మెదక్ మున్సిపాలిటీ: మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం వాడీవేడిగా జరిగింది. రూ. రెండు లక్షలు విలువ చేసే మోటార్కు రూ. 4 లక్షలు ఎలా ఖర్చు చేస్తారని అధికారులను కౌన్సిల్ సభ్యులు నిలదీశారు. వారం రోజులుగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో నీరు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. స్పందించిన మున్సిపల్ డీఈఈ మహేష్ పంపుహౌస్ వద్ద నీటిని సరఫరా చేసే మోటార్ కాలిపోయినట్లు తెలిపారు. గత నెలలో రూ.50 వేలు పెట్టి మరమ్మతులు చేయించారు కదా? మళ్లీ ఈనెల మరో లక్ష రూపాయలు ఎందుకు ఖర్చు చేశారని మున్సిపల్ వైస్చైర్మన్ మల్లికార్జున్గౌడ్ ప్రశ్నించారు. బతుకమ్మ ఉత్సవాలకు పట్టణంలో విద్యుత్ దీపాల కోసం రూ. లక్షలు ఖర్చు చేసి ఎందుకు అద్దెకు తెస్తున్నారు. ఆ డబ్బులతో కొత్తవి కొనుగోలు చేయవచ్చు కదా అన్నారు. అంతకు ముందు మెదక్ తహసీల్దార్ లక్ష్మణ్బాబుకు కౌన్సిలర్లు రెవెన్యూ సమస్యలు విన్నవించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ.. పట్టణానికి నీరందించే పంప్హౌస్ వద్ద జేసీబీలతో ఇష్టానుసారంగా ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు. సమావేశంలో కౌ న్సిలర్లు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment