బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నేటి యువత, అధ్యాపకులు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) గురించి ఆలోచించాలని జేఎన్టీయూకే ఇన్చార్జి వీసీ డాక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో శుక్రవారం సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ 4.0 అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సమాజానికి అవసరాలే ముఖ్యంగా ఉండే సాఫ్ట్వేర్ రూపొందించాలని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ద్వారా మానవునికి భవిష్యత్తులో సంభవించే ఆరోగ్య పరమైన సమస్యలు వైద్యులు గుర్తిస్తారన్నారు. ప్రస్తుత యువత సీఎస్ఈ వైపే మొగ్గు చూపుతున్నారని, వర్క్షాపునకు ఆఫ్ స్కిల్ సహకారం అందించడం సంతోషమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యపై అధిక దృష్టి కేంద్రీకరించి వినూత్న కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వ్యవస్ధాపకులుగా, వినూత్న అవిష్కరణలు చేపట్టే సమయంలో ఎదురయ్యే సవాళ్లను నిబద్ధతతో ఎదుర్కొని విజయం సాధించాలన్నారు. రెక్టార్ కేవీ రమణ మాట్లాడుతూ విద్యార్థి దశలో లభించే అవకాశాల గురించి యువతకు తెలియదని, అవకాశాలు అందిపుచ్చుకుంటే విజయం దానంతట అదే వస్తుందన్నారు. పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులు ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి వినూత్న ఆవిష్కరణలు, పరిశోధనలు చేపట్టేందుకు ఆసక్తి కనబరచాలన్నారు. రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, రిసోర్స్పర్సన్ మురళీకృష్ణ, ప్రిన్సిపాల్ మోహనరావు, సీఎస్ఈ ఇన్చార్జి విభాగాధిపతి కరుణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment