సాక్షి, విజయవాడ: నగరంలో టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతల ఆస్తులే టార్గెట్గా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. బోండా ఉమ తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారు. వీఎంసీ అధికారులను ఉసిగొల్పి బిల్డింగ్లను కూల్చివేయిస్తున్నారు. ప్రకాశ్నగర్లోని వైఎస్సార్సీపీ నేత జగదీష్ భవనాన్ని కూల్చివేశారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించారంటూ రాత్రి నోటీసులిచ్చిన అధికారులు.. నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఉదయాన్నే జేసీబీలతో బిల్డింగ్ను కూల్చివేశారు.
కాగా, రాష్ట్రంలో అధికార మత్తుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ ఆస్తులను, అభివృద్ధి పథకాల శిలాఫలకాలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ విధ్వంసం కొనసాగుతోంది. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ శిలాఫలకాలను ధ్వంసం చేశారు.
వీటి పక్కనే ఉన్న జగనన్న పాలవెల్లువ ‘నేమ్ బోర్డు’ను తొలగించారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చింతలచెర్వు గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని పగులకొట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలపై దాష్టీకానికి పాల్పడ్డారు.