జూబ్లీహిల్స్‌ రూట్‌ మారిన 47వై/ఎం బస్సులు | - | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌ రూట్‌ మారిన 47వై/ఎం బస్సులు

Published Sat, May 6 2023 5:24 AM | Last Updated on Sat, May 6 2023 5:24 AM

- - Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 78లో రోడ్డు ఇరుకుగా ఉండటంతో సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తుండటం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోతూ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఫిలించాంబర్‌ నుంచి షేక్‌పేట ఓల్డ్‌ ముంబయి వరకు రూ. 1.15 కోట్లతో అన్ని హంగులతో రోడ్డును విస్తరించినా ఆర్టీసీ బస్సులు వినియోగించుకోవడం లేదని దీని వల్ల రోడ్‌ నెం 78పై భారం పడుతున్నదని ట్రాఫిక్‌ ఇక్కట్లు పెరిగిపోతున్నాయని సమస్యలు ‘సాక్షి’ కళ్లకు కట్టింది. ఇందుకు ఆర్టీసీ అధికారులు స్పందించారు. విస్తరించినా... వినియోగించని శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించారు. కంటోన్మెంట్‌ డిపో మేనేజర్‌ ఎల్‌.రాంమోహన్‌ ఈ మేరకు రాణిగంజ్‌ డిపోకు చెందిన 47వై/ఎం రూట్‌ బస్సులను గురువారం నుంచి రూట్‌ మారుస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ బస్సులన్నీ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 78 నుంచి కాకుండా ఫిలింనగర్‌ కొత్త చెరువు మీదుగా షేక్‌పేట ఓల్డ్‌ ముంబయి రోడ్డు మీదుగా మణికొండ, నార్సింగ్‌, మంచిరేవుల వైపు వెళ్లేలా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ స్పందన చూసి 47/ఎల్‌ రూట్‌ బస్సులను కూడా మారుస్తామని ఆయన వెల్లడించారు. దీని వల్ల జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 78పై ట్రాఫిక్‌ రద్దీ తగ్గడమే కాకుండా ప్రమాదాల నివారణతో పాటు బస్సులు కూడా అనుకున్న రీతిలో ప్రయాణికులకు అందుబాటులో ముందుకు సాగేలా ప్రణాళికలు రూపొందించామని డీఎం వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement