భానుపురి (సూర్యాపేట) : ఎలాంటి తప్పులు జరగకుండా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులకు సూచించారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోళ్లు, డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడారు. ఽప్రభుత్వ నిబంధనలు పాటించి సన్న, దొడ్డు రకాల ధాన్యానికి వేర్వేరు సెంటర్లు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో సన్న ధాన్యం పండించిన రైతుల ఆధారంగా సెంటర్లను ఎక్కువగా ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 206 కొనుగోలు కేంద్రాల కోసం ప్రతిపాదనలు పంపారని, అయితే సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించడంతో సెంటర్లను పెంచాల్సి ఉందన్నారు. అవసరమైన చోట ఎక్కువ సెంటర్లు పెట్టే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు టోకెన్ ఇవ్వాలని, అన్నిచోట్ల తేమశాతం కొలిచే యంత్రాలు, డ్రైయర్లు, క్లీనర్లు ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు తర్వాత రవాణాలో ఎలాంటి ఇబ్బంది రాకుండా వాహనాలు సిద్ధం చేయాలన్నారు. కేటాయించిన రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా పోలీసు అధికారులు చెక్పోస్టులు పటిష్టంగా ఏర్పాటు చేయాలని అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, డీఆర్డీఓ అప్పారావు, వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, డీటీఓ జి.సురేష్రెడ్డి, డీఎస్ఓ రాజేశ్వర్, ఏఎస్ఓ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment