హనుమంతునిపాడు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల పరిస్థితి ఘోరంగా మారింది. కనీసం రేషన్ బియ్యం కూడా సక్రమంగా సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది.దీంతో పేదలు ప్రభుత్వ కార్యాలయాలనే ముట్టడించాల్సి వస్తోంది. దాసరపల్లి పంచాయతీ గ్రామ సచివాలయ పరిధిలోని రెడ్డెం వారిపల్లి గ్రామస్తులకు మూడు నెలల నుంచి రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. రెడ్డెంవారిపల్లి గ్రామం దాసరిపల్లి గ్రామ పంచాయతీలో ఉంటుంది. ఆ గ్రామంలో 60 మంది రేషన్ కార్డు దారులున్నారు. ఆ పంచాయతీ డీలర్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జుటికే సునీల్ అనే వ్యక్తి వాహనం ద్వారా ఇళ్లకు వెళ్లి రేషన్ బియ్యం సరఫరా చేసేవాడు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల నుంచి వాహనం గ్రామానికి వెళ్లడంలేదు. అతని ఆరోగ్యం సరిగా లేదంటూ వాహనం నిలిపి వేశారు. ఇలా మూడు నెలల నుంచి బియ్యం పేదల వద్దకు చేరలేదు. గ్రామానికి దాసరిపల్లి డీలర్ షాపు రెండు మయిళ్ల దూరంలో ఉంటుంది. నడిచి వెళ్లలేని వృద్ధులకు బియ్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కొండారెడ్డిపల్లి, దాసరిపల్లి గ్రామంలోని డీలర్ షాపునకు వెళ్లి ఒక నెలకు తెచ్చుకునట్లు తెలిపారు. మరలా వెళ్లిన వారికి బియ్యం ఇవ్వడంలేదు. ఎప్పుడు స్టాక్ ఉంటుందో.. ఎప్పుడు ఉండదో ఎవరికీ అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. రేషన్ షాపు గతంలో తిమ్మారెడ్డిపల్లి పంచాయతీలో ఉండేదని.. గత కొన్నేల నుంచి దాసరిపల్లి పంచాయతీకి మార్చినప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. షాపును తిమ్మారెడ్డిపల్లికి మార్చాలని కోరారు. దీంతో తహసీల్దార్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ హనుమంతునిపాడు, కొండారెడ్డిపల్లి షాపుల నుంచి బియ్యం గ్రామానికి పంపించినట్లు తెలిపారు. దాసరిపల్లికి కొత్త డీలర్ను ఏర్పాటు చేశాయాలని కలెక్టర్ను కోరామన్నారు. గ్రామస్తులు ఎం.సుబ్బమ్మ, ఎం. రామలక్ష్మ, కొప్పుల రాజు, అరునమ్మ, రత్తమ్మ, లింగయ్య, కె. వెంకటరెడ్డి, ఎన్.శంకర్, శ్రీను, ఎన్.తిరుపాలు, ఎస్.అనంతయ్యతో పాటు 50 మంది గ్రామస్తులు ఆందోళనలో పాల్గొన్నారు.
మూడు నెలల నుంచి నిలిచిన రేషన్ బియ్యం సరఫరా
నాటి ప్రభుత్వంలో వాహనాల ద్వారా నేరుగా ఇళ్లకు..
నేడు పరిస్థితి ఘోరం
Comments
Please login to add a commentAdd a comment