రాష్ట్రస్థాయి బాలికల ఫుట్బాల్ టోర్నీ విజేత జిల్లా జట్టు
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్రస్థాయి సీనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నీ విజేతగా అనంతపురం జిల్లా జట్టు నిలిచింది. ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ సంఘం, ఏపీ ఫుట్బాల్ సంఘం(ఏపీఎఫ్ఏ) సంయుక్త ఆధ్వర్యంలో కానూరులోని అనుమోలు ప్రభాకర్ ప్లే ఫీల్డ్లో మూడురోజుల పాటు అత్యంత రసవత్తరంగా జరిగిన ఈ పోటీల్లో 12 జిల్లాల జట్లు ప్రాతినిధ్యం వహించాయి. గురువారం ఉదయం జరిగిన రెండో సెమీఫైనల్స్లో కర్నూలు జట్టును శ్రీసత్యసాయి జిల్లా జట్టు 4–5 తేడాతో ఓడించి ఫైనల్స్కు చేరింది. అనంతరం జరిగిన ఫైనల్స్లో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా జట్ల మధ్య ఆసక్తికరపోరు నడిచింది.
అనంతపురం జట్టు క్రీడాకారులు అనూష రెండు గోల్స్ చేయగా, కాంచన, నందిని చెరో గోల్ చేశారు. అనంతపురం జట్టు 4–0 తేడాతో ప్రత్యర్థి శ్రీసత్యసాయి జట్టును ఓడించి విజేతగా నిలిచింది. రన్నర్ ట్రోఫీని శ్రీసత్యసాయి జిల్లా జట్టు దక్కించుకుంది.మూడో స్థానం కోసం సెమీస్లో ఓడిన కడప, కర్నూలు జట్లు తలపడగా, కడప 2–0 తేడాతో కర్నూలు జట్టును ఓడించి మూడోస్థానంలో నిలిచింది. ఫైనల్ పోటీలను ఏపీఎఫ్ఏ కార్యదర్శి డానియేల్ ప్రదీప్ పర్యవేక్షించారు. విజేతలకు అనుమోలు ప్రభాకర్, కె.బాలకృష్ణ, ఏపీఎఫ్ఏ ఉపాధ్యక్షులు ముని శ్రీనివాసరావు, కోశాధికారి విజయ్, ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షకార్యదర్శులు శేషగిరిరావు, చక్రవర్తి ట్రోఫీలు అందజేసి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment