లండన్ అబ్బాయి... పాల్వంచ అమ్మాయి !
ప్రేమ బంధంతో ఒక్కటైన జంట
పాల్వంచ: ఆ యువతీ, యువకుడి పేమకు దేశాలు, మతాలు అడ్డురాలేదు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి మరీ వివాహబంధంతో వారిద్దరు ఒక్కటయ్యారు. పట్టణంలోని ఒడ్డుగూడేనికి చెందిన షేక్ మౌలా సాహేబ్–ఖాజాబీ కుమార్తె షేక్ షహనాజ్ ఉన్నత చదువుల నిమిత్తం లండన్ వెళ్లింది. అక్కడ నియాల్ హట్టన్తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలకు చెప్పారు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో పాల్వంచలో శుక్రవారం వివాహ వేడుక నిర్వహించారు. కాగా, ఈ వివాహానికి నియాల్ హట్టన్ కుటుంబీకులు, బంధువులు పలువురు హాజరవడంతో సందడి నెలకొంది.
పర్యావరణానికి హాని కల్గించొద్దు..
టేకులపల్లి: అడవికి నిప్పు పెట్టి పర్యావరణానికి హాని కలిగించొద్దని, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని డీఎఫ్ఓ జి.కృష్ణగౌడ్ అన్నారు. టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామంలో గత రెండు రోజుల పాటు నిర్వహించిన ఫైర్ అవేర్నెస్, ఫైర్ ఫైటర్స్ వాలీబాల్ కప్ పోటీలు శుక్రవారం ముగియగా.. ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. అడవులను అగ్ని ప్రమాదాల నుంచి కాపాడాలని, వన్యప్రాణులను రక్షించాలని, వన్యప్రాణులను వేటాడటం చట్ట ప్రకారం నేరమన్నారు. అనంతరం వాలీబాల్ క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఎఫ్ కోటేశ్వర్రావు, డిప్యూటీ సీఎఫ్ఎఫ్డీలో కె.దామోదర్రెడ్డి, ఎఫ్ఆర్ఓ ముఖ్తార్హుస్సేన్ పాల్గొన్నారు.
ఉత్సాహంగా
బ్యాడ్మింటన్ టోర్నీ..
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం పట్టణ పరిధిలోని హనుమాన్బస్తీలో గల బ్యాడ్మింటన్ ఇండోర్లో స్టేడియంలో ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ గుజ్జుల సుధాకర్రెడ్డి జ్ఞాపకార్థం సుధాకర్రెడ్డి మెమోరియల్ పేరిట నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ శుక్రవారం రెండు రోజుకు చేరుకుంది. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. మహిళలు, పురుషుల విభాగంలో ఈ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ కె.సావిత్రి, ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ యుగేంధర్రెడ్డి, సెక్రటరీ ఆర్.రాజేందర్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంటూరి రవికుమార్, ట్రెజరర్ కె.రమేష్, రాజ్కుమార్, వెంకటేశ్వర్లు, గిరి పాల్గొన్నారు.
ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణానికి చెందిన ఓ యువతిని స్థానిక మెడికల్ కాలనీకి చెందిన భరణి వెంకటకార్తీక్ అనే యువ న్యాయవాది పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకుని, గర్భవతి అని తెలిసి దూరం పెట్టాడు. దీంతో బాధితురాలు పెద్ద మనుషులను, పోలీసులను ఆశ్రయించగా.. వారి సమక్షంలో పెళ్లికి అంగీకరించి, మరుసటి రోజు నుంచి నిరాకరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన సదరు యువతి స్థానిక పోలీస్స్టేషన్లో కార్తీక్పై ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. దీంతో కార్తీక్ పరారీలో ఉండగా.. ముందస్తు బెయిల్ కోసం ఈ నెల 6న కార్తీక్ తరఫు న్యాయవాది క్రిష్ణ కిషోర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టు న్యాయమూర్తి చాడ విజయభాస్కర్రెడ్డి వద్ద ముద్దాయి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆతర్వాత ముద్దాయిపై నమోదైన కేసుకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని పిటిషన్ను డిస్మిస్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment