కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో పెండింగ్లో ఉన్న సమీకృత మార్కెట్, అమృత వర్షిణి నిర్మాణాలకు నిధులు విడుదల చేసి, పనులు త్వరగా పూర్తిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. శనివారం కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి, ముఖ్యమంత్రి హామీ పథకం నిధులతో నగరంలో సమీకృత మార్కెట్ నిర్మాణాలు చేపట్టామని, ప్రభుత్వం మారడంతో నిధుల లేమితో పనులు నిలిచిపోయినట్లు తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాల ఆవరణలో ఆధునిక కళాభవనం అమృతవర్షిణి నిర్మాణం చేపట్టినట్లు గుర్తుచేశారు. నిధులు లేక ఈ నిర్మాణం కూడా నిలిచిపోయిందన్నారు. అవసరమైన నిధులు వెంటనే విడుదల చేసి, పనులు పూర్తిచేయాలని ఆయన కోరారు. కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనెంబర్ 272 ప్రభుత్వ భూమిలో మూడు దశాబ్దాల క్రితం ఎస్సీ, బీసీ నిరుపేద కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇచ్చారని, ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జంగిలి సాగర్, దిండిగాల మహేశ్, జెడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు జమీలొద్దిన్, తుల బాలయ్య, నక్క కృష్ణ, కోల సంపత్, దావ కమల మనోహర్, కర్ర సూర్యశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment