మచిలీపట్నంటౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 2వ తేదీ బుధవారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ఆంధ్ర జాతీయ కళాశాలలో హెలీప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. కళాశాల బయట గతుకులుగా ఉన్న రహదారిని ప్యాచ్ వర్క్, రహదారి వెంట ఉన్న చెత్త, చెదారాలను తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజుకు సూచించారు. ఈ మార్గం ద్వారా డంపింగ్యార్డును సీఎం చంద్రబాబు పరిశీలిస్తారన్నారు. అక్కడి నుంచి మూడు స్తంభాల సెంటర్, కోనేరుసెంటర్ మీదుగా, టీటీడీ కల్యాణ మండపానికి చేరుకుంటారన్నారు. ఆంధ్రజాతీయ కళాశాలలో గడ్డిమొక్కలను తొలగించాలని, కళాశాల ఆవరణను చదును చేయాలని సూచించారు. మంత్రి వెంట జేసీ గీతాంజలిశర్మ, వీఆర్వో చంద్రశేఖరరావు, ఏఎస్పీ బీవీడీ ప్రసాద్, డీఎస్పీ సుభానీ తదితర అధికారులు ఉన్నారు.
ముమ్మరంగా పనులు..
సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు కావటంతో ఆంధ్రజాతీయ కళాశాల నుంచి డంపింగ్యార్డుకు వెళ్లే రోడ్డు గతుకులను మరమ్మతులు చేస్తున్నారు. అలాగే నగరంలోని పలు వార్డుల నుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించి కళాశాల ప్రాంతంతో పాటు ప్రధాన రహదారులు, టీటీడీ కల్యాణ మండపం ప్రాంతంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఏజే కళాశాలకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment