మదర్ డెయిరీ నెయ్యి వినియోగిస్తున్న దేవస్థానం
విజయ డెయిరీ నెయ్యి వాడాలని ప్రభుత్వ ఆదేశాలు
సందిగ్ధంలో దేవస్థానం అధికారులు
యాదగిరిగుట్ట : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రసాదంలో ఏ నెయ్యి వాడాలనే సందిగ్ధంలో దేవస్థానం అధికారులు ఉన్నారు. 2025 మార్చి వరకు మదర్ డెయిరీతో అగ్రిమెంట్ ఉండడంతో ఆ సంస్థ సరఫరా చేసే నెయ్యినే వాడుతున్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యిని వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాల జారీ చేయడంతో.. ఏ నెయ్యి వాడాతారా.. అనేది ప్రశ్నగా ఉంది.
40 ఏళ్లుగా మదర్ డెయిరీ నుంచే సప్లయ్
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి లడ్డూతో పాటు వివిధ ప్రసాదాల తయారీలో 40 ఏళ్లుగా మదర్ డెయిరీ నెయ్యినే వాడుతున్నారు. రోజూ 700 కిలోల నెయ్యి వినియోగిస్తున్నారు. ఈ ఏడాది కూడా మదర్ డెయిరీ నెయ్యినే వినియోగించేందుకు మార్చికి ముందే టెండర్ ద్వారా దేవస్థానం అగ్రిమెంట్ కుదర్చుకుంది. 2025 మార్చిలో అగ్రిమెంట్ ముగియనుంది. కాగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలతో పాటు యాదాద్రి క్షేత్రంలోనూ ప్రసాదాల తయారీకి విజయ డెయిరీ నెయ్యిని వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మదర్ డెయిరీనే వాడాలని యాదాద్రి దేవస్థానం అధికారులకు ఇటీవల సూచించారు. ప్రభుత్వం మరో విధంగా ఆదేశాలు ఇవ్వడంతో దేవస్థానం అధికారులు అయోమయంలో పడ్డారు.
ప్రభుత్వానికి లెటర్ పెడతాం
మదర్ డెయిరీ నెయ్యి కోసం ఇప్పటికే అగ్రిమెంట్ అయ్యింది. అగ్రిమెంట్ 2025 మార్చి వరకు ఉంది. కాబట్టి మదర్ డైయిరీ వాడాలా.. విజయ డైయిరీ వాడాలా స్పష్టత కోసం ప్రభుత్వానికి లెటర్ పెడతాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటాం.
–భాస్కర్రావు, యాదాద్రి దేవస్థానం ఈఓ
Comments
Please login to add a commentAdd a comment