విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. చేసిన మంచిని గుర్తించి ఓటుతో ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నారు.
రాజాం పట్టణం పొనుగుటివలసలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలే రాజేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
విజయనగరం ఉడా కాలనీలో డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు అక్కడి మహిళలు హారతిచ్చి విజయతిలకం దిద్దారు.
గంట్యాడ మండలం వసాది గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యపై అభిమానులు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. మేలు చేసిన వారికి అండగా ఉంటామని గ్రామస్తులు భరోసా ఇచ్చారు.
బొబ్బిలి పట్టణంలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓ వృద్ధుడు ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని, సంక్షేమ పాలన కొనసాగించాలని ఎమ్మెల్యేతో చేయికలిపి మరీ చెప్పారు.
డెంకాడ మండలం చింతలవలసలో నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పాలనకు మద్దతుగా నిలవాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.
జామి మండలం రామయ్యపాలెంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును గ్రామస్తులు అక్కున చేర్చుకున్నారు. సంక్షేమ పాలనే కావాలి.. మీరు చల్లగా ఉండాలంటూ ఓ వృద్ధురాలు ఎమ్మెల్యే చేతిని ముద్దాడి ఆశీర్వదించింది.