మైసూరు: మైసూరు– బెంగళూరు జాతీయ రహదారిలో ఒకే నెలలో భారీగా ట్రాఫిక్ చలానాలు విధించారు. నెలరోజుల్లో మొత్తం రూ. 9 కోట్ల జరిమానా విధించారు. ఐటీఎంఎస్ కెమెరాల్లో నమోదైన ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆయా వాహనదారులకు సుమారు రూ. 8.99 కోట్ల జరిమానా విధించారు. జూన్ 1 నుంచి అదే నెల 30 వరకు 1,61,491 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు వచ్చాయి. ఇందులో కారులో సీటు బెల్ట్ పెట్టుకోని కేసులే అధికంగా ఉన్నాయి.
పసికందు మృతిపై నిరసన
యశవంతపుర: వైద్యుల నిర్లక్ష్యం వల్ల 7 నెలల శిశువు మృతి చెందిన ఘటన బెళగావి జిల్లా గోకాక్లో జరిగింది. గోకాక్ పట్టణానికి చెందిన డాక్టర్ మహంతేశ్ కడాడి ఆస్పత్రిని నడుపుతున్నారు. శివానంద నింగప్ప తమ చిన్నారికి అనారోగ్యంగా ఉండడంతో నాలుగు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మంగళవారం మధ్యరాత్రి పసికందు ఆరోగ్యం విషమించింది. దీనితో వైద్యులు మరో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. తల్లిదండ్రులు అంత రాత్రి సమయంలో నానాపాట్లు పడి ఒక అంబులెన్స్ తీసుకొచ్చేలోపు శిశువు ప్రాణాలు వదిలింది. దీనితో ఆక్రోశానికి గురైన బంధువులు దాడికి దిగి ఆస్పత్రి కుర్చీలను ధ్వంసం చేశారు. డాక్టర్ మహంతేశ్ను నిలదీశారు. ఇంతలో పోలీసులు చేరుకుని బంధువులను అడ్డుకుని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment