డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములమవుదాం
హైదరాబాద్ యాంటీ నార్కోటిక్ డీఎస్పీ హరీష్ చంద్రారెడ్డి
చేవెళ్ల: డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని హైదరాబాద్ యాంటీ నార్కోటిక్ డీఎస్పీ హరీష్ చంద్రారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని వివేకానంద జూనియర్, డిగ్రీ కళాశాలలో శనివారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశం చేసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్తో కలిగే అనర్థాలు, నష్టాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని, అప్పుడే వాటికి దూరంగా ఉంటారని తెలిపారు. చదువుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన వయసులో మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం మొత్తం నాశనం అవుతుందన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను బాధపెట్టినవారవుతారని గుర్తుంచుకోవాలన్నారు. డ్రగ్స్ వాడకంతో జరిగే నష్టం, వాడిన వారు ఎలా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారో స్క్రీన్పై విద్యార్థులకు చూపించారు. ఎవరైనా సరే డ్రగ్స్ వాడుతున్నట్లు తెలిసినా, అందులోకి లాగేందుకు ప్రయత్నించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచుతారని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వాములం అవుతామని.. డ్రగ్స్ జోలికివెళ్లమని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో యాంటి నార్కోటిక్ సీఐలు శ్రీనివాస్రావు, గోపి, చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్రెడ్డి, డైరెక్టర్ ఇంద్రాసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment