ధరూరు: సీపీఐ–ఎం జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. శనివారం ఆయన స్థానిక సీపీఎం నాయకులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలో ఈ నెల 25, 26 తేదీల్లో సీపీఎం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. రెండు రోజుల పాటు జరిగే జిల్లా మహాసభలకు పార్టీ శ్రేణులు తరలిరావాలని కోరారు. జిల్లా ఆవిర్భావం జరిగి ఎనిమిదే ఏళ్లు పూర్తయినప్పటికీ ప్రయోజనాలు ప్రజలకు చేకూరలేదన్నారు. పారిశ్రామికాభివృద్ధి కోసం భూములు సేకరించినప్పటికీ పరిశ్రమలు స్థాపించకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో అన్ని శాఖలకు పూర్తి స్థాయిలో అధికారులను నియమించకుండా ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేకుండాపోయిందని, ఫలితంగా రైతులకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందడం లేదన్నారు. మూడేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేస్తున్నామన్నారు. జిల్లా మహాసభల్లో గత పోరాటాలను సమీక్షించుకుని, భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. కార్మిక లోకం అంతా అధిక సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు నర్సింహ, దేవదాసు, నర్సింహులు, మోష, ప్రవీణ్, ఆంజనేయులు, కుర్వ ఆంజనేయులు, తిమ్మప్ప, మూకెన్న, పరుష, ముని, కుర్వ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment