భువనేశ్వర్: దుర్గా పూజోత్సవాల్లో భారీ చోరీ సంఘటన చోటు చేసుకుంది. విజయ దశమి రోజున వేకువజామున ఈ ఘటన వెలుగు చూసింది. ముందురోజు అర్ధరాత్రి వరకు పూజోత్సవాల్లో హడావుడిగా ఉన్న నిర్వాహకులు చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటన బాలాసోర్ జిల్లా కొరై ప్రాంతంలో జరిగింది. బరుండై బెంగాలీ సాహి పూజా మండపంపై ఆసీనమై ఉత్సవ పూజలందుకున్న దేవీ అలంకరణలో విలువైన ఆభరణాలను ఆగంతకులు దోచుకున్నారు. ప్రధాన మండపంపై ప్రముఖ దేవీ ప్రతిమతో పార్శ్వ దేవతలకు అలంకరించిన ఆభరణాలను సైతం దొంగిలించారు. వీటి సమగ్ర విలువ రూ.15 లక్షలుగా అంచనా. ఈ ఘటనపై పూజా కమిటీ వర్గాలు స్థానిక కొరై ఠాణాలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. పూజా సమయంలో సాక్షాత్తు పూజా మండపంపై నుంచి నిలువెత్తు అమ్మవారిని అలంకరించిన ఆభరణాలను స్వల్ప వ్యవధిలో దొంగిలించి, ఆగంతకులు పోలీసు భద్రతకు సవాలు విసిరారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment