ఫ జిల్లా వ్యాప్తంగా 78 బృందాల ఏర్పాటు
ఫ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు టీకాలు వేస్తున్న సిబ్బంది
నల్లగొండ అగ్రికల్చర్ : పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా పశువైద్య సంవర్థక శాఖ ఆద్వర్యంలో టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఈనెల 15వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమం వచ్చేనెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాలోని 2,25,869 తెల్లజాతి, 3,17,279 నల్లజాతి పశువులకు టీకాలు వేయడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మూడు నెలల వయస్సు పైబడిన వాటికి టీకాలు వేయనున్నారు. టీకాలు వేయడానికి జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ జిల్లా వ్యాప్తంగా 78 బృందాలను ఏర్పాటు చేసింది. ఆయా బృందాలు ఉదయం 8 గంటలకే గ్రామాల్లోని రైతుల కొట్టాలు, షెడ్లకు వెళ్లి టీకాలు వేస్తున్నాయి. టీకాలు వేయడానికి ఉదయం 11 గంటల వరకే అనుకూల సమయంగా భావించి ఉదయాన్నే ఆయా బృందాలు గ్రామాలకు వెళ్తున్నాయి. టీకాలు వేసిన పశువుల కొమ్ములకు గుర్తుగా ఆకుపచ్చ రంగును వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో శుక్రవారం నాటికి 23,254 తెల్ల పశువులు, 40,527 నల్ల పశువులకు టీకాలు వేసే వేశారు.
పశువులకు టీకా వేయించాలి
గాలికుంటు వ్యాధి సోకితే రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం వ్యాధి నివారణ కోసం ఉచితంగా టీకాలు వేయిస్తుంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి పశువుకు టీకా వేయించుకోవాలి.
– జూలకంటి వెంకట్రెడ్డి,
జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి
శుక్రవారం వరకు టీకాలు వేసిన పశువులు ఇలా
జాతి మొత్తం టీకాలు వేసింది
నల్లజాతి 3,17,279 40,527
తెల్లజాతి 2,25,869 23,254
Comments
Please login to add a commentAdd a comment