నాగర్కర్నూల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ మల్లురవి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సందేశానికి మల్లురవితోపాటు కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు సీతారామారావు, దేవసహాయం, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, డీఎఫ్ఓ రోహిత్ గోపిడి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లురవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా అభివృద్ధి కోసం అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. దిశ సమావేశం ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని, ఈ మేరకు అధికారులు ప్రణాళిక రూపొందించుకొని తదుపరి సమావేశంలో సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించారు. నాగర్కర్నూల్ను దేశంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. అంతకు ముందు బ్యాంకు అధికారులతో మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగియడానికి గడువు సమీపిస్తున్నందున లక్ష్య సాధనలో వెనకబడిన బ్యాంక్ ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని పూర్తిచేసేలా చూడాలన్నారు. అయితే సమగ్ర సమాచారం లేకుండా బ్యాంకర్లు సమావేశానికి హాజరుకావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్య, వ్యవసాయం, జిల్లా శిశు సంక్షేమం, డీఆర్డీఓ, తపాలా, పౌరసరఫరాలు, మిషన్ భగీరథ తదితర శాఖలపై సమీక్ష నిర్వహించారు. తదుపరి దిశా కమిటీ సమావేశానికి అన్ని ప్రణాళికలు, నివేదికలతో రావాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు తమ శాఖలోని వివిధ సమస్యలు, నివేదికలను సిద్ధం చేసి తమ దృష్టికి తేవాలని సూచించారు. అనంతరం అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను ఎంపీ దృష్టికి తెచ్చారు. సమావేశంలో డీఆర్డీఓ చిన్న ఓబులేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లోని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మల్లురవి, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్ దేవసహాయం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
దిశ కమిటీ సమావేశంలో ఎంపీ మల్లురవి
Comments
Please login to add a commentAdd a comment