రేపటి ప్రజావాణి రద్దు
భానుపురి (సూర్యాపేట) : ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులందరూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు వంటి సంక్షేమ పథకాల అమలుకు సర్వే కార్యక్రమాల్లో ఉన్నందున ప్రజావాణి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో 2024–25 సంవత్సరానికి గిరిజన సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేసేందుకు భారత ప్రభుత్వం, మినిస్ట్రీస్ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్ విభాగం ఆన్లైన్ పద్ధతిలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.శంకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు (htt p://ngo.tribal.gov.in) పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ దరఖాస్తులకు ఫిబ్రవరి 15వ తేదీ చివరి తేదీ అని, పూర్తి వివరాల కోసం (htt p://ngo.tribal.gov.in) సంప్రదించాలని సూచించారు.
పోలీస్ క్రీడాకారుల ఎంపిక
సూర్యాపేటటౌన్ : తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 సందర్భంగా వివిధ క్రీడల్లో మెన్, విమెన్ పోలీస్ క్రీడాకారులను ఎంపిక చేసేందుకు శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాలీబాల్, కబడ్డీ, హై జంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, షార్ట్ పుట్, ఖోఖో, బ్యాడ్మింటన్, పరుగు పందెం క్రీడల్లో జిల్లా జట్లను ఎంపిక చేశారు. జిల్లా జట్లుగా ఎంపికై న నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీస్ క్రీడాకారులకు పోటీలు నిర్వహించి 5వ జోనల్ పోలీస్ జట్లు ఎంపిక చేస్తారు. 5వ జోనల్ పోలీస్ క్రీడాకారుల ఎంపిక కోసం ఈ నెల 20వ తేదీన సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ క్రీడాపోటీలను ఏఆర్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, డీఈఓ అశోక్, ఏఆర్ డీఎస్పీ నరసింహ చారి, ప్రభుత్వ పాఠశాలల పీఈటీలు పర్యవేక్షించారు.
ఇంటర్లో
ఉత్తీర్ణత శాతం పెంచాలి
తిరుమలగిరి (తుంగతుర్తి): ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా చూడాలని ఇంటర్ బోర్డు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి భీమ్సింగ్ అధ్యాపకులను ఆదేశించారు. శనివారం తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి చేశారు. కళాశాలలో 90 రోజుల ప్రణాళికపై చర్చించి అధ్యాపకులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ రాజమోహన్రావు, శ్రీనివాస్, పుల్లయ్య, దయాకర్, నవీన్, వీరయ్య, మహేందర్ పాల్గొన్నారు.
25 వరకు బడిబయటి పిల్లల గుర్తింపు సర్వే
సూర్యాపేటటౌన్ : జిల్లాలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి బడి బయట పిల్ల లను గుర్తించేందుకు చేపట్టిన సర్వే ప్రక్రియ ఈ నెల 25తేదీ వరకు కొనసాగనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆవాస ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టి బడి ఈడు వయసు ఉండి ఇప్పటివరకు బడిలో నమోదు కాని వారిని, 6 నుంచి 14, 15 నుంచి 19 సంవత్సరాల వయసులో ఉండి బడి మానేసిన విద్యార్థులను గుర్తించి ప్రబంధు పోర్టల్లో అప్లోడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. వయసుకు తగ్గ తరగతిలో చేర్పించడం కోసం జిల్లాలో గల 64 స్కూల్ కాంప్లెక్స్ల పరిధిలో గల క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లు ప్రణాళిక ప్రకారంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారుల పర్యవేక్షణలో పనిచేయనున్నట్లు తెలిపారు. ఎల్డీఏలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు వివరాలను పోర్టల్లో నమోదు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment