పక్షులు, ఎలుకలను చంపి తింటాయి. అయితే ఎటువంటి ఆహారాన్నైనా సరే చప్పరించి, జ్యూస్లా మార్చుకుని తాగేస్తాయి. ఇక ఈ వీడియోలో ఉన్న పక్షి ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగిలే అవకాశం లేదు’’అని చెప్పుకొచ్చారు. కాగా పింక్ టో తరంతుల సాలీడులు ఎక్కువగా దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి. -
పక్షిని నోట కరచుకున్న సాలీడు
-
వామ్మో! ఖైదీల లాక్డౌన్ అంటే ఇలానా?
వాషింగ్టన్: ఎల్ సాల్విడార్లో శుక్రవారం ఒక్క రోజే 22 మంది హత్యకు గురవడంతో దేశ అధ్యక్షుడు నయీబ్ బ్యూక్లే, ఇజాల్కోలోని జైల్లో 24 గంటల లాక్డౌన్ను అమలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ జైల్లో ముఠా నాయకులు శిక్షలు అనుభవిస్తుండడం, వారి ఆదేశాలు, వ్యూహాల ప్రకారమే బయట నగరంలో హత్యలు జరగుతున్నాయని నయీబ్ భావించడమే అందుకు కారణం. ఆయన దేశ అధ్యక్షుడిగా గత జూన్ నెలలో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు 22 హత్యలు జరగడం ఇదే మొదటి సారి. ఈ నేపథ్యంలో జైల్లోని ఖైదీలెవరూ ఒకరికొకరు మాట్లాడకుండా వారందరిని ఒకే చోట నిర్బంధించడం ద్వారా లాక్డౌన్ అమలు చేయాలని నయీబ్ జైలు అధికారులను ఆదేశించారు. అయితే కరోనా వైరస్ విజంభిస్తోన్న నేపథ్యంలో ఎల్ సాల్విడార్ గత మార్చి నెల నుంచి దేశ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రజలంగా మాస్క్లు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలనే నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇజాల్కోలోని జైల్లో ఖైదీలను ఒకో చోట నిర్బంధించడం వల్ల సామాజిక దూరం నిబంధన గాలిలో కలసిపోయింది. పైగా ఊపిరాడనంతగా ఖైదీలను ఒకరిపై ఒకరు ఆనుకునేలా బంధించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఎల్ సాల్విడార్లో వీధి ముఠాల మధ్య కుమ్ములాటలు జరిగేవి. వాటిని మరాస్లని పిలిచేవారు. ఆ కుమ్ములాటల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించేవి. దేశాధ్యక్షుడి నయీబ్ వచ్చాకే కుమ్ములాటలు పూర్తిగా నిలిచి పోయాయి. కొన్ని నెలలుగా ఒక్కరంటే ఒక్కరు కూడా మరణించలేదు. శుక్రవారం నాడు ఒక్క రోజే 22 మంది హత్య జరగడంతో ఆయన జైలు లాక్డౌన్కు నిర్ణయం తీసుకున్నారు. -
అమెజాన్ కార్చిచ్చుల ఎఫెక్ట్
వాషింగ్టన్: పుడమికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు వల్ల ఏర్పడిన దుష్పరిణామాలు ఇంకా కొనసాగుతున్నాయి. అమెజాన్ అడవులకు దాదాపుగా 2 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న అండిస్ పర్వత శ్రేణుల్లోని హిమనీనదాలు కరిగిపోతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. అడవులు తగలబడడంతో సూక్ష్మమైన కాలుష్యకారక బొగ్గు కణాలు గాల్లో కలుస్తాయి. ఇవి వాయువేగంతో ప్రయాణించి అండీన్ హిమనీనదంపై పేరుకుంటున్నాయి. బ్రెజిల్కు చెందిన రియోడీజనీరో స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అమెజాన్ కార్చిచ్చులకు, హిమనీనదాలు కరగడానికి మధ్య సంబంధంపై అధ్యయనం చేసి ఈ విషయాలు వెల్లడించారు. -
జుట్టు కత్తిరించి.. ఈడ్చుకెళ్తూ..
లా పాజ్ : అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణ అమెరికా దేశం బొలీవియా రక్తసిక్తమవుతోంది. అధికార మూమెంట్ ఫర్ సోషలిజం పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనలు ఉధృతం చేశాయి. ఈ క్రమంలో ఇరు పక్షాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా.. ఎంతో మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్ల విద్యార్థి మృతికి కొచాబాంబ పట్టణ మేయర్ పేట్రిసియా ఆర్సే కారణమంటూ నిరసనకారులు గురువారం ఆందోళన చేపట్టారు. మేయర్ కార్యాలయానికి నిప్పంటించి ఆమెను వీధిలోకి ఈడ్చుకువచ్చి... హంతకురాలు అని అరుస్తూ మోకాళ్లపై కూర్చోబెట్టారు. అనంతరం ఆమెపై ఎరుపు రంగు కుమ్మరించి... ఆపై జుట్టు కత్తిరించి.. చెప్పుల్లేకుండా రోడ్డుపై నడిపిస్తూ అమానుషంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని... పేట్రిసియాను ఆస్పత్రికి తరలించారు. కాగా బొలీవియా అధ్యక్షుడు ఎవో మోరాల్స్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మహిళా మేయర్పై దాడి ప్రతిపక్షాల దురహంకారానికి నిదర్శమని మండిపడ్డారు. ‘ తన అనుచరులను కాపాడేందుకు ప్రయత్నించినందుకు ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించారు. పేదల పక్షాన నిలబడినందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక దేశ ఉపాధ్యక్షుడు అల్వారో గ్రేసియా ఘటనపై స్పందిస్తూ.. ‘ మహిళగా పుట్టడమే ఆమె చేసిన నేరం. నిజాయితీగా ఉండటమే ఆమె తప్పు. మహిళ అయినందుకే ఈ ఘోరం అని వ్యాఖ్యానించారు. ఇక అధికార పార్టీ మహిళా విభాగం కూడా ఘటనపై తీవ్రంగా స్పందించింది. మేయర్పై దాడిని.. జాత్యహంకార, వివక్షాపూరిత, హింసాత్మక ఘటనగా అభివర్ణించింది. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని.. ఫాసిస్టు నాయకుల అహంకారానికి నిదర్శనమని పేర్కొంది. కాగా 2006లో బొలీవియా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఎవో మారెల్స్.... ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడి మరోసారి అధికారం చేజిక్కించుకున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
మంటల్లో ‘అమెజాన్’; విరాళాలు ఇవ్వండి!
బ్రెసీలియా : ప్రపంచంలోనే అత్యధిక పొడవైన వర్షాధార ఉష్ణమండల అడవి(రెయిన్ఫారెస్ట్)గా ప్రసిద్ధికెక్కిన అమెజాన్లో కార్చిచ్చు రగులుతోంది. ఈ అడవిలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది. గత కొన్నాళ్లుగా మంటల ధాటికి ఈ అడవిలోని చెట్లన్నీ కాలి బూడిద అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్లో దాదాపు 73 వేల అగ్ని ప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎన్పీఈ వెల్లడించింది. గడిచిన ఐదేళ్లలో(2013-2018) వీటి సంఖ్య 83 శాతం పెరిగిందని పేర్కొంది. దీంతో దక్షిణ అమెరికా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో పొగ అలుముకుందని తెలిపింది. బ్రెజిల్పై ఈ మంటల ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించింది. ముఖ్యంగా అమెజానస్, రోండోనియా రాష్ట్రాల్లో పూర్తిగా పొగ అలుముకుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆగష్టు మొదటివారంలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరగడంతో బ్రెజిల్లో అత్యవసర పరిస్థితి విధించారు. దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో పాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడిగా బోల్సోనారో విఫలమయ్యారని..ఆయన అడవుల నరికివేతను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విమర్శలపై స్పందించిన బోల్సోనారో పర్యావరణ కార్యకర్తలుగా చెప్పుకొనే కొంతమంది వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగానే అడవులను తగులబెడుతున్నారని ఆరోపిస్తున్నారు.కాగా అటవీ సమీపంలోని భూములను వ్యవసాయానికి అనువుగా మార్చుకునే సమయంలో, పంట చేతికొచ్చిన తర్వాత రైతులు వ్యర్థాలను కాల్చే క్రమంలో మంటలు వ్యాప్తిస్తున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ప్రమాదాల సంఖ్యతో పాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ద లంగ్స్ ఆఫ్ ప్లానెట్’ గా వ్యవహరించే అమెజాన్ ఈ స్థాయిలో కాలుష్య కారకాలను వెదజల్లడంతో దక్షిణ అమెరికా దేశాల్లోని వివిధ రాష్ట్రాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ జనాభాకు 20 శాతం ప్రాణవాయువు(ఆక్సీజన్) అందించడంతో పాటు జీవవైవిధ్య సమతౌల్యంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్ క్రమంగా అంతరించిపోయినట్లయితే.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కనీసం తాగునీరు కూడా లభించని దుస్థితి దాపురిస్తుందని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. అమెజాన్ను కాపాడండి! ఇక పచ్చని అడవి కార్చిచ్చు దాటికి బుగ్గిపాలవుతున్న ఫొటోలు, వీడియోలను నాసాకు చెందిన ఆక్వా సాటిలైట్, యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన సెంటినల్ 3 ఉపగ్రహం విడుదల చేశాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో #Prayfor Amazonas, #AmazonRainforest హ్యాష్ట్యాగ్లతో అమెజాన్ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి పెద్ద ఉద్యమం నడుస్తోంది. అదే విధంగా మానవాళి మనుగడకు దోహదపడుతున్న అడవిని మంటల నుంచి కాపాడుకునేందుకు విరాళాలు అందజేయాల్సిందిగా నెటిజన్లు పలువురు బిలియనీర్లకు విఙ్ఞప్తి చేస్తున్నారు. అడవులను సంరక్షించుకునే ఉద్యమంలో ప్రతీ పౌరుడు భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో 1988 నుంచి అమెజాన్లో భూములు కొనే వీలు కల్పిస్తున్న రెయిన్ఫారెస్ట్ ట్రస్టు.. తమ ద్వారా అటవీ భూములు కొనుగోలు చేయవచ్చని సూచిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా సంస్థ ఇప్పటికే 23 మిలియన్ ఎకరాల అటవీ భూమిని సంరక్షించగలిగింది. ఇక రెయిన్ఫారెస్ట్ యాక్షన్ నెట్వర్క్ కూడా అమెజాన్ సంరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తోంది. అదే విధంగా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటూ అమెజాన్, ప్రపంచంలోని వివిధ అడవుల్లో ఆశ్రయం పొందుతున్న అనేక జీవజాతులను రక్షిస్తోంది. ఇదిలా ఉండగా Ecosia.org అనే సెర్చ్ ఇంజన్ తమ ప్లాట్ఫారమ్కు వచ్చే ప్రతీ 45 సెర్చ్లకు ఒక మొక్కను నాటే వీలు కల్పిస్తుంది. దీనిని ఆశ్రయించడం ద్వారా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటే మహోద్యమంలో పరోక్షంగా భాగస్వాములు అవ్వొచ్చు. అంతేకాకుండా అమెజాన్ వాచ్, అమెజాన్ కన్జర్వేషన్ టీమ్లకు విరాళాలు అందజేయడం ద్వారా వాతావరణ మార్పులను అదుపు చేయగలిగే అడవులను కాపాడుకోవచ్చు. -
పెట్రోల్ పట్టుకునేందుకు ఎగబడ్డ జనం.. అంతలోనే
త్లాహులిల్పాన్: దక్షిణ అమెరికాలోని మెక్సికోలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హిడాల్గో రాష్ట్రంలోని త్లాహులిల్పాన్ పట్టణంలో శుక్రవారం రాత్రి ఓ ఆయిల్ పైప్లైన్కు అక్రమంగా అమర్చిన ట్యాప్ లీక్ కావడంతో పెట్రోల్ను పట్టుకునేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 67 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 76 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారికి అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ సంతాపం తెలిపారు. ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థ పెమెక్స్ పైప్లైన్ల నుంచి మాఫియా, డ్రగ్ డీలర్లు ఇంధనాన్ని దొంగలించడం మెక్సికోలో సర్వసాధారణం. దీనివల్ల ఒక్క 2017లోనే రూ.21,376 కోట్ల ఆదాయాన్ని మెక్సికో కోల్పోయింది. -
చుట్టేసి ఆరగిస్తాయ్.!
