భైంసాటౌన్: రైతులు ఖరీఫ్లో పండించిన పంట ఉత్పత్తులు చేతికొస్తున్నాయి. ఇప్పటికే సోయా పంట చేతికి రాగా, చాలాచోట్ల కోతలు పూర్తయ్యాయి. మక్కలు, ఇతర పంట ఉత్పత్తులు మార్కెట్లో, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. త్వరలో వరి ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రారంభం కానున్నాయి. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సోయా కొనుగోళ్లు జరుగుతున్నాయి. భైంసా, కుభీర్, తానూర్, ముధోల్, సారంగపూర్ కేంద్రాల్లో తూకాలు మొదలు కాగా, త్వరలోనే కుంటాల, దిలావర్పూర్లోనూ ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. క్వింటాలుకు రూ.4,892 మద్దతు ధర చెల్లిస్తుండడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
కాంటాలకు స్టాంపింగ్ ఏది..
ఇదిలా ఉండగా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తుల తూకాలకు ఎలక్ట్రానిక్ కాంటాలను వినియోగిస్తున్నారు. అయితే, ముందుగా కాంటాలను పరిశీలించి, కచ్చితమైన తూకం సరిచూసి, సంబంధిత అధికారులు స్టాంపింగ్ వేయాలి. దీంతో రైతులు తూకాల్లో మోసపోకుండా ఉంటుంది. అయితే, జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సోయా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, కొన్నిచోట్ల కాంటాలకు అధికారులు స్టాంపింగ్ వేయలేదు. గడువు ముగిసిన కాంటాలనే వినియోగిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ఈ పరిస్థితి ఉంటే, ఇక ప్రైవేట్ వ్యాపారుల కాంటాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పట్టణంలోని ఏఎంసీ మార్కెట్యార్డుకు ప్రతీరోజు వందల సంఖ్యలో సోయా లాట్లు విక్రయానికి వస్తున్నాయి. కొనుగోళ్లకు ముందే కాంటాలు పరీక్షించాల్సిన అధికారులు సకాలంలో చేయకపోవడంతో రైతులు తూకాల్లో నష్టపోయే అవకాశముంది.
సకాలంలో చేస్తేనే ప్రయోజనం...
ప్రస్తుతం సోయా కొనుగోళ్లు జరుగుతుండగా, కొన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు సైతం ప్రారంభవుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలే కాకుండా, వ్యాపారులు సైతం కొనుగోళ్లు చేపడతారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్, తూనికలు, కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు జరిపి రైతులు తూకాల్లో మోసపోకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్న నేపథ్యంలో సకాలంలో కాంటాలను పరీక్షించి, మోసాలకు తావులేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
గతేడాది వేసినట్లు ఉన్న స్టాంపింగ్ ముద్ర
ఈ చిత్రంలోని ఎలక్ట్రానిక్ కాంటా భైంసా మండలం మాటేగాంలోని ప్రభుత్వ సోయా కొనుగోలు కేంద్రంలోనిది. ఇటీవల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. రైతులు సోయా విక్రయిస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రానిక్ కాంటాను పరిశీలించగా, స్టాంపింగ్ గడువు ముగిసినట్లు ఉంది. కొనుగోళ్లకు ముందే కాంటాను పరిశీలించి, సంబంధిత అధికారులు స్టాంపింగ్ వేయాలి. ఆ తర్వాతనే తూకం ప్రారంభించాలి. కానీ, స్టాంపింగ్ గడువు ముగిసిన కాంటాపైనే తూకం వేస్తుండడంతో కచ్చితత్వంపై రైతుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment