భువనగిరి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ–2008లో నష్టపోయిన అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీలు)గా నియమించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 391మంది అభ్యర్థులు ప్రయోజనం పొందనున్నారు. నల్లగొండలోని డీఈఓ కార్యాలయంలో శుక్రవారం నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు..
2008 డిసెంబర్ 6వ తేదీన నాటి ప్రభుత్వం 35వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 30 శాతం ఎస్జీటీ పోస్టులను డీఈడీ చేసిన వారికి ప్రత్యేకంగా కేటాయించారు. దీంతో బీఈడీ అభ్యర్థులు మార్కులపరంగా ముందునప్పటికీ నష్టపోయారు. అప్పటి నుంచి తమకు ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటాలు చేస్తూ కోర్టులను సైతం ఆశ్రయించారు. వారికి అనుకూలంగా కోర్టులు తీర్పును సైతం ఇచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థులకు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జీటీలుగా నియమించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరికి వేతనం కింద నెలకు రూ.31,030 చెల్లించనున్నారు. దీంతో అభ్యర్థులు 15 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది.
సర్టిఫికెట్ల పరిశీలనకు సకాలంలో హాజరుకావాలి
నల్లగొండ: డీఎస్సీ–2008లో 30 శాతం ఎస్జీటీ పోస్టులు కేటాయించిన డీఈడీ అభ్యర్థులను కాంట్రాక్టు పద్ధతిన ఉపాధ్యాయ విధుల్లోకి తీసుకుంటున్నందున ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు శుక్రవారం నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరిగే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని నల్లగొండ డీఈఓ భిక్షపతి గురువారం ఒక ప్రక్రనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ తెలంగాణ వెబ్సైట్ www.schooledu.telangana.gov.in లో అభ్యర్థుల జాబితా, అప్లికేషన్ ఫామ్ను ఉంచిందని పేర్కొన్నారు. జాబితాలో పేర్లు ఉన్నవారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో నల్లగొండలోని డీఈఓ కార్యాలయానికి సకాలంలో రావాలని కోరారు.
ఫ సెకండరీ గ్రేడ్ టీచర్లుగా డీఎస్సీ–2008 అభ్యర్థులు
ఫ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని ప్రభుత్వ నిర్ణయం
ఫ ఉమ్మడి జిల్లాలో 391 మంది అభ్యర్థులకు లబ్ధి
ఫ నేటినుంచి నల్లగొండలో సర్టిఫికెట్ల పరిశీలన
ఎంపిక ఇలా..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 391 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 100 నుంచి 115 మంది ఇతర ఉద్యోగాల్లో చేరారు. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న సర్టిఫికెట్ల పరిశీలనకు 250 నుంచి 260 మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వెబ్సైట్లో వెరిఫికేషన్ పత్రాన్ని విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. దానిని పూర్తిగా నింపి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేసేందుకు అంగీకరిస్తున్నట్లు సంతకం చేయాల్సి ఉంటుంది. అంగీకార పత్రాన్ని సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అధికారులకు అందజేయాలి.
Comments
Please login to add a commentAdd a comment