ఇటీవల ఇండోనేషియాలోని మకస్పర్లో తోటలో కూరగాయలు కోయడానికి వెళ్లిన ఓ మహిళను భారీ అనకొండ మింగేసింది. అలాగే రెండ్రోజుల కిందట అసోంలో జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువను పట్టుకొన్న ఓ అటవీ అధికారి, దానితో సెల్ఫీ తీసుకుంటుండగా అది ఆయన మెడను చుట్టుకొని బిగించింది. చుట్టుపక్కల వారు వేగంగా స్పందించి దాని పట్టునుంచి అధికారిని విడిపించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో అనకొండ గురించి క్లుప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములున్నాయి. వీటిలో అతి పెద్దదే అనకొండ(పైథాన్). సరీసృపాల్లోని యునెక్ట్స్ ప్రజాతికి చెందిన ఇవి విషరహితం. యునెక్ట్స్ అంటే గ్రీకు భాషలో గుడ్ స్విమ్మర్(మంచి ఈతగాడు) అని అర్థం. అనకొండల రూపం, పరిమాణాన్ని బట్టి వీటిని నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి.. గ్రీన్(ఆకుపచ్చ) అనకొండ, ఎల్లో(పసుపు) లేదా పరాగ్వేయన్ అనకొండ, బ్లాక్ స్పాటెడ్ (నల్లమచ్చల) అనకొండ, బేని లేదా బొలివియన్ అనకొండ. మనదేశంతోపాటు ఉపఖండంలో కనిపించే కొండచిలువ ఇందులో ఒకటి. దక్షిణ అమెరికాలో అత్యధికం ఒక్క అంటార్కిటాకాలో మినహా మిగిలిన అన్ని ఖండాల్లోనూ అనకొండలు ఉన్నాయి. అయితే, వీటి సంఖ్య దక్షిణ అమెరికాలో అత్యధికం. అక్కడి వాతావరణ పరిస్థితులు దీనికి కారణం. అనకొండల్లోని నాలుగు రకాలూ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి పురాణాల్లోనూ వీటి ప్రసక్తి ఉంది. వీటికి కొన్ని అతీత శక్తుల్ని ఆపాదిస్తూ రాసిన పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనుషుల్ని తినేవిగానూ వీటిని పేర్కొన్నారు. అనకొండ పేరు మీద వచ్చిన అనేక ఇంగ్లిష్ సినిమాలకు ఇవే ప్రేరణ. చిత్తడి నేలలు, తీరాల్లో ఆవాసం అనకొండలు అన్ని ప్రాంతాల్లోనూ నివసించగలిగినప్పటికీ ఇవి ఎక్కువగా నది, సముద్ర తీర ప్రాంతాలు, చిత్తడి నేలల్లో ఉండడానికి ఆసక్తి చూపుతాయి. ఇక్కడ ఇవి సంచరించడానికి అనుకూలంగా ఉండడంతోపాటు వీటి ఆహారమైన చిన్నచిన్న జంతువులు నీళ్లు తాగేందుకు రావడం మరో కారణం. బలమైన కండరాలతో ఏర్పడిన వీటి ఆకారం నేలమీద కంటే నీటిలో చురుగ్గా ప్రయాణించేందుకు వీలుగా ఉండడమూ చెప్పుకోవచ్చు. ఇవి నీళ్లలో ఈదుతూ లేదా దాక్కొని ఉంటూ ఎక్కువ సమయం గడుపుతాయి. ప్రవాహ వేగం తక్కువగా ఉండే నదులు, జలపాతాల సమీపంలో ఎత్తైన చెట్ల కొమ్మలను చుట్టుకొనీ ఉంటాయి. ఇవి గరిష్ఠంగా 100 అడుగుల వరకూ పెరుగుతాయని వాదనలు ఉన్నప్పటికీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైన ప్రకారం ఇప్పటివరకు 25 అడుగుల పొడవైన అనకొండే అతి పెద్దది. అలాగే వీటి బరువు 250 కిలోల వరకూ ఉంటుందని అంచనా. అయితే నేషనల్ జియోగ్రాఫిక్ వెల్లడించిన వివరాల ప్రకారం గరిష్టంగా 45–68 కిలోల వరకు ఉన్నవాటినే ఇప్పటిదాకా గుర్తించారు. ఊపిరి ఆడకుండా .. రక్తప్రసరణ జరగకుండా.. ఏటా వసంత కాలంలో అనకొండలు జతకూడతాయి. ఆడ అనకొండలు వదిలే ఒకరకమైన ద్రవం వాసనను బట్టి మగవి వెతుక్కుంటూ వస్తాయి. గర్భస్థ కాలం ఏడు నెలలు. ఈ కాలంలో పిల్లల్ని మోసే ఆడవి వేటాడవు. ఒక్కదఫా కనీసం 30 పిల్లల్ని కంటాయి. పుట్టగానే వాటిని వదిలేసి వెళ్లిపోతాయి. అనకొండ గరిష్ఠ జీవిత కాలం 30 ఏళ్లు. జింకలు, కుందేళ్లు, చేపలు, మొసళ్లు, తదితర జంతువుల్ని ఆహారంగా తీసుకొనే అనకొండలు.. ఆకలేస్తే మనిషి మీద దాడి చేయడానికీ వెనకాడవు. ఈ క్రమంలో ఇవి తమ ఆహారాన్ని మొదట బలంగా చుట్టుకొని ఊపిరి ఆడకుండా, రక్తప్రసరణ జరగకుండా చేస్తాయి. అవి చనిపోయాక వాటిని మింగి ఆరగిస్తాయి. అడవుల నరికివేత.. ఆవాసం ధ్వంసం సాధారణంగా అడవుల్లోనే నివసించే అనకొండలు ఇటీవల తరచూ మానవ నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పెంపుడు జంతువులు, మనుషుల మీద దాడి చేస్తున్నాయి. కలప, వ్యవసాయం కోసం అడవులను నరికివేయడంతో ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. చిత్తడి నేలలు, నదీ తీర ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు ఎక్కువ అవడంతో వీటి ఆహారమైన ఇతర జంతువుల రాక తగ్గింది. దీంతో అనకొండలు ఆహారం వెతుక్కుంటూ జనావాసాల్లోకి చేరుతున్నాయని చెబుతున్నారు. -
మెక్సికోరల్లో జర్మనీ...
జర్మనీ... ప్రపంచకప్ ఫేవరెట్లలోకెల్లా హాట్ ఫేవరెట్. 1982 నుంచి, అందునా డిఫెండింగ్ చాంపియన్గా బరిలో దిగిన మూడుసార్లు టోర్నీ తొలి మ్యాచ్లో ఓడిపోలేదు. మెక్సికో... సాధారణ జట్టే కానీ ఈసారి తనదైన రోజున ఏ జట్టునైనా పరాజయం పాల్జేసేంత ప్రమాదకారిగా కనిపిస్తోంది....ఆ రోజు ప్రపంచ కప్ తొలి మ్యాచ్లోనే వచ్చింది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య తీవ్ర స్థాయి ప్రతిఘటనలతో సాగిన మ్యాచ్లో మెక్సి‘కోరల్లో’ చిక్కిన జర్మనీ బయటపడ లేకపోయింది. కనీసం ‘డ్రా’ అయినా చేసుకోలేక అనూహ్య ఓటమిని మూటగట్టుకుంది. ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాను శనివారం అనామక ఐస్లాండ్ నిలువరించి కప్పై ఆసక్తి పెంచగా, ప్రపంచ చాంపియన్ను ఓడించిన మెక్సికో ఒక్కసారిగా వేడి పుట్టించింది. మాస్కో: ప్రపంచ కప్లో రసవత్తర మ్యాచ్.డిఫెండింగ్ చాంపియన్ జర్మనీకి షాక్. ఆదివారం 78 వేల ప్రేక్షక సందోహం మధ్య ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్లో మెక్సికో 1–0తో జర్మనీని బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది. విపరీతమైన దాడులను ఎదుర్కొన్నా ఈ దక్షిణ అమెరికా జట్టు నిబ్బరం చూపింది. 35వ నిమిషంలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హిర్విన్ లొజానో చేసిన ముచ్చటైన గోల్తో ఆధిక్యంలో నిలిచిన మెక్సికో దానిని చివరి వరకు నిలబెట్టుకుంది. ఎంత ప్రయత్నించినా ప్రత్యర్థిని అందుకోలేకపోయిన జర్మనీ... ఇక గెలుపు ఊహకే దూరంగా ఉండిపోయింది. దాడులతో మొదలు... మ్యాచ్ తొలి మూడు నిమిషాల్లోనే రెండు జట్లకు చెరోసారి గోల్ అవకాశం వచ్చిందంటేనే ఆట ఏ స్థాయిలో ప్రారంభమైందో అర్థం చేసుకోవచ్చు. జర్మనీ ఎప్పటిలానే ఆధిపత్యం కోసం ప్రయత్నించింది. మెక్సికో మాత్రం బంతిని అదుపులో ఉంచుకునే తమ సహజ సిద్ధమైన ఆటను ఎంచుకోలేదు. అయినా ఆ జట్టుపై ఇదేమంత ప్రభావం చూపలేదు. డిఫెన్స్ లోపాలున్నా జర్మనీనే కొంత మెరుగ్గా కనిపించింది. అయినా ప్రత్యర్థి తేలిగ్గా లొంగలేదు. క్రమంగా మెక్సికో ప్రతి దాడులకు దిగడంతో మ్యాచ్ ఆసక్తిగా మారింది. 35వ నిమిషంలో హెర్నాండెజ్ నుంచి వచ్చిన పాస్ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన లొజానో... కీపర్ న్యూర్ను బోల్తా కొట్టిస్తూ గోల్గా మలిచాడు. తర్వాత కూడా ఇదే తీవ్రతతో ఆడిన మెక్సికో... జర్మనీని ఇబ్బందికి గురి చేసింది. పాస్లు సరిగా అందిపుచ్చుకోకపోవడం ఆ జట్టును దెబ్బతీసింది. వందశాతం ఆటను చూపలేకపోవడంతో ప్రత్యర్థి పని సులువైంది. బంతి జర్మనీ ఆధీనంలోనే ఉన్నా, వారిని అనుసరించే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసిన మెక్సికో మొదటి భాగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రయత్నించినా చిక్కలే... చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో భాగంలో జర్మనీ ఆటలో తీవ్రతను పెంచింది. కానీ దుర్బేధ్యమైన ప్రత్యర్థి డిఫెన్స్ను ఛేదించలేకపోయింది. ఇదే సమయంలో మెక్సికో ఆటగాళ్లు అలసిపోయినట్లు కనిపించారు. ఈ అవకాశాన్నీ ప్రపంచ చాంపియన్ వినియోగించుకోలేదు. లాభం లేదని సీనియర్ గోమె జ్ను బరిలో దింపింది. అయినా ఆ జట్టు కొట్టిన షాట్లు గోల్పోస్ట్పైగా వెళ్లాయి. చివరి నిమిషాల్లోకి వచ్చేసరికి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అవకాశాలు సృష్టించుకోలేని పరిస్థితుల్లో మ్యాచ్ను చేజార్చుకుంది. మ్యాచ్ మొత్తంలో 60 శాతం పైగా సమయం బంతి తమ ఆధీనంలోనే ఉన్నా, 25 సార్లు దాడులు చేసినా జర్మనీకి చేదు ఫలితమే మిగిలింది. మొదటి భాగంలో ప్రతిదాడి, రెండో భాగంలో రక్షణాత్మక ఆటను నమ్ముకున్న మెక్సికోనే విజయం వరించింది. తదుపరి ఈనెల 23న కొరియాతో మెక్సికో; స్వీడన్తో జర్మనీ తలపడతాయి. గోల్ చేశాక లొజానో ఆనందహేళ... మ్యాచ్ ముగిశాక నిరాశలో జర్మనీ ఆటగాళ్లు ముల్లర్, హామెల్స్. 36 ప్రపంచకప్లో తాము ఆడిన తొలి మ్యాచ్లోనే ఓడిపోవడం 36 ఏళ్ల తర్వాత జర్మనీకిదే తొలిసారి. చివరిసారి పశ్చిమ జర్మనీ 1982 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో 1–2తో అల్జీరియా చేతిలో పరాజయం పాలైంది. 5 గత ఆరు ప్రపంచకప్లలో తాము ఆడిన తొలి మ్యాచ్లోనే మెక్సికో గెలుపొందడం ఇది ఐదో సారి. మరో మ్యాచ్ను ఆ జట్టు ‘డ్రా’ చేసుకుంది. 6 ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ చాంపియన్ ఆడిన తొలి మ్యాచ్లోనే ఓడిపోవడం ఇది ఆరోసారి. 1950లో ఇటలీ 2–3తో స్వీడన్ చేతిలో... 1982లో అర్జెంటీనా 0–1తో బెల్జియం చేతిలో... 1990లో అర్జెంటీనా 0–1తో కామెరూన్ చేతిలో... 2002లో ఫ్రాన్స్ 0–1తో సెనెగల్ చేతిలో... 2014లో స్పెయిన్ 1–5తో నెదర్లాండ్స్ చేతిలో... 2018లో జర్మనీ 0–1తో మెక్సికో చేతిలో ఓడిపోయాయి. 2 జర్మనీ జట్టును మెక్సికో ఓడించడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో ఏకైకసారి మెక్సికో 1985 జూన్లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో జర్మనీపై గెలిచింది. 3ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా మెక్సికో ప్లేయర్ రాఫెల్ మార్కెజ్ (2002, 06, 2010, 14, 18) అత్యధికంగా ఐదు ప్రపంచకప్లలో ఆడిన మూడో ప్లేయర్గా నిలిచాడు. గతంలో ఆంటోనియో కర్బజాల్ (మెక్సికో–1950, 54, 58, 62, 66), లోథర్ మథియాస్ (జర్మనీ–1982, 86, 90, 94, 98) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
అకాంకాగ్వా పర్వతాన్ని అధిరోహించిన ఏఎస్పీ
చిత్తూరు రూరల్: చిత్తూరు జిల్లా ఏఎస్పీ రాధిక దక్షిణ అమెరికాలోని ఎత్తైన పర్వతం మౌంట్ అకాంకాగ్వాను విజయవంతంగా అధిరోహించారు. ఈ పర్వతం అర్జెంటీనాలో ఉంది. దీని ఎత్తు 6,962 మీటర్లు. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢత్వం అవసరం. గతంలో ఈమె అనేక పర్వతాలను అధిరోహించి పోలీసు శాఖ కీర్తి ప్రతిష్టలను పెంచారు. ఈమె జిల్లా ఎస్పీ రాజశేఖర్బాబులతో పాటు పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు అందుకున్నారు. ఏఎస్పీ అక్కడి నుంచి స్వదేశానికి ఈ నెల 6వ తేదిన తిరిగిరానున్నారు. -
ఇదండీ విచిత్ర జీవి సంగతి!
గుర్రం లాంటి ముఖం, నీటి ఏనుగు కాళ్లు, మోపురం లేని ఒంటె లాంటి దేహంతో ఉన్న ఈ జీవిని చూసేందుకు చిత్రంగా ఉంది కదూ. నిజమే.. మానవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్కే దీని వివరాలు అంతుపట్టలేదు. జన్యుక్రమ విశ్లేషణ పుణ్యమా అని ఇన్నేళ్ల తరువాత ఈ జీవి వివరా లు తొలిసారి వెల్లడయ్యాయి. దక్షిణ అమెరికాలో డార్విన్ పర్యటిస్తున్నప్పు డు పెటగోనియాలో ఈ జీవి తాలూ కూ అవశేషాలు లభించాయి. వాటి ఆధారంగా బతికున్నప్పుడు ఆ జీవి ఎలా ఉండేదో ఊహించిన డార్విన్ దానికి మక్రావుచెనియా పాటాకోనికా అని నామకరణం చేశాడు. పేరుపెట్టగలిగాడేగానీ ఇతర వివరాలేవీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్డ్యామ్ అధ్యాపకుడు మైకేల్ హోఫ్రిటర్ దీనిపై పరిశోధనలు చేపట్టారు. అవశేషాల ద్వారా సేకరించిన మైటోకాండ్రియల్ డీఎన్ఏను విశ్లేషించినప్పుడు ఈ జీవజాతి రాక్షస బల్లుల కాలంలో ఉండేదని, గుర్రం, నీటిఏనుగు వంటి పెరిస్సోడాక్యాటా జాతికి చెందిందని గుర్తించగలిగారు. పరిశోధన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
ఇది ఎలుగుల సృష్టి...!
ఈ ఫొటోల్లోని భారీ సొరంగాలను చూడండి చాలా అందంగా.. మనిషి నడవడానికి సరిపడినంత విశాలంగా ఉన్నాయి కదా. ఇలాంటి సొరంగాలు దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంతంలో అనేకచోట్ల ఉన్నాయి. వీటి నిర్మాణం చూసి బాగా చేయితిరిగిన ఇంజనీర్ ఇలా ఏర్పాటు చేసి ఉంటాడని అనుకుంటున్నారా.. అయితే మీరు పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే ఈ సొరంగాలను మనిషి తవ్వలేదు..అలాగని ప్రకృతి మార్పుల వల్ల కూడా ఏర్పడ లేదు. సొరంగాలను ఎలుగుబంట్లు తవ్వాయట.. నమ్మడం లేదా అయితే సొరంగంలోని గోడలపై ఎలుగుబంట్లు తవ్వినట్లు నిరూపించే వాటి కాలు, చేతుల గోళ్ల ముద్రలు ఉన్నాయి ఓసారి చూడండి. ‘పాలియోబుర్రో’ అనే పిలిచే ఈ సొరంగాలను 10 వేల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికాలో ప్రాంతంలో నివసించిన భల్లూకాలు తమ అవసరాల కోసం తవ్వి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అప్పట్లో వాటి ఆకారం ఇప్పుడున్న ఏనుగుల సైజులో ఉండేవని, అందుకే ఇలాంటి సొరంగాలను తవ్వడం సాధ్యపడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బ్రెజిల్లోని ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన హెన్రిచ్ ఫ్రాంక్ అనే ప్రొఫెసర్ 2000 సంవత్సరంలో రియో గ్రాండ్ డాసుల్ ప్రాంతంలో మొదటి సొరంగాన్ని కనుగొన్నాడు. ఇప్పటివరకు ఫ్రాంక్, అతని బృందం కలిపి ఇలాంటి సొరంగాలనే 1,500లకు పైగా కనుగొన్నారు. వీటిలో కొన్ని సొరంగాలు వందల అడుగులకు పైగా పొడవు ఉండడంతోపాటు లోపల అనేక చిన్న చిన్న సొరంగ మార్గాలు ఉన్నాయని ఫ్రాంక్ తెలిపారు. 2000 అడుగుల పొడవు, ఆరడుగుల ఎత్తు, ఐదడుగుల వెడల్పున్న సొరంగాన్ని తాజాగా కనుగొన్నారు. ఇంకా ఈ సొరంగాలకు సంబంధించి అంతుచిక్కని అనేక ప్రశ్నలు శాస్త్రవేత్తలను వేదిస్తున్నాయి. -
చుట్టూ చేపలు... మధ్యలో మనుషులు
ఒలింపిక్స్ ముగిసి రెండు మూడు నెలలు అవుతోంది. కానీ బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో మరో సూపర్ టూరిస్ట్ అట్రాక్షన్కు సిద్ధమవుతోంది. మొత్తం దక్షిణ అమెరికాలోనే అతిపెద్దదైన అక్వేరియం వచ్చే నెల తొమ్మిదిన ప్రారంభం కానుంది. అక్కడెక్కడో యూరప్లో కిలోమీటర్ లోతైన అండర్గ్రౌండ్ టన్నెల్ ఉంటే... ఇక్కడ 650 అడుగుల పొడవైన అండర్వాటర్ టన్నెల్ ఉందీ చేపలతొట్టిలో. దాదాపు 45 లక్షల లీటర్ల నీటిని 28 ట్యాంకుల్లో నింపడం ద్వారా ఈ అక్వేరియంను సిద్ధం చేశారు. ఈ ట్యాంకులన్నింటినీ కలుపుతూ ఈ టన్నెల్ ఉంటుందన్నమాట. ఆక్వా రియో అని పేరుపెట్టన ఈ అక్వేరియంలో దాదాపు 350 జాతుల జలచరాలు 8000 వరకూ ఉంటాయి. సింగపూర్ తదితర దేశాల్లో అండర్ వాటర్ టన్నెల్స్తో కూడిన అక్వేరియంలు ఉన్నప్పటికీ ఇంత భారీస్థాయిలో ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని అంచనా. అక్వేరియంతోపాటు ఆక్వా రియోలో ఒక సర్ఫ్ మ్యూజియం, సైన్స్ మ్యూజియం కూడా ఉంటాయి. జలచరాలను దగ్గర నుంచి చూడాలనుకునే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కావాలంటే ఈ అక్వేరియంలో ఒక రాత్రి మొత్తం గడిపేందుకూ అవకాశముంది. ఇలాంటిదేవో ఇక్కడ ఒకటి అరా ఏర్పాట చేస్తే బాగుండు అనిపిస్తోంది కదూ.... నిజమే! -
పచ్చటి కళ
అదిగో అల్లదిగో... సురినేమ్ దక్షిణ అమెరికాలోని చిన్నదేశాలలో సురినేమ్ ఒకటి. 1975లో నెదర్లాండ్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఈ దేశానికి సహజ వనరులే ఆయువు పట్టు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో... స్వాతంత్య్రం పట్ల నమ్మకం కంటే అపనమ్మకమే ప్రజల్లో ఎక్కువగా ఉండేది. దీంతో వేలాది మంది ప్రజలు దేశాన్ని విడిచి నెదర్లాండ్స్కు వెళ్లారు. మరోవైపు ప్రభుత్వ అసమర్థత, అక్రమాల మీద ప్రజలకు విముఖత వచ్చింది. దీనివల్లే 1980లో తలెత్తిన సైనిక తిరుగుబాటును ప్రజలు స్వాగతించారు. 1980-1987 వరకు దేశంలో మిలటరీ పాలన కొనసాగింది. రాజకీయ ప్రత్యర్థులను మిలటరీ ప్రభుత్వం చంపేయడంతో నెదర్లాండ్స్ తన సహకారాన్ని ఆపింది. ఈ ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆ తరువాత సాధారణ ఎన్నికలు జరగడం, కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడంలాంటివి జరిగినప్పటికీ 1990లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగింది. అయితే అంతర్జాతీయ రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ఇదే సంవత్సరం మే నెలలో ఎన్నికలు జరిగాయి. ‘న్యూ ఫ్రంట్ ఫర్ డెమొక్రసీ అండ్ డెవలప్మెంట్’, ‘సురినేమ్ లేబర్ పార్టీ’లు మెజార్టీ స్థానాలను గెలుచుకొని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పరిపాలన పరంగా సురినేమ్ పది జిల్లాలుగా విభజించబడింది. జీవవైవిధ్యంలో సురినేమ్ మంచి స్థాయిలో ఉంది. దేశంలో 150 రకాల క్షీరదాలు, 650 రకాల పక్షిజాతులు, 350 రకాల చేపజాతులు ఉన్నాయి. జీవవైవిధ్యంలో ‘సెంట్రల్ సురినేమ్ నేచర్ రిజర్వ్’ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో చోటు సంపాదించింది. సురినేమ్లో ఎన్నో నేషనల్ పార్క్లు ఉన్నాయి. 16 శాతం భూభాగంలో నేషనల్ పార్క్లు, సరస్సులు ఉన్నాయి. సురినేమ్ సంస్కృతిలో వైవిధ్యం ఉంది. దీనిపై ఆసియా, ఆఫ్రికాల ప్రభావం బలంగా ఉంది. దేశంలో ప్రసిద్ధిగాంచిన సంగీతం ‘కసెకో’. దీనిపై ఆఫ్రికన్, యురోపియన్, అమెరికాల సంగీత శైలుల ప్రభావం కనిపిస్తుంది. దేశంలో 60 శాతం మందికి డచ్ అధికార భాష. ‘డచ్ లాంగ్వేజ్ యూనియన్’లో సురినేమ్కు సభ్యత్వం ఉంది. దక్షిణ అమెరికా దేశాలలో డచ్ మాట్లాడే ఏకైక దేశం సురినేమ్. హోటల్ ఇండస్ట్రీ సురినేమ్ ఆర్థికవ్యవస్థకు కీలకంగా మారింది. ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగా రావడానికి కారణం... జీవవైవిధ్యం. కోమెన్విజిన్ జిల్లాలో జులెస్ బ్రిడ్జీకీ పర్యాటక పరంగా గుర్తింపు ఉంది. సురినేమ్లో బహుళ పార్టీ వ్యవస్థ అమలులో ఉంది. సంకీర్ణప్రభుత్వాలే ఎక్కువ. ‘నేషనల్ పార్టీ ఆఫ్ సురినేమ్’, ‘ప్రోగ్రెసివ్ రిఫామ్ పార్టీ’, ‘సురినేమ్ లేబర్ పార్టీ’, ‘నేషనల్ డెమొక్రటిక్ పార్టీ’, ‘డెమొక్రటిక్ నేషనల్ ప్లాట్ఫాం’... మొదలైనవి దేశంలో ప్రధానమైన పార్టీలు. ఒకవైపు ఉన్నత జీవనప్రమాణాలు, మరోవైపు రాజకీయ, ఆర్థిక సవాళ్లతో సురినేమ్ సంస్కృతిపరంగానే కాదు జీవవైవిధ్యం దృష్ట్యా కూడా చెప్పుకోదగిన దేశంగా ప్రపంచ పటంలో నిలిచింది. టాప్ 10 1. సురినేమ్ ఒకప్పుడు ‘డచ్ గియాన’గా పిలవబడేది. 2. సురినేమ్కు తూర్పులో ఫ్రెంచ్ గుయానా, పశ్చిమంలో గుయానా, దక్షిణంలో బ్రెజిల్ ఉన్నాయి. 3. ‘కింగ్డమ్ ఆఫ్ ది నెదర్ల్యాండ్స్’లో 1954లో భాగమైంది సురినేమ్. 4. బాక్సైట్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో సురినేమ్ ఒకటి. 5. పారమరిబో... దేశంలోని పెద్ద పట్టణం మరియు దేశరాజధాని. 6. దేశంలో ప్రాచుర్యం పొందిన ఆట... ఫుట్బాల్. 7. దేశంలో అధికార భాష డచ్తో పాటు... స్రనన్ టోంగో, హిందీ, భోజ్పూరి, ఇంగ్లిష్, సర్నమి, హక్కా... మొదలైన భాషలు కూడా మాట్లాడతారు. 8. దేశ తొలి అధ్యక్షుడు జోహన్ ఫెరియర్. 9. రాజధానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రౌన్స్బెర్గ్ పక్షులధామంగా పేరుగాంచింది. 10. రెయిన్ఫారెస్ట్ సంరక్షణలో ముందున్న దేశాలలో సురినేమ్ ఒకటి. -
2 వేల మంది గర్భిణులపై 'జికా' ప్రభావం
బోగొటా: గత ఏడాది బ్రెజిల్ వాసులను గజగజలాడించిన జికా వైరస్ ప్రస్తుతం కొలంబియాలో వ్యాపించింది. ఈ వైరస్ లాటిన్ అమెరికాలో వేగంగా విస్తరించి అక్కడి ప్రజలను వణికిస్తోంది. దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో జికా ప్రభావం చాలా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కొలంబియాలోనే 2000 మందికి పైగా గర్భిణిలకు జికా వైరస్ బారిన పడ్డారని స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందన్నది అర్థమవుతోంది. గతేడాది 15 లక్షల మంది బ్రెజిల్ వాసులు జికా బారిన పడ్డ విషయం విదితమే. పుట్టబోయే పిల్లలపై జికా ప్రభావం ఉండటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లులపై జికా ప్రభావం చూపితే పుట్టే పిల్లల్లో బ్రెయిన్ సంబంధ వ్యాధులు వస్తాయి. తల చిన్న పరిమాణంలో ఉన్న పిల్లలు పుడతారు. మొత్తంగా 20, 297 జికా వైరస్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 1,050 మందికి జికా ఉన్నట్లు నిర్ధారించగా, మరో 17,115 మంది శాంపిల్స్ ఇంకా ల్యాబోరేటరీలలో ఉన్నాయని వాటిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తారు. బ్రెజిల్ తర్వాత జికా ప్రభావం ఎక్కువగా దేశం కొలంబియా అని అధికారులు చెబుతున్నారు. -
ఆహా ఏమి రుచి... వంకాయ
తిండి గోల నవనవలాడే వంకాయలతో కూర చేస్తే ఆఖరు బంతివారికి అందనే అందదని చెప్పుకుంటుంటారు పెద్దవాళ్లు. వంకాయవంటి కూరయు లేదు... అంటూ తెగ పొగిడించుకునే ఈ కూరగాయను ప్రాచీన హిందూమత శ్రాద్ధ కర్మలలో నిషేధించేవారట. దీంతో ఈ కాయగూర పాశ్చాత్యులదే తప్ప భారతీయులది కాదని తెలుస్తోంది. అయితే, ఇది ఎప్పుడు మన దేశాన అడుగుపెట్టిందనే లెక్కలు అంతగా లేవు. కానీ, బ్రిటిషర్ల కాలంలోనే మన దేశంలో తన ముచ్చికను ముందుగా మోపి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. దక్షిణ ఆసియా, దక్షిణ అమెరికాలో వంకాయను ‘బ్రింజాల్’ అని, ఉత్తర అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు, బ్రిటీషర్లు ‘ఎగ్ప్లాంట్’, గార్డెన్ ఎగ్.. వంటి పేర్లతో పిలుస్తుంటారు. అక్కడి పరిశోధకులు ఈ కూరగాయసాగులో పాటించిన అధునాతన పద్ధతుల వల్ల వందల రకాల ఆకృతులు, రంగులతో దర్శనమిస్తుంది వంకాయ. మన నోట మాత్రం ఆహా ఏమి రుచి అని కూరను తిన్న ప్రతిసారీ అనిపిస్తూనే ఉంది. వంకాయ పాశ్చాత్యులదే అయినా దాన్ని నడ్డి విరిచి వండేది మనమే కాబట్టి, రుచి క్రెడిట్ మన పాకశాస్త్ర ప్రవీణులకే ఇచ్చేయాలి. కాదంటారా!! -
క్షురకర్మ పండగ
చారిత్రక ‘మాచు పిచ్చు’ ప్రదేశమే కాదు, పెరూ దేశంలో చూడదగ్గ మరో ఉత్సవం ‘చాచు’. ‘ఇన్కా’ సామ్రాజ్యం నుంచీ కొనసాగుతున్న ఈ ఉత్సవంలో సింపుల్గా చేసేది ‘వికునా’ల క్షురకర్మ. వికునాలంటే దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపించే అరుదైన పొట్టిరకం అడవి ఒంటెలు. వికునా ఉన్ని అతి శ్రేష్టమైనది. అయితే ఏడాదికి దాని ఉన్ని అరకిలోకు మించదు. ఒకప్పుడు ఇన్కా రాజులు, రాణులు మాత్రమే ఆ ఉన్నితో తయారైన వస్త్రాలు ధరించేవారు. సాధారణ మనుషులు వాటిని ధరించడం మీద నిషేధం ఉండేది. వికునా ఉన్నితో చేసిన ఒక కోటు ప్రస్తుతం సుమారు 30 వేల డాలర్లకు అమ్ముడుపోతుంది. ఇంత ఖరీదైనది కాబట్టే దానికి అనుగుణమైన వేట సాగేది. కాబట్టి ఉన్ని సేకరణను ప్రభుత్వం నియంత్రిస్తోంది. అయితే ‘చాచు’ పండగను మాత్రం పాతకాలంలోలాగే జరుపుతోంది. ఏడాదికి ఒకమారు వందలాదిమంది ‘ఇన్కా’ సంప్రదాయ వేషధారణలో వాటిని చుట్టుముట్టి ఒకచోటికి తరలేలా చేస్తారు. ఈ మొత్తం తతంగాన్ని పర్యవేక్షిస్తున్నట్టుగా ఒకరు రాజు వేషాన్ని కూడా ధరిస్తారు. అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి, శుభ్రంగా బొచ్చుగొరిగి, తిరిగి జాగ్రత్తగా వికునాలను అడవిలోకి వదిలేస్తారు. -
పంది లాంటి గుర్రం!
ప్లే టైమ్ చూడటానికి పంది లాగా కనిపిస్తున్న ఈ జంతువు నిజానికి గుర్రం జాతికి చెందినది. దీన్ని ‘టాపిర్’ అంటారు. దక్షిణ అమెరికా ఖండంలో ఎక్కువగా కనిపించే టాపిర్ భూమిపై జంతుజాలం ఆవిర్భవించినప్పటి నుంచీ మనుగడలో ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీనికి గుర్రం లాగా సకిలించే గుణం ఉంటుంది. దీని జీవన ప్రమాణం 25 నుంచి 30 సంవత్సరాలు. బరువు 360 కిలోల వరకూ పెరుగుతుంది. ప్రస్తుతానికి అయితే వీటి ఉనికి దక్షిణ అమెరికా, మధ్య అమెరికాల్లోని గడ్డిభూముల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వేగంగా ఈదగల జంతువుల్లో టాపిర్ ఒకటని పరిశోధకులు గుర్తించారు. బుర దలో పొర్లడం దీనికి బాగా ఇష్టం. ఇవి నివసించే ప్రాంతాల్లో కూడా దీన్ని మచ్చిక చేసుకొన్న దాఖలాలు లేవు. ఇది సాధుజంతువు కాదు, అలాగని అకారణంగా దాడి చేసే క్రూర జంతువు కూడా కాదు. సాధారణంగా టాపిర్ ఎవరి మీదా దాడి చేయదు, కానీ మనుషులు ఎవరైనా దానిపై దాడికి పూనుకొంటే తన పటిష్టమైన ముందుకాలి పాదంతో ఎదురుదాడి చేస్తుంది. -
పాతకాలపు పెళ్లి
ఆధునికత పూర్తిగా లోబరుచుకున్నాక, కోల్పోతున్న సంప్రదాయాలపై మనసు మళ్లడం సహజమే! బల్గేరియాలో ఇదే జరిగింది. వాళ్లు ఏకంగా పదిహేడో శతాబ్దంలో అక్కడ పెళ్లి ఎలా జరిగేదో అలా తిరిగి ప్రదర్శించారు. పనిలో పనిగా ఒక జంటకు పెళ్లి కూడా చేశారు. రజ్గ్రాడ్ నగరానికి సమీపంలోని ఒక గ్రామ వేడుకలో భాగంగా జరిగిన ఈ శుభకార్యంలో వందలాది బల్గేరియన్లు తమ సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ధరించారు. ఆచారంగా చిరు గంటలు మోగించడం, వధూవరులకు మేలు చేయాలని పొట్టేలును బహూకరించడం, బృందనాట్యం చేయడం, సమష్టిగా విందారగించడం... అంతా కన్నులపండువగా జరిగింది. ఒంటె గొర్రె పరిమాణానికి గొర్రెలాగానూ, చూడ్డానికి ఒంటెలాగానూ కనిపిస్తున్న ఈ జీవిని అల్పకా అంటారు. ఒంటె జాతికే చెందినదేగానీ అందులో చిన్నరకం. దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఫొటో మాత్రం ఐరోపాలో తీసింది. ఆస్ట్రియాలోని సాల్జ్బర్గ్ రాష్ట్రంలోనిది. వేసవి ప్రవేశించే సమయంలో వాటికి ఇలా శుభ్రంగా బొచ్చు గొరిగేస్తారు. ఆ ఉన్నితో రకరకాల దుస్తులు తయారవుతాయి. క్షవరం తర్వాత మెలానీ విట్టుమ్ తన వ్యవసాయ క్షేత్రంలో అల్పకాలకు ఇలా స్నానం చేయిస్తోంది. ఇక్కడ సంబంధం లేని విషయం ఒకటి. అల్పకాలు చాలా శుభ్రంగా ఉంటాయి. ఒకటి వేసిన పేడ మీదే అన్నీ వచ్చి వరుసగా వేస్తాయి. తప్పిపోతే బాగుండు! ఏ చిక్కూలేకపోతే జీవితంలోని మజా అర్థంకాదు. చిక్కుపడాలి, దాని ముడి విప్పాలి. అప్పుడుగానీ బతికిన అనుభూతి గాఢంగా పెనవేసుకోదు. అది అర్థం చేయించడానికే కాబోలు ఈ ప్రహేళికా నిర్మాణాలు! అమెరికాలోని ‘నేషనల్ బిల్డింగ్ మ్యూజియం’లోని ‘మేజ్’ ఇది. రాజధాని నగరం వాషింగ్టన్ డి.సి.లో ఉంది. ఇందులో సందర్శకులు తప్పిపోతూ సంబరపడిపోతుంటారు. బయటపడ్డాక మరింత సంబరపడతారు. -
ఎంత ఎదిగిపోయిందో..!
ఈ చిత్రం చూస్తుంటే పాలసముద్రంలో తేలియాడుతున్న కొండ అనిపిస్తోంది కదూ? పైన ఉన్నది కొండే.. కానీ కిందనున్నవి పాలు కాదు.. ట! ఔను.. నిజ్జంగా నిజం. ఏకంగా మేఘాలను సైతం దాటేసి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన ఈ పర్వతం పేరు మౌంట్ రోరైమా. దక్షిణ అమెరికాలోని పకరైమా పర్వత శ్రేణుల్లో ఉన్న అతి ఎత్తై కొండ ఇదే. అంతేకాదు.. ఈ భూమ్మీద సహజసిద్ధంగా ఏర్పడిన అత్యంత ప్రాచీనమైన భౌగోళిక నిర్మాణాల్లో ఇది కూడా ఒకటి. ఈ పర్వతం దాదాపు 200 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి ఉంటుందని అంచనా. -
జూలో కొత్త అతిథుల సందడి
బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో రెడ్ ఆండ్రేడ్ టమారీన్ (గోల్డెన్) కోతులు సందడి చేస్తున్నాయి. ఇవి చైన్నై నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం జూకు చేరుకున్నాయని జూ క్యూరేటర్ బిఎన్ఎన్. మూర్తి తెలిపారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వీటిని జూకు బహుమతిగా అందజేసిందన్నారు. కొలంబియా, సౌత్ అమెరికా, ఆమెజాన్ ప్రాంతాలకు చెందిన ఈ అరుదైన కోతులు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ దత్తత తీసుకొని జూకు బహుమతిగా అందజేసిందన్నారు. వీటిని వారం రోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి సందర్శనార్ధం ఎన్క్లోజర్లలో ఉంచుతామన్నారు. అతి తక్కువ బరువు (250 గ్రాములు) గల ఈ కోతులకు పిగ్టెల్ మాకాక్ (పందితోక కోతులు) ఎన్క్లోజర్లోనే వీటిని ఉంచుతామన్నారు. జూకు చేరుకున్న ఈ కోతుల్లో మగది 4 ఏళ్లు, అడవి 3 ఏళ్ల వయస్సు గలవి. వీటి జీవిత కాలం 20 ఏళ్లు. ఇవి ఎక్కువగా గుంపులుగా ఉండేందుకు ఇష్టపడుతాయన్నారు. ఈ కోతులకు పండ్లు, చిన్న చిన్న కీటికాలు, మొలకెత్తిన విత్తనాలు ఆహారమన్నారు. జూలో వీటికి మొలకెత్తిన విత్తనాలు, పండ్లతో పాటు సెర్లాక్స్ను కూడా అందిస్తామన్నారు. జూకు మరిన్ని కొత్త వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
ప్రాణాలు ఇస్తారు, తీస్తారు..!
ఫుట్బాల్ అంటే ప్రాణం ఇచ్చే అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటుంది. ఆట కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. అవసరమైతే ఫుట్బాల్ కోసం ప్రాణం ఇస్తారు. తిక్కపుడితే ప్రాణాలు తీస్తారు కూడా... ముఖ్యంగా యూరప్, దక్షిణ అమెరికా ఖండాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఫుట్బాల్పై అభిమానం దురభిమానంగా మారిన సందర్భాలు అనేకం. ఎస్కోడార్ కాల్చివేత... ఫిఫా 2014 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో బ్రెజిల్ ప్లేయర్ మార్సెలో చేసిన సెల్ఫ్ గోల్ గుర్తుందా.. సరిగ్గా 20 ఏళ్ల కిందట 1994లో అమెరికా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్లో కొలంబియా ప్రముఖ ఆటగాడు ఆండ్రెస్ ఎస్కోబార్ అచ్చం ఇలాగే సెల్ఫ్ గోల్ చేశాడు. పొరపాటున చేసిన ఈ గోల్ చివరికి అతని ప్రాణాలనే బలిగొంది. ఆ గోల్ వల్లే తమ జట్టు ప్రపంచకప్ నుంచి ఇంటిదారి పట్టినందుకు కొలంబియా అభిమా నులు కొందరు తీవ్ర ఆ వేదనకు లోనయ్యారు. అంతే ఎస్కో బార్ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమ ర్శలు చేశారు. అయితే అమెరికా నుంచి తిరి గొచ్చిన రెండు రోజులకే ఎస్కోబార్ను మెడెలిన్లోని ఓ రెస్టారెంట్ దగ్గర సాకర్ అభి మానులు కాల్చి చంపారు. తాను పొరపాటున సెల్ఫ్ గోల్ చేశానని చెప్పినా వారు వినలేదు. దీంతో కొలంబియా ఓ అద్భుత ఆటగాడిని కోల్పోయింది. అయితే సాకర్పై అభిమానం ఆటగాళ్ల హత్యకు దారి తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నెల్సన్ రివేరా (సాల్వడార్), ఒరేన్ సింప్సన్ (జమైకా) ఇలా పలువురు ఆటగాళ్లు దురాభిమానానికి బలైన వాళ్లే. అభిమానుల ఆగ్రహం కట్టలు తెగితే... ఓ ఆటగాడి అద్భుతమైన ప్రదర్శన కారణంగా ప్రత్య ర్థులకు ఏదైనా నష్టం జరగడం వల్లనో, లేదంటే ఆటగాడి పేలవ ప్రదర్శన కారణంగా తమ జట్టు ఓడి పోవడం వల్లనో అభి మానులు కోపోద్రిక్తులైన ఘటనలు కోకొల్లలు. క్లబ్ మ్యాచ్ దగ్గరి నుంచి ప్రపంచకప్ వరకు కొన్ని సందర్భాల్లో అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు. కొన్నిసార్లు అభి మానులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. రెండేళ్ల కిందట ఈజిప్ట్లో అల్ అహ్లి-అల్ మస్రీ అనే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 70 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. మస్రీ జట్టు 3-1తో తమ జట్టు అహ్లిపై విజయం సాధించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అంతే స్టేడియంలో బీభత్సం సృష్టించారు. రెండు జట్ల అభిమానులు మారణా యుధాలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీనికి తోడు తొక్కిసలాట కూడా జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైన 21 మంది సాకర్ అభిమానులకు అక్కడి కోర్టు మరణశిక్ష విధించింది. 2003లో పొలాండ్లో జరిగిన ఓ సాకర్ మ్యాచ్లో ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. 1974లో టోటెన్ హాట్స్పూర్-ఫెయెనూర్డ్ మధ్య జరిగిన యూఈఎఫ్ఏ కప్ ఫైనల్ మ్యాచ్లో...1985 యూరోపియన్ కప్ ఫైనల్లో లివర్పూల్-జువెంటస్ మధ్య జరిగిన మ్యాచ్లో... 1985లో బర్మింగ్ హామ్-లీడ్స్ మధ్య జరిగిన ఈపీఎల్ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన అభిమానులు దాడులు చేసుకున్నారు. ఒకరినొకరు గాయపర్చుకున్నారు. రిఫరీలూ బలయ్యారు ఫుట్బాల్లో రిఫరీల పాత్ర కీలకం. ఒక రకంగా మైదానంలో వాళ్లు చెప్పిందే వేదం. అయితే రిఫరీలు కూడా అప్పుడప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసు కుంటారు. వాళ్లు తీసుకున్న నిర్ణయాలు ఆటగాళ్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది రిఫరీల ప్రాణాలను కూడా తీసింది. గత ఏడాది అమెరికా ఉతా రాష్ట్రంలోని సాల్ట్లేక్ సిటీలో రికార్డో పొర్టిల్లో అనే రిఫరీకి ఓ టీనేజ్ సాకర్ ప్లేయర్ పంచ్ ఇచ్చాడు. యెల్లో కార్డ్ చూపినందుకు గట్టిగా కొట్టడంతో రిఫరీ గాయపడ్డారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చని పోయారు. 2013లో బ్రెజిల్లోని సావోపాలోలో జరిగిన ఓ సాకర్ మ్యాచ్లో రిఫరీని అభిమానులు కొట్టి చంపడమే కాకుండా.. శవా న్ని ముక్కలు ముక్కలుగా కోసి అత్యంత పాశవికంగా వ్యవహరించారు. అయితే వాళ్లు అలా వ్యవహరిం చడానికి కారణం కూడా ఉంది. మ్యాచ్ సందర్భంగా జోస్నిర్ అనే ఆటగాడిని రిఫరీ సిల్వా బహిష్కరిం చడంతో వివాదం మొదలైంది. అది కాస్తా చినికిచినికి గాలివానగా మారింది. దీంతో ఆగ్రహోదిక్తుడైన రిఫరీ కత్తితో ఆటగాడిని పొడిచాడు. జోస్నిర్ ఆస్పత్రిలో మరణించాడు. దీనికి ప్రతీకారంగా రిఫరీపై ఇలా దాడులకు దిగారు. -
యంగ్ పికాసో!
జార్జ్ పొచెస్తోవ్ పదకొండు నెలల వయసులో ఉన్నప్పుడు వాళ్ల నాన్న బ్రెయిన్ కాన్సర్తో చనిపోయాడు. చావు గురించి జార్జ్కు తెలిసే వయసేమీ కాదు అది. కానీ, ఆ చిట్టి కళ్లు తండ్రి కోసం వెదుకుతున్నట్లు తల్లి కనిపెట్టింది. పిల్లాడిని దారి మళ్లించడానికి అన్నట్లు అతని ముందు పెయింటింగ్ సామాగ్రి ముందు పెట్టేది. వాటితో తనకు తోచిన గీతలేవో గీసేవాడు జార్జ్. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉక్రెయిన్ దంపతులకు జన్మించిన జార్జ్ పదిహేడు సంవత్సరాల వయసులో కారు బొమ్మను అద్భుతంగా గీశాడు. వయసుతో పాటు అతనిలో చిత్రకళా ప్రతిభ పెరగడం ప్రారంభమైంది. బ్రైట్ కలర్ స్కీమ్లతో రకరకాల ప్రయోగాలు చేశాడు. గురువంటూ ఎవరూ లేకపోయినా చిత్రకళను తనకు తానే స్వయంగా నేర్చుకున్నాడు. జార్జ్ గీసిన చిత్రాలకు బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. త్రీ-డైమన్షల్ కాన్వాస్ మీద దృష్టి పెట్టినా, ఇ్రంపెషనిస్టిక్ ఆర్ట్ మీద దృష్టి పెట్టినా...తనదైన శైలిని ఎప్పుడు కోల్పోలేదు జార్జ్. హిల్లరీ క్లింటన్ నుంచి మైఖెల్ జోర్డన్(ప్రముఖ బాస్కెట్బాల్ ప్లేయర్) వరకు జార్జ్కు అభిమానులు ఉన్నారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, కొరియా, దక్షిణ అమెరికా, నెదర్లాండ్స్, రష్యా, ఉక్రేయిన్లలో ఎక్కువగా జార్జ్ చిత్రాలు ప్రదర్శితమవుతుంటాయి. జార్జ్పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్కు ఎంతో ఇష్టమైన పని. ఇరవెరైండు సంవత్సరాల జార్జ్ పొచెస్తోవ్ను మీడియా ముద్దుగా ‘యంగ్ పికాసో’ అని పిలుస్తుంది. నిజానికది భారీ పొగడ్తే కావచ్చు, కానీ చిత్రకళలో జార్జ్ మెరుపులు చూస్తుంటే ఆ మాత్రమైనా అనకుంటే ఎలా అనిపిస్తుంది! జార్జ్పై ‘ఏ బ్రష్ విత్ డెస్టినీ’ అనే డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. ఇది నాలుగు ఎమ్మీ అవార్డ్లు గెలుచుకుంది. చిత్రకళ మాత్రమే కాకుండా సామాజిక సేవా సంస్థలకు సహాయపడడం అంటే కూడా జార్జ్కు ఎంతో ఇష్టమైన పని. -
ఇది అరిస్తే.. అడవి దద్దరిల్లాల్సిందే..!
అవునట. కీటకం కొంచెం కూత ఘనం అన్నట్లు.. ఇది అడవి దద్దరిల్లిపోయేంత రేంజ్లో శబ్దం చేస్తుందట! చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేసే కీచురాళ్ల గురించి తెలుసు కదా. వాటి వర్గానికి చెందినదేనట ఈ కొత్త జాతి కీటకం కూడా. అయితే ఇది మనముందుండి శబ్దం చేసినా.. మనకు అస్సలు వినపడదు లెండి. ఎందుకంటే.. దీని శబ్దం మనం వినలేనంత ఫ్రీక్వెన్సీలో ఉంటుందట మరి! మనం 20 హెర్ట్జ్ల నుంచి 20 కిలోహెర్ట్జ్ల మధ్య ఫ్రీక్వెన్సీల్లో ఉండే ధ్వనినే వినగలుగుతాం. కానీ దీని శబ్దం ఏకంగా 150 కిలోహెర్ట్జ్ల వరకూ ఉంటుందట. ఆడ కీటకాలను ఆకర్షించేందుకు మగకీటకాలు ఈ రేంజ్లో పాటలు పాడతాయని... జంతుసామ్రాజ్యంలోనే అత్యధిక ఫ్రీక్వెన్సీతో ప్రేమగీతాలు పాడేవి ఇవేనని చెబుతున్నారు. అందుకే.. ఈ జాతికి ‘సూపర్సోనస్’ అని పేరుపెట్టారు. దక్షిణ అమెరికాలోని అడవుల్లో ఈ కొత్తజాతితోపాటు మరో మూడు కొత్త రకం కీటకాలనూ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అన్నట్టూ.. ఇవి శబ్దాలు చేసేది నోటితో కాదు.. రెక్కలతో. రెక్కలు చాలా చిన్నగా ఉండటంతో ఇవి ఎక్కువగా ఎగరలేవు. కానీ.. ఒక రెక్కతో ఇంకో రెక్కపై ఉండే రంపపుపళ్ల వంటివాటిపై వేగంగా రుద్దుతూ శబ్దం చేస్తాయి. రెక్కలపై ప్రత్యేకంగా ఉండే చిన్న మద్దెలలాంటి నిర్మాణం లౌడ్స్పీకర్లా పనిచేసి శబ్దం తీవ్రతను పెంచుతుంది. ఈ ప్రత్యేకతతోనే ఇవి గబ్బిలాలు, ఇతర జీవుల నుంచీ తప్పించుకుంటాయట. -
రుతు రాగంలో అపశృతి... ఎల్నినో
ఎల్నినో అంటే: ఎల్నినోకు స్పానిష్ భాషలో అర్థం..లిటిల్బాయ్. దక్షిణ అమెరికా పశ్చిమ తీరాన (పెరూ, ఈక్వెడార్) వందల ఏళ్ల క్రితం జాలర్లు తొలిసారిగా ఎల్నినోను గుర్తించారు. దక్షిణ అమెరికా పశ్చిమ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు ఉన్నట్లుండి అసాధారణంగా పెరగడాన్ని ఎల్నినో అంటారు. సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వేడి సముద్ర గాలులు తూర్పు, మధ్య పసిఫిక్ నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు పశ్చిమ దిశగా వీస్తాయి. ఎల్నినో సమయంలో తూర్పు, మధ్య పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో అసాధారణంగా సముద్ర ఉపరితలం వేడెక్కుతుంది. ఫలితంగా పెరూ, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో విపరీత వర్షపాతం నమోదవుతుంది. దీని పర్యవసానంగా పశ్చిమ పసిఫిక్ ప్రాంతమంతా చల్లగా ఉంటూ.. భారత్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో రుతుపవనాలు బలహీన పడి వర్షపాతం తగ్గుతుంది. భారత సేద్యానికి గొడ్డలిపెట్టు: భారత వ్యవసాయరంగాన్ని స్వల్ప నుంచి తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే అంశాల్లో ఒకటి ఎల్నినో. ఈ ఏడాది ఎల్నినో ప్రభావాన్ని చవిచూసే అవకాశం ఉందని ఇప్పటికే భారత్తో పాటు ఇతర దేశాల వాతావరణ విభాగాలు నిర్ధారించాయి. జూన్-ఆగస్ట్ మధ్య కాలంలో సంభవించే ఎల్నినో ద్వారా నైరుతి రుతుపవనాలు ప్రభావితమై అల్ప వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకతకు విఘాతం వాటిల్లనుంది. అదే జరిగితే అన్నదాతలను ఆదుకునేలా కనీస మద్దతు ధరలను ప్రభుత్వం పెంచాల్సి ఉంటుంది. వరి, చక్కెర, కూరగాయలు, ఫలాల ధరలు పెరుగుతాయి. ఈ పరిణామాలు రూపాయి విలువను తగ్గించి ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలవుతాయి. ఎల్నినో సాధారణంగా 3 నుంచి 7 ఏళ్లకోసారి సంభవిస్తుంది. భారత్పై నైరుతి రుతుపవనాల కాలంలో దీని ప్రభావం ద్వారా పంటల దిగుబడి దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. 2001-2010 ఖరీఫ్ కాలంలో 2002, 2007, 2009లో ఎల్నినో దాపురించడంతో వర్షపాతం వరుసగా 19 శాతం, 13 శాతం, 23 శాతం మేరకు తగ్గింది. భారత వాతావరణ విభాగం (ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్) ప్రకారం ఈ ఏడాది ఎల్నినో సంభవిస్తే వర్షపాతం సుమారు 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఐ.ఎమ్.డి ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఎల్నినో ప్రభావం ఉంటుంది. ఆస్ట్రేలియా బ్యూరో వాతావరణ విభాగం ప్రకారం ఇది జూలైలో అభివృద్ధి చెందనుంది. ఎల్నినో ప్రభావం కనిపించిన గత పరిణామాలను పరికిస్తే... 2002, 2004, 2009లో పప్పు దినుసుల దిగుబడి వరుసగా 14,23,27 శాతం మేర క్షీణించింది. అదే విధంగా వాణిజ్య పంటైన చెరకుతోపాటు సజ్జలు, మొక్కజొన్న, రాగి పంటల దిగుబడి కూడా తగ్గింది. ఖరీఫ్ సేద్యానికి నైరుతి రుతుపవనాల వర్షపాతమే ప్రధాన ఆధారం. ఇక వర్షాదార ప్రాంతాలకైతే వేరే చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఏ విధమైన సేద్యపు నీటి సదుపాయాలు ఉండవు. ఈ ప్రాంతాల్లో పప్పు దినుసుల సాగు అధికం. జూలై- సెప్టెంబర్ కాలంలో నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆగ స్ట్లో వర్షపాతం తగ్గితే..వీటి దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. ఐఎమ్డీ అంచనా ప్రకారం ఆగస్ట్లో ఎల్నినో ప్రభావం ఉండనుంది. అంటే ప్రధాన ఆహార ధాన్యాలతోపాటు పప్పు దినుసుల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావం ద్వారా భారత్లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఇదివరకే ఎల్నినో సంభవించిన సంవత్సరాల్లో దేశ జీడీపీ కూడా తగ్గింది. ప్రస్తుతం దేశ జనాభాలో 68.9 శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. దేశ వ్యవసాయ భూ విస్తీర్ణత 56 శాతంలో వర్షాధార వ్యవసాయం కొనసాగుతోంది. కాబట్టి వ్యవసాయరంగ క్షీణత అధిక జనాభాపై ప్రభావాన్ని చూపుతుంది. ఎల్నినో ద్వారా వ్యవసాయ ఆదాయం తిరోగమిస్తే అది అనేక రంగాలపై దుష్ర్పభావం చూపుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజల కొనుగోలు సామర్థ్యం కుంటుపడుతుంది. ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాలపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. నిత్యావసర ధరలు పెరిగి దేశ ద్రవ్యోల్బణం రేటు కూడా పెరుగుతుంది. వ డ్డీ రేట్లు పెరిగి చివరకు పారిశ్రామిక ఉత్పత్తికి విఘాతం వాటిల్లుతుంది. మూడు నుంచి ఏడేళ్లకోసారి సంభవించే ఎల్నినోలతోనే ఇంతటి విపత్కర పరిణామాలు దాపురిస్తే ఏటా పునరావృతమైతే ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. ఏడింటిలో రెండు మాత్రమే: 1991 నుంచి ఇప్పటిదాకా 7 ఎల్నినో ప్రభావాలు సంభవించాయి. అయితే ఈ ఏడింటిలో కేవలం రెండు మాత్రమే తీవ్ర కరువు పరిస్థితులకు దారితీశాయి. 1994లో తలెత్తిన ఎల్నినో ధాటికి రుతుపవనాల ద్వారా 10 శాతం అధికంగానే వర్షపాతం నమోదైంది. అయితే ఈసారి వచ్చే ఎల్నినో ద్వారా రుతుపవనాలు 30 శాతం మేరకు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని క్రిసిల్ భావిస్తోంది. మూలాలెక్కడ? ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో జరిగే ఈ అసాధారణ వాతావరణ సంఘటన దాదాపు ప్రపంచంలోని అనేక దేశాలపై ఏదో ఒక రూపంలో కష్టనష్టాలకు గురిచేస్తోంది. అమెరికా తీర ప్రాంతంలో వరద లు ముంచెత్తితే, భారత్లో రుతుపవనాలకు విఘాతం కలిగిస్తూ కరువు కాటకాలకు కారణ భూతమవుతోంది. ఎల్నినోపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరుగుతున్నప్పటికీ దాని మూలాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలు ఇంకా పూర్తి స్థాయిలో సఫలీకృతులు కాలేకపోతున్నారు. అమెరికా దీనిపై సమగ్ర అధ్యయనాలను నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా కావాల్సినంత సమాచారం అందుబాటులోకి రాలేదు. భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ఈ ఎల్నినోకు కారణమా? లేదా? భూతాపం ద్వారా ఎల్నినో తీవ్రత పెరుగుతుందా? అనే విషయంలో స్పష్టతకు రాలేదు. భిన్నాభిప్రాయాలు: ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎమ్డీ అంచనాల ప్రకారం ప్రతికూలత కొంత మాత్రమే ఉండొచ్చని 96 శాతం వర్షాలు కురుస్తాయని చెబుతుండగా.. అమెరికా వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం 1997-1998 నాటి తీవ్ర ఎల్నినో ఈసారి సంభవించనుందని అంచనావేస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని అన్ని ప్రధాన వాతావరణ విభాగాలు నిర్ధారించినప్పటికీ అది ఏ స్థాయిలో ఉంటుందనే విషయమై ఏకాభిప్రాయం కనిపించడం లేదు. నైరుతి గతికి ఇవే ప్రామాణికాలు: మన దేశంపై నైరుతి రుతుపవనాల ప్రభావం ఏవిధంగా ఉంటుందనే విషయంలో నిపుణులు ప్రధానంగా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 1. ఫిబ్రవరి, మార్చి నెలలో దక్షిణ హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 2. ఫిబ్రవరి, మార్చి నెలలో తూర్పు ఆసియా దేశాల్లో నమోదైన వాతావరణ పీడనాలు . 3. జనవరిలోని వాయవ్య ఐరోపాలోని భూఉపరితల ఉష్ణోగ్రతలు 4. ఫిబ్రవరి,మార్చిలలో పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు వీటి ఆధారంగా నైరుతి రుతుపవనాల గమనం ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. ఇప్పటి వరకు అనుకూలం: ఈ ఏడాది అనుకున్నదానికంటే రెండు రోజుల ముందుగానే మే 18 నాటికే భారత ఉపఖండంలో నైరుతి జల్లులు ప్రవేశించాయి. వాటికి అనుకూలంగానే ప్రస్తుతం బంగాళాఖాతంలో విస్తరించడానికి సానుకూల వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతమంతటా విస్తరించిన తర్వాత అరేబియా సముద్రం మీదుగా నైరుతి కేరళ తీరాన్ని తాకుతుంది. వాస్తవానికి అన్ని వాతావరణ పరిస్థితులను అంచనావేస్తే భారత్ వాతావరణ శాఖ ఎల్నినో ప్రభావం ఉందని అంచనా వేసింది. కానీ దాని ప్రభావం ఉండుంటే రుతు పవనాల ఆగమనం మరింత ఆలస్యమయ్యేది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే...రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనికి శుభశకునంగానే తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని, తద్వారా రుతుపవనాల విస్తరణకు తోడ్పడుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.రుతుపవనాల విషయానికి వస్తే ఈ గాలులు దేశమంతా విస్తరించిన తర్వాతే నైరుతి ద్రోణి ఏర్పడుతుంది. ఈద్రోణికి సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, వాయుగుండాలు, తీవ్రవాయుగుండాలు తోడైతే దేశమంతా మంచివానలే కురుస్తాయి. వీటి ద్వారా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశమంతా చిరుజల్లులనుంచి భారీవర్షాల వరకు పలు దఫాలుగా కురిసే అవకాశముంది. మన రాష్ట్రానికి వస్తే: మన రాష్ట్రంలో జూన్-సెప్టెంబర్ మధ్య నైరుతి ప్రభావం అధికంగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు, కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు అధికంగా ప్రభావం చూపుతాయి. గడచిన ఐదేళ్ల వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది అంత ఎక్కువగా ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. అయితే మధ్యలో వచ్చే అల్పపీడనాలు, వానలు, రుతుపవనాల ఉపసంహరణతో వచ్చే వర్షపాతాలు, ఆ లోటును పూడుస్తాయని మొత్తంగా చూస్తే ఈ ఏడాది మంచి వానలే కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే పరిరక్షణ: పర్యావరణ దినోత్సవం... క్యోటో ప్రోటోకాల్... జీవ వైవిధ్య సదస్సు... ఓజోన్ పరిరక్షణ దినం... ఇలా నెలకోమారు ఏదో రూపంలో మన పర్యావరణాన్ని కాపాడేందుకు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా సదస్సులు, చర్చాగోష్ఠులు, మేధోమథనం లాంటివి చేపడుతున్నా మరోవైపు జరగరాని నష్టం జరుగుతూనే ఉంది. ఈ సదస్సులు చేపట్టిన నాటి నుంచి కనీసం వైపరీత్యాల పరంపరకు అడ్డుకట్ట పడడం లేదు సరికదా నష్టాల తీవ్రత రేటు పెరిగి పోతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు పెచ్చరిల్లుతున్నాయి. పర్యావరణానికి ఎనలేని విఘాతం కలిగిస్తున్నాయి. వీటిని నిషేధించాలని వేదికలపై గొంతెత్తి చాటుతున్న ఏలికలు తమ పరిపాలనలో అమలు చేయడంలో మాత్రం ఘోర వైఫల్యం మూటగట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ నిషేధం విషయంలో జపాన్, సింగపూర్ లాంటి చిన్న దేశాలను చూసి మనదేశం నేటికీ గుణపాఠం నేర్వలేకపోవడం విచారకరం. మన కృషి ఎంత? భారత్లో కూడా ఈ ఎల్నినో అంశంపై పూర్తి స్థాయిలో పరిశోధనలను నిర్వహించాలి. ప్రపంచ జల వలయంపై ప్రభావాన్ని చూపగల ఎల్నినోను తేలిగ్గా తీసుకోవడం భవిష్యత్ ఆహార భద్రతకు ముప్పుగా పరిణమిస్తుంది.దారిద్య్ర రేఖకు దిగువనున్న జనాభాకు నిరంతర ఆహారభద్రతను కల్పించాలంటే అది వ్యవసాయ దిగుబడులను పెంచడం ద్వారానే సాధ్యమవుతుంది. వరుసగా సంభవించే ఎల్నినోలతో ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతోంది. దీన్ని అధిగమించాలంటే ఎల్నినో మూలాలను వెతికి పట్టుకొని అడ్డుకట్ట వేయాలి. ఆ దిశగా మన శాస్త్రవేత్తలు ప్రగతి సాధించాలి. క్లిష్ట పరిస్థితులను తట్టుకోగలిగే వ్యవసాయ వంగడాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలి. ఎల్నినో, భూతాపం లాంటి వైపరీత్యాలను సమర్థంగా ఎదురొడ్డే సాంకేతిక పరిజ్ఞానం మన సొంతమవ్వాలి. -
చీకటి జాతులపై గూగుల్ వెలుతురు
ఇప్పటివరకూ ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతూ ఉన్న జాతుల సంఖ్య కనీసం వంద వరకూ ఉంటుందని అంచనా. ప్రత్యేకించి దక్షిణ అమెరికాలో వెలుగులోకి రాకుండా చీకటిలోనే ఉండిపోయిన జాతులు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు అంటారు. పెరూ, బ్రెజిల్ దేశాల మధ్య దట్టమైన అడవుల్లో అనేక కొండ జాతుల వాళ్లు మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతున్నారని అంచనా. ఇప్పుడు ఇలాంటి వారిని గుర్తించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు శాటిలైట్ ఫోటోలనూ, గూగుల్ మ్యాప్స్నూ ఉపయోగిస్తున్నట్టు తాజాగా అమెరికాకు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ప్రకటించారు. బ్రెజిల్, పెరూల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలిస్తున్నట్లు అధ్యయనకర్తలు వివరించారు. మిగిలిన ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా గడుపుతున్న కొన్ని జాతులనైనా దీని ద్వారా వెలుగులోకి తీసుకురాగలమని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికీ నాగరకతకు దూరంగా ఉన్న మనుషులు గూగుల్లో ఎలా కనిపిస్తారో మరి! -
చిలీ తీరంలో భారీ భూకంపం
2 మీటర్ల ఎత్తు అలలతో తీరాన్ని తాకిన సునామీ ఆరుగురి మృతి, పలు చోట్ల రోడ్లు ధ్వంసం శాంటియాగో: దక్షిణ అమెరికా దేశం చిలీకి ఉత్తరాన పసిఫిక్ మహా సముద్రంలో మంగళవారం రాత్రి 11:46 గంటలకు భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు రిక్టర్స్కేలుపై 8.2 త్రీవతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి రెండు మీటర్ల ఎత్తున సునామీ అలలు ఎగిసిపడుతూ చిలీ తీరాన్ని తాకాయి. సునామీ అలల వల్ల ఆరుగురు మరణించినట్లు చిలీ అధికారులు ప్రకటించారు. సముద్ర అలలు ఇంకా ఒక మీటరు ఎత్తున ఎగిసిపడుతున్నాయని, తీరప్రాంతంలోని సుమారు 9 లక్షల మందిని ఎత్తై, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. సుమారు రెండు నిమిషాల పాటు వచ్చిన భూకంపం వల్ల 10 గంటల తర్వాత కూడా ప్రకంపనలు వస్తున్నాయని, ఇప్పటిదాకా 17 సార్లు ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి తీరప్రాంతంలోని పలు చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగెత్తారు. పలుచోట్ల విద్యుత్ స్తంభించిపోయి అంధకారం అలుముకుంది. అయితే పెద్ద ఎత్తున ఆస్తినష్టమేమీ సంభవించలేదని విపత్తుల సహాయక సంస్థ వెల్లడించింది. ఉత్తర చిలీలోని ఇక్విక్ మైనింగ్ ఏరియాకు 86 కి.మీ. దూరంలో సముద్రంలో 10 కి.మీ. లోతులోనే భూకంప కేంద్రం ఏర్పడినట్లు యూఎస్ జియోలజికల్ సర్వే వెల్లడించింది. చిలీ తీరంలో భూకంపం వల్ల ఏర్పడిన సునామీ అలలు గురువారం జపాన్ లోని హొకైడో వద్ద తీరాన్ని తాకే అవకాశముందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా చిలీ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో 2010లో 8.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించి భారీ సునామీ విరుచుకుపడటంతో పలు పట్టణాల్లో భారీ విధ్వంసం జరిగింది. సుమారు 500 మంది మరణించగా 30 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది. -
అరణ్యం: సింహాలు దొంగతనం చేస్తాయా!
మగ సింహాలు పదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. 150 నుండి 250 కిలోల బరువుంటాయి. ఆడ సింహాలు తొమ్మిది అడుగుల వరకూ పెరుగుతాయి. 120 నుండి 200 కిలోల బరువుంటాయి! సింహం కూనను వెల్ప్ లేక లయొనెట్ అంటారు! సింహం గాండ్రింపు 8 కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది! మగ సింహం రోజుకు 7 కిలోల మాంసం తింటే, ఆడ సింహం 5 కిలోలు తింటుంది. అందుకే ఎక్కువగా జీబ్రా, జిరాఫీల్లాంటి పెద్ద జంతువులనే వేటాడతాయివి! ఇవి రోజులో పదహారు నుంచి ఇరవై గంటల పాటు విశ్రాంతి తీసుకుంటాయి. అంతేకాదు... మగ సింహాలకు వేటాడటానిక్కూడా బద్దకమే. పైగా వాటి కంటే ఆడ సింహాలే వేటలో చురుగ్గా ఉంటాయి. అందుకే ఆహార సేకరణ బాధ్యత వాటిదే. కానీ వేటాడి తెచ్చినదాన్ని ముందు మగ సింహాలు తిన్నాకే ఆడవి తింటాయి! ఆహారం దొరకనప్పుడు ఇవేం చేస్తాయో తెలుసా? చిరుతలు, హైనాలు వేటాడిన జంతువులను దొంగిలిస్తాయి! ఆడ సింహాలకు జాలి ఎక్కువ. ఒకవేళ ఏ సింహం కూన అయినా తప్పిపోయి తమ దగ్గరకు వస్తే... వాటికి కూడా తమ పిల్లలతో పాటే పాలిచ్చి పెంచుతాయి! సింహాలు నీళ్లు తాగకుండా నాలుగైదు రోజుల పాటు ఉండగలవు! సింహాల గుంపును ప్రైడ్ అంటారు. ప్రతి గుంపులో పదిహేను నుంచి నలభై వరకూ ఉంటాయి. ఆడ సింహాలు వేటకెళ్తే, మగవి పిల్లలను చూసుకుంటూ ఉంటాయి. అయితే ప్రతి సింహం రెండేళ్ల పాటు మాత్రమే తన గుంపునకు లీడర్గా ఉంటుంది. ఆ తరువాత వేరేది లీడర్ అవుతుంది! అందంగా ఉందని దగ్గరకెళ్లారో... అంతే! చూడగానే నెమలిలా అనిపిస్తుంది. కాస్త పరిశీలిస్తే కోడిలాగా కనిపిస్తుంది. కానీ ఇది నె మలి కాదు. కోడి అంతకన్నా కాదు. దీని పేరు హాట్జిన్. దక్షిణ అమెరికాలోని ఉష్ణప్రాంతాల్లో కనిపించే ఒక పక్షి! హాట్జిన్ల దగ్గరకు వెళ్తే అంతే సంగతులు. ఎందుకంటే, వాటి దగ్గర విపరీతమైన బురద వాసనలాంటిది వస్తుంది. ఆ వాసనకు కారణం... జీర్ణక్రియలోని లోపమే. హాట్జిన్లకు జీర్ణశక్తి తక్కువ. అందుకే గట్టిగా ఉండేవాటిని ముట్టుకోవు. ఆకులు, పూలు తింటాయి. ఆహారం జీర్ణమయ్యే క్రమంలో వాటి శరీరంలో ఒక రసాయనం విడుదలవుతుందట. దాని కారణంగానే ఇలాంటి వాసన వస్తుందని కనిపెట్టారు పరిశోధకులు. హాట్జిన్లు పొడవడం, రక్కడం చేయవు. కారణం వీటికి కొన్ని బలహీనతలుండటమే. ఇవి సరిగ్గా ఎగరలేవు. అన్ని రంగుల్నీ గుర్తించలేవు. నీరసంగా, డల్గా ఉంటాయి. అందుకే వీటినెవరూ పెంచుకోవడానికి ఇష్టపడరు. బ్రెజిల్లో కొన్ని చోట్ల హాట్జిన్ల గుడ్లను తింటారు. నిజానికి అవి కూడా ఒకలాంటి వాసన వస్తాయట. కానీ రుచి బాగుంటుందట. కానీ వీటి మాంసాన్ని మాత్రం ముట్టరు! -
అరణ్యం: కుందేలుకు సంతోషం కలిగితే...?
మగ కుందేళ్లను బక్స్, ఆడ కుందేళ్లను డాస్ అంటారు! కుందేళ్లు ఎలాంటి ప్రదేశంలో అయినా జీవించగలవు. గడ్డి మైదానాలు, వర్షారణ్యాలు, చివరకు ఎడారుల్లో కూడా అవి బతగ్గలవు! ఇవి పగలు కంటే రాత్రిపూట ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాయి! కుందేళ్లు సంవత్సరంలో మూడుసార్లు బిడ్డల్ని కంటాయి. వీటి పిల్లలను కిట్స్ అంటారు. పుట్టినప్పుడు వీటికి చూపు ఉండదు. ఒంటిమీద బొచ్చు కూడా ఉండదు! వీటి దృష్టికోణం 360 డిగ్రీలుగా ఉంటుంది. అందుకే ఇవి తమ వెనుక ఉన్నవాటిని కూడా తల తిప్పకుండానే చూడగలవు! కుందేళ్లకు ఇరవై ఎనిమిది పళ్లుంటాయి. ఇవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. వీటి గుండె నిమిషానికి 130 నుంచి 325 సార్లు కొట్టుకుంటుంది! వీటికి ఆనందం వస్తే నానా హంగామా చేస్తాయి. ఎగురుతాయి, ఎత్తులెక్కి దూకుతాయి, అడ్డదిడ్డంగా పరుగులు తీస్తాయి, కాళ్లు నేలకేసి టపటపా కొడుతుంటాయి! కుందేళ్లు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవు. తోడు లేకపోతే విసిగిపోతాయవి! కొన్నిసార్లు ఆహారమే కుందేళ్ల పాలిట విషమవుతూ ఉంటుంది. ఎందుకంటే, తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోతే అదే విషమై ప్రాణాలు తీస్తుంది. అందుకే గట్టిగా ఉండే ఆహారాన్ని ముట్టవు కుందేళ్లు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే గడ్డి, కూరగాయలు, పండ్లు, దుంపలు వంటి వాటినే తింటూ ఉంటాయి! మీసాలు మాకూ ఉన్నాయోచ్! పక్షులకు కూడా మీసాలుంటాయా అని ఆశ్చర్యం వేయడం లేదూ దీన్ని చూస్తుంటే! అయితే ఇవి మీసాలు కాదు... కొమ్ములు. పైగా ఒకటి, రెండు కాదు... మూడున్నాయి! అందుకే దీన్ని త్రీ వ్యాటిల్డ్ బెల్ బర్డ్ అంటారు. ఆడ బెల్ బర్డ్స్కి ఇలా కొమ్ములు ఉండవు. మగవాటికి మాత్రమే ఉంటాయి. దక్షిణ అమెరికాలో కనిపించే ఈ పక్షులు ముప్ఫై సెంటీ మీటర్ల వరకూ పెరుగుతాయి. వీటి ముక్కు చుట్టూ వచ్చే మూడు కొమ్ములు పది సెంటీ మీటర్ల వరకూ పెరుగుతాయి. సాధారణంగా ఈ కొమ్ములు కిందికి వేళ్లాడుతున్నట్టుగా ఉంటాయి. కానీ భయపడినప్పుడు, కోప్పడినప్పుడు, పాట పాడుతున్నప్పుడు నిటారుగా అవుతుంటాయి. అలాంటప్పుడు వాటి పరిమాణం కూడా కాస్త పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పక్షులన్నింటిలోకీ గట్టిగా అరవగలిగేవి ఇవే. వీటి అరుపు కిలోమీటరు దూరం వరకూ స్పష్టంగా వినిపిస్తుంది. తమ జంట విషయంలో వీటికి స్వార్థం చాలా ఎక్కువ. ఇతర మగ పక్షి కనుక తనతో జతకట్టిన ఆడపక్షి దగ్గరకు వస్తే, దాని చెవిలో గట్టిగా అరిచి వెళ్లగొట్టేస్తాయి మగ బెల్ బర్డ్స్. మనిషయినా పక్షి అయినా జెలసీ సహజమే అన్నమాట!