ఎర్రవల్లి: మండలంలోని కోదండాపురం గ్రామానికి సోమవారం ఐదుగురు శిక్షణ కలెక్టర్లు రానున్నట్లు ఎంపీడీఓ అజార్ మోహియుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదురోజులపాటు గ్రామంలో బస చేసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి గ్రామస్తులతో చర్చిస్తారని ఆయన చెప్పారు.
భక్తులతో కిక్కిరిసిన ఆదిశిలా క్షేత్రం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభు లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఈసందర్భంగా అర్చకులు రమేషాచారి, రవిచారి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావులచెర్వు గట్టు తిమ్మప్పస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేయడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు మధుసూదనాచారి, నాగరాజుశర్మ, చంద్రశేఖర్రావు, అరవిందరావు, ఆలయ సిబ్బంది ఉరుకుందు, రంగస్వామి, కృష్ణ, శివమ్మ, రాము, శ్రీను, చక్రి, వాల్మీకి పూజారులు పాల్గొన్నారు.
శనేశ్వరుడికి పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడికి శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెల్లవారుజాము నుంచే భక్తుల చేత తిలతైలాభిషేక, గోత్రనామార్చన వంటి పూజలు చేయించారు. అనంతరం భక్తులు శివుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు గవ్వమఠం శాంతికుమార్, ఉమామహేశ్వర్, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment