రాయగడ: చదువుతోనే ప్రగతి సాధ్యమవుతుందని ఇంఫా కర్మాగారానికి చెందిన ప్రజా సంబంధాల అధికారి శక్తి ప్రసాద్ పాణిగ్రహి అన్నారు. జిల్లాలోని తెరువలిలో ఉన్న ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో ఎల్లోయిస్ (ఇంఫా) సంస్థకు చెందిన వంశీధర్, ఇలా పండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెరువలి ప్రాంతంలోని గౌడొగుడ, రెలిబడిగా, రామచంద్రనగర్, పూజారిగుడ గ్రామాల్లో కమ్యూనిటీ విద్యా కేంద్రాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పాణిగ్రహి మాట్లాడుతూ ఇంఫా సంస్థ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా కమ్యూనిటీ విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసిందని వివరించారు. గ్రామాల్లోని మహిళలు చదువుకునేందుకు ఈ కేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ చదువుకుంటే సామాజిక చైతన్యం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కేంద్రాలను కర్మాగారం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పల్లి స్వచ్ఛంద సేవా సంస్థ డైరక్టర్ రాధాశ్యామ్ పండ, ఖెదాపడ పంచాయతీ సర్పంచ్ నరసింహ హికక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment