కరీంనగర్: పెండింగ్లో ఉన్న 5 డీఏలలో కనీసం మూడింటిని విడుదల చేసి, పీఆర్సీ అమలు చేయాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల తిరుపతి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం కరీంనగర్లోని కుమార్వాడీ హైస్కూల్లో డీటీఎఫ్ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం రెండో పీఆర్సీ వేసినప్పటికీ కేవలం 5 శాతం మధ్యంతర భృతితో సరిపెట్టిందని తెలిపారు. కరీంనగర్ అర్బన్ మండలంలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎస్జీటీలు లేరని, ఫలితంగా నాణ్యమైన విద్యనందించడం సాధ్యపడదని పేర్కొన్నారు. ప్రభుత్వం డీఎస్సీ నియామకాలు పూర్తి చేసి, టీచర్ల కొరత తీర్చాల్సి ఉండగా అసంబద్ధమైన జీవో 25 విడుదల చేసి, విద్యార్థుల సంఖ్యతో పోస్టులను నిర్ణయించడం సరికాదన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యదర్శి ఎ.దామోదర్ మాట్లాడుతూ.. ఇ–కుబేర్లో పెండింగ్ ఉన్న అన్ని రకాల బిల్లులను విడుదల చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి చెకినాల రామ్మోహన్ మాట్లాడుతూ.. అర్హత గల స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment