దారిద్య్రాలను పారదోలే వీరలక్ష్మిగా.. | - | Sakshi
Sakshi News home page

దారిద్య్రాలను పారదోలే వీరలక్ష్మిగా..

Published Sat, Oct 12 2024 12:18 PM | Last Updated on Sat, Oct 12 2024 12:18 PM

దారిద్య్రాలను పారదోలే వీరలక్ష్మిగా..

● వీరలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చిన మహాలక్ష్మి ● నేడు నిజరూప దర్శనంలో అమ్మవారు ● దసరా మండపంలో శ్రీరామ లీలా మహోత్సవం

భద్రాచలం: ముగ్గురమ్మల శక్తి స్వరూపిణీ, దారిద్య్రాలన్నింటిని పారదోలే వీరలక్ష్మిగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్కరించారు. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు శుక్రవారం వీరలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం చివరిగా అమ్మవారు నిజరూపంగా శ్రీ మహాలక్ష్మి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీంతో శరన్నవరాత్రి అలంకరణలు పూర్తి కానున్నాయి. విజయదశమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దసరా మండపంలో శమీ, ఆయుధ పూజలతో పాటు రావణాసుర వధగా పేర్కొనే శ్రీరామ లీలా మహోత్సవం జరుగుతుంది. సెలవులు కావడంతో రామాలయంలో భక్తుల సందడి నెలకొంది.

రామదాసు కాలం నుంచి ఆనవాయితీ

భక్తరామదాసు నిర్మించిన దసరా మండపంలో విజయదశమి వేడుకలను నిర్వహించటం రామదాసు కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. కొన్ని పురాణాల ప్రకారం రామచంద్రమూర్తి రావణాసురుడిపైన విజయం సాధించింది విజయదశమి రోజునే అని వేదపండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాదిన ప్రముఖంగా నిర్వహించే రావణాసుర వధ శ్రీరామ లీలా మహోత్సవం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో నిర్వహిస్తున్నారు. శ్రీరామాయణ పారాయణం అనంతరం ఉదయం రామయ్యకు పట్టాభిషేక మహోత్సవాన్ని జరుపుతారు. దసరా మండపంలో విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనం, శమీ వృక్షం వద్ద ఆయుధ పూజలు నిర్వహిస్తారు. శమీ పత్రాలతో పూజలు అనంతరం భక్తులు శమీ ఆకులను తలలపై చల్లుకుంటారు. జమ్మి ఆకులను శిరస్సులపై ధరించిన వారికి సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement