దేవరకొండ: బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డుపై నిలిపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టి మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి దేవరకొండ మండల పరిధిలోని బొల్లిగుట్టతండా సమీపంలో జరిగింది. సీఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం గిరిజానగర్తండాకు చెందిన ఇస్లావత్ నరేష్(21), సబావత్తండాకు చెందిన రాహుల్(18) డీజే ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. ఆదివారం డిండి మండలంలో ఓ శుభకార్యానికి డీజే తీసుకెళ్లారు. శుభకార్యం పూర్తయిన తర్వాత వారిద్దరు బైక్పై తూర్పుపల్లి మీదుగా స్వగ్రామాలకు వెళ్తుండగా.. దేవరకొండ మండల పరిధిలోని బొల్లిగుట్టతండా సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నరేష్, రాహుల్కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో వారిని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా నరేష్ మార్గమధ్యలో మృతిచెందాడు. రాహుల్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
పాతకక్షలతో ఇద్దరిపై దాడి
ఆత్మకూరు (ఎస్): పాతకక్షలను మనసులో పెట్టుకొని ఇద్దరు వ్యక్తులపై మద్యం సీసాలతో మరో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమ్మికల్ గ్రామానికి చెందిన పెద్దింటి సైదులు, వేల్పుల వంశీపై అదే గ్రామానికి చెందిన వీరబోయిన భరత్, కొడిదల వంశీ మధ్య ఏడాది క్రితం గొడవ జరిగింది. ఆదివారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా భరత్, కొడిదల వంశీ మద్యం తాగడానికి సాయంత్రం ఆత్మకూర్(ఎస్) శివారుకు వచ్చారు. అదే సమయంలో సైదులు, వేల్పుల వంశీకి ఫోన్చేసి మాట్లాడుకుందాం అని పిలిపించారు. వారిద్దరు అక్కడకు రాగానే భరత్, కొడిదల వంశీ మద్యం సీసా పగులగొట్టి సైదులు, వేల్పుల వంశీపై దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట చేసినట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపినట్లు పేర్కొన్నారు.
మూర్ఛ వ్యాధితో వ్యక్తి మృతి
నల్లగొండ క్రైం: మూర్ఛతో రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. సూర్యాపేట మండలంలోని రాయినిగూడెం గ్రామానికి చెందిన సందనబోయిన పరశురామ్(40) సోమవారం నల్ల గొండ పట్టణంలోని బతుకమ్మ కుంట వద్ద అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై మూర్ఛ వచ్చి కిందపడిపోయాడు. స్థానికులు గమనించి 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు సామాజిక మాధ్యమాల్లో మృతుడి వివరాలు పోస్ట్ చేయగా.. అతడి భార్య కళ్యాణి గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. మృతుడు నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడని, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడని అతడి భార్య పేర్కొంది. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానం లేదని టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఎస్బీఐ బ్రాంచ్లో షార్ట్ సర్క్యూట్
● రెండు ఏసీలు, కంప్యూటర్ దగ్ధం
మిర్యాలగూడ టౌన్: షార్ట్ సర్క్యూతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఏసీలు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి మిర్యాలగూడ మండలంలో జరిగింది. మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో గల ఎస్బీఐలో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకన్న బ్యాంకు సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రెండు ఏసీలు, ఒక కంప్యూటర్, కొంత ఫర్నీచర్ దగ్ధమైందని, సుమారు రూ.2లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బ్యాంకు సిబ్బంది పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment