అన్నవరం: సత్యదేవుని ఆలయ చరిత్రలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సత్యదేవుని ఆలయం ముందు స్వర్ణ ధ్వజస్తంభం, జాతీయ రహదారిపై విశాఖపట్నం – విజయవాడ మార్గంలో డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మించిన నమూ నా ఆలయంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖరంపై కలశ ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవారం ఉదయం 10.48 గంటల సుమూహూర్తంలో వైభవంగా నిర్వహించారు.
ధ్వజస్తంభం ప్రతిష్ఠించారిలా..
రత్నగిరిపై స్వామివారి ఆలయంలోని అనివేటి మండపంలో ఉన్న ధ్వజస్తంభానికి ఉదయం 9 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, నెల్లూరుకు చెందిన దాత దంపతులు, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.రామచంద్ర మోహన్ దంపతులు, భక్తులు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం తవ్విన గొయ్యిలో నవధాన్యాలు, నవరత్నాలు, పంచలోహాలు, నవపాషాణాలు వేసి, పూజలు చేశారు. భక్తులు కూడా వివిధ నాణేలు, నవరత్నాలు సమర్పించారు. భక్తులు జై సత్యదేవ అని భక్తిపారవశ్యంతో నినాదాలు చేస్తూండగా ధ్వజస్తంభాన్ని లాంఛనంగా క్రేన్ సహకారంతో ఆ గోతిలోకి దించి నిలబెట్టారు. ఇదే ముహూర్తానికి జాతీయ రహదారిపై నిర్మించిన నమూనా ఆలయంలో కూడా కలశ ప్రతిష్ఠ, సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు.