మాజీ మంత్రి గొల్లపల్లి ధ్వజం
మలికిపురం: వంద రోజుల కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మలికిపురంలో నియోజకవర్గ వైఎస్సార్ సీపీ యువజన విభాగ సమావేశం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సూరిశెట్టి బాబీ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. మళ్లీ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకూ అంతా కలసి సాగుదామని పిలుపునిచ్చారు. ఇసుక ఉచితం అంటూ నమ్మించి గెలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను నిలువునా ముంచారన్నారు. దొడ్డిదారిన ఇసుకను కూటమి శ్రేణులు దోచుకెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఉల్లి ధర కన్నీళ్లు రప్పిస్తుందని, ఇలా అన్ని కూరగాయల ధరల బాదుడు దారుణంగా ఉందన్నారు. సూపర్ సిక్స్ పేరిట హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక వాటిని మరిచిపోయారన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సూరిశెట్టి బాబీ, రాష్ట్ర బీసీ విభాగం నాయకులు పాటి శివకుమార్, సీనియర్ నాయకుడు కేఎస్ఎన్ రాజు, జిల్లా విద్యార్థి విభాగం వైస్ ప్రెసిడెంట్ తాడి సహాదేవ్, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు కుసుమ చంద్రశేఖర్, చెల్లింగి నవీన్, జిల్లెల్ల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment