సాక్షి, కామారెడ్డి: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఇన్చార్జి చైర్మన్గా బీబీపేటకు చెందిన డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఏదుల ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు నిజామాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీఎంఎస్ చైర్మన్గా ఉన్న సంబారి మోహన్ తన పదవికి రాజీనామా చేయడంతో ఇన్చార్జి చైర్మన్గా ఇంద్రసేనారెడ్డిని నియమించారు.
లైఫ్ సర్టిఫికెట్
సమర్పించాలి
కామారెడ్డి క్రైం: ఇప్పటివరకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పింఛను పొందుతున్న వృద్ధ కళాకారులు ఈనెల 25వ తేదీలోగా సర్టి ఫికెట్ అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కలెక్టరేట్లోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
గ్రూప్ 1, 2లలో దివ్యాంగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
కామారెడ్డి అర్బన్: గ్రూప్ 1, 2 పరీక్షలకు సిద్ధమయ్యే దివ్యాంగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు దివ్యాంగ సంక్షేమ అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇచ్చే ఈ ఉచిత శిక్షణకు ఆసక్తిగల దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని 31వ నంబర్ గదిలో సంప్రదించాలని సూచించారు.
పార్టీ మారే ప్రసక్తే లేదు
● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డిరూరల్: బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన నాగిరెడ్డిపేటలో విలేకరులతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారబోనని, మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే పని చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఉద్యోగావకాశాలూ కల్పించలేదని ఆరోపించారు. ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిర్మల్రెడ్డి, ప్రతాప్రెడ్డి, సిద్దయ్య, మోతె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన పరీక్షలు
నిజామాబాద్ అర్బన్: జిల్లాలో పదో తరగతి లోపు విద్యార్థులకు 15వ తేదీన ప్రారంభమై న సమ్మెటివ్–2 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మంగళవారం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నారు. బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు బుధవారం నుంచి జూన్ 11వ తేదీ వరకు కొనసాగుతాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.