ఉరవకొండ: పట్టణంలో సోమవారం వైఎస్సార్ సీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి నామినేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైఎస్సార్ సీపీ నాయకులు, వైఎస్సార్ అభిమానులు పోటెత్తారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా గ్రామాల నుంచి తరలివచ్చి విశ్వకు మద్దతు తెలిపారు. మహిళలు సైతం వేలాదిగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. డీజేలు, డ్రమ్స్, వాయిద్యాలు, తప్పెట్లు, బాణాసంచా పేలుళ్ల మధ్య డ్యాన్సులు చేస్తూ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా కూడేరు సంగమేశ్వరస్వామి ఆలయం, పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి విశ్వ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను తన కుమారుడు, పార్టీ యువనేత ప్రణయ్రెడ్డి, నాయకులు ఏసీ ఎర్రిస్వామి, మూలగిరిపల్లి ఓబన్న, ఎంసీ నాగభూషణంతో కలిసి ఆర్ఓ కేతన్గార్గ్కు అందించారు. ఉరవకొండ, విడపనకల్లు, కూడేరు, వజ్రకరూరు, బెళుగుప్ప మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి ర్యాలీ చేపట్టారు. దారి పొడవునా ఉప్పొంగిన ఉత్సాహంతో వేచి చూస్తున్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కవితాహోటల్ సర్కిల్ వద్ద నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ఉరవకొండ నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందని, నిండు మనసుతో తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీంఅహ్మద్, యాదవ, రజక కార్పొరేషన్ల చైర్మన్లు హరీష్యాదవ్, మీసాల రంగన్న, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వీరన్న, ఆర్టీసీ రీజి నల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల, ఐదు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ యార్డు చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉరవకొండ వైఎస్సార్ సీపీ
అభ్యర్థిగా ‘విశ్వ’ నామినేషన్
భారీగా తరలివచ్చిన నాయకులు