వనపర్తి: జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో విద్య, వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్, డీఆర్డీఓ, డీఐఈఓ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 ఏళ్లు పైబడిన వారందరికి అక్షర జ్ఞానం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం నిర్వహిస్తోందన్నారు. జిల్లాలో 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులు సుమారు 17 వేల మంది ఉన్నారని.. వారిని అక్షరాస్యులుగా మార్చి వందశాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దాలని, ఇందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. లైన్ డిపార్ట్మెంట్ అధికారులు వలంటీర్లు, నిరక్షరాస్యులను మ్యాచింగ్ బ్యాచింగ్ చేయాలని సూచించారు. 7, 8, 9వ తరగతి విద్యార్థులు తమ కుటుంబంలోని నిరక్షరాస్యులను, 10వ తరగతి ఉత్తీర్ణులైన స్వయం సహాయక సంఘాల సభ్యులు కనీసం పది మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తమ కుటుంబంలోని నిరక్షరాస్యులు, చుట్టుపక్కల వారిని ఈచ్ వన్.. టీచ్ వన్ అనే విధానంతో కనీస అక్షర జ్ఞానం పొందేందుకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా వయోజన విద్య అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, డీపీఓ సురేష్, పుర కమిషనర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి..
అఽధికారులు విధులతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులు, సిబ్బందికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యాయామం కోసం రోజు కొంత సమయం కేటాయించాలన్నారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలమని.. ఇప్పటి అలవాట్లు వృద్ధాప్యంలో మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయని తెలిపారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిత్య జీవితంలో ఉండే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యమని తెలిపారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment