ఫీజు బకాయిలు విడుదల చేయాలి
నరసరావుపేట: ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి రూ.3900 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల ఐదవ తేదీన నిర్వహించే వైఎస్సార్ సీపీ ఫీజు పోరుకు సంబంధించిన పోస్టర్ను శనివారం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు విద్యార్థినీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సత్వరమే చెల్లించాలని కోరుతూ గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నడిచి వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వటం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం రూ.3900 కోట్లు ఉన్నాయని, వీటిలో రూ.1100 కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ బకాయిలనీ వివరించారు. వీటికి గాను ప్రభుత్వం కేవలం ఉడతా భక్తి కింద రూ.700 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని, మేమే బకాయిలు చెల్లించామని బడాయిలు చెప్పుకుంటున్నారని అన్నారు. బకాయిలు రాకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలు రాయనీయకుండా ఇంటికి పంపిస్త్తున్నారని అన్నారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక పిల్లలను చదువులు మాన్పించేస్తున్నారన్నారు. కూటమిప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలవుతున్నా ఏమి చేయలేని పరిస్థితిలో ఉందని, ఏ కార్యక్రమం అమలు చేయకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పై నిందలు మాత్రం వేస్తున్నారని ఎద్దేవా చేశారు. సుమారు రూ.4.10 లక్షల కోట్లు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదన్నారు. ఈ దుర్మార్గపు పాలన గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ విద్యార్థిని, విద్యార్థుల కోసం భారీ ఎత్తున పోరాటం చేయనుందని, దీనిలో వారందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని అన్ని డిగ్రీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలలకు సంబంధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఐదవ తేదీన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అన్నీ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ పాల్గొనాలని కోరారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల సాంబశివారెడ్డి, జిల్లా రైతు విభాగ, స్టూడెంట్ విభాగాల అధ్యక్షులు అన్నెంపున్నారెడ్డి, గుజ్జర్లపూడి ఆకాష్ కుమార్, మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీనివాసరావు, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఎస్.సుజాత పాల్, ఇయం.స్వామి మాస్టర్, పాలపర్తి వెంకటేశ్వరరావు, కందుల ఎజ్రా, నాయకులు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, పడాల చక్రారెడ్డి, యన్నం రాధాకృష్ణారెడ్డి, షేక్ కరీముల్లా, సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, గంటనపాటి గాబ్రియల్, సయ్యద్ ఖాదర్బాష, ఉప్పుతోళ్ల వేణుమాధవ్, బూదాల కళ్యాణ్, ఆళ్ల మణికంఠరెడ్డి పాల్గొన్నారు.
రూ.3,900 కోట్లు ఫీజు బకాయిల
విడుదలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఫీజు పోరు పోస్టర్ ఆవిష్కరణ
విద్యార్థులు, వారి తల్లితండ్రులు, పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపు
పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment