బాధితులకు రూ. లక్ష సాయం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు రూ. లక్ష సాయం

Published Fri, Oct 18 2024 3:06 AM | Last Updated on Fri, Oct 18 2024 3:06 AM

బాధితులకు రూ. లక్ష సాయం

అమలాపురం టౌన్‌: అమలాపురం రావులచెరువు ప్రాంతంలో ఇటీవల జరిగిన బాణసంచా విస్ఫోటంలో బాధిత కుటుంబాలకు హైదరాబాద్‌కు చెందిన స్మైల్‌ ఫౌండేషన్‌ సంస్థ రూ.50 వేల సాయం అందించింది. ముమ్మిడివరం శెట్టిబలిజ సంఘం శెట్టిబలిజ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ సంస్థ రూ.50 వేలు సమకూర్చింది. బాధిత కుటుంబాలకు మొత్తం రూ.లక్ష నగదును నాయకులు గురువారం అందజేశారు. ఇందులో స్మైల్‌ ఫౌండేషన్‌ సభ్యులు విస్ఫోట ఘటనలో గాయపడిన గొవ్వాల రాజుకు రూ.30 వేలు, ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన సుభద్రమ్మకు రూ.20 వేలు అందజేశారు. ముమ్మిడివరం శెట్టిబలిజ సంఘం వారు ఆ రెండు బాధిత కుటుంబాలకు చెరో రూ.25 వేల చొప్పున సాయం సమకూర్చారు. శెట్టిబలిజ సంఘాల నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, విత్తనాల శేఖర్‌, సంసాని బులినాని, గొవ్వాల రాజేష్‌, దొంగ చిన్నా, దొమ్మేటి రాము తదితరులు పాల్గొన్నారు.

జ్వరాలతో ప్రజలు సతమతం

అమలాపురం టౌన్‌: ఇటీవల వచ్చిన వరదలు, ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ప్రజలు చికెన్‌ గున్యా, డెంగీతో పాటు పలు వైరల్‌ జ్వరాలతో బాధ పడుతున్నారని అమలాపురానికి చెందిన వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన జిల్లా పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే జ్వరాలపై ఇంటింటా సర్వే చేయించి రోగులను గుర్తించి ప్రభుత్వ వైద్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సక్రమంగా అందక, ప్రైవేట్‌ ఆస్పత్రులో బిల్లుల భారం భరించలేక సామాన్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో వైద్య సిబ్బంది ఇంటింటా సర్వేలు తరచూ చేసి ప్రజారోగ్యం కాపాడిందని గుర్తు చేశారు. పార్టీ జిల్లా నాయకులు పొలమూరి రామకృష్ణ, కుడుపూడి గోపాలకృష్ణ, పితాని బేబీరావు, కొనుకు వెంకటేశ్వరరావు, కముజు సుందరరావు, కేతా సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement