తణుకు: కొత్త ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకాలు ప్రజలకు భారంగా మారా యని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ విమర్శించారు. శుక్ర వారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇసుక విధానంలో స్పష్టత లేకుండా చేసిన ప్రభుత్వం ఆన్లైన్ విధానంలో అనేక మతలబులు పెట్టి సాధారణ పౌరులకు అవకాశం లేకుండా చేశారన్నారు. ఇసుక లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన మద్యం షాపుల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారని చెప్పారు. గోదావరి జిల్లాల్లో షాపులు దక్కించుకున్న వారిని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోనివ్వడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ రెండు పథకాలపై ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజలపై విద్యుత్ భారం
భీమవరం: ఇంధన సర్దుబాటు, ట్రూ అప్ చార్జీల పేరుతో సుమారు రూ.20 వేల కోట్లు ప్రజలపై భారం వేస్తే ప్రజా ప్రతిఘటన తప్పదంటూ సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం విద్యుత్ సబ్స్టేషన్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబురావు మాట్లాడుతూ ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు విద్యుత్ సంస్థల ప్రతిపాదన అంగీకరించడానికి సిద్ధపడటం తీవ్రంగా తప్పుపట్టారు. ఇంధనం సర్ధుబాటు పేరుతో ప్రజలపై భారం వేయడం దారుణమన్నారు. భీమవరం విద్యుత్తు సబ్స్టేషన్ ఏఈ వర్మకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.
వాసవీ మాతకు విశేష పూజలు
పెనుగొండ: కర్ణాటక శివమొగ్గ(షిమోగా)లో వాసవీ అమ్మవారి ప్రతిష్టాపన చేసి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శత మాపోత్సవం వేడుక సంకల్ప పూజలు పెనుగొండ వాసవీ శాంతి థాంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 100 మంది పైగా భక్తులు కర్ణాటక నుంచి అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతి థాంకు శుక్రవారం తరలి వచ్చారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎమ్మెల్సీ డి.అరుణ్ దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి గోమాత పూజ, పంచామృతాభిషేకాలు, దంపతుల పూజలు నిర్వహించారు.
సార్వత్రిక విద్యాపీఠం ప్రవేశాల గడువు పొడిగింపు
భీమవరం: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠానికి సంబంధించి ప్రస్తుత విద్యాసంవత్సరానికి టెన్త్, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 31 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫైన్ లేకుండా ఫీజు చెల్లించడానికి ఈ నెల 25 వరకు గడువు ఉందన్నారు. రూ.200 ఫైన్తో ఈ నెల 26 నుంచి 29 వరకు, రూ.500 ఫైన్తో ఫీజు చెల్లించడానికి ఈ నెల 30, 31 తేదీల్లో అవకాశముందని తెలిపారు.
సీహెచ్సీకి మందులు
దెందులూరు: సాక్షిలో ప్రచురితమైన ‘మందుల్లేవ్’ కథనానికి ప్రభుత్వం స్పందించింది. నెల రోజులుగా దెందులూరు సీహెచ్సీకి మందులు లేకపోయినా జిల్లా అధికారులు, కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై సాక్షిలో వచ్చిన కథనానికి స్పందించింది. దెందులూరు సీహెచ్సీకి మందులు సరఫరా చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సాక్షికి నియోజకవర్గంలోని ప్రజలు, బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
20న ఖోఖో సెలెక్షన్స్
దెందులూరు: 43వ రాష్ట్ర స్థాయి బాలబాలికల ఖోఖో జట్ల ఎంపిక కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి ఈ నెల 20న ఉదయం 10 గంటలకు టీ.నర్సాపురం మండల బొర్రంపాలెం జెడ్పీహెచ్ స్కూల్లో ఎంపిక పోటీలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment