సాక్షి, అమరావతి: కర్నూలులోని వైఎస్సార్సీపీ కార్యాలయ భవనం కూల్చివేతకు కర్నూలు మునిసిపల్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఆ భవనం నిర్మాణానికి సంబంధించిన వివరాలు, ఆ పార్టీ వర్గాలు సమర్పించే అదనపు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, విచారణ జరిపిన తరువాతే చట్ట ప్రకారం 8 వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని, అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ కార్యాలయం భవనం కూల్చివేతకు మునిసిపల్ కమిషనర్ ఈ నెల 7న జారీ చేసిన కన్ఫర్మేషన్ ఆర్డర్ను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, కర్నూలు జిల్లా కమిటీ అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కృష్ణమోహన్ గురువారం విచారణ జరిపారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యాలయ భవనాల విషయంలో గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మునిసిపల్ అధికారుల నోటీసుకు సమగ్ర వివరాలతో వివరణ ఇచ్చామని చెప్పారు. అయినప్పటికీ దానిని పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండా భవనం కూల్చివేతకు కన్ఫర్మేషన్ ఆర్డర్ జారీ చేశారని తెలిపారు.
అధికారులు లేవనెత్తిన ప్రతి అభ్యంతరానికీ సమాధానం ఇచ్చామని, ఒక్క దాన్ని కూడా కనీస స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని, సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని అన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, మునిసిపల్ కమిషనర్ జారీ చేసిన కన్ఫర్మేషన్ ఆర్డర్ను రద్దు చేశారు. 2 వారాల్లో అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశిస్తూ పిటిషన్ను పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment