లక్ష్యం నెరవేరలే..!
అర్హులు అందరికీ రుణాలిస్తాం
పంట పెట్టుబడుల్లో భాగంగా పంట రుణాలకు దరఖాస్తు చేసుకునే అర్హులైన రైతులందరికి రుణాలు అందిస్తాం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం మేరకు రుణాలు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. అయితే చాలా మంది రైతులు తమ పంట రుణాలను బ్యాంకులకు వెళ్లి రెన్యువల్ చేసుకోలేదు.
– అయ్యపురెడ్డి, ఎల్డీఎం
● 2023–24లో జిల్లాకు రూ.3530.58 కోట్లు
పంట రుణ లక్ష్యం
● 53.27 శాతం మాత్రమే చేరిన వైనం
● రెన్యువల్స్ చేయించుకోని రైతులు
● రుణమాఫీ ప్రధాన కారణం గద్వాల న్యూటౌన్: 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో పంట రుణ లక్ష్యం నెరవేరలేదు. నిర్ధేశించిన లక్ష్యంలో 53.27 శాతం మాత్రమే రుణ లక్ష్యం అయ్యింది. రుణమాఫీ అవుతుందన్న ఉద్దేశ్యంతో చాలా మంది రైతులు తమ పంట రుణాలను రెన్యువల్స్ చేయించుకోలేదు. దీని ఫలితంగానే పంటరుణ లక్ష్యం నెరవేరలేదని బ్యాంకర్లు అంటున్నారు.
పంట రుణ పరిమితి మేర రుణాలు
పంటలపై ఆయా బ్యాంకులు ఆ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన పంట రుణ పరిమితి మేరకు రైతులకు రుణాలు అందిస్తాయి. ఇందులో బాగంగా ఆయా బ్యాంకుల వారీగా రెండు సీజన్లకు రుణ లక్ష్యాన్ని లీడ్ బ్యాంక్ అధికారులు నిర్ధేశిస్తారు. అయితే రైతులు సీజన్కు ముందు లేదా సీజన్ మధ్యలో పంట రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తారు. అంతకుముందు ఏడాదిలో సంబందిత రైతు తాను తీసుకున్న రుణాన్ని చెల్లించవచ్చు లేదా చెల్లించకపోయిన వడ్డీ చెల్లించి, మరో పంటను వేస్తున్నట్లు వ్యవసాయ అధికారుల దృవీకరణ పత్రాన్ని సమర్పించి లేదా తనకు ఎక్కువగా ఉన్న భూమిపై మళ్లీ రుణాన్ని తీసుకోవచ్చు. ఇలా రైతు బ్యాంకుకు వచ్చి రెన్యూవల్ చేసుకుంటేనే బ్యాంకులు పంట రుణాలు అందిస్తాయి. అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. దీంతో చాలా మంది రైతులు తమ రుణాలు మాఫీ అవుతాయన్న ఉద్ధేశ్యంతో పంట రుణాలు తీసుకోవడానికి వెళ్లలేదు. అయితే ఈ రుణమాఫీ కొంత గందరగోళానికి దారి తీసింది. చాలా మంది రైతులకు వచ్చిన మాఫీ వడ్డీకే సరిపోయింది. అదికూడా అందరికి రాలేదు. ఇదే సమయంలో ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రకటించింది. దీనివల్ల కూడా రైతులు బ్యాంకులకు వెళ్లి రెన్యూవల్ చేసుకోలేదు. పంట రుణాలను రెన్యువల్ చేసుకుంటే రుణమాఫీ కాదేమో అన్న భయం అన్నదాతలను వెంటాడింది. వీటి ఫలితంగానే 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబందించి పంట రుణాలకై బ్యాంకులకు నిర్ధేశించిన లక్ష్యం నెరవేరలేదు. ఇదిలా ఉంటే చాలా మంది రైతులు పంట పెట్టుబడులకై అధిక వడ్డీలకు ప్రైవేట్గా అప్పులు చేశారు. జిల్లా పరిస్థితి ఇలా..
నడిగడ్డ వ్యవసాయ ఆధారిత జిల్లా. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్లతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోథల పథకం, దీని కింద ఏడు రిజర్వాయర్లు, వందకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటికి అదనంగా బోర్లు, బావులు కూడా ఇక్కడి రైతులు ఏర్పాటు చేసుకున్నారు. ఏటా రెండు సీజన్లలో దాదాపు 5లక్షల ఎకరాల వరకు వివిద రకాల పంటలు సాగు చేస్తుంటారు. ఇంకా పండ్లతోటలు, కూరగాయలు పండిస్తున్నారు. అయితే జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. రైతుబంధు, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వంటి పంట పెట్టుబడుల పథకాలు కేంద్ర, రాష్ట్రాలు అమలు చేస్తున్నా, వాటితో పూర్తి పంట పెట్టుబడుల అవసరాలు తీరడం లేదు. దీంతో వీరంతా బ్యాంకులు అందించే పంట రుణాలనే పంట పెట్టుబడులుగా ఉపయోగిస్తూ, సేద్యం చేస్తున్నారు